చిట్టీ డబ్బులు ఇప్పించి పుణ్యం కట్టుకోండి
మదనపల్లె రూరల్ : నమ్మకస్తుడని నమ్మి చిట్టీలు వేశాం. చిట్టీలు వేయించుకున్న అతను ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో తాము చెల్లించిన డబ్బులు ఇవ్వకుండా అతడి కుటుంబసభ్యులు తమను ఇబ్బందులు పెడుతున్నారని, దయచేసి తమ కష్టార్జితాన్ని ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా బాధితులు ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని వేడుకున్నారు.
బాధితులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని ప్రశాంత్నగర్కు చెందిన గాలి వెంకటరమణ 20 ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తూ నమ్మకంగా ఉండేవాడు. దీంతో స్థానికంగా ఉంటున్న రాజానగర్, ప్రశాంత్ నగర్కు చెందిన భాస్కర్, సుజాత, సోమశేఖర్, రామాంజనేయులు, శ్రీనివాసులు, మల్లికార్జున, షాహిద్, సయ్యద్, రమణ, నాగేశ్వర్, రమేష్, ఆదినారాయణ, దాదాపీర్, రామలక్ష్మి తదితరులు సుమారు 76 మంది అతని వద్ద చీటీలు వేశారు. సుమారు రూ.కోటి 30లక్షలు చిట్టీల రూపంలో అతడికి చెల్లించారు. కాగా గత ఏడాది నవంబర్లో గాలి వెంకటరమణ చనిపోయాడు. దీంతో అతడి వద్ద చిట్టీలు వేసిన బాధితులు అతని భార్య రమణమ్మ, కుమార్తె గీత, అల్లుడు జగదీశ్వర్లను అడిగారు. తమకు సంబంధం లేదని, మేము ఒక్క పైసా ఇవ్వమని వారు తెగేసి చెప్పారని వాపోయారు. గాలి వెంకటరమణ దగ్గర చిట్టీలు వేసిన తాము మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారమని, కష్టార్జితం పొదుపు చేసుకునే క్రమంలో అతడిని నమ్మి చెల్లించామన్నారు. తమ వద్ద చెల్లింపుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. చిట్టీల నిర్వాహకుడు గాలి వెంకటరమణ మృతిపై తమకు అనుమానం ఉందన్నారు. అతని భార్య, కుమార్తె అల్లుడిని విచారించి బాధితులైన తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి బాధితుల మొర


