ఘర్షణలో గాయపడిన వృద్ధుడు మృతి
మదనపల్లిటౌన్ : బి కొత్తకోట మండలం రంగనాథపురంలో ఈనెల 21రాత్రి జరిగిన ఘర్షణలో గాయపడిన వృద్ధుడు కృష్ణప్ప గురువారం రాత్రి మృతి చెందాడు. బి కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని గోళ్ళతోపు పంచాయతీ రంగనాథపురానికి చెందిన వేడుక కృష్ణప్ప (70) అతని భార్య కృష్ణమ్మ (65) లు గొర్రెలు తోలుకొని వీధి గుండా వెళుతుండగా తిమ్మారెడ్డి, బాబురెడ్డి, అనసూయ, అరుణ, నారాయణమ్మ తదితరులు కర్రలతో దాడి చేశారన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణప్పకు మదనపల్లెలో చికిత్స చేయించి, అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని ఓ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని సీఐ చెప్పారు.


