నా కుమార్తెను అప్పగించి న్యాయం చేయాలి
కడప రూరల్ : ‘నా భర్త ఆస్తి కోసం నా కుమార్తెను నా దగ్గరి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. నా కుమార్తెను నాకు అప్పగించి న్యాయం చేయాలి’ అని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన గీతాంజలి కోరారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2017లో అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అరుణ్తేజ్ అనే వ్యక్తితో తనకు ప్రేమ వివాహం జరిగిందన్నారు. తమకు నాలుగేళ్ల హన్విత అనే కుమార్తె ఉందని పేర్కొన్నారు. తన భర్త 2022 సంవత్సరంలో మృతి చెందడంతో తాను అనంతపురం జిల్లా కేంద్రంలోని అమ్మగారింటిలో ఉంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కడప నగరానికి చెందిన టీడీపీ నాయకుడు చల్లా రాజశేఖర్ భార్య, కార్పొరేటర్ చల్లా స్వప్న తన భర్తకు మేనత్త అవుతుందన్నారు. వీరు 2023 జూలైలో తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లడంతోపాటు సంరక్షణ కోసమని తన భర్త అరుణ్ తేజ్కు చెందిన దాదాపు రూ.5–6 కోట్ల ఆస్తిని రాయించుకుని తనకు, తన కుమార్తెకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. న్యాయం కోసం ప్రశ్నిస్తే వారు ‘అధికారం మాది.. మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు’ అంటూ బెదిరిస్తున్నట్లుగా ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2024లో అటు అనంతపురంతోపాటు ఇటు కడపలో చీటింగ్ కేసును పెట్టినట్లుగా తెలిపారు. అలాగే న్యాయం కోసం 2025 జూన్లో హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. తన కుమార్తెను తనకు ఇప్పిండంతోపాటు తమ ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.


