● గండికోట ముంపుబాధితులకుకూటమి ‘వంచన’!
● జగనన్న ఇచ్చిన రూ.10 లక్షలకు తోడుమరో రూ.2 లక్షలన్న ఆదినారాయణరెడ్డి
● ఎన్నికల హామీలు మర్చిపోయిన ఎమ్మెల్యే.. నిలిచిపోయిన జీవో 312 నిధులు
● 9,096 మంది బాధితుల ఆవేదన..పెంచి అనంతపురం వాసులఎదురుచూపులు
జమ్మలమడుగు: రాయలసీమ ప్రయోజనాల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన గండికోట ముంపు బాధితుల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ విడుదల చేసిన నిధులను ఆపేయడమే కాకుండా, ఎన్నికల వేళ కూటమి నేతలు ఇచ్చిన ‘అదనపు’ హామీలు ఇప్పుడు నీటి మూటలుగానే మిగిలిపోయాయి.
నమ్మించి గొంతు కోసిన ఆదినారాయణరెడ్డి:
2024 ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రస్తుత ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి.. ముంపువాసులకు భారీ హామీలిచ్చారు. జగనన్న సర్కార్ ఇచ్చే రూ.10 లక్షల పరిహారానికి తోడు, కూటమి ప్రభుత్వం రాగానే అదనంగా మరో రూ.2 లక్షలు (మొత్తం రూ. 12 లక్షలు) ఇప్పిస్తానని బాధితులను నమ్మించారు. ఆ మాట నమ్మి ఓట్లేసిన 18,206 మంది నిర్వాసితులు ఇప్పుడు ఎమ్మెల్యే వంచనను చూసి మండిపడుతున్నారు. అధికారం వచ్చి రెండేళ్లు కావ స్తున్నా.. అటు జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 3.25 లక్షల బకాయిలు లేవు, ఇటు ఎమ్మెల్యే హామీ ఇచ్చిన అదనపు రూ. 2 లక్షల ఊసే లేదు.
పెంచి అనంతపురం వాసుల గోస:
పరిహారం కోసం ముఖ్యంగా పెంచి అనంతపురం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 525 మందికి ప్యాకేజీ అందాల్సి ఉండగా, కేవలం 148 మందికే రూ. 14.59 కోట్లు ఇవ్వాలని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. మిగిలిన వారి పరిస్థితిపై స్పష్టత లేదు. నిధుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ‘పై నుంచి ఆదేశాలు లేవు.. ఎప్పుడు ఇస్తామో చెప్పలేం‘ అంటూ అధికారులు నిర్వేదం వ్యక్తం చేస్తుండటం బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది.
కొండాపురం మండల పరిధిలో ముంపునకు గురైన సుమారు 500 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ‘అవార్డు’ పాస్ చేయలేదు. ప్రస్తుతం ఆ భూముల్లో ప్రాజెక్టు నీరు నిల్వ ఉండటంతో రైతులు సాగు చేసుకోలేక, పరిహారం అందక ఆర్థికంగా చితికిపోతున్నారు. గత ప్రభుత్వం జూలై 6, 2023న జీవో నంబర్ 312 ద్వారా రూ. 296.62 కోట్లు విడుదల చేసినా, రాజకీయ కారణాలతో వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడం కూటమి నేతల ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది.


