మార్చిలోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి
మదనపల్లె: జిల్లాలో చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులన్నింటినీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉపాధి హామీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ ఆదేశించారు. గురువారం స్థానిక బీటీ కళాశాలలో జిల్లా స్థాయి ఉపాధి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మార్చి 10లోగా రూ.62 కోట్లు చెల్లిస్తామని అన్నారు. జిల్లాలో మొత్తం రూ.103.6 కోట్ల మెటీరియల్ నిధులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.41.6 కోట్లు చెల్లించామన్నారు. గ్రామాల్లో జరుగుతున్న సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్లు, పండ్ల తోటల పెంపకానికి చేసిన ఖర్చును మార్చి 10లోపు విడతల వారీగా చెల్లిస్తామన్నారు. ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు మొదలు కాని పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి వీబీ జీ రామ్ జీ చట్టంతో అమలు చేస్తున్నామని, అందుకు వీలుగా ప్రస్తుతం పురోగతిలోని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 12,711 పనులు వారంలోపు పూర్తి చేయాలని, ఈ పనులకు సంబంధించిన బిల్లు పూర్తిగా చెల్లించాలని ఉపాధి సిబ్బందిని అదేశించారు. ఎంపీడీఓలు గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటరత్నం, పీఆర్ ఎస్ఈ, జిల్లా లోని డీఈఈలు, ఏపీడీలు, ఎంపీడీఓలు, ఉపాధి ఎంపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు.
● ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పథకం అమలు
● ఉపాధి హామీ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్


