ప్రధాన వార్తలు

పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్గా వచ్చే మంత్రి ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్తోపాటు ఇంకో అనుబంధ రూమ్ను కూడా మెయిన్టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

సర్కారు డ్రామా.. ఎరువులు భ్రమ
యూరియా విషయంలో ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే, గ్రామాల్లో కళ్లకు కనిపిస్తున్నది మరొకటి. మొన్నటి దాకా తగినన్ని నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో రైతుల ఆందోళనలు చూసి మాట మార్చారు. అక్రమంగా ఎలా తరలి వెళుతోందని.. అలా తరలి పోయిన యూరియా నిల్వలను తిరిగి స్వాధీనం చేసుకోండంటూ హూంకరిస్తున్నారు. దౌర్జన్యంగా, లోపాయికారిగా, అక్రమంగా యూరియా నిల్వలను తమ గోదాములకు తరలించుకు పోయింది కూటమి పార్టీల నేతలే. మరి వారి వద్ద నుంచి నిజంగా ఒక్కటంటే ఒక్క బస్తా అయినా అధికారులు స్వా«దీనం చేసుకోగలిగారా? ‘ముఖ్యమంత్రి సీరియస్..’ అని ఎల్లో మీడియాలో డ్రామా వార్తలు మినహా ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు. సర్కారు నిర్వాకంతో ఊరూరా చిన్న, సన్నకారు రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ‘యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు సరిపడా నిల్వలున్నాయి. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ చేస్తున్న ప్రకటనలకు.. వాస్తల పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ఇప్పటికే ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వ.. ఇప్పుడు ఆర్బీకేలను ఇంకా పతనావస్థకు తీసుకెళ్తూ.. ఇక్కడికి రావాల్సిన యూరియా స్టాకును అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు మళ్లించేందుకు అధికార పార్టీల నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో వారు వ్యాపారులతో కమీషన్లు తీసుకుని అధిక ధరలతో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకోసం మార్కెట్లో యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు. యూరియా దొరకడం గగనంగా మారడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చిన స్టాక్ను వచ్చినట్లు టీడీపీ నేతలు దారి మళ్లించిన విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడ్డారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినా.. చర్యలు తప్పవంటూ ఎల్లో మీడియా వేదికగా సీరియస్ అయినట్లు డ్రామాలతో రైతులను మభ్యపెడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)తో పాటు రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా సరఫరాను పెంచాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోందని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు మార్క్ఫెడ్–ప్రైవేటు వ్యాపారులకు ఇప్పటివరకు ఉన్న 50ః50 నిష్పత్తిలో జరుపుతున్న ఎరువుల కేటాయింపులను ఇక నుంచి 70ః30 నిష్పత్తిలో కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఇంకా ఆచరణకు నోచుకోలేదు. స్టాకు లేక మూతపడిన సొసైటీలు అధిక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీరు దిగిన మెట్ట పంటలతో పాటు ముంపునకు గురైన మాగాణి పొలాలకు యూరియా అత్యవసరం. వర్షాధారంతో సాగు చేసిన మెట్ట పైరులకు అదును దాటకముందే యూరియా బూస్టర్ డోస్ వెయ్యాలి. కానీ.. ఒక్క బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మార్క్ఫెడ్ వద్ద చాలినంత స్థాయిలో యూరియా నిల్వల్లేని కారణంగా ఆర్ఎస్కేలతో పాటు మెజార్టీ సొసైటీలు శనివారం మూసివేశారు. నో స్టాక్ బోర్డులు పెట్టకపోయినప్పటికీ యూరియా నిల్వల్లేని కారణంగా రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సొసైటీలను మూయాల్సి వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కొద్దిపాటి నిల్వలున్న సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అన్ని జిల్లాల్లోనూ కన్పిస్తున్నాయి. 80 శాతం ప్రైవేట్ డీలర్ల వద్దే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 11.84 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరగ్గా, దాంట్లో అత్యధికంగా యూరియా 4.89 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 4.08 లక్షల టన్నులు, డీఏపీ 1.53 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 76 వేల టన్నులు, ఎంవోపీ 57 వేల టన్నులున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 6.23 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా, వాటిలో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా కేవలం 1.50 లక్షల టన్నులు, డీఏపీ 84 వేల టన్నులు మాత్రమే ఉంది. 17 జిల్లాల్లో యూరియా, 11 జిల్లాల్లో డీఏపీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న నిల్వల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు డీలర్ల వద్దే ఉన్నాయి. సొసైటీలు, ఆర్ఎస్కేల్లో అరకొరగా ఉండడంతో పంపిణీలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.400 చొప్పున, డీఏపీ రూ.1,400 నుంచి రూ.1550 వరకు బ్లాకులో విక్రయిస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ సీజన్లో యూరియాతో పాటు ఎరువులు అధికంగా వాడేస్తున్నారంటూ ప్రభుత్వం తమను తప్పుపడుతుండడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. బస్తా కూడా పట్టుకోలేని టాస్క్ఫోర్స్ బృందాలు రైతుల ముసుగులో సొసైటీలు, రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న యూరియా నిల్వలను టీడీపీ నేతలు పక్కదారి పట్టించి, బ్లాక్లో విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వ్యవసాయేతర అవసరాలతో పాటు సరిహద్దు జిల్లాలు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న యూరియాను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్్కఫోర్సు బృందాలు మొక్కుబడి తనిఖీలకే పరిమితమయ్యాయి. టీడీపీ నేతల గోదాముల జోలికి మాత్రం పోవడం లేదని స్పష్టమవుతోంది. అధికార టీడీపీ నేతల గోదాములను తనిఖీ చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసిన యూరియా నిల్వలను ఒక్క చోట అయినా వెలికి తీశారా అని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని ఊళ్లలో అదే దుస్థితి ⇒ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి వచ్చిన 266 బస్తాల యూరియాను గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలే పప్పుబెల్లాల్లా పంచుకున్నారు. మిగిలిన స్టాక్ను స్థానిక టీడీపీ నాయకుడు రూ.430 చొప్పున అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రస్తుతం ఒక్కో రైతుకు కేవలం ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీఏసీఎస్లు, ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సి వస్తోంది. పెడన మండలం నందమూరు విశాల సహకార పరపతి సంఘం వద్దకు అన్నదాతలు భారీగా తరలి రావడంతో పోలీసులను పిలిపించాల్సి వచ్చింది. గన్నవరంలో ఓ ఫెర్టిలైజర్ దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. వ్యవసాయ శాఖ కొత్తగా పెట్టిన నిబంధనల మేరకు అన్నదాతలు ఆధార్కార్డు, పట్టాదారు పాస్బుక్, కౌలుకార్డు వెంట తీసుకుని వచ్చారు. ⇒ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ప్రైవేటు ఎరువుల దుకాణం వద్ద శనివారం రైతులు పడిగాపులు కాశారు. ఇక్కడ కేవలం 120 బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ వైవీ పద్మావతి, వ్యవసాయ శాఖ ఏఓను నిలదీసి ఎరువుల షాప్ షట్టర్ దించేశారు. దీంతో పంపిణీ వాయిదా పడింది. ⇒ అనకాపల్లి జిల్లా మునగపాకలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు ఆధ్వర్యంలో రైతులు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎరువుల నిల్వలు ఏమయ్యాయో చెప్పాలని రైతులు నిలదీశారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల రైతులు ఒడిశాకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు. స్థానికంగా యూరియా కొనాలంటే అదనంగా జింకు, ఇతర మందులు కొనుగోలు చేయాలంటూ డీలర్లు తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. ⇒ కాకినాడ జిల్లా సామర్లకోటలోని నీలమ్మ చెరువు వద్ద ఉన్న ప్రాథమిక సహకార సంఘం ద్వారా యూరియా పంపిణీకి టోకెన్లు పంపిణీ చేస్తుండగా తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది టోకెన్లు పంపిణీ నిలిపి వేశారు. ⇒ ఏలూరు జిల్లాలో యూరియా కొరతే లేదని కలెక్టర్ ప్రకటించారు. అయితే కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న శనివారపుపేట కోఆపరేటివ్ సొసైటీకి శనివారం సిబ్బంది తాళాలు వేశారు. టీడీపీ అనుచరులకే యూరియా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండాకురిటి గ్రామంలోని టీడీపీ నాయకులు వీఏఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్) లేకుండానే దౌర్జన్యంగా ఆర్ఎస్కే తలుపులు తీసి తమ అనుచర వర్గానికి యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఆర్ఎస్కేకు వచ్చిన 450 యూరియా బస్తాల పంపిణీని శనివారం చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ బత్తుల జ్యోతీశ్వరరావు ఆర్ఎస్కేకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. అప్పటికే 70 శాతం మేర యూరియా టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేశారు. ఎరువుల అడ్డగోలు పంపిణీపై ఏం చర్యలు తీసుకుంటారని వీఏఏ ఎం.కుసుమను సర్పంచ్ ప్రశ్నించారు.గోదాం వద్దకు వెళ్తుంటే తమ్మినేని అరెస్ట్ శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస రైల్వే గూడ్స్ గోదాం వద్ద నుంచి ఎరువులు పక్కదారి పడుతున్నాయనే సమాచారంతో శనివారం కుమారుడు చిరంజీవి నాగ్తో కలిసి అక్కడికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని వాహనాన్ని అడ్డుకుని వెనుదిరగాలని కోరారు. తమ్మినేని వెనుదిరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు ముందుకు కదలనీయలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ను బలవంతంగా జీపు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి నాగ్ వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావుతో మాట్లాడుతూ జిల్లాకు ఎన్ని బస్తాల ఎరువులు వచ్చాయి, ఎన్ని ఇచ్చారని ప్రశ్నించగా ఆయన కాకి లెక్కలు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అనంతరం తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలైనా ఎరువులు ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. బహిరంగ మార్కెట్లోనూ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో ప్రజా పోరాటం చేస్తామని ప్రకటించారు.వ్యవసాయం చేయలేం ప్రస్తుతం వరి పంటకు పొటాష్, యూరియా చాలా అవసరం. పొటాష్ను పెద్దాపురంలో బస్తాకు రూ.50 అదనంగా చెల్లించి కొనుగోలు చేశాను. కానీ యూరియా లభించడం లేదు. సొసైటీ వద్ద రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారు. నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఇలాగైతే ఎలా? – గుణ్ణం వీర్రాజు, రైతు, సామర్లకోట

