‘బస్తా’ మే సవాల్!
చౌడేపల్లె: మండలంలోని చారాల సచివాలయం, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు మంగళవారం యూరియా కోసం ‘బస్తా’ మే సవాల్ అంటూ కుస్తీ పట్టాల్సి వచ్చింది.. ఎలాగైనా యూరియా బస్తాను చేజిక్కించుకోవాలనే ఆత్రుత ప్రతి రైతులోనూ కనిపించింది. అధికారులు ఎప్పుడు టోకెన్లు జారీచేస్తారా..ఎప్పుడు బస్తా చేతికొస్తుందోనంటూ ఉత్కంఠగా పోటీపడ్డారు. చారాల, శెట్టిపేట గ్రామపంచాయతీల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలిరావడంతో గందరగోళం నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే సచివాలయం వద్ద రైతులు చేరుకొన్నారు. రైతుసేవా కేంద్రంలో 300 బస్తాల యూరియా స్టాకు ఉన్నప్పటికీ ఒక్కసారిగా రైతుల సంఖ్య పెరగడంతో సమాచారం అందుకొన్న ఏఓ మోహన్కుమార్ అదనపు సిబ్బందిని సచివాలయం వద్దకు రప్పించారు. రైతులందరూ ఒక్కసారిగా టోకన్లకోసం సచివాలయంలోకి చొరబడటంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు, పోలీసుల సహకారంతో యూరియా బస్తాలు పంపిణీ చేయాల్సి వచ్చింది.
యూరియా కోసం రైతుల కుస్తీ
తోపులాటలతో ఇబ్బందిపడ్డ వృద్ధులు


