పెద్దమండ్యం: ఎనిమిది నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని కలిచెర్లలో గురువారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుర్రంవాండ్లపల్లె పంచాయతీ బత్తినిగారిపల్లెకు చెందిన వీరభద్ర మూడో కుమార్తె శ్రీలత (18)కు తంబళ్లపల్లె మండలం ఎద్దులవారికోట పంచాయతీ నాయునివారిపల్లెకు చెందిన కోటకొండ నాగరాజు కుమారుడు సోమశేఖరతో వివాహం జరిపించారు. ఇతనికి తల్లిదండ్రులు లేక పొవడంతో వివాహమైనప్పటి నుంచి దంపతులు ఇద్దరు కలిచెర్లలోని కుమ్మరవీధిలో నివాసం ఉన్న సోమశేఖర చిన్నాన్న కె. మల్లికార్జున ఇంట్లోనే ఉంటున్నారు. ఇతను గ్రామంలో భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేసుకుంటుండగా, సోమశేఖర ట్రాక్టర్ డ్రైవర్గా ఓ రైతు వద్ద పనిచేస్తున్నాడు. ఇటీవల వేరు కాపురం పెట్టాలని భర్తను భార్య కోరింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. అయితే ప్రసం జరిగిన తరువాత వేరుకాపురం పెడతామని అల్లుడైన సోమశేఖర, భార్య తల్లిదండ్రులకు చెప్పారు. కాగా వేరు కాపురం పెట్టలేదని, తన మాట వినలేదన్న కారణంతో జీవితంపై విరక్తి చెంది తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ పి. శ్రావణి పరిశీలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదెహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్: కుటుంబీకులతో గొడవపడి ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిమ్మనపల్లె మండలంలో గురువారం చోటు చేసుకున్న ఘటనపై కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు. కొండయ్య గారి పల్లికి చెందిన షాహిర్ భార్య ముబీనా (28), కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో గొడవపడి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. వైద్యం అందించినా కోలుకోకపోవడంతో ఆమెను తిరుపతి తీసుకెళ్లారు.
అప్పుల బాధ
తాళలేక రైతు ...
వేంపల్లె : మండలంలోని బక్కన్న గారి పల్లె గ్రామంలో రెడ్డిబోయిన. సూర్యనారాయణ (30) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. బక్కన్న గారి పల్లె గ్రామానికి చెందిన రెడ్డి బోయిన సత్యనారాయణ కుమారుడు సూర్యనారాయణ కు 2.50 ఎకరాలు పొలం ఉంది. ఈ పొలంలో అరటి, మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేసుకునేవారు. గతంలో తమ పొలంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఐదు బోర్లు వేయించాడు. సుమారు 12 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేయగా దిగుబడి రాకపోవడమే కాకుండా గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు. దీంతో తెచ్చిన అప్పులు తీర్చలేక గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీ తో ఉరి వేసుకున్నాడు. ఈయనకు భార్య కళ్యాణి ఐదు సంవత్సరాల కొడుకు భాను ప్రకాష్, మూడు సంవత్సరాల కొడుకు రుషేంద్ర లు ఉన్నారు. భార్య కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. కుటుంబ పోషకుడు మృతి చెందడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