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలకు ఇబ్బంది ఉండదు. శత్రువులనుకున్న వారు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య వ్యవహారాలను సకాలంలో చక్కదిద్దుతారు. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి బయటపడతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు శుభవార్తలు వింటారు. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, బంగారు రంగులు. శ్రీదక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.మిథునం...ఆర్థికంగా మరింత సర్దుబాట్లు కాగలవు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. కళాకారులు, వైద్యరంగం వారికి మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. గణపతి స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...కొన్ని కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. కొన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య ఎదురీదవలసి వస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. స్థిరాస్తి వివాదాలతో కుస్తీపడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.సింహం....కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. కాశీ, ప్రయాగ వంటి యాత్రలు చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించడంలో కొందరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో యుక్తిగా బాధ్యతలు నిర్వహిస్తారు. వైద్యరంగం, క్రీడాకాకారులకు ఊహించని సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.కన్య...ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలను పెంచుచకుంటారు. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.తుల...చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను చాకచక్యంగా నిర్వహించి లాభాలు దక్కించుకుంటారు. వైద్యరంగం ,రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...ఊహించని సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. క్రీడాకారులు,పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న కార్యక్రమాలను చక్కదిద్ది ఊరట చెందుతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మీరు అనుకున్నంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరం...ముఖ్యమైన వ్యవహారాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై ఆలోచనలు సాగిస్తారు. కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. కళారంగం, రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు చర్చలు జరుపుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్నంత ప్రగతి సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెంచుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో ఎదురయ్యే ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వైద్యులు, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. అధిక ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. అనుకున్న వ్యవహారాలు నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. క్రీడాకారులు, సాంకేతిక వర్గాలకు ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక ఆందోళన. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ నమ్మబలికిన టీడీపీ, జనసేన కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా మార్చేసిందని తూర్పారబట్టారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే.. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య అప్పటి విపక్షాలు తెలుగుదేశం, జనసేన పార్టీ లు పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీలక రంగాల్లో మూల ధన వ్యయం బాగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గుతోందని.. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, అప్పులు పెరగకుండా చూస్తామని గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ లు హామీ ఇచ్చాయి.⇒ కానీ.. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాది (2023–24)తో పోల్చి చూస్తే కేవలం 3.08 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04 శాతం పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 12.02 శాతం ఉంటే, ప్రభుత్వ సొంత ఆదాయం అత్యల్పంగా 3.08 శాతం వృద్ధికే ఎందుకు పరిమితమైంది? ⇒ గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచి్చన ఆదాయాన్ని (సీఎజీఆర్) పరిగణనలోకి తీసుకుంటే అది కేవలం 2.39 శాతం మాత్రమే పెరిగింది. వాస్తవానికి అది కనీసం 10 శాతం ఉండాల్సి ఉంది. ⇒ మరో అత్యంత ఆందోళకర అంశం రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరగడం. వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో చేసిన అప్పులో 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలను పునరాలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ విధానాల వల్ల తీవ్ర అవినీతితో ప్రభుత్వ ఆదాయానికి భారీగా దగండి పడింది.

ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..
సాక్షి, హైదరాబాద్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్ టన్నులు. అంటే ఈ సీజన్లో ఇప్పటివరకు 6.87 ఎల్ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్ కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్ఫెడ్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్ సీజన్ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్కు 9.80 ఎల్ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా 1.60 ఎల్ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్ పాయింట్ల ద్వారా మార్క్ఫెడ్కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్ స్టాక్తో కలిపితే మొత్తం 3.61 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్లో యూరియా డిమాండ్ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్లో పత్తి లేకపోవడంతో డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు.

మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ను తలదన్నేలా అధునాతన కృత్రిమమేధ సంస్థ ‘మాక్రోహార్డ్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రో, సాఫ్ట్ పదాలకు పూర్తి విరుద్ధమైన మాక్రో, హార్డ్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ కంటే తన సంస్థ అద్భుతంగా ఎదగబోతోందని అర్థంవచ్చేలా గతంలోనే మస్క్ Macrohard >> Microsoft అని ‘ఎక్స్’ లో పోస్ట్చేసిన విషయం తెల్సిందే. ఎక్స్ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మాక్రోహార్డ్ సంస్థ పనిమొదలు పెడుతుందని మస్క్ శనివారం ప్రకటించారు. ‘‘ఇకపై సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ తదితరాల కోసం విడిగా హార్డ్వేర్లను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన పనిలేదు. ఇకపై అంతా ఆన్లైన్లోనే కృత్రిమమేధతో పని జరిగిపో తుంది. సాఫ్ట్వేర్ అనేవి అంతా ఆన్లైన్లోనే ఇన్స్టాల్ అవుతాయి. ఈ లెక్కన ఒకరకంగా మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, డివైస్లు, ఉపకరణాల విభాగ వ్యాపారం మూలకు పడినట్లే. యావత్ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏఐతో భర్తీచేస్తా. హ్యూమన్ స్పీచ్, టెక్స్ట్ సహా పరస్పర సమాచార బదిలీని సాధ్యంచేసే చాట్బాట్ వంటివన్నీ ఇకపై నేరుగా సాఫ్ట్వేర్తోనే జరిగేలా చేస్తా. ఇది వేలాది మంది శ్రామికులు చేసే పనిలో సమానం. భారీ సంఖ్యలో సాఫ్ట్వేర్ శ్రామికశక్తిని మా ఏఐ క్లోన్ భర్తీచేస్తుంది. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ’’అని మస్క్ చెప్పుకొచ్చారు. ఒకేసారి సమాంతర వ్యవస్థ ‘‘ఇకపై వేలాదిగా స్పెషలైజ్డ్ కోడింగ్, ఇమేజ్, వీడియోలను సృష్టించే, అర్థంచేసుకునే కంప్యూటర్ పోగ్రామ్లను అభివృద్ధిచెందించాల్సి ఉంది. ఇవన్నీ ఒకేసారి సమాంతరంగా పనిచేస్తాయి. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఏదైనా సమాచారం, అంశంపై నేరుగా సాఫ్ట్వేర్తోనే మాట్లాడొచ్చు, సంప్రతించవచ్చు. వర్చువల్ మెషీన్లే సాధారణ యూజర్లు అడిగే ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇస్తాయి. ఇదంతా ఊహించనంత స్థాయిలో జరగబోతోంది. దీనిని ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ కర్మాగారంగా చెప్పొచ్చు’’అని మస్క్ చెప్పారు. మస్క్కు చెందిన ఎక్స్ఏఐ సంస్థ ఆగస్ట్ ఒకటో తేదీన అమెరికా పేటెంట్ ఆఫీస్లో ‘మాక్రోహార్డ్’పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. గతంలోనే మస్క్ ఏఐ ఆధారిత వీడియోగేమ్స్ రంగంలో అడుగుపెట్టాలని భావించారు. ఇప్పుడు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు దశాబ్దాలుగా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ ఏకఛత్రాధిపత్యాన్ని కూలదోసేందుకు కొత్త తరహాలో ఏఐ సాఫ్ట్వేర్ తయారీకి మస్క్ నడుంబిగించారు. అయితే ప్రతి కంప్యూటర్లో కనిపించే మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్ వంటి సాఫ్ట్వేర్లకు దీటుగా అంతకుమించిన సౌకర్యాలుండే అన్ని రకాల సాఫ్ట్వేర్ సేవలను అందించడం మస్క్కు కత్తిమీద సాము చేయడంతో సమానమని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ ఎన్విడియా నుంచి తెప్పించిన లక్షలాది గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ)లతో అమెరికాలోని మెంఫిస్లో మస్క్ ఇప్పటికే భారీ కేంద్రాలను ఏర్పాటుచేసి కొలోసస్ సూపర్కంప్యూటర్లతో పని మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే తరహాలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు సిద్ధమైన ఓపెన్ఏఐ, మెటా వంటి పెద్ద సంస్థలతో మస్క్ సంస్థ పోటీపడాల్సి ఉంది.

అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్ ఐటమ్స్పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ కింద కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్ కస్టమ్స్ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్ షిప్మెంట్స్పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు.

రంగా విగ్రహాలకు అవమానం
కైకలూరు/కలిదిండి: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాలకు అవమానం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మాస్్కలు ధరించిన ఇద్దరు దుండగులు కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలకు పేడపూసి అవమానించారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కలిదిండి మూడు కూడళ్ల సెంటర్లో రంగా విగ్రహం వద్ద శుక్రవారం సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. శనివారం ఉదయం రెండు ప్రాంతాల్లో విగ్రహాలకు పేడ ఉండటాన్ని గమనించిన రంగా అభిమానులు కోపంతో రగిలిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి.. నిందితుల్ని గుర్తించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే.. ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో రెండు, కైకలూరు మండలం ఆలపాడులో ఒకచోట స్థాపించిన రంగా విగ్రహాలను ఆయన తనయుడు వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించనున్నారు. కలిదిండి, సానారుద్రవరం గ్రామాల మీదుగానే ఆయన వెళ్లాల్సి ఉంది. అందుకే దుండగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీల్లో ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరూ 18 ఏళ్లలోపు వారిగా కనిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని ఒక యువకుడు విగ్రహానికి పేడ పూయగా, తర్వాత మరో యువకుడు బైక్పై రావడంతో అతనితో కలిసి పరారయ్యాడు. రాధా రానుండటంతో పక్కా పథకం ప్రకారమే విగ్రహాలకు పేడ పూసినట్టు స్థానికులు భావిస్తున్నారు. విగ్రహాలను శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ నేతలు దుండగుల దుశ్చర్యను తెలుసుకుని శనివారం రంగా విగ్రహాలను శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) శనివారం కలిదిండిలోని రంగా విగ్రహం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో వచ్చారు. రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు డీజే వ్యాన్ను పెద్ద శబ్దంతో విగ్రహం వైపు తిప్పారు. అక్కడితో ఆగకుండా కూటమి కార్యకర్తలు బైక్లపై నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో డీఎన్నార్ సీఐ రవికుమార్కు ఫిర్యాదుచేశారు. కూటమి కార్యకర్తల కవ్వింపు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లోగా దోషులను గుర్తించాలని, లేదంటే 3వేల మంది కార్యకర్తలతో కలిదిండిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జనం విగ్రహాలను అవమానించిన విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఘటనా స్థలాలను శనివారం పరిశీలించారు. దీంతో.. స్థానికులు ఆయనను చుట్టుముట్టారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే కామినేని ఐజీ జీవీజీ అశోక్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రా–తెలంగాణ రాధా, రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సీఎం చంద్రబాబు కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది. దుండగుల సమాచారమిస్తే బహుమతి రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగుల సమాచారం చెబితే బహుమతి అందిస్తామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ శనివారం ప్రకటించారు. కలిదిండి పోలీస్స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు.

ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

వైజాగ్లో భారత మహిళల జట్టు
సాక్షి, విశాఖపట్నం: సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్లో సత్తా చాటాలని భారత మహిళల జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి నెల రోజుల ముందునుంచి జట్టు సన్నాహకాలు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 25 నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ బృందానికి ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వారం రోజుల పాటు టీమ్ సాధన చేస్తుంది. ఫిట్నెస్, ట్రైనింగ్లాంటి అంశాల గురించి కాకుండా పూర్తిగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లపైనే దృష్టి పెడుతూ ‘స్కిల్ బేస్డ్’ కండిషనింగ్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సాధన కోసం బోర్డు వ్యూహాత్మకంగానే వైజాగ్ను ఎంపిక చేసింది. జట్టులోని ముగ్గురు సభ్యులు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, స్నేహ్ రాణాలకు ఎప్పుడో 2014లో మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. మిగతా ప్లేయర్లు ఎవరూ వైజాగ్లో గతంలో ఒక్క సారి కూడా మ్యాచ్ ఆడలేదు. ప్రాక్టీస్తో ఇక్కడి పిచ్, పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ క్యాంప్ ఉపయోగపడనుంది. వరల్డ్కప్లో భారత జట్టు రెండు అత్యంత కీలక మ్యాచ్లు దక్షిణాఫ్రికాతో (అక్టోబర్ 9న), ఆ్రస్టేలియాతో (అక్టోబర్ 12)న విశాఖలోనే ఆడనుంది. రిజర్వ్ ప్లేయర్లు సహా భారత జట్టు సభ్యులంతా ఈ ప్రత్యేక క్యాంప్లో పాల్గొంటారు. భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా దీనికి హాజరవుతారు. రెగ్యులర్ సాధనతో పాటు డే అండ్ నైట్లో రెండు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా జరుగుతాయి.
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. స్కెంజెన్ వీసా ధరలు పెరిగాయ్
కార్యాలయ ఉద్యోగ నియామకాలు పుంజుకోవచ్చు
మోసాలపై ఫండ్స్ కన్నేసి ఉంచాలి
రిటైల్ రంగం రికార్డు రన్
పేదలకు అవకాశాలను దూరం చేసి.. ఇప్పుడు ఓట్లను చోరీ చేయాలనుకుంటున్నాయి
పుస్తకాలు వదిలి.. పాఠశాలకు కదిలి
పని ఒత్తిడి.. పట్టరాని ఆవేశం
నేను రెడీలో ఇలా...
శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
యుద్ధాల విషయంలో స్వర్గప్రాప్తి ఏమోగానీ సుంకాల వేసినందుకు మాత్రం కచ్చితంగా నరకానికే పోతారేమోననిపిస్తుంది సార్!
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
సాక్షి కార్టూన్ 23-08-2025
#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం
చైనా మార్కెట్లలో భారత్కు స్వాగతం
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. స్కెంజెన్ వీసా ధరలు పెరిగాయ్
కార్యాలయ ఉద్యోగ నియామకాలు పుంజుకోవచ్చు
మోసాలపై ఫండ్స్ కన్నేసి ఉంచాలి
రిటైల్ రంగం రికార్డు రన్
పేదలకు అవకాశాలను దూరం చేసి.. ఇప్పుడు ఓట్లను చోరీ చేయాలనుకుంటున్నాయి
పుస్తకాలు వదిలి.. పాఠశాలకు కదిలి
పని ఒత్తిడి.. పట్టరాని ఆవేశం
నేను రెడీలో ఇలా...
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
యుద్ధాల విషయంలో స్వర్గప్రాప్తి ఏమోగానీ సుంకాల వేసినందుకు మాత్రం కచ్చితంగా నరకానికే పోతారేమోననిపిస్తుంది సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
సాక్షి కార్టూన్ 23-08-2025
'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం
చైనా మార్కెట్లలో భారత్కు స్వాగతం
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
సినిమా

జటాధరలో సితార
సుధీర్బాబు హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా మరో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కీలకమైన సితారపాత్రలో దివ్య ఖోస్లా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, ప్రేరణా అరోరా సహకారంతో శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుం అరోరా ఈ సినిమాకు సహ–నిర్మాతలు. ఈ చిత్రంపాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్లో విడుదలకానుంది.

స్టైలిష్ డ్యూడ్
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ఫుల్ సినిమా ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘బూమ్ బూమ్’పాట లిరికల్ వీడియోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రదీప్, మమితా స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్.

టాలీవుడ్కి రాషా రాక...
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖారారు అయిందనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్బాబు తనయుడు) హీరోగా ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్లో ఓ సినిమా రానుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలోని హీరోయిన్పాత్రకు రాషా తడానీని మేకర్స్ సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారని సమాచారం. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయని, అక్టోబరు నెలలో చిత్రీకరణ ప్రారంభం కానుందని టాక్. మరోవైపు అజయ్ దేవగన్ హిందీ చిత్రం ‘అజాద్’లో ఓ కీలకపాత్రలో నటించి, మెప్పించారు రాషా. ఈ యంగ్ బ్యూటీ నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది.

