రంగ రంగ..వైభవంగా..
● కదిలింది శ్రీరంగనాథుని బ్రహ్మరథం
● దారిపొడవునా గోవింద నామస్మరణలు, భజనలు
● ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలో శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి రథోత్సవ వేడుకలు కనుల పండువగా జరిగాయి. రథోత్సవ వేడుకలను తిలకించేందుకు పట్టణ పరిధిలోని భక్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కాయ కర్పూరాలు సమర్పించారు. స్వామి వారి తేరు (రథం) కింద గుమ్మడికాయలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజాద్రవ్యాలు సమర్పించారు. ఆ దేవదేవుడిని దర్శించి తరించారు. దారి పొడవునా గోవింద నామస్మరణతో రథాన్ని కదిలించారు. భక్తి పారవశ్యంలో ఓలలాడారు. అక్కడక్కడా భక్తులకు ప్రసాదాలు, శీతల పానీయాలను పంపిణీ చేశారు. తేరు ప్రారంభానికి ముందు అర్చకులు కృష్ణరాజేష్శర్మ విశేష పూజలు జరిపించారు. ఉభయదారులకు అర్చనలు చేశారు. తేరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మెన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, కో–ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి పాల్గొన్నారు.
రంగ రంగ..వైభవంగా..


