పీలేరురూరల్ : అంగన్వాడీలను నమ్మించి మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్సార్టీయూసీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నమ్మ మండిపడ్డారు. మంగళవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని రిలే దీక్షలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు, యూనియన్ నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. గతంలోనూ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో అనేక మార్లు అంగన్వాడీలను అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేయడం, ఇవీకాక గుర్రాలతో తొక్కించడం జరిగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల సమ్మె చేయడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పలు డిమాండ్లు పరిష్కరించిందన్నారు. అలాగే డిమాండ్లను మినిట్స్లో పొందుపరిచిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా అంగన్వాడీలు ధర్నా చేస్తే అరెస్ట్ చేపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు జీతాలు పెంచి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు బడ్జెట్ ఉంటుంది కానీ అరకొర జీతాలతో బతుకుతున్న అంగన్వాడీలకు జీతాలు పెంచేందుకు బడ్జెట్ లేదా అని నిలదీశారు.
వైఎస్సార్టీయూసీ అంగన్వాడీ
విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నమ్మ


