సిండికేటా.. పరోక్ష ఒత్తిళ్లా?
మదనపల్లె: మదనపల్లె దినసరి, వారపు సంత మార్కెట్ల గుత్తల అప్పగింత టెండర్లను శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కే.ప్రమీల నిర్వహించారు. దీనికి కేవలం ఇద్దరే హాజరయ్యారు. క్రితం సారి వేలంలో పలికిన ధరకు అనుగుణంగా మరుసటి ఏడాది గుత్తలకు ధర నిర్ణయించి వేలంపాటల ద్వారా అప్పగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుత్తల వ్యవహరం గందరగోళానికి దారితీసిన విషయం విదితమే. 2024–25లో దినసరి మార్కెట్ రూ.1.18 కోట్లు, వారపుసంత రూ.42 లక్షలు పలికింది. దీనికి అనుగుణంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి వారపుసంతకు రూ.45 లక్షలు, దినసరి మార్కెట్కు రూ.1.20 కోట్లుగా నిర్ణయించి వేలంపాటను ప్రారంభించారు. కమిషనర్ నిర్వహించిన ఈ వేలంపాటలో ఇద్దరు మాత్రమే పాల్గొనడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం నిర్ణయిచిన ధర అధికమని హాజరైన ఇద్దరు కమిషనర్ దృష్టికి తెచ్చారు. నిర్ణయించిన ధరకు అదనంగా 18శాతం జీఎస్టీ చెల్లించాలని కమిషనర్ చెప్పగా ఆ మొత్తం చెల్లించలేమని పాటదారులైన ఆ ఇద్దరు పేర్కొన్నారు. గతంలోనూ ప్రతి వేలానికి సంబంధించిన గుత్తకు 18శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నామని, ఇది జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి అమలవుతోందని కమిషనర్ వారికి వివరించారు. అయినప్పటికీ ఈ నిర్ణీత ధరను తగ్గించాలన్న ప్రతిపాదన చేయగా... ఇది సాధ్యంకాదని స్పష్టం చేశారు. దీంతో ఆ ఇద్దరు వెనుదిరిగి వెళ్లిపోయారు. మొదటి వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో మరోసారి వేలంపాటలకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు.
మదనపల్లె సంత, డైలీ మార్కెట్ వేలానికి ఇద్దరే హాజరు
ఽఆపై ధర భరించలేమంటూ వెనక్కు..


