● 800 బస్తాల రేషన్ బియ్యం సీజ్
● మిల్లు నిర్వాహకులపై కేసులు నమోదు
మదనపల్లెటౌన్ : మదనపల్లె పట్టణంలోని రైస్ మిల్లులకు రేషన్ బియ్యం అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంపై కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆదేశాలతో.. విజిలెన్స్ సీఐలు శివన్న, శ్రీనివాసులురెడ్డిలు సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు. స్థానిక ఎస్టేట్లో ఉన్న రెండు రైస్ మిల్లుల్లో శుక్రవారం విస్తృతంగా సోదాలు చేశారు. మిల్లులో ఉన్న బియ్యాలపై కెమికల్స్ చల్లి పీడీఎస్ రైస్ ఉన్న ఆనవాళ్లను వెలికి తీశారు. వంశీ కృష్ణా రైస్ మిల్లులో 11 బస్తాలు బయట పడగా, మోడరన్ రైస్ మిల్లులో ఐదు బస్తాల పీడీఎస్ రైస్ బయట పడింది. వీటి విలువ సుమారు రూ.32, 000 ఉండచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. 800 కిలోల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివన్న మాట్లాడుతూ మదనపల్లెలోని రెండు రైస్ మిల్లుల్లో పీడీఎస్ బియ్యాన్ని పాలీష్ చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో సుమారు 800 కిలోల బియ్యం పట్టుకున్నామని, వీటిని పంచనామా నిమిత్తం స్థానిక సీఎస్ డీటీ ఫైరోజ్కు అప్పగిస్తున్నామన్నారు. రేషన్ బియ్యం ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తుంటే, కొందరు అక్రమార్కులు వాటిని సొమ్ము చేసుకుంటున్నారని, వీరిపై కొరడా ఝళిపిస్తామన్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని మిల్లుకు విక్రయించడానికి వచ్చిన వ్యక్తి నమోనారాయణ పైన, ఈ రైస్ కొనుగోలు చేసిన రెండు రైస్ మిల్లుల యజమానులు ధీరజ్, కిషోర్ పైన కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఈ దాడులు మరింతగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో డీసీటీఓ బాబుమోజస్, సీఎస్ డీటీ ఫైరోజ్, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.


