చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరాలను దొంగలించిన నిందితున్ని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను గురువారం సాయంత్రం రూరల్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. జనవరి 29న సాయంత్రం పట్టణంలోని మేదరవీధికి చెందిన టంగుటూరు ఎల్లాలు అనే వ్యక్తి మద్యం సేవించాడు. ఈ క్రమంలో హోమస్పేటలో ఉన్న అతను స్కూటీలో వెళ్తున్న ఒక వ్యక్తిని పిలిచి లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. దీంతో ఆ వ్యక్తి స్కూటీలో ఎల్లాలును స్కూటీపై కూర్చోపెట్టుకొని ఒక పథకం ప్రకారం పట్టణ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతని ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలను తీసుకొని అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. మరుసటి ఉదయం మద్యం మత్తు వదలిన తర్వాత తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు ఎల్లాలు గుర్తించాడు. దీంతో అతను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో నేరస్తుడిని త్వరితగతిన గుర్తించారు. దస్తగిరిపేటకు చెందిన పాత నేరస్తుడైన జేస్టాది రాజేష్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు గొలుసు, రెండు ఉంగరాలతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా నిందితుడిపై పలు ప్రాంతాల్లోని పోలీస్ష్టేషన్లలో కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులోని టూ టౌన్ పోలీస్స్టేషన్లో హత్య కేసుతో పాటు త్రీ టౌన్, రూరల్, రాజుపాళెం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందులలో చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించి సొత్తును రికవరీ చేసిన ఎస్ఐ, సీఐతో పాటు హెడ్కానిస్టేబుల్ దాస్, కానిస్టేబుల్ సునీల్లను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ అభినందించారు.
బంగారు నగలు, స్కూటీ స్వాధీనం


