రెండో వితడలో చేపట్టి ఆగిన పనులు
అనుమతిలేదు
మదనపల్లె: 2019–24 మధ్యలో అప్పటి సీఎం వై.ఎస్.జగన్ చేపట్టిన విద్యారంగ సంస్కరణలు రాష్ట్ర చరిత్రలో ఎవరిపాలనలోనూ జరగలేదు. ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి పర్చడం, ఆంగ్లమాధ్యమ బోధన, పైసా భారం లేకుండా అన్నిసౌకర్యాలను కల్పించిన ఘనత గత సీఎం వై.ఎస్.జగన్కే దక్కుతుంది. అలాగే అమ్మఒడి పథకాన్ని అమలు చేసి విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి బాటలు వేశారు. అయితే కూటమిపాలన రావడంతో వై.ఎస్.జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై కాలకూట విషాన్ని చిమ్ముతోంది. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన అభివృద్ధిని, ప్రధానంగా పాఠశాలల అభివృద్ధిపై కక్షగట్టడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు రెండో విడతలో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. ఈ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు, విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న ఈ పనులను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉన్నా కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.
మొదటి విడతకు మహర్దశ
వై.ఎస్.జగన్ పాలనలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాడు–నేడు తొలి విడత పనులకు శ్రీకారం చుట్టిన గత ప్రభుత్వం పాఠశాల వారీగా ఏఏ పనులు అవసరం, ఎంత నిధులు అవసరమో గుర్తించి ఆ మేరకు నిధులను విడుదల చేసి పనులు చేయించింది. ఏ పాఠశాల నిధులను ఆ పాఠశాల ఖాతాలకు జమ చేయడంతో పనులు పరుగుపరుగున పూర్తయ్యాయి. విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తొలి విడతలో జిల్లాలో 584 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ, గురుకుల విద్యాలయాల్లో పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ విడతలో రూ.132.23 కోట్లతో అదనపు తరగతుల నుంచి సౌకర్యాల కల్పన పనులు చేపడితే రూ.130 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయి కార్పొరేట్ స్కూళ్లుగా తయారయ్యాయి.
రెండో విడతకు గ్రహణం
‘నాడు–నేడు’తో చేపట్టిన రెండో విడత పాఠశాలల అభివృద్ధికి కూటమి గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం ఈ రెండో విడతలో ఒక్కో పాఠశాలలో 10 నుంచి 40 వరకూ పనులను గుర్తించి వాటి పనులు చేపట్టింది. జిల్లాలో 1,018 పాఠశాలల్లో రూ.340.54 కోట్లతో చేపట్టిన పనులు వేగంగా సాగిపోతున్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పనులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ప్రభుత్వం రావడానికి ముందు రూ.160 కోట్ల పనులు పూర్తికాగా, మిగిలిన అసంపూర్తి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. 20 నెలలు గడుస్తున్నా ఈ పనుల్లో చలనం లేదు. ప్రభుత్వం పట్టించుకోకుండా కోట్లతో చేపట్టిన పనులను పూర్తి చేయించాలన్న శ్రద్ధ చూపడం లేదు.
రూ.20 కోట్లు మురిగిపోతున్నాయి
రెండో విడతలో పాఠశాలల అభివృద్ధికి మంజూరు చేసిన నిధుల్లో రూ.20 కోట్ల నిధులు మురిగిపోతున్నాయి. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని అసంపూర్తి పనులు పూర్తి చేయించే అవకాశం ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. పాఠశాలల కమిటీలు, ఉపాధ్యాయ వర్గాలు అసంపూర్తి పనులతో ఇబ్బందులు పడుతున్నా, వాటిని పూర్తి చేయించేందుకు ప్రభుత్వం సహకరించడం లేదు.
వైఎస్సార్సీపీ పాలనలో
ప్రభుత్వ బడులకు మహర్దశ
మొదటి విడతలో రూ.132.23 కోట్లతో సర్వాంగ సుందరంగా బడులు
రెండో విడతలో రూ.340.54 కోట్లలో రూ.166.49 కోట్ల ఖర్చు
కూటమిపాలన రాకతో
అర్ధంతరంగా ఆగిపోయిన పనులు
రూ.20 కోట్లు మురిగిపోతున్నాయి
వసతులు, సౌకర్యాలు లేక విద్యార్థుల వెతలు
‘నాడు–నేడు’ రెండో విడత కింద మంజూరైన పాఠశాలల పనులు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి లేదు. అసంపూర్తి పనుల విషయంలో నిర్ణయం రావాల్సి ఉంది. అప్పటి వరకు పనులు చేపట్టలేం. గత ప్రభుత్వంలో మంజూరైన రెండో విడత పనులకు సంబంధించి రూ.20 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి.
– సుధాకర్బాబు, ఈఈ, సమగ్రశిక్ష


