మదనపల్లెటౌన్ : పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలన్నీ తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమం జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా నలు మూలల నుంచి ప్రజలు సమస్యలపై అర్జీలను తీసుకు వచ్చి నేరుగా జిల్లా ఎస్పీకి అందజేశారు. అర్జీల్లో ఎక్కువగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో తీసుకెళ్లిన వారిపై పోలీసులు సకాలంలో చర్యలు తీసుకు పోక పోవడం వంటి వాటిపై ఫిర్యాదు చేశారు. అలాగే భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సైబర్ నేరాలు, భూ కబ్జాలు, దాడుల కేసులపై జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదుచేశారు.ఎస్పీ సంబంధింత అధికారులతో మాట్లాడారు.సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
హోంగార్డు కుటుంబానికి అండగా పోలీసు శాఖ
మదనపల్లెటౌన్ : విధి నిర్వహణలో అకాల మరణం చెందిన అన్నమయ్య జిల్లా, కేవీపల్లె పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ మృతి చెందిన హోంగార్డు వేణుగోపాల్ (హెచ్జి–303) కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలచింది. సోమవారం హోంగార్డు కుటుంబాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయం మదనపల్లెకు రప్పించి, వేణుగోపాల్ సతీమణి కె.చంద్రకళ కు కారుణ నియామక పత్రాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పనిచేసే పోలీస్, హోంగార్డులకు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆపద వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉండి అన్నివిధాల ఆదుకుంటుందని ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


