పది కిలోల గంజాయి స్వాధీనం
మదనపల్లె : పెద్దతిప్పసముద్రం మండలంలో గంజాయి సాగు చేస్తూ దాన్నే బి.కొత్తకోట కేంద్రంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితులైన పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామం పెద్దమేకలవారిపల్లెకు చెందిన అవులప్పగారి వెంకటరమణారెడ్డి (53), బి.కొత్తకోటకు చెందిన మొటుకు సురేంద్ర అలియాస్ డిమ్మర్ (26), సంపతికోట మహమ్మద్ ఆఫ్రిద్ ఖాన్ (20), దేసుగారి పురుషోత్తం (20), ఆదిల్ (22)లను అరెస్ట్ చేసి వారినుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. వెంకటరమణారెడ్డి పెద్దమేకలవారిపల్లె గుట్టవద్ద ఉన్న పొలంలో మూడేళ్లు గా గంజాయిని సాగు చేస్తున్నాడు. స్థానికంగా ఆవులు, గొర్రెలకు కడుపునొప్పి వస్తే తినిపించేందుకు ఈ గంజాయిని విక్రయించే వాడని చెప్పారు. ఈ వ్యవహారం గుట్టుగా ఉండటంతో గంజాయి సాగుచేసి దాన్ని బి.కొత్తకోటకు చెందిన వారికి కిలో రూ.20 వేలకు విక్రయించుకొంటున్నాడు. ఈ కోవలో వృత్తిపనులతో జీవిస్తున్న బి.కొత్తకోటకు చెందిన నలుగురు నిందితులు జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదన వైపునకు మళ్లారు. దాంతో పెద్ద వెంకటరమణారెడ్డి విక్రయించిన గంజాయిని కొనుగోలు చేసి దాన్ని స్థానికంగా విక్రయించుకుని సొమ్ము చేసుకునేవారు. వెంకటరమణారెడ్డి సాగుచేసిన గంజాయిలో విక్రయించగా మిగిలిన దాన్ని గుట్టవద్ద దాచిపెట్టేవాడు. సోమవా రం సాయంత్రం బి.కొత్తకోట పిటిఎం రోడ్డులో గంజాయిని విక్రయించేందుకు వెంకటరమణారెడ్డి రావడం, వీటిని కొనుగోలు చేసేందుకు నిందితులు నలుగురు కలిసిన సమాచారం అందడంతో సిఐ కే.గోపాల్రెడ్డి దాడులు నిర్వహించి పట్టుకున్నారని చెప్పారు. వారి సమాచారంతో రెండుకిలోల ఐదు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. కాగా బి.కొత్తకోట, మదనపల్లెల్లో కిలో గంజాయి రూ.20 నుంచి రూ.40వేలు, బెంగళూరులో రూ.లక్ష పలుకుతోందని చెప్పారు. పట్టుబడిన గంజాయి నాణ్యతను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ మహేంద్ర, సీఐలు గోపాల్రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఐదుగురు నిందితుల అరెస్ట్


