చౌడేపల్లె: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద వివిధ రకాల వేలం పాటల లీజు ద్వారా ఆలయానికి రూ:3.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. గురువారం బోయకొండ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ పర్యవేక్షణలో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలకు రూ:5లక్షల ధరావత్తు చెల్లించిన 21 మంది పాటదారులు మాత్రమే పాల్గొన్నారు.గతంలో వచ్చిన వేలం పాట ఆదాయంలో నామమాత్రపు ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ ముందే నిర్ణయించిన మేరకు వేలం పాటలు ముగించేశారని ఆరోపణలు వచ్చాయి.కొండ పైన కొబ్బరికాయలు, పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు ద్వారా రూ:54.70 లక్షలకు పాడి హరిప్రసాద్ సొంతం చేసుకొన్నారు. దేవస్థానం టోల్ గేటు నిర్వహణ హక్కు ద్వారా రూ:73 లక్షల హెచ్చుపాటతో రమణ కై వసం చేసుకున్నారు. పెద్దబోగం, చిన్న బోగం సేకరించుకొను హక్కు ద్వారా రూ:88.20 లక్షలతో గోపి , భక్తాధులు సమర్పించు చీరలు, రవికలు, పావడాపీసులు సేకరించుకొను హక్కు రూ:47.06 లక్షలతో గంగులప్ప సొంతం చేసుకొన్నారు. అలాగే భక్తాధులు సమర్పించు తలనీలాలు సేకరించే హక్కును రూ:27.15 లక్షల హెచ్చుపాటతో యాదగిరి కై వసం చేసుకొన్నారు. కొండపై క్లాక్ రూము నిర్వహించుకొనే హక్కుపై రూ:18.50 లక్షల హెచ్చుపాటతో కిరణ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొండపై పూల హారాలు,నిమ్మకాయ హారాలు, వడిబాల సామాగ్రి,చీరలు, జాకెట్ పీసులువిక్రయించుకొను హక్కుకు పోటీదారులనుంచి సరైన మద్దతు రాని కారణంగా వాయిదా వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ చిన్నరెడ్డెప్ప బందోబస్తును ఏర్పాటుచేశారు.


