ఆపుకోలేని ఆవేదన
డెమో ఫార్మిసిన్ మార్చాలని డిమాండ్
రాజంపేట: ఉమ్మడి జిల్లా రైలుమార్గంలో నంద్యాల–రేణిగుంట మధ్య నడిచే డెమోరైలులో ప్రయాణికులకు కనీస వసతులు కరువయ్యాయి. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మహిళలు చెప్పుకోలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఒక్కోసారి చాలా మంది మరుగుదొడ్లలో ఉండగానే రైలు వెళ్లిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణికులు సంక్షేమానికి పెద్దపీట అని చెప్పుకునే మోదీ ప్రభుత్వంలో రైల్వేశాఖ పనితీరుకు డెమోలో నరకప్రయాణం అద్దంపడుతోంది.
సప్తగిరిలో పెట్టిన తరహాలో..
తిరుపతి–చైన్నె మధ్య నడిచే సప్తగిరిలో మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. ఆ తరహాలో డెమోలో ఏర్పాటుచే యాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రయాణికులు కూడా సప్తగిరిలో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే వారు ఈ విషయంపై తరచూ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అదే విధంగా ప్రయాణికుల ఆవేదనను అర్థం చేసుకొని పరిష్కారదిశగా విశాఖ జోన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి.
డెమోకు పెరుగుతున్న ఆదరణ
పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రాముఖ్యత కలిగిన స్టేషన్లలో హాల్టింగ్స్ను ఎత్తివేశారు. కోవిడ్–19 ముందు ఉన్న హాల్టింగ్స్ ఇప్పుడు లేకపోవడంతో ప్రయాణికులు నంద్యాల–రేణిగుంట ఽమధ్య నడిచే డెమో రైలుపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ఈ రైలు రద్దీగానే తిరుగుతోంది.
8 గంటల ప్రయాణంలో నరకం..
నంద్యాలలో 5.30కు బయలుదేరి రేణిగుంటకు 12.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 1.45 కు బయలుదేరి రాత్రి 9.30గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. దాదాపు 8 గంటలకుపైగా డెమోలో ప్రయాణం కొనసాగుతుంది. నంద్యాల, వైఎస్సార్, తిరుపతి జిల్లా వాసులు ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రైలు ఆగితే స్టేషన్లోకి పరుగులు..
మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేని పరిస్థితుల్లో తమ అవససరాలు తీర్చుకునేందుకు రైలు ఆగగానే సేష్టన్లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు పరుగులు తీసుకున్నారు. ఇటీవల రాజంపేట, రైల్వేకోడూరు స్టేషన్లో ఇటాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికుల చెప్పుకోలేని ఆవేదనను రైల్వేశాఖపరిగణనలోకి తీసుకోలేదు. స్టేషన్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. నీటిసౌకర్యం, మరుగుదొడ్లు లేకపోవడం వల్ల గంటలతరబడి వృద్ధులు, పిల్లలు, మహిళలు అవస్థలు పడుతున్నారు.
డెమో ప్యాసింజర్
డెమో రైలులో ప్రయాణికులు
డెమో రైలును కాకుండా సాధారణ బోగీల (ఫార్మిసిన్)తో నడిపించాలని నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. డెమో రైలులో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. అయితే యాత్రీకులు డెమోలాంటి రైళ్లలో ప్రయాణం బరువని, జనరల్ బోగీలతో నంద్యాల–రేణిగుంట రైలును నడిపించే అంశాన్ని రైల్వేశాఖ పరిశీలించాలని కోరుతున్నారు.
డెమో రైలులో మరుగుదొడ్లు కరువు
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
పట్టించుకోని రైల్వేశాఖ
మౌలిక సదుపాయాలు కల్పించాలి
డెమో రైలు బాత్రూం, మరుగుదొడ్లు లేకపోవడంతో ఆపుకోలేని ఆవేదనతో ప్రయాణం చేయాల్సిన దుస్ధితి నెలకొంది. ఈ రైలు ప్రారంభం నుంచి సమస్య కొనసాగుతోంది. రైల్వే అధికారులు స్పందించి డెమోలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. –షమీవుల్లాఖాన్, న్యాయవాది, నందలూరు
రైల్వే అధికారులు స్పందించాలి
కడప, నంద్యాల, తిరుపతి జిల్లాలను కలుపుతూ నడిచే డెమో రైలులో ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ రైలులో మరుగుదొడ్డు ఏర్పాటుచేయాలి..లేదా ఫార్మిసిన్ మార్చాలి. సమస్యలపై రైల్వే అధికారులు వెంటనే స్పందించాలి. –రాజశేఖర్రెడ్డి, డీఆర్యూసీసీ మాజీసభ్యుడు, నందలూరు
ఆపుకోలేని ఆవేదన
ఆపుకోలేని ఆవేదన
ఆపుకోలేని ఆవేదన


