కమనీయం.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
స్వామి, అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం వేకువ జామునే మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారిని అలంకరించి గ్రామోత్సవం చేపట్టారు. ఆలయ మండపంలో మూలవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా చేశారు. అనంతరం కల్యాణోత్సవ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా స్వామివార్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందర్ని ఆకట్టుకొంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగళ్యధారణ చేయించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి వారి ఎదుట యజ్ఞహోమాలు నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం వాహన మండపంలో అందంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువుదీరి మేళతాళాలతో కోలాటాలు, చెక్కభజనలతో గ్రామ వీధుల మీదుగా ఊరేగారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన సోమవారం రథారోహణం, రథాగమనం, ధూళీ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాలాబట్టర్ తెలిపారు.
గరుడ వాహనంపై స్వామి వారి ఊరేగింపు
గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామి వారు
కమనీయం.. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం


