గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజైన సోమవారం స్వామవారిని స్థానిక బస్టాండు కూడలిలోని స్వామివారి తేరు(రథం) వద్దకు తీసుకొచ్చి అందులో కొలువుదీర్చారు. ఆలయంలో ధూళీ ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో రథాన్ని అందంగా అలంకరించారు. అనంతరం హరినామస్మరణ నడుమ రథోత్సవం సాగింది. ఈసందర్బంగా వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. మేళతాళాలు, కోలాటాలు, టీటీడీ కళాకారుల సాంస్కృతి కార్యక్రమాలతో రథోత్సవం గ్రామపురవీధుల గుండా సాగింది. గత ఆదివారం రాత్రి స్వామివారి రాత్రి తిరునాలు ఘనంగా నిర్వహించారు. తరిగొండతోపాటు పరిసర గ్రామాల ప్రజలు చాందీనీ బండ్లు, అన్నం,టెంకాయ బండ్లు ఆలయం చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గోన్నారు.
ఆలయంలో నేడు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన మంగళవారం సూర్యప్రభవాహనం, ఊంజల్సేవ, చంద్రఫ్రభ వాహనం, పార్వేట ఉత్సవం, అశ్వవాహనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని ఆలయఅర్చకులు గోపాలబట్టార్ తెలిపారు.


