పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వద్దు
పీఆర్ అడిషనల్ కమిషనర్
డాక్టర్.సుధాకర్ రావు
మదనపల్లె రూరల్: పంచాయతీరాజ్ చట్టంలోని అధికారాన్ని ఉపయోగించి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు పన్ను వసూళ్లు చేయాలని పంచాయతీరాజ్ రాష్ట్ర అడిషనల్ కమిషనర్ డాక్టర్.సుధాకర రావు ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎన్వీఆర్ కల్యాణమండపంలో డీపీఓ రాధమ్మ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలో పంచాయతీరాజ్ యాక్టివిటీస్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని 25 మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు, 480 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్.సుధాకర్ రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి, డిప్యూటీ ఎంపీడీఓ అధికారాలు, విధులు, బాధ్యతలపై వివరించారు. పన్ను వసూళ్లు, పంచాయతీలకు ఇతర ఆదాయ వనరులపై సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ఆర్థిక వనరులు అత్యంత అవసరమని, అందులో భాగంగా పన్నుల వసూలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. అన్నమయ్య జిల్లాలో సుమారు 3లక్షల అసెస్మెంట్లు నుంచి రూ.15 కోట్లు పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటివరకు 40 శాతం వసూలైందన్నారు. పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూలులో అలసత్వం వహిస్తే గ్రామాభివృద్ధి నిలిచిపోతుందని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పంచాయతీరాజ్ సిబ్బందికి అవార్డుల ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్డబ్ల్యూఎస్ డీఎల్డీఓ లక్ష్మీపతి, అమరనాథరెడ్డి, డీఎల్పీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


