బుద్ధుని కొండపై ఆంక్షలు తొలగించాలి
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె బుద్ధునికొండపై ఆరునెలలుగా అమలుచేస్తున్న నిషేధాజ్ఞలు వెంటనే ఎత్తివేసి, బుద్ధ భగవానుడి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకులు పీటీయం.శివప్రసాద్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా పౌరులకు సంక్రమించిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారంటూ పోలీసుల తీరుకు నిరసగా ఆయన ఇంట్లో మౌనదీక్ష చేపట్టారు. దీక్ష విరమణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...బుద్ధుడికొండపై రెవెన్యూ, పోలీసు అధికారులు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. భగవాన్ బుద్ధుడి పూజలకు అనుమతి కోరుతూ, మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మౌనదీక్ష పేరుతో నిరసన కార్యక్రమానికి బాస్ పిలుపునిచ్చిందన్నారు. కార్యక్రమ అనుమతికి మూడురోజుల ముందే వన్టౌన్ పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకుంటే, చివరిక్షణంలో అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలపడం భావ్యం కాదన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంట్లోనే మౌనదీక్ష చేపట్టినట్లు చెప్పారు. బుద్ధవిహారలో ఇప్పటివరకు నాలుగుసార్లు బుద్ధుడి విగ్రహాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని, ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ధంపై కొనసాగుతున్న ద్వేషాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు మార్చి 13న ఛలో ఢిల్లీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాస్ నాయకులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, జీ.వి.రమణ, వై.గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, రవిశంకర్, తలారికృష్ణ, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.


