● కథానాయకుడిగా మదనపల్లె వాసి
● నటీనటులు ఇక్కడి వారే
కురబలకోట : మదనపల్లె పట్టణానికి చెందిన అప్పినపల్లి భాస్కరాచారి కథానాయకుడిగా తానే స్వయంగా నిర్మించిన విధాత చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబీసీ ప్రొడక్షన్స్ బ్యానర్పై విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు భాస్కరాచారి మంగళవారం అంగళ్లులో చిత్ర విశేషాలను వెల్లడించారు. మదనపల్లె ప్రాంతానికి చెందిన నటీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరిగిందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సందేశాత్మక చిత్రంగా నిలుస్తుందని తెలిపారు. రెండు గంటలకుపైగా నిడివి గల ఈ చిత్రానికి ఒక్క రోజులోనే సెన్సార్ బోర్డు నుంచి కూడా అనుమతి రావడం విశేషమన్నారు. మదనపల్లె పేరు, ప్రతిష్టలను ఈ చిత్రం మరింత పెంచగలదని భావిస్తున్నట్లు తెలిపారు. మనిషి జీవితాన్ని విధి ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునేలా చూపించడం జరిగిందన్నారు. సాధారణ రైతు కూలీ ఇతి వృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం గ్రామీణ జీవన స్ఫూర్తిని, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, కష్ట నష్టాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. దర్శకుడిగా మణికంఠ రాజేంద్ర వ్యవహరించారన్నారు. మంచి కథ, కథనంతో వస్తున్న సందేశాత్మక చిత్రంగా విధాత చిత్రం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ఆదరణ లభించగలదని చిత్ర బృందం ఆశిస్తున్నట్లు తెలిపారు.


