కారణం ఉంటేనే మ్యుటేషన్ల తిరస్కరణ
మదనపల్లె: మ్యుటేషన్ల దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారో.. అందుకు స్పష్టమైన కారణం ఉండాలని, వాటి వివరాలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టంగా ఆదేశించారు. గురువారం స్థానిక ఓ కల్యాణ మండపంలో జిల్లాలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లతో భూముల మ్యుటేషన్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అందులో రికార్డుల నిర్వహణలో పారదర్శకత, మ్యుటేషన్ ప్రక్రియలో కాల పరిమితులపై అవగాహన కల్పించారు. మ్యుటేషన్ల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జిదారులతో ఫొటో రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మ్యుటేషన్లను తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలతో స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. రికార్డులు పక్కాగా ఉంటేనే మ్యుటేషన్లకు ఆమోదం తెలపాలన్నారు. దీనిపై అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాసు పుస్తకాలలో తప్పులు సవరించి నిర్ణీత వ్యవధిలో తిరిగి అందించాలన్నారు. మార్చి, ఏప్రిల్లో పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు. రీ సర్వేకు సంబంధించి జాయింట్ ఎల్పీఎంలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మ్యుటేషన్ల అర్జీలను ఎలా పరిష్కరించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సబ్ కలెక్టర్ కళ్యాణి, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రావణి వివరించారు. ఎక్కడ తప్పులు దొర్లుతాయి, వాటిని ఏ విధంగా సరిదిద్దాలో వివరించారు. మీసేవ లేదా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, తహసీల్దార్ ద్వారా అడంగల్ పరిశీలన, ఫారం–8 నోటీసు జారీ, వీఆర్వోల క్షేత్రస్థాయి విచారణ, సబ్ కలెక్టర్, ఆర్డీవో స్థాయిలో పరిశీలన, తుది ఆమోదం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ కళ్యాణి, డీఆర్ఓ మధుసూదనరావు, రాయచోటి, పీలేరు ఆర్డీవో శ్రీనివాస్, సర్వే ఏడీ భరత్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
రీ సర్వే ఎల్పీఎంలు తక్కువగా ఉండాలి
కలెక్టర్ నిశాంత్ కుమార్