భయపెట్టే అందాల భామలు
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడం... హీరోలతో పాటల్లో ఆడిపాడటం... అనే ధోరణి ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇటీవల ట్రెండ్ మారింది. తామేమీ తక్కువ కాదంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నారు కథానాయికలు. యాక్షన్ సినిమాల్లోనే కాదు... ప్రేక్షకులను భయపెట్టే హారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం రష్మికా మందన్నా, తమన్నా, పూజా హెగ్డే, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, సమీరా రెడ్డి... వంటి పలువురు అందమైన భామలు థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలు...డబుల్ ధమాకా ‘ఛలో’ (2018) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు... తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక నేషనల్ క్రష్గా మారారు. ఇప్పటివరకూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన రష్మిక ఒకేసారి రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ‘థామా, మైసా’ వంటి హారర్ సినిమాల ద్వారా ఆడియన్స్కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారామె.రష్మికా మందన్న లీడ్ రోల్లో ‘మైసా’ అనే సినిమా రూపొందుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమానిపాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను ఇటీవల తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఎమోషనల్, హారర్, యాక్షన్ థ్రిల్లర్గా ‘మైసా’ రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక గోండు మహిళగా కనిపించనున్నారు.అదే విధంగా రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్లో నాలుగో చిత్రంగా ‘థామా’ని నిర్మిస్తున్నారు దినేష్ విజయన్. గతంలో వచ్చిన ‘భేడియా, స్త్రీ, ముంజ్య’ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించడంతో ‘థామా’పై భారీ అంచనాలున్నాయి. అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో తడ్కాపాత్రలో రష్మిక నటిస్తున్నారు. హారర్, మిస్టరీ అండ్ లవ్స్టోరీగా రూపొందుతోన్న ‘థామా’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధంగా ఉండండి ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూనే ప్రత్యేకపాటల్లోనూ సందడి చేస్తుంటారు తమన్నా. తెలుగులో ఆమె లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో తమన్నా నటిస్తుండగా అందులో ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారామె.అరుణాభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, జానపద థ్రిల్లర్ జానర్లో అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఆ మధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లో భాగం కావడం థ్రిల్లింగ్గా ఉంది. ఆ అడ్వంచర్ను బిగ్ స్క్రీన్పై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తమన్నా పేర్కొన్న విషయం విదితమే. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది.తొలిసారి హారర్ చిత్రంలో... ‘మజ్ను, అజ్ఞాతవాసి, శైలజారెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు అనూ ఇమ్మాన్యుయేల్. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ తొలిసారి ‘బూమరాంగ్’ అనే హారర్ చిత్రంలో నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ని లండన్లోని పలు ప్రదేశాల్లో జరిపారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘బూమరాంగ్’. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్గా సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ‘బూమరాంగ్’ ద్వారా ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో వేచి చూడాలి.మొదటిసారి... ‘సవ్యసాచి’ (2018) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు నిధీ అగర్వాల్. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో, హరి హర వీరమల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిధీ అగర్వాల్ మొదటిసారి ఓ గ్రిప్పింగ్ హారర్ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ సినిమా ద్వారా ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.పుప్పాల అప్పలరాజు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెల 17న నిధీ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించి, ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నిధీ అగర్వాల్ నటిస్తున్న తొలి గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రోడక్షన్ వాల్యూస్తో ఈ మూవీ ఆడియన్స్కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్గా ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ సినిమా నిధీ కెరీర్లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రోడక్షన్ హౌస్లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. బిగ్ స్క్రీన్పై ఆమె చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా టైటిల్ దసరాకి రివీల్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రెండో పిశాచి ... ఓ సినిమా హిట్ అయిందంటే చాలు... ఆ చిత్రానికి సీక్వెల్ ΄్లాన్ చేస్తున్నారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వం వహించిన హారర్ చిత్రం ‘పిశాచి’ 2014లో విడుదలై, హిట్గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్గా తాజాగా ‘పిశాచి 2’ రూపొందించారు మిస్కిన్. ఈ మూవీలో ఆండ్రియా లీడ్ రోల్లో నటించారు. విజయ్ సేతుపతి, పూర్ణ, అజ్మల్ అమీర్ ఇతరపాత్రలు పోషించారు. మురుగానందం నిర్మించారు. ఇప్పుటికే పలు హారర్ బ్యాక్డ్రాప్ మూవీస్లో నటించిన ఆండ్రియా ‘పిశాచి–2’లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.ఈ చిత్రంలో ఆమెపాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. అంతేకాదు... కథకు అవసరం రీత్యా ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్గా నటించారని, ఓ సన్నివేశంలో నగ్నంగా నటించారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ మిస్కిన్ ధ్రువీకరించారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్ విషయంలో పలు అడ్డంకులు రావడంతో ‘పిశాచి 2’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. హారర్ చిత్రంతో రీ ఎంట్రీ ‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సమీరా రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అశోక్’ (2006) చిత్రం తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. అయితే క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (2012) సినిమాలో మాత్రం ప్రత్యేకపాటలో చిందేశారామె. ఆ తర్వాత నటించలేదు. 2014లో అక్షయ్ వర్దేతో ఏడడుగులు వేసిన ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లి, పిల్లలు కారణంగా నటనకు దూరమైన సమీర 13 సంవత్సరాల తర్వాత హిందీ చిత్రం ‘చిమ్నీ’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.అది కూడా ఓ హారర్ మూవీతో కావడం విశేషం. ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీగా రూపొందుతోన్న ‘చిమ్నీ’కి గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘చిమ్నీ’ టీజర్ సినిమాపై ఉత్కంఠత పెంపొందించింది. ఈ సినిమా గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘చిమ్నీ’లాంటి హారర్ సినిమాని నేనెప్పుడూ చేయలేదు. గతంలో ‘డర్నా మనా హై’మూవీలో చేశాను.అయితే కేవలం అందులో నాది నెరేటర్పాత్ర మాత్రమే. ఆ రకంగా నేను నటిస్తున్న తొలి హారర్ మూవీ ‘చిమ్నీ’ అనుకోవచ్చు. 13 సంవత్సరాల తర్వాత తిరిగి షూటింగ్లోపాల్గొనడం కాస్తంత నెర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ కెమెరా ఆన్ కాగానే నాలోనిపాత నటి తిరిగి బయటకు వచ్చేసింది’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. సమీరా రెడ్డి ఇరవై యేళ్ల క్రితం నటించిన ‘నామ్’ అనే హిందీ సినిమా గత యేడాది నవంబరు 22న విడుదల కావడం విశేషం. కాంచన 4లో... అందం, అభినయంతో ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో హీరోల సరసన సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే తొలిసారి హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ‘కాంచన 4’ సినిమాలో నటించనున్నారు. నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్, మహేశ్బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్చరణ్ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ప్రత్యేకపాటలో నటించిన ఆమె ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు.అయితే హిందీ, తమిళ సినిమాల్లో మాత్రం నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే... ‘ముని, కాంచన’ హారర్ సిరీస్లో రానున్న ‘కాంచన 4’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్తపాత్రలో పూజ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో ఆమెది ఓ సవాల్తో కూడుకున్నపాత్ర అనే వార్తలు వినిపిస్తున్నాయి.మూగ, చెవిటి అమ్మాయిపాత్రలో కనిపించనున్నారట పూజా హెగ్డే. ఇంతకీ ఈ చిత్రంలో ఆమెపాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫుల్ హారర్ నేపథ్యంలో వచ్చిన ‘ముని, కాంచన, కాంచన 2, కాంచన 3’ సినిమాలు మంచి విజయం సాధించడంతో ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హారర్ మూవీతో తమిళ్లో ఎంట్రీ... నోరా ఫతేహి... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లో ప్రత్యేకపాటలతో తనదైన డ్యాన్సులతో కుర్రకారుని ఉర్రూతలూగించారామె. తెలుగులో ‘టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్, షేర్, లోఫర్, ఊపిరి’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారామె. కాగా ‘కాంచన 4’ వంటి హారర్ సినిమాతో నోరా ఫతేహి తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘కాంచన 4’కి అవకాశం వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఇదే సరైనcజెక్టు అనుకున్నా. స్క్రిప్టు బాగా నచ్చింది. పైగా ‘కాంచన’ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణ ఉంది. ‘మడ్గావ్ ఎక్స్ప్రెస్’ తర్వాత అలాంటి జానర్ మూవీ చేయాలనుకున్నప్పుడు ‘కాంచన 4’ అవకాశం దక్కింది. కొత్త భాషలో నటించడం సవాలే. కానీ, నేను సవాళ్లను ఇష్టపడతాను. హారర్ అండ్ కామెడీ సీన్స్లో నా నటనను, డాన్స్ స్కిల్స్ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైనcజెక్ట్ అని నా అభి్రపాయం. ‘కాంచన 4’లో లారెన్స్, పూజా హెగ్డేలతో నటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నోరా ఫతేహి చెప్పారు. పై తారలే కాదు... మరికొందరు హీరోయిన్లు కూడా హారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. బాలీవుడ్లో లేడీ ఫైర్ బ్రాండ్ అనగానే హీరోయిన్ కంగనా రనౌత్ గుర్తొస్తారు. నటిగా, డైరెక్టర్గా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి లోక్సభ సభ్యురాలిగా గెలుపొంది తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. కాగా కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక΄ోతే.. తాజాగా ఆమె ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. అనురాగ్ రుద్ర దర్శకత్వం వహించనున్న ఈ హారర్ డ్రామా సినిమాలో ఆమె కీలక పాత్రపోషించనున్నారు. ఓ జంటని దుష్ట శక్తి ఎలాంటి తిప్పలు పెట్టిందనే కథాంశం చుట్టూ ఈ సినిమా ఉంటుందట. అతీంద్రియ శక్తులు, జానపద కథల నేపథ్యంలో అనురాగ్ రుద్ర తీర్చిదిద్దనున్నారని టాక్. టైలర్పోసీ, స్కార్లెట్ రోజ్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలుపోషించనున్నారు. లయన్ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ న్యూయార్క్లో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ దాదాపు అమెరికాలోనే జరగనుంది. కంగనా రనౌత్ ఎంపీగా గెలుపొందిన తర్వాత ఒప్పుకున్న చిత్రం ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ కావడం విశేషం.
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ పేరిట ప్రతిఏటా 350 కోట్ల రూపాయల ప్రజాధనానికి టెండర్... కుప్పంలో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్టు

