రైతు రిజిస్ట్రేషన్కు దూరంగా 51,072 మంది గుర్తింపు
రొంపిచెర్ల : చిత్తూరు జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్కు 51072 మంది రైతులు దూరంగా ఉన్నారని గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. అయన శుక్రవారం రొంపిచెర్ల మండలంలోని బండకిందపల్లెలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలన్నారు. రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ కింద ఏపీఎఫ్ఆర్ రిజిస్టేషన్ చేయాలని సిబ్బందిని అదేశించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న రైతులు మాత్రమే ప్రధానమంత్రి కిసాన్, అన్నదాత సుఖీభవ, ఆర్థిక ప్రయోజనాలు, సబ్సిడీ ఎరువులు, పని ముట్లు పొందుతారన్నారు. రైతులు సాగు చేసిన పంటలను ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో పంట సాగు చేసిన రైతులు 3,75,010 మంది ఉండగా వారిలో ఇప్పుటి వరకు 3,57,352 మంది పంట నమోదు జరిగిందన్నారు. రైతు రిజిస్ట్రేషన్ సంఖ్య ద్వారానే అన్ని లావాదేవీలు జరుగుతాయన్నారు. ఎరువుల వాడకంపై రైతుకు అవగాహన కల్పించారు. అఽధిక ఎరువులు వేయడం వలన భూమి దెబ్బ తింటుందన్నారు. క్రిమి సంహారిక మందుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. దీని వలన భూమితోపాటు వ్యవసాయ పంటలు కూడా దెబ్బ తింటాయని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఏడీఏ శివకుమార్, మండల ఏవో శ్రావణి, డీఏవో కార్యాలయ ఏవో శ్రీకాంత్, ఏఈవో ఖాదర్ వల్లి, వీహెచ్ఏలు తిరుమల, హేమలత తదితరులు పాల్గొన్నారు.


