యథేచ్ఛగా భూ ఆక్రమణ
ఆక్రమిత భూమిని చదును చేసిన దృశ్యం
స్వాధీనం చేసుకున్న టిప్పర్ను పోలీసులకు అప్పగిస్తున్న ఆర్డీఓ చంద్రమోహన్
కాశినాయన : కూటమి నాయకుల ఆధ్వర్యంలో భూ దందాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం మనదే.. ఖాళీగా ఉంటే ఆక్రమించుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టీపట్టనట్లు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ ఆక్రమిత భూములను పరిశీలించారు. అక్కడ ఆక్రమిత భూముల్లో పనిచేస్తున్న రెండు హిటాచీలు, ఒక జేసీబీ, టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. డ్రోన్ సర్వే ద్వారా ఆక్రమిత భూములను గుర్తించారు.
నిజమైన లబ్ధిదారులకు బెదిరింపులు
టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఆక్రమణకు గురైన భూములపై కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మండలంలోని మూలపల్లె రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబర్ 1లో 1,018 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 200 సర్వే నంబర్ల వరకు గతంలో పట్టాలు ఇచ్చి ఆన్లైన్లో నమోదు చేశారు. 300 ఎకరాల భూమిని అటవీశాఖకు స్వాధీనం చేశారు. మిగిలిన భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారు. కొందరు దొంగ పట్టాలు సృష్టించి మాకు డీ ఫారాలు ఉన్నాయని ఆక్రమించి పంటలను సాగు చేస్తున్నారు. పట్టాలు కలిగి ఆన్లైన్లో ఉన్న భూములను సైతం కొంత మంది ఆక్రమించుకుని సాగు చేస్తూ నిజమైన లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈభూముల ఆక్రమణ జరుగుతోంది. భూమి మాది అని అక్కడికి వెళితే భూమి దగ్గరికి రానివ్వలేదని కొంత మంది రైతులు వాపోయారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్కు, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కొంత రైతులు ఆర్డీఓకు మొరపెట్టుకున్నారు. ఆక్రమించిన భూమిలో రేయింబవళ్లు జేసీబీలు, టిప్పర్లతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు పెట్రేగిపోతున్నారు.
అక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటాం
ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. రెండు రోజుల లోపు ఆక్రమించి భూములు సాగు చేస్తున్న రైతుల వివరాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులు కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలను తహసీల్దార్ వెంకటసుబ్బయ్యకు సమర్పించాలని తెలిపారు. మొత్తం పూర్తి వివరాలు సేకరించి తనకు పంపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, ఆర్ఐ అమరనాథ్రెడ్డి, వీఆర్ఓ నారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
యథేచ్ఛగా భూ ఆక్రమణ


