పెద్దతిప్పసముద్రం : క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో న్యాయమూర్తి ఇద్దరు ముద్దాయిలకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎస్ఐ పరమేశ్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన క్రిష్ణమూర్తి (49), పోతుపేట పంచాయతీ పిడుంవారిపల్లికి చెందిన మంజునాథ్ (35)లు మూడేళ్ల క్రితం మద్యం కేసులో పట్టుబడగా వీరిపై కేసు నమోదైంది. అయితే ముద్దాయిలిద్దరూ గతంలో చాలా సార్లు వాయిదాల నిమిత్తం తంబళ్ళపల్లి కోర్టుకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారనే అభియోగంతో తంబళ్ళపల్లి జూనియర్ సివిల్ జడ్జి ఏ.ఉమర్ ఫరూక్ ఇటీవల పోలీసులను ఆదేశిస్తూ ముద్దాయిలపై అరెస్టు వారంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు విస్తృతంగా గాలించి వారిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, కానిస్టేబుల్ బావాజాన్ తెలిపారు.


