ఘనంగా రామయ్య గ్రామోత్సవం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం టీటీడీ అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని మూల విరాట్కు ఆరాధన, విశేష సహస్రనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణము, చతుర్వేద పారాయణము నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పీఠంపై ఆశీనులు చేసి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి.. తులసి గజమాలలతో సుందరంగా అలంకరించి, మంగళవాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో అడుగడుగునా భక్తులు స్వామి వారికి కాయ, కర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, మనోజ్ పాల్గొన్నారు.
రామయ్య సన్నిధిలో
ఏపీఆర్ఈఆర్ఏ సభ్యులు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిలుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(ఏపీఆర్ఈఆర్ఏ) గౌరవ సభ్యులు ఇ. రాజశేఖర రెడ్డి, యు.ఎస్.ఎల్.ఎన్ కామేశ్వర రావు దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ప్రదక్షణ చేయించి, గర్భాలయంలోని మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.


