రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత
సింగిల్ డెస్క్ ద్వారా పరిశ్రమలకు అనుమతి
మదనపల్లె రూరల్: రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పీపీఆర్ కల్యాణమండపంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కే.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ నిశాంత్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రహదారి భద్రతపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయన్నారు. రోడ్డు భద్రతపై సరైన అవగాహన లేకుండా యువత చేస్తున్న ర్యాష్ డ్రైవింగ్, వేగంగా బైక్స్ నడపడం, యాంగిల్స్ మీద కట్చేయడం కిక్ ఇస్తుందనుకుంటే, దాని పర్యవసానం జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. పిల్లలు చేసిన పొరపాట్లకు, తప్పిదానికి జీవితాంతం తల్లిదండ్రులు పరువు పోగొట్టుకోవడమే కాకుండా జైలుశిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు అండగా నిలిచి, గోల్డెన్ అవర్లో వారిని ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడిన గుడ్ సెమారిటన్కు రూ.25వేలు గౌరవవేతనంతో పాటుగా ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. రోడ్డు భద్రతను ప్రజలు చాలా చిన్న విషయంగా భావిస్తున్నారని, ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం గాల్లో కలుస్తోందని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో రోడ్డుప్రమాదాల్లో అన్నమయ్యజిల్లా టాప్ ఫైవ్ జాబితాలో ఉండటం ఆవేదన కలిగించే అంశమన్నారు. రోడ్డు భద్రత పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, వాళ్ల సొంత ప్రాణాలతో పాటు వేరే వాళ్ల కుటుంబాలను ఇబ్బందుల్లో పడేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డుభద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా మొమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, ఆర్టీఓ అశోక్ప్రతాప్, పంచాయతీరాజ్ అధికారి దయాకర్, ఎంవీఐ దినేష్చంద్ర, ఏఎంవీఐలు శివలింగయ్య, శ్రీహరి, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
మదనపల్లె: జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అందే దరఖాస్తులకు సింగిల్ డెస్క్ విధానంలో అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించిన ఆయన పరిశ్రమలకు అందిస్తున్న రాయితీపై అధికారులతో ఆరా తీశారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ కృష్ణకిశోర్, జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, పలుశాఖల అధికారులు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమస్యలపై కలెక్టర్ ఆరా: మండలంలోని కొండామర్రి పంచాయతీలో శనివారం సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులతో కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు విధుల నిర్వహణలో, సమస్యలపై నిర్లక్ష్యంతో వ్యవహరించరాదని ఆదేశించారు. ఎంపీడిఓ తాజ్మస్రూర్, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రహదారి నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు
జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్
రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత


