ఇవన్నీ ప్రభుత్వ దాడులే
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి, ఆయనపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమని, ఇది ప్రభుత్వ దాడేనని కడప మేయర్ పాకా సురేష్ కుమార్ ఆరోపించారు. అంబటి రాంబాబుపై దాడిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్లో నల్ల రిబ్బన్లు, చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘నో రెడ్ బుక్’ అంటూ రెడ్ బుక్లను దహనం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రాక్షస రాజకీయం నశించాలి, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, సీబీఎన్ డౌన్ డౌన్, అంబటి రాంబాబును విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపైనే కాకుండా వారి ఇళ్లపై కూడా దాడులు చేస్తూ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, రోజా, ఇళ్లపై దాడులు చేశారని, తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేసి ఇంట్లోని ఫర్నీచర్, కార్లు, సామగ్రిని ధ్వంసం చేశారన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.
ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి పోవాలి
అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ ధర్నా..రెడ్బుక్లు కాల్చివేత