పెద్దల కోసం పేదల భూములు... ‘నాలా’ చట్టం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా ఆందోళన

నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్సభలో విపక్షాల ఆగ్రహం

దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు

మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..

ఏపీలో విద్యుత్ కొనుగోలులో మరో కనికట్టు... అధిక ధరకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం

చంద్రబాబు మోసకారి... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ...
క్రీడలు

ప్రజ్ఞానందకు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శనివారం మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానందకు ఇది వరుసగా నాలుగో ‘డ్రా’. ఇక ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్... జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్)తో గేమ్ను 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. సామ్ సెవియాన్ (అమెరికా), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)... అరోనియన్ (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) మధ్య మ్యాచ్లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మొత్తంగా శనివారం జరిగిన అన్నీ మ్యాచ్లు ‘డ్రా’గానే ముగిశాయి. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫాబియానో కరువానా (అమెరికా) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, అరోనియన్ చెరో 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గుకేశ్, మాక్సిమి లాగ్రెవ్, వెస్లీ సో, అలిరెజా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడతారు.

ఇలవేనిల్–అర్జున్ పసిడి ధమాకా
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా షూటర్ ఇలవేనిల్ వలారివన్ డబుల్ ధమాకా సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో శుక్రవారం బంగారు పతకం చేజిక్కించుకున్న ఆమె మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ మరో పసిడి నెగ్గింది. తమిళనాడుకు చెందిన ఈ యువ షూటర్... శనివారం జరిగిన పోటీల్లో అర్జున్ బబుతాతో కలిసి స్వర్ణంపై గురిపెట్టింది. చైనీస్ జంట డింగ్కె లూ–జిన్ లూ పెంగ్తో పోటీ ఎదురైనప్పటికీ చివరకు భారత జోడీ 17–11తో విజేతగా నిలిచింది. మొదట్లో చైనా జోడీ ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఇలవేనిల్–అర్జున్ ద్వయం లక్ష్యంపై గురి పెట్టడంలో సఫలమైంది. ఇటు తమిళ షూటర్ ఇలవేనిల్కు, అటు పంజాబ్ షూటర్ బబుతాకు ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో అర్జున్ బబుతా తొలి పసిడి పతకం నెగ్గాడు. రుద్రాం„Š పాటిల్, కిరణ్ జాదవ్, అర్జున్లతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది.జూనియర్ ఈవెంట్లోనూ శాంభవి శ్రవణ్–నరేన్ ప్రణవ్ జంట బంగారం గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జంట 16–12తో చైనా జోడీపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్లో చైనాకే చెందిన రెండు జట్లు 632.3 స్కోరు, 630 స్కోర్లతో శాంభవి– నరేన్ ప్రణవ్ (629.5) జోడీ కంటే ముందు వరుసలో నిలిచాయి. కానీ అసలైన పతకం రేసులో భారత ద్వయం పుంజుకుంది. గురి తప్పని షాట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. భారత్కే చెందిన ఇషా తక్షలే–హిమాన్షు జోడీ (628.6 స్కోరు) క్వాలిఫికేషన్లో నాలుగో స్థానంలో నిలిచింది. జూనియర్ పోటీల్లో శాంభవికిది రెండో స్వర్ణం. మహిళల టీమ్ ఈవెంట్లో ఆమె హృదయశ్రీ, ఇషా అనిల్లతో కలిసి తొలిరోజే బంగారు పతకం గెలిచింది.

కేరళకు మెస్సీ సేన
కొచ్చి: ప్రపంచ ఫుట్బాల్ చాంపియన్ అర్జెంటీనా జట్టు భారత్లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో భాగంగా లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ ఏడాది మొత్తం మూడు మ్యాచ్లు ఆడాల్సివుంది. ప్రత్యర్థి జట్లు, నగరాలు ఖరారు కానప్పటికీ ఏ ఏ దేశాల్లో జరిగేవి వెల్లడించారు. ముందుగా మెస్సీ సేన అమెరికాలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6 నుంచి 14వ తేదీల మధ్యలో అర్జెంటీనా... అమెరికాలో ఈ మ్యాచ్ ఆడుతుంది. తర్వాత నవంబర్ 10 నుంచి 18వ తేదీల మధ్యలో లువాండా (అంగోలా), కేరళ (భారత్) రెండు ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో మెస్సీ జట్టు తలపడుతుంది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అర్జెంటీనా ఎదుర్కోబోయే జట్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొంది. అయితే మొరాకో, కోస్టా రికో, ఆస్ట్రేలియాలతో పాటు ఆసియా మేటి జట్టు జపాన్లతో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఘనమైన ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్నాళ్లుగా సాకర్ స్టార్ మెస్సీని కేరళకు తీసుకొచ్చేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమైంది. మొత్తానికి అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) షెడ్యూల్లో కేరళను చేర్చడంలో సఫలమైంది. మెస్సీ నవంబర్లో గనక జట్టుతో పాటు వస్తే నెల వ్యవధిలో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మళ్లీ డిసెంబర్లో భారత్కు రానున్నాడు. దీనికి సంబంధించి షెడ్యూల్ను ఆర్గనైజర్లు ఇటీవలే ప్రకటించారు. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్లోని సాకర్ ప్రియులకు, మెస్సీని ఆరాధించే అభిమానులకు ఇది పెద్ద పండగే.

వైజాగ్లో భారత మహిళల జట్టు
సాక్షి, విశాఖపట్నం: సొంత గడ్డపై జరిగే వన్డే వరల్డ్ కప్లో సత్తా చాటాలని భారత మహిళల జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి నెల రోజుల ముందునుంచి జట్టు సన్నాహకాలు మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 25 నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ బృందానికి ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో వారం రోజుల పాటు టీమ్ సాధన చేస్తుంది. ఫిట్నెస్, ట్రైనింగ్లాంటి అంశాల గురించి కాకుండా పూర్తిగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లపైనే దృష్టి పెడుతూ ‘స్కిల్ బేస్డ్’ కండిషనింగ్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సాధన కోసం బోర్డు వ్యూహాత్మకంగానే వైజాగ్ను ఎంపిక చేసింది. జట్టులోని ముగ్గురు సభ్యులు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, స్నేహ్ రాణాలకు ఎప్పుడో 2014లో మాత్రమే ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. మిగతా ప్లేయర్లు ఎవరూ వైజాగ్లో గతంలో ఒక్క సారి కూడా మ్యాచ్ ఆడలేదు. ప్రాక్టీస్తో ఇక్కడి పిచ్, పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ క్యాంప్ ఉపయోగపడనుంది. వరల్డ్కప్లో భారత జట్టు రెండు అత్యంత కీలక మ్యాచ్లు దక్షిణాఫ్రికాతో (అక్టోబర్ 9న), ఆ్రస్టేలియాతో (అక్టోబర్ 12)న విశాఖలోనే ఆడనుంది. రిజర్వ్ ప్లేయర్లు సహా భారత జట్టు సభ్యులంతా ఈ ప్రత్యేక క్యాంప్లో పాల్గొంటారు. భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా దీనికి హాజరవుతారు. రెగ్యులర్ సాధనతో పాటు డే అండ్ నైట్లో రెండు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా జరుగుతాయి.
బిజినెస్

