రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం, పుంగునూరు రోడ్డులోని, వలసపల్లి నవోదయ స్కూల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారించగా, ఢీకొన్న వాహనం వివరాలు, మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. నల్లటి ప్యాంటు షర్టుతోపాటు కోటు ధరించి ఉన్నాడు. ఇతని వద్ద గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తాలూకా పోలీసులు తెలిపారు. మృతుడిని గుర్తించిన వ్యక్తులు తాలూకా పోలీసులను సంప్రదించాలని సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు గ్రామంలో ఉన్న హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈఓ షంషుద్దీన్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు.విధులకు డుమ్మా కొట్టిని ఉపాధ్యాయుడికి షోకాజ్ నీటీసు ఇచ్చినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం. ఓబులేసు తెలిపారు.లావనూరు హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ఆర్ .రామంజులరెడ్డి విధులకు రాకుండా వలంటీర్తో నిర్వహిస్తున్నాడని స్థానికులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. డీఈఓ వచ్చిన సమయంలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చారని మండల విద్యాశాఖాధికారి తెలిపారు.


