ఔను..వాళ్లిద్దరు మళ్లీ పెళ్లి చేసుకున్నారు
వారిది పెద్దలు కుదిర్చిన వివాహం..అన్యోన్యంగా సాగుతున్న బంధం.. వారికి ఒక చక్కటి పాపాయి.. ఆనందంగా ఉన్న ఆ ఇంట చిన్న మనస్పర్థలు.. అర్థం చేసుకోవాల్సిన ఆలుమగలు అపార్థం చేసుకున్నారు. ఎడబాటు పెంచుకున్నారు. ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుండాల్సినవారు దూరమయ్యారు. కొద్ది కాలానికి తమ తప్పు తెలుసుకున్నారు. చిన్నారి పడే వేదన అర్థం చేసుకున్నారు.. మళ్లీ అనుబంధం కావాలనుకున్నారు.. మళ్లీ పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. కలిసి ఉంటే కలదు సుఖం అని చాటిచెబుతున్నారు..
రొంపిచెర్ల : చిన్న చిన్న గొడవలతో ఏడు అడుగులు నడిచి మూడు ముళ్ల బంధాన్ని తెంచుకుంటున్న రోజులివి. అయితే వీళ్లు మనస్పర్థలతో విడిపోయినా మళ్లీ పెళ్లి చేసుకుని ఒక్కటై యువతకు అదర్శంగా నిలిచారు. వివిరాల్లోకి వెళ్లితే ... రొంపిచెర్ల మండలం మోటుమెల్లెల గ్రామ పంచాయతీ బాలనాగిరెడ్డిగారిపల్లె దాసరిగుడెంకు చెందిన మారయ్య ,హేమలతకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం రెండేళ్లు సజావుగా సాగింది. వీరికి ఒక కూతురు ఉంది. అనంతరం భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. వీరిని కలపాలని ఇరు కుటుంబ సభ్యులు బంధువులు ప్రయత్నించారు. భార్యా భర్తలు కూడా కలిసి ఉంటేనే బాగుంటుందని భావించారు. దీంతో బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీలోని కట్టకింద శివాలయంలో బుధవారం ఉదయం మళ్లీ ఇద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తల్లిదండ్రులిద్దరు ఒక్కటి కావడంతో కూతురు అనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.