ఎలాన్ మస్క్ సైబర్ట్రక్: సేఫ్టీలో టాప్ రేటింగ్
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.ఎన్హెచ్టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ట్రక్కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh— Elon Musk (@elonmusk) August 22, 2025

2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు: రాష్ట్రపతి ఆమోదం
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు ఈ నెల 12న ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.ఈ కొత్త ఆదాయపన్ను చట్టం, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టం సరళతరంగా, పారదర్శకంగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై ప్రకటించింది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.The Income-tax Act, 2025 has received the Hon’ble President’s assent on 21st Aug 2025.A landmark reform replacing the 1961 Act, it ushers in a simpler, transparent & compliance-friendly direct tax regime.Access the official document here: https://t.co/wOPk1PFQbP pic.twitter.com/Xw84hzpPb3— Income Tax India (@IncomeTaxIndia) August 22, 2025

ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
మహీంద్రా అండ్ మహీంద్రా వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ను 999 యూనిట్లకు పరిమితం చేసింది. కాగా కంపెనీ దీని కోసం ఈ రోజు బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలైన 135 సెకన్లలో.. అన్నీ యూనిట్లు అమ్ముడైపోయాయి.లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ తరువాత 999 యూనిట్లకు చేరింది. అన్ని యూనిట్లు ఇప్పుడు పూర్తిగా అమ్ముడైపోయాయి. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.From 999 to 000 in just 135 seconds. That's how quickly we sold all units of the BE 6 Batman Edition.Deliveries will begin on Batman Day, 20th September 2025.#BE6BatmanEdition #DriveYourLegend #MahindraBE6 #MahindraElectricOriginSUVs pic.twitter.com/u4x8LVxAIG— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) August 23, 2025

బంగారం విలువపై 90 శాతం లోన్
ప్రైవేటు రంగంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ ‘ఎస్ఐబీ గోల్డ్ ఎక్స్ప్రెస్’ పేరుతో కొత్త బంగారం రుణ పథకాన్ని ప్రారంభించింది. బంగారం విలువపై 90% వరకు రుణాన్ని ఈ పథకం కింద పొందొచ్చు. రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు రుణం, గరిష్టంగా మూడేళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఎంఎస్ఎంఈలు, నాన్ ఎంఎస్ఎంఈలు, చిన్న సంస్థలు తమ వ్యా పార విస్తరణ, మూలధన అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చని సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఎలాంటి రహస్య చార్జీల్లేకుండా, పారదర్శకంగా ఈ రుణ పథకం ఉంటుందని తెలిపింది. మొత్తం ప్రక్రియ డిజిటల్గా పూర్తవుతుందని, మొదటిసారి రుణం తీసుకునే వారు కూడా అర్హులేనని పేర్కొంది.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
ఫ్యామిలీ

అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
రచయిత్రి,సామాజిక కార్యకర్త,ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఆసక్తికరమైన విషయాలను ఇన్స్టాలో పంచుకున్నారు. రెండు పురాతన వస్తువుల గురించి షేర్ చేశారు. దీంతో ఆమెకు అభినందించడంతోపాటు,పనిలో పనిగా పుట్టిన రోజు శుభాకాంక్షఅందించారు అభిమానులు సుధామూర్తి షేర్ చేసినవి పురాతన సింధులోయ నాగరికతలోని ప్రముఖ నగరమైన లోథల్ నుండి తవ్వబడిన ఐకానిక్ కళాఖండాలు.ఇందులో మొదటిది అద్భుతమైన బంగారు హారం. దీన్ని అతిసూక్ష్మమైన బీడ్స్ వేల సంవత్సరాల క్రితం రూపొందించారట. View this post on Instagram A post shared by Sudha Murty (@smtsudhamurty)y"> ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లురెండోది ఒక సాధారణ మట్టి కుండ. దాహం వేసిన కాకి రాళ్లు వేసి నీళ్లను పైకి తీసుకొచ్చిన కథలోని కూజాను పోలి ఉంది. లోథల్ నుండి వచ్చిన ఈ కళా ఖండాలు అద్భుతమైన హస్తకళ, కళాకారుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పురాతన వారసత్వం, నైపుణ్యం, మోడ్రన్ ఇండియా మేళివింపునకు సూచించే అద్భుతమైన క్షణాలు అని ఆమె వ్యాఖ్యానించారు.కాగా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి భార్య. సుధా మూర్తి రచయితగా, సామాజిక సమస్యలపై స్పందించడంతోపాటు దాతగా భారతీయులకు ఆమె సుపరిచితం. కర్ణాటకలోని షిగ్గావ్లో 1950 ఆగస్టు 19న జన్మించారు. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ అందించారు ఫ్యాన్స్.ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్

ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!
ప్రకృతి విపత్తులను ఉపగ్రహాల సాయంతో ముందుగానే తెలుసుకుని ప్రజలను అలర్ట్ చేస్తుంటారు అధికారులు. వాతావరణ శాఖ కూడా ఎక్కడెక్కడ ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందో తెలిపి అలర్ట్లు జారీ చేస్తుంది. అయితే దీన్ని ఓ సాధారణ చేప ముందుగానే గుర్తిస్తోందట. అందుకే దాన్ని ప్రళయానికి సంకేతంగా పిలుస్తుంటారట కూడా. ఇంతకీ అది ఏ చేప..?. దాని కథా దకమామీషు ఏంటో చూద్దామా..!.ఆ చేప పేరే ఓర్ఫిష్(oarfish). దీన్ని "డూమ్స్డే ఫిష్" అని పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రళయానికి సంకేతం అన్న భావనలో ఈ చేపకు ఆ పేరు వచ్చిందట. ఇది సిల్వర్ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. సముద్రంలో 200 నుంచి దగ్గర దగ్గర వెయ్యి అడుగుల లోతుల్లో నివశిస్తుందట. చాలా నెమ్మదిగా కదులుతుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకలతో కూడిన చేప కావడంతో అస్థి చేప అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో ఒక క్రమబద్ధతిలో వెళ్తుందట. అందుకే దీనికి ఓర్ అనే పేరొచ్చిందట. జపాన్ వాళ్లు దీన్ని సముద్ర దేవుడి దూతగా పేర్కొంటారట. ఈ ఓర్ఫిష్ గనుక సముద్ర ఉపరితలం వద్దకు వచ్చిందంటే రాబోయే భూకంపం, సునామీకి సంకేతం అట. అది నిజం అని చెప్పేలా 2010లో, 2011 భూకంప, సునామీ రావడానికి కొన్ని నెలల ముందు ఈ ఓర్ఫిష్లు సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చాయట. అంతేగాదు 2017లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించే ముందు సముద్రంలో అనేక ఓర్ఫిష్లు కనిపించాయట. అయితే శాస్త్రవేత్తలు ఈ చేపను విపత్తులను ముందుగా గుర్తించగలదని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లోని మార్పుల వల్లో లేక అనారోగ్యం కారణంగానో చనిపోయి ఇలా సముద్రం ఒడ్డున కనిపించి ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలంపై కనిపించనే కనిపించవు. సముద్రంలో అత్యంత లోతుల్లోనే ఇది నివశిస్తుందట. ఒక్కొసారి సంతానోత్పత్తికై కూడా ఉపరితలం వద్దకు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే 2025 నుంచి, భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కాలిఫోర్నియాలో ఈ ఓర్ ఫిష్ కనిపించాయట కూడా. ఇవి మానవులకు హానికరం కాదని చెబుతున్నారు. ఈ చేపలు ప్లాంక్టన్, క్రిల్, చిన్న చేపలు, స్క్విడ్, జెల్లీ ఫిష్ వంటి వాటిని తిని జీవిస్తుందట. విచిత్రం ఏంటంటే దీన్ని ప్రళయానికి సంకేతం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నా..ఇంకా పలుచోట్ల ఈ చేప కనిపించగానే హడలిపోతారట. అది రుజువు చేసేలా విపత్తులు రావడం కూడా ఈ నమ్మకాలకు మరింత బలం చేకూరినట్లు అయ్యిందని నిపుణలు వాపోతున్నారు. (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..)

