ఆలయంలో హుండీ చోరీ
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని మతుకువారిపల్లెలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వినాయక స్వామి ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయం స్థానికులు గుర్తించి చూడగా డబ్బుతో సహా హుండీ తీసికెళ్లారు. దీంతోపాటు అదే గ్రామంలో ఆరుగురు రైతుల పొలాల వద్ద బోరు మోటరుకున్న కేబుల్వైర్లను కూడా కోసుకొని పోయారు. బాధితులు గురువారం కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాలకు వెళ్లి పరిశీలించారు.
నాటు తుపాకీ స్వాధీనం
చౌడేపల్లె : వన్యమృగాలను వేటాడేందుకు వినియోగించే నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. దిగువపల్లె పంచాయతీ కురిజల వారిపల్లెకు చెందిన నాగరాజ బోయకొండ సమీపం నాటు తుపాకీతో సంచరింస్తుండగా డ్రోన్ కెమెరా లో చిత్రీకరించడంతో ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
రైతుపై కర్రతో దాడి
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో గురువారం రాత్రి అకారణంగా దూషించాడన్న కోపంతో కర్రతో రైతును చితకబాదిన సంఘటన జరిగింది. ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాల మేరకు..కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లె గ్రామంలో ఉంటున్న రైతు సురేంద్ర(56) అదేవీధికి చెందిన రమణయ్యను అకారణంగా దూషించాడన్నసాకుతో కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో సురేంద్ర తలకు బలమైన గాయమైంది. అతన్ని కుటుంబీకులు 108వాహనంలో చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కోడిపందెం శిబిరంపై మెరుపు దాడి
– 13మందిపై కేసు నమోదు
చౌడేపల్లె : బోయకొండ అటవీ పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలు మారాయి. నిత్యం పేకాట, కోడి పందెం, వ్యభిచార నిర్వహణకు అడ్డాగా నిలిచాయి. అన్నమయ్య జిల్లాపరిధిలోకి చౌడేపల్లె మండలాన్ని చేర్చడంతో తొలిసారిగా మదనపల్లె డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో గురువారం డ్రోన్ కెమెరా బృందం తనదైనశైలిలో నిఘా పెట్టి కోడి పందెం శిబిరంపై మెరుపు దాడులు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఈ దాడుల్లో కోడిపందేలు ఆడుతున్న 13మందిని, 6 పందెం కోడి పుంజులు, రూ:25 వేలు నగదు సీజ్చేసినట్లు చెప్పారు. అలాగే 11 బైక్లు 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ మీడియాకు వివరించారు.
104 ఏళ్ల వృద్ధుడు మృతి
బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావికి చెందిన 104 ఏళ్ల వృద్దుడు కుమార చంగలరావు గురువారం మృతి చెందారు. 1922 జూలై 21న జన్మించిన ఆయన వృద్ధాప్య, ఆరోగ్య సంబంధిత సమస్యలతో చనిపోయారు. కుటుంబీకులు ఆయనకు బెంగళూరులో చికిత్సలు అందించారు. కోలుకోలేని పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. ప్రస్తుత నాయనబావి గ్రామం 65 ఏళ్ల క్రితం వరకు లేదు. ఇక్కడ నివాస గృహాలు, నివాసముంటున్న వారు లేరు. 1960లో ఇక్కడ తొలి గృహాన్ని నిర్మించి ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నివాసాలు మొదలై నాయనబావి గ్రామం ఏర్పడింది. ఇది బి.కొత్తకోట–మదనపల్లె రహదారిపై ఉంది. కుమార చెంగలరావు మృతికి గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు గంగ కాలువలో
మృతదేహం లభ్యం
బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలుగురాళ్ళపల్లె పంచాయతీ జౌకుపల్లె గ్రామం సమీంలోని తెలుగుగంగ సాగునీటి కాలువలో గుండాపురం ఎస్సీకాలనీకి చెందిన పందీటి ఓబులేసు(20) గురువారం శవమై తేలాడు. స్థానిక ఎస్ఐ శివప్రసాద్ వివరాలు ఇలా ఉన్నాయి మృతి చెందిన యువకుడు గుండాపురం ఎస్సీకాలనీకి చెందినవాడిగా గుర్తించినట్లు చెప్పారు. మృతిని కోసం కుటుంబసభ్యులు, బందువులు ఎవరూ రాలేదన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు – వనిపెంట రహదారిలో ఈనెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొండపేట గౌస్ (37) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. మండలంలోని వనిపెంటకు చెందిన గౌస్ 1వ తేదీన సాయంత్రం మైదుకూరు నుంచి బైక్లో వనిపెంటకు వెళుతుండగా కేశలింగాయపల్లెకు సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. అతన్ని నంద్యాల శాంతిరాం ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందినట్టు అర్బన్ ఏఎస్ఐ శివప్రసాద్రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఉన్నారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనం డ్రైవర్ చంద్రశేఖర్పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.
ఆలయంలో హుండీ చోరీ


