కురబలకోట : ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని నీతి ఆయోగ్ ఆఫీసర్ నాన్సీ నిఖిత అన్నారు. శుక్రవారం ఆమె కురబలకోటలోని అంగన్వాడీ కేంద్రం, జెడ్పీ హైస్కూల్, అంగళ్లులోని టెర్రకోట సీఎఫ్సీ సెంటర్ను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలు, పిల్లల పోషణ, విద్యా కార్యక్రమాలు, టెర్రకోట తయారీ కార్యకలాపాలపై ఈ సందర్భంగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ప్రజల సహకారం ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో వేగంగా అమలు కావడానికి ఆస్కారం ఉందన్నారు. ప్రజలతో కలసి అధికారులు పరస్పరం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. గ్రామాల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగయ్య, ఎంఈఓ ద్వారకనాథ్, సీడీపీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.