కేబీసీ-17లో రూ. 25 లక్షల ప్రశ్న ఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!
బహుళ ప్రజాదరణ పొందిన రియాల్టి షో ‘కౌన్ బనేగా కరోడ్పతి 17 (KBC-17)’ ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేస్తోంది. ఈ షోకు సుదీర్ఘకాలంగా హోస్ట్గా వ్యవహరిస్తున్నబిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాక్చాతుర్యంతో పాటు, పార్టిసిపెంట్ల ప్రతిభాపాటవాలు కూడా వీక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఎసిసోడ్లోని ఒక ప్రశ్న ఆసక్తికరంగా మారింది.మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన పోటీదారు సాకేత్ నంద్కుమార్ ఒక ప్రశ్న దగ్గర ఇరకాటంలో పడిపోయాడు. అప్పటివరకు వరుసగా సమాధానాలు చెప్పి, కొన్నింటికి లైఫ్లైన్లను వాడుకొని సరిగ్గా రూ. 25 లక్షల ప్రైజ్మనీ దగ్గర ఆగిపోయాడు. రోల్ఓవర్ కంటెస్టెంట్గా హాట్ సీట్లో కూర్చున్న సాకేత్ నందకుమార్ ఏకంగా ఆరు భాషలు మాట్లాడకలగడంపై బిగ్ బీ ప్రశంసలు కురిపించారు. దీంతో గెస్ట్ని జర్మన్లో స్వాగతించమని అడిగి కాసేపు సందడి చేశారు. ఇక షోలోని ప్రశ్నల విషయానికి వస్తే రూ. 25 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేక సోనార్ హాట్ సీట్ తీసుకొని రూ. 12,50,000 ప్రైజ్ మనీతో నిష్క్రమించాడు.రూ. 25 లక్షల ప్రశ్న ఏంటి అంటే"1932లో తన టెస్ట్ అరంగేట్రంలో, ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్ తరపున ఏ మైదానంలో సెంచరీ చేశాడు?" అనేది ప్రశ్న.ఎ) ది ఓవల్ బి) మెల్బోర్న్ సి) సిడ్నీ డి) ఓల్డ్ ట్రాఫోర్డ్ అనే అప్షన్లు ఇచ్చారు.సమాధానం తెలియక పోవడంతో సాకేత్ చివరి లైఫ్లైన్ను ఎంచుకున్నాడు కానీ సమాధానం లభించలేదు. చివరికి ఆప్షన్ ఏ ది ఓవల్ అనే తప్పు సమాధానం చెప్పాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (1910-1952)కాగా పంజాబ్కు చెందిన నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీ అలియాస్ ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు 1932–33లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ తరపున ఆడాడు. బిల్ వుడ్ఫుల్ నేతృత్వంలోని బలమైన ఆస్ట్రేలియన్ జట్టును ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో అతను అద్భుతమైన 102 పరుగులు చేశాడు. డాన్ బ్రాడ్మాన్తో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన కొద్దిమంది క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్న ఇబ్రహీం అలీ ఖాన్ తన ముత్తాత నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికార్ అలీ ఖాన్ సిద్ధిఖీ పటౌడీలా ఉంటాడని భావిస్తారు.చదవండి: కేబీసీ 17లో కోటి గెల్చుకున్న తొలి వ్యక్తి..కానీ 7 కోట్ల ప్రశ్న ఏంటో తెలుసా? క్విజ్ మాస్టర్ అమితాబ్ బచ్చన్ను ఆకట్టుకున్న సాకేత్ నందకుమార్ తాను గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏమి చేయాలని అనుకుంటున్నాడో తెలుసా. బిర్యానీ లవర్ : తాను బిర్యానీ ప్రేమికుడిని కాబట్టి,గెల్చుకున్న డబ్బుతో భారతదేశం అంతటా పర్యటించి దేశంలో లభించే వివిధ రకాల బిర్యానీలను రుచి చూస్తాడట. అంతేకాదు తన తల్లికి బహుమతిగా సొంత రెస్టారెంట్ కూడా ఓపెన్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు.ఇదీ చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..
ఐఏఎస్ అయ్యేందుకు యువత ఎంతగా పరితపిస్తుందో తెలియనిది కాదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. ఏళ్లుగా ప్రిపేర్ అవ్వతూ ఐఏఎస్ అవ్వాలని తపిస్తుంటారు. అలాంటి కలను ఇక్కడొక వ్యక్తి ఎలా సాకారం చేసుకున్నాడో వింటే విస్తుపోతారు. ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీ వింటే..నిజాయితీగా లభించిన ఉద్యోగం మంచిగా చేసుకుంటూ..అధికారుల మన్ననలను పొందుతూ ఊహించని విధంగా తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సక్సెస్ స్టోరీ ఇది.ఈయన్ని మరో అబ్దుల్ కలాం అనొచ్చు. అతడే కేరళకు చెందిన అబ్దుల్ నాజర్. అతడి బాల్యం కష్టాలతో ప్రారంభమైంది. ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని దూరం చేసింది. పాపం తల్లి కుటుంబాన్ని పోషించుకునేందుకు పనిమనిషిగా మారి జీవనం సాగించాల్సి వచ్చింది. రాను రాను పరిస్థితి కడు దయనీయంగా మారడంతో నాసర్ అతని తోబుట్టువులు అనాథశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అంతేగాదు పదేళ్ల వయసులో కుటుంబాన్ని పోషించుకునేందుకు డెలివరీ బాయ్గా..ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్గా ఇలా చిన్నాచితక పనులు చేసుకుంటూ చదువుని సాగించేవాడు. ఇన్ని కష్టాల మధ్యలో ఎక్కడ చదువుని మాత్రం వదిలేయలేదు నాజర్. అలా రాష్ట్ర ఆరోగ్య శాఖలో క్లర్క్ ఉద్యోగం సంపాదించాడు. ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలామందికి ఇష్టమైన డ్రీమ్. అయితే అదరిలా నాసర్కి కూడా యూపీఎస్సీకి ప్రిపరై, సివిల్స్ రాయాలని ఉండేది. కానీ తనకున్న బాధ్యత రీత్యా అది సాధ్యపడదు. అదీగాక అంత డబ్బు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోవడం అనేది సాధ్యమై పని కాదు. అందుకని అతడు ఎంచుకున్న మార్గం వింటే వావ్..అని మెచ్చకోకుండా ఉండలేరు. ఎందుకుంటే తనకు లభించిన ఉద్యోగాన్నే అధికారుల మన్ననలను పొందేలా వర్క్ చేయాలని భావించాడు. అతడి కష్టానికి తగ్గా ప్రతిఫలం ప్రమోషన్ల రూపంలో వస్తూనే ఉండేది. అలా మొత్తం 20 ఏళ్ల అంకితభావంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. అతని అత్యుత్తమ ట్రాక్ రికార్డు కారణంగా 2017లో సివిల్స్ ఎగ్జామ్ రాయకుండానే ఐఏఎస్ ఆఫీసర్గా పదోన్నతి పొందాడు. చెప్పాలంటే తన అచంచలమైన కృషితో అత్యున్నత అధికారి అయ్యాడు. ఈ కథ ఆలోచింప చేసేలా ఉన్నా..బహుశా అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ నాసర్ ఈ అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు దశాబ్దాల ఓపిక, అచంచలమైన కృషి, కష్టపడేతత్వం వంటివి ఆయుధాలుగా మలుచుకున్నాడనేది గుర్తురెగాలి. ఈ స్టోరీ కలను సాకారం చేసుకోలేకపోయామని కృశించి పోకూడదు..శక్తివంతమైన ఆలోచనా దృక్పథంతో సాధ్యమయ్యేలా చేసుకోవచ్చని తెలుపుతోంది. ఓపికతో నిశబ్ధంగా తన పని తాను చేసుకుంటూపోతే..ఏదో ఒకనాటికి లక్ష్యానికి చేరకుంటాం అనేది జగమెరిగిన సత్యం. అంతేగాదు పట్టుదలతో అడియాశగా మిగిలిన కలను సైతం ఆశాకిరణంగా మార్చుకోవచ్చని అబ్దుల్ నాసర్ కథే చెబుతోంది కదూ..!.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?)
ఫొటోలు


కాబోయే మరదలితో రిబ్బన్ కట్ చేసిన సారా.. సచిన్ పుత్రికోత్సాహం (ఫొటోలు)


పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు


ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)


తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)


ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)


జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)


విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)


జపాన్లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)


పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)


శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్ మాజీ సలహాదారు బోల్టన్ ఇంట్లో సోదాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా ఎన్నిౖకైన సమయంలో 2018–19 సంవత్సరాల్లో జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ నివాసంపై ఎఫ్బీఐ అధికారులు దాడులు జరిపారు. మేరీల్యాండ్లోని బెథెస్డాలో ఉన్న బోల్టన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ అధికారులు ధ్రువీకరించారు. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. రహస్య పత్రాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే సోదాలు చేపట్టినట్లు మీడియా అంటోంది. వాషింగ్టన్ డీసీలోని బోల్టన్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయని తెలిపింది. అప్పటి ట్రంప్ పాలనపై బోల్టన్ 2020లో ఒక పుస్తకం రాశారు. ఇందులో ట్రంప్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పుస్తకంలోని పలు అంశాలను అధికార రహస్య పత్రాల ద్వారానే బోల్టన్ పొందినట్లు ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. దాడులపై బోల్టన్ స్పందించలేదు. దాడుల విషయంతనకు తెలియదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

