భక్తిశ్రద్ధలతో షబ్–యే–బరాత్
● రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు
బయాన్ చేస్తున్న మహమ్మద్ అలీ బగ్దాది
కడప సెవెన్రోడ్స్: ముస్లింలు మంగళవారం షబ్–యే–బరాత్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలతోపాటు కడప నగరంలోని దాదాపు అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిళలు, పిల్లలు తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్ ప్రార్థనలు, జికర్ నిర్వహించారు. మసీదులు భక్తుల ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు తెల్లవారుజాము ఫజర్ నమాజ్ వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా మత గురువులు, ఆధ్యాత్మికవేత్తలు సందేశాలు ఇచ్చారు. ముఖ్యంగా షబ్బే బరాత్ పర్వదినం విశిష్టత, రంజాన్ మాసాన్ని పుణ్యసాధనకు వినియోగించుకోవాల్సిన విషయాన్ని తెలియజేశారు. రంజాన్ మాసం పొందడం తమ అదృష్టంగా భావించాలన్నారు. ఈ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో గడుపాలన్నారు. ఈ మాసంలోని ప్రతి క్షణాన్ని పుణ్యసాధనకు కృషి చేయాలన్నారు. అల్లాహ్తోపాటు మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) జీవన విధానాన్ని కొనసాగించాలని భక్తులకు సూచించారు. అనంతరం ప్రత్యేక నమాజులు, జికర్, తహజూద్ నమాజ్లు పాటిస్తూ తమతోపాటు తమ కుటుంబ సభ్యులు పాపాలను క్షమించాలని, స్వర్గలోక ప్రాప్తి కల్పించాలని అల్లాహ్ను కన్నీటితో వేడుకున్నారు. ఇదిలా ఉండగా మసీదులకు అదిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా మసీదు కమిటీ ప్రతినిధులు విశేష ఏర్పాట్లు చేశారు. మసీదులకు ఏర్పాటు చేసిన విద్యుద్దీప అలంకరణ పర్వదిన శోభను మరింత రెట్టింపు చేసింది.
భక్తిశ్రద్ధలతో షబ్–యే–బరాత్
భక్తిశ్రద్ధలతో షబ్–యే–బరాత్


