సైనిక పాఠశాలలో తనిఖీలు
కలికిరి : దేశ వ్యాప్తంగా సైనిక పాఠశాలలతో పాటు ఇతర ప్రధాన ప్రదేశాలకు ఖలిస్థాని గ్రూప్ పేరుతో ఈ–మెయిల్ ద్వారా పోలీసులకు వచ్చిన బాంబు బెదిరింపుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు కలికిరి సీఐ అనీల్కుమార్ ఆధ్వర్యంలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు కలికిరి సైనిక పాఠశాలను జల్లెడ పట్టాయి. పాఠశాల ఆవరణలోని ఆడిటోరియం, విద్యార్థుల వసతిగృహాలు, సిబ్బంది గదులు, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కార్యాలయాలు, విద్యార్థుల తరగతి గదులు, పరిపాలన భవనం, మెస్, క్వార్టర్స్లలో తనిఖీ చేశారు. తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు, సైనిక పాఠశాల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ–మెయిల్ కేవలం బెదిరింపు మాత్రమే అని నిర్ధారిస్తూ, సైనిక పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు, సిబ్బంది, అధికారులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైనిక పాఠశాల వద్ద భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే ప్రజలు వెంటనే 112 డయల్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.


