రెవెన్యూలో ‘మ్యుటేషన్’ గుబులు
రాయచోటి : అక్రమంగా మ్యుటేషన్ చేసినా.. సరియైన కారణం లేకుండా దరఖాస్తులను తిరస్కరించినా రెవెన్యూ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరికలతో.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది గుండెల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో వారికి ఇష్టం వచ్చిన రీతిలో రికార్డులు తారుమారు జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. పక్కా రికార్డులు ఉన్నప్పటికీ కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడుతున్నట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీంతో బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై కలెక్టర్ నేరుగా విచారణ చేపట్టడంతోపాటు అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. మ్యుటేషన్ దరఖాస్తులను తిరస్కరించిన అంశంపై శనివారం విచారణ చేపట్టారు. రాయచోటి, కలకడ మదనపల్లి మండలాల తహసీల్దార్లను ఆయా మండలాలకు సంబంధించిన ఐదు గ్రామాల వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లను మదనపల్లి కలెక్టరేట్కు పిలిపించారు. తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులపై కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ స్వయంగా పలువురు మ్యుటేషన్ల దరఖాస్తుదారులతో ఫోన్లో మాట్లాడి వారు పెట్టుకున్న దరఖాస్తులపై పలు అంశాలను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ విచారణలో తాము చేసిన అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం అధికారులలో కనిపిస్తోంది. పీజీఆర్ఎస్ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా జరుగుతోందనే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. భవిష్యత్తులో మ్యుటేషన్ తదితర రెవెన్యూ దరఖాస్తులపై అక్రమంగా దరఖాస్తుల తిరస్కరణ, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పరిశీలన సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.
కలెక్టర్ విచారణతో అధికారుల్లో ఆందోళన
రాయచటోటి మండల పరిధిలోని రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


