మదనపల్లెలో ఏసీబీ దాడుల కలకలం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏసీబీ అధికారులు బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఓ అధికారి ఇంట్లో జరిపిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. దాడులకు సంబంధించి కడప ఏసీబీ సీఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కడప రిమ్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా పని చేస్తున్న మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో ఓ బాధితుడి దగ్గర రూ.30 వేల లంచం తీసుకుంటూ బుధవారం పట్టుబడినట్లు చెప్పారు. కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆదేశాలతో అనంతపురం ఏసీబీ టీమ్తో కలసి మదనపల్లె బీకేపల్లెలో ఉంటున్న మేజారి సుబ్బయ్య ఇంట్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే ఎలాంటి అక్రమ ఆస్తులు వెలుగు చూడలేదని కొన్ని అనుమానిత రికార్డులను వెంట తీసుకుని వెళ్లామని చెప్పారు. ఏసీబీ అధికారుల దాడుల వార్త పట్టణంలో దావానంలా వ్యాపించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీశాయి.


