ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం
మదనపల్లెటౌన్ : మహిళలు భయాన్ని వీడి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం సాధిస్తారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లెలో వారం రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన మహిళా సాధికార వారోత్సవాలను డీఎస్పీ కార్యాలయం వద్ద ఎస్పీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి వంటి వారిని సాటి మహిళలు, విద్యార్థినులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనేక పదవుల్లో ఉన్న మహిళలే నేటి తరం మహిళలకు స్ఫూర్తి అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే ఆటంకాలను చూసి భయపడకూడదని, ఆపద సమయంలో పోలీసు శాఖ రక్షణ కవచంలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం, చట్టాలపట్ల అవగాహన కల్పించడం, స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచడమే మహిళా వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ వారోత్సవాలకు జిల్లాలోని మహిళలు, విద్యార్థినులు, స్వచ్ఛంద సమస్థల వారు పాల్గొని విజయవంతం చేయాని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


