కనికరం చూపి పెన్షన్ ఇప్పించండయ్యా..!
మదనపల్లె రూరల్ : పుట్టుకతోనే పిల్లవాడి రెండుచేతులకు వైకల్యం. తన పనులు తాను చేసుకోలేని దుస్థితి. సదరం సర్టిఫికెట్లో 89 శాతం అంగ వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. అయినప్పటికీ పెన్షన్ ఇచ్చేందుకు అధికారులకు మనసు రావడం లేదు. దయచేసి తమ బిడ్డపై కనికరం చూపి పెన్షన్ ఇప్పించండయ్యా అంటూ కలెక్టరేట్ ఆవరణలో బుధవారం తల్లిదండ్రులు వేడుకున్నారు. మదనపల్లె పట్టణం దేవలంవీధికి చెందిన కురాకుల వెంకటేశ్వర్లు బిల్డింగ్ సెంట్రింగ్ వర్క్ చేస్తుంటాడు. భార్య శిరీష గృహిణి. వీరికి ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు కురాకుల రామ్చరణ్తేజ్(11) అంగవైకల్యంతో జన్మించాడు. రెండుచేతులు సన్నగా చచ్చుపడిపోయాయి. పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్కు దరఖాస్తు చేస్తే 89శాతం అంగ వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించారన్నారు. దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, తమ ఆధార్కార్డుపై వేరొకరి ఇల్లు ఉన్నట్లు ఆన్లైన్లో చూపడంతో మంజూరుకాలేదన్నారు. దీంతో నానాతంటాలు పడి ఆన్లైన్లో దాన్ని తొలగించేందుకు రెండేళ్లు పట్టిందన్నారు. రెండేళ్ల క్రితం మళ్లీ దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే, అధికారులు ఇదిగో, అదిగో అంటూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా అని అడిగితే, ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదని చెపుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టర్కు ఉన్న ప్రత్యేకాధికారాలతో తప్ప పెన్షన్ మంజూరుచేయడం సాధ్యం కాదని చెప్పడంతో కలెక్టరేట్కు వచ్చినట్లు తెలిపారు. కుమారుడు రామ్చరణ్ తేజ్ దుస్థితిని కళ్లారా చూసి అయినా కలెక్టర్ సార్ కరుణిస్తాడేమోనని కొండంత ఆశతో వచ్చినట్లు చెప్పారు. దివ్యాంగ బాలుడికి మద్దతుగా బీజేపీ నాయకులు డాక్టర్.అజ్మతుల్లాఖాన్ నిలిచారు. కలెక్టరేట్కు తీసుకురావడంతో పాటు సమస్యను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.


