కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ
మదనపల్లె : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు చెప్పారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన వీబీజీ రాంజీ, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్కోడ్లు, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ప్లాంటు బిల్లులను ఒకేసారి తీసుకొస్తోందని చెప్పారు. ప్రజలకు తెలిసేలోపు వీటిని అమలులోకి తీసుకువస్తోందని అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు, కార్మికులు దీన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో సామాజిక న్యాయం పూర్తిగా దెబ్బతిందని, దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఉపాధి కొత్త చట్టంలో కూలీల అవసరాల మేరకు కాకుండా కేంద్రానికి తోచిన సమయంలో పని ఇచ్చే విధంగా సవరణ పెట్టారని, దీనివల్ల పని కల్పించడం కష్టమవుతుందని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి లేబర్కోడ్లు అమల్లోకి వస్తాయని దీనివల్ల కార్మికులు కనీస హక్కులతో పాటు సమ్మె హక్కునూ కోల్పోతారని తెలిపారు. ఈ చట్టాలను అత్యంత వేగంగా బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని, వీటిపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎం నాయకులు నాగరాజు, నరసింహ, ఆఫ్రిది పాల్గొన్నారు.


