మదనపల్లెటౌన్: కర్నాటక సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరు కోమాలోకి వెళ్లారు. రాయల్పాడు ఎస్ఐ రామా కథనం మేరకు.. మదనపల్లె మండలం, బార్లపల్లెకు చెందిన అరుణ్ కుమార్, మనోజ్ సొంతపని మీద రాయల్పాడుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేరే ద్విచక్ర వాహనదారుడిని లిఫ్టు అడిగి బయల్దేరారు. ఇదే సమయంలో గుర్రంకొండ మండలం, మర్రిపాడుకు చెందిన బషీర్ బాషా బెంగుళూరు నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యలోని మదనపల్లి– చీకలబైలు చెక్పోస్టు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ను ఢీకొని, ద్విచక్ర వాహనంలో వెళ్తున్న అరుణ్ కుమార్, మనోజ్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న బషీర్ బాషా మృతి చెందగా కారు డ్రైవర్ కోమాలోకి వెళ్లాడు. ద్విచక్రవాహనంలో వెళ్తున్న అరుణ్ కుమార్ తీవ్రంగా గాయపడగా, మనోజ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ఆటోలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాయల్పాడు ఎస్ఐ రామా సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కోమాలోకి వెళ్లిన కారు డ్రైవర్ ను శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా బషీర్ బాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


