అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్యం
మదనపల్లె రూరల్ : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు రిలే దీక్షలు నిర్వహిస్తుంటే, కూటమిప్రభుత్వం పట్టించుకోకపోగా, నిర్లక్ష్యం కనపరుస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధురవాణి, రాజేశ్వరి అన్నారు. బుధవారం అంగన్వాడీ రిలేదీక్షల్లో భాగంగా ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటూ పొర్లు దండాలతో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా అంగన్వాడీలు రెండురోజులుగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా తమ సమస్యలను గుర్తించి, సానుకూలంగా వ్యవహరించాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, రిటైర్డ్ అయిన వారికి రూ.10వేల పెన్షన్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యుటీ మంజూరుచేయాలన్నారు. మినీ వర్కర్లకు విద్యార్హత లేదనే చిన్నసాకుతో 1,810 మంది పోస్టులను నిలిపివేయడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీల సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కనపరిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి 2న విజయవాడలో మహాధర్నా నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకుంటామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే, మరో సమ్మెకు పిలుపునిచ్చేందుకు వెనుకాడమని హెచ్చరించారు. అంగన్వాడీల రిలేదీక్షలకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఐద్వా భాగ్యమ్మ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కార్యదర్శి గంగాదేవి, సభ్యులు శ్యామల, విజయలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని
పొర్లు దండాలతో నిరసన


