గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన బుధవారం చక్రస్నానం నిర్వహించారు. ఉదయం తోమాలసేవ, తిరుచ్చి ఉత్సవాలు జరిపారు. అర్చకులు రంగునీళ్లు, పుసుపునీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకొంటూ కోలాహాలంగా వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం వైభవంగా జరిపించారు. స్వామివారి ఆయుధాలైన శంఖు, చక్రాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తూ చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరిగింది. వాహన మండపంలో రంగురంగుల పుష్పాలతో అలంకరించిన తిరుచ్చి వాహనంలో స్వామివారిని కొలువుదీర్చి గ్రామపురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ధ్వజావరోహణం నిర్వహించారు. ఏకాంత సేవతో ఈ రోజు ఉత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గోన్నారు.
ఆలయంలో నేడు : శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. తరువాత పష్పయాగం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు.


