అంగన్వాడీల జోలికొస్తే పతనం తప్పదు
– సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు
మదనపల్లెఅర్బన్ : అంగన్వాడీల జోలికొస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలో భాగంగా మంగళవారం సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈక్రమంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు, న్యాయమైన కోర్కెల సాధనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇందులో భాగంగానే అనుబంధ సంఘాల పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నట్లు చెప్పారు. ముఖ్యంగా కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, గ్రాట్యుటీ మంజూరు, మినీసెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం, తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు. అయితే వర్కర్స్ సమస్యలు, డిమాండ్లపై కొద్ది రోజులుగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదన్నారు. పైగా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఇదే జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేశ్వరీ, కోశాధికారి హరిశర్మ, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మధురవాణి, కార్యదర్శి గంగాదేవి, సభ్యులు విజయ, శ్యామల, జయలక్ష్మీ, శివలక్ష్మీ, ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, తదితరులు పాల్గొన్నారు.


