కుట్రకు బూడిదైన టమాట సీడ్ కట్టెలు
రూ. 1.65 లక్షల నష్టం
కురబలకోట : టమాట సాగుకు వినియోగించే సీడ్ కట్టెలకు నిప్పంటించడంతో.. కాలి పూర్తిగా బూడిదైన సంఘటన కురబలకోట మండలం కమతంపల్లి సమీపంలో శనివారం వేకువ జామున చోటు చేసుకుంది. బాధిత రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అంగళ్లు గ్రామం కమతంపల్లికి చెందిన ఆవుల రవీంద్ర ఊరికి సమీపంలోని బైపాస్ పక్కన పొలంలో ఏడు వేల టమాట సీడ్ కట్టెలు నిల్వ చేశారు. టమాట సాగుకు, కుటుంబ భవిష్యత్తుకు ఎంతో ఆశతో వీటిని భద్రపరిచారు. శనివారం వేకువ జామున ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. సమాచారంతో ఆగమేఘాలపై వెళ్లి చూశారు. అప్పటికే చూస్తుండగానే మంటలకు కట్టెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కళ్లెదుటే రైతు కష్టార్జితం మంటల్లో కాలిపోతుంటే నిస్సహాయుడిగా మిగిలారు. రూ.1.65 లక్షల విలువ చేసే కట్టెలు ఉన్నపాటున కాలిపోవడంతో ఆ రైతుకు వేదన మిగిల్చింది. ఇతనికి మరో రైతు మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ కారణం చేత గిట్టని వారు టమాట కట్టెలకు నిప్పంటించి ఉంటారని బాధిత రైతు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు.


