భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
డీఏఓ శివనారాయణ
మదనపల్లె రూరల్: భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు, మందులు వాడి రైతులు అధిక దిగుబడి పొందాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ తెలిపారు. గురువారం మదనపల్లె మండలం వలసపల్లె గ్రామంలో భూసార పరీక్షలకు సంబంధించి మట్టి నమూనాలను సేకరించారు. ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు వస్తాయన్నారు. మట్టిలోని పోషక లోపాలను గుర్తించి అవసరమైనంత మేరకు ఎరువులు చల్లడం ద్వారా నేల ఆరోగ్యం కాపాడటంతోపాటు పర్యావరణ కాలుష్యం తగ్గించినట్లు అవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షకు మట్టిని సేకరించే విధానం, వివిధ రకాల జీవన ఎరువులు వాడటం వల్ల ఉపయోగం, రైతులకు కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ రమేష్రాజు, ఏవో నవీన్కుమార్రెడ్డి, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.