మరణం అంచున గాజా
గాజా స్ట్రిప్: రెండేళ్ల యాజన్.. గాజా నగరంలోని బీచ్లో ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్నాడు. ఆ శిబిరానికి రెండు నెలలుగా పిండే కాదు.. ఎలాంటి ఆహార సహాయం అందడం లేదు. విశాలమైన అతని కళ్లు.. ఆహారం కోసం ఎదురుచూసి.. చూసి.. అలసటతో బరువెక్కాయి. ఎముకలు తేలిన శరీరం అతని ఆకలిని చెబుతోంది. ఏడవడానికి కాదు కదా.. చివరికి తిండి తినడానికి కూడా ఓపికలేక.. చిరిగిపోయిన పరుపుపై జీవచ్ఛవంలా కూర్చున్నాడు. ఇది ఒక్క యాజన్ స్థితి కాదు.. గాజా స్ట్రిప్లోని పిల్లలందరి సామూహిక దుంఖః. ప్రస్తుతం గాజాలో పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది. గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం గాజాలో 5లక్షల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిండీ మెక్ కెయిన్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఇది గాజా గవర్నరేట్ నుంచి డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్కు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘రోజుల తరబడి తినడానికి ఏమీ లేక లక్షలాది మంది బతుకీడిస్తున్నారు. పోషకాహార లోపం స్థాయి వేగంగా పెరుగుతోంది. ఆకలి మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో తక్షణ, పూర్తి స్థాయి మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పాయి. కరువును ఎలాగైనా ఆపాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ ప్రజల ప్రాణాలు కాపడేందుకు అడ్డంకులు లేని మానవతా సహాయం, తక్షణ కాల్పుల విరమణ అవసరమని సూచించారు. లేని పక్షంలో సెప్టెంబర్ చివరి నాటికి, గాజా స్ట్రిప్ అంతటా దాదాపు 7 లక్షల మంది కరువును ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు. ప్రాణాంతకంగా మారిన పోషకాహార లోపం రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదేపదే నిరాశ్రయులను చేస్తే.. మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి. ఇక్కడ ఆహారం దొరకడం లేదు. జూలై, మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇక గాజా నగరంలో మూడు రెట్లు ఎక్కువైంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. దొరికిన కొద్ది మొత్తంతో పిల్లల కడుపు నింపి, పెద్దలు పస్తులుంటున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది. నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అది అత్యంత ప్రాణాంతకం. జూన్ 2026 చివరి నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య 14,100 నుంచి 43,400 కు అంటే మూడు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 98 శాతం పంట భూములు దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేదు. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జూలై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం, సహాయ సామగ్రి పెరిగింది. కానీ.. అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ. సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు. వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు. మనుషులు సృష్టించిన కరువు అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని, అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్యసమితి సహాయ అధిపతి టామ్ ఫ్లెచర్ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇజ్రాయెల్ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అనుమతిస్తే మనం నివారించగలిగే కరువు ఇది. ఇజ్రాయెల్ అడ్డంకుల కారణంగానే సరిహద్దుల వద్ద ఆహారం నిల్వలు నిలిచిపోయాయి’ అని తెలిపారు.

బిడ్డ భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.దుబాయ్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్తో ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Nora & Khalid (@noraandkhalid)

శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
కొలంబో: అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే(76)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు ఆ వెంటనే అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. శ్రీలంక అధ్యక్షుడిగా 2022–24 సంవత్సరాల్లో విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 సెప్టెంబర్లో తన భార్య ప్రొఫెసర్ మైత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన విక్రమసింఘే ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు ఆరోపణలు న్నాయి. లాయర్, సీనియర్ రాజకీయ నేత అయిన విక్రమసింఘే ఐదు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. వేర్వేరు సమయాల్లో ఆరు సార్లు ప్రధానిగా పనిచేశారు. గొటబయ రాజపక్స రాజీనామాతో 2022లో అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆయన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటప డేశారన్న ప్రతిష్టను సంపాదించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అధ్యక్షుడిగా ఆయన చేపట్టిన 23 విదేశీ పర్యటనల ఖర్చు రూ.17.50 కోట్లని మీడియా తెలిపింది. కాగా, అరెస్టయిన ఏౖMðక శ్రీలంక మాజీ అధ్యక్షుడిగా విక్రమ సింఘే నిలిచిపోయారు.
జాతీయం

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్టక్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది.

‘భారత్తో సమస్య ఉంటే.. ’: ట్రంప్కు జైశంకర్ స్పష్టం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జైశంకర్ స్పష్టం చేశారు.‘ఎకనమిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఎన్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. #WATCH | Delhi: At The Economic Times World Leaders Forum 2025, EAM Dr S Jaishankar says, "It's funny to have people who work for a pro-business American administration accusing other people of doing business. If you have a problem buying oil or refined products from India, don't… pic.twitter.com/rXW9kCcVuv— ANI (@ANI) August 23, 2025ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్తో సమస్య ఉంటే, ఈ దేశపు చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్ అన్నారు.

National Space Day: 2035 నాటికి భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం: ఇస్రో చీఫ్
న్యూఢిల్లీ: భారతదేశం అంతరిక్ష రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నదని, 2035 నాటికి భారతదేశానికి సొంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటవుతుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ పేర్కొన్నారు. నేడు(ఆగస్ట్ 23) జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 2040 నాటికి భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష కార్యక్రమాలకు సమానంగా ఉంటుందని నారాయణన్ అన్నారు. ప్రధాని మోదీ అందించిన దిశ, దార్శనికతల ఆధారంగా చంద్రయాన్-4 మిషన్ మనకు సాకారమయ్యింది. వీనస్ ఆర్బిటర్ మిషన్కు కూడా చేరువయ్యాం. 2035 నాటికి మనకు అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రధాని నెక్స్ట్ జనరేషన్ లాంచర్ కు ఆమోదం తెలిపారని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ పేర్కొన్నారు. #WATCH | Delhi: ISRO Chairman V. Narayanan says, "... Based on his direction and vision, we are going to have a Chandrayaan-4 mission. We are going to have a Venus Orbiter Mission. We are going to have a space station called BAS (Bharatiya Antriksh Station) by 2035, and the first… pic.twitter.com/1RNQOJyng0— ANI (@ANI) August 23, 2025

Uttarakhand: ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు
చమోలీ: ఉత్తరాఖండ్ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమోలీ జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. #WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఈ విపత్తుపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణం వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘చమోలీ జిల్లాలోని థరాలి ప్రాంతంలో క్లౌడ్బరస్డ్ సంభవించింది. జిల్లా యంత్రాంగం, ఎస్డిఆర్ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు. తాను స్థానిక పరిపాలన అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని’ అన్నారు#WATCH | Uttarakhand: There is a possibility of a lot of damage due to the cloud burst in Tharali tehsil of Chamoli last night. A lot of debris has come due to the cloudburst, due to which many houses, including the SDM residence, have been completely damaged: Chamoli DM, Sandeep… pic.twitter.com/3kGNYRSMdG— ANI (@ANI) August 23, 2025ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలు స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన విపత్తుకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక అనుసంధాన రహదారులు మూసుకుపోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతలో ఆగస్టు 22 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే క్లౌడ్ బరస్ట్ అని అంటారు.
ఎన్ఆర్ఐ

విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్ లో భాగంగా నిర్వహించిన కార్యశాల ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని, తెలుగు సంఘాన్ని అభినందించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు భాషా సాంస్కృతిక మూలాలను బతికించుకోవాలనుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మలేషియాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్ను ఆమె అభినందించారు. ఈ కార్యశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చంద్రయ్య, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. ప్రతాప్, కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యక్షులు సీతారావు విద్యార్థులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు. మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు.

తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్లో తెలిపారు. అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్లైన్ వర్క్ షాప్కి మేరీల్యాండ్తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
క్రైమ్

మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆర్.కె.నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు. ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు.

నిద్ర చేయడానికొచ్చి శాశ్వత నిద్రలోకి..
ఎన్టీఆర్ జిల్లా: కొడుకు పుట్టాడని చిన్నమ్మ ఇంట్లో నిద్ర చేయటానికి వచ్చిన ఓ బాలింత, మూడు నెలల కుమారుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషాద ఘటన శుక్రవారం ఎనీ్టఆర్ జిల్లా కంచకచర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం ఎ.కొండూరుకు చెందిన నాగబత్తుల చైతన్యకు విజయవాడకు చెందిన నవీన్తో ఏడాది క్రితం వివాహమైంది. అతను విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో పని చేస్తుంటాడు. వారికి మగ బిడ్డ పుట్టగా ఆర్జిక్ చైతన్య అని నామకరణం చేశారు. చైతన్య కంచికచర్ల మండలం కీసరలో నివసిస్తున్న పిన్ని ఇంట్లో నిద్రచేసేందుకు మూడు నెలల బాబుతో కలసి బస్సులో వచ్చింది. కీసర సెంటర్లో బస్సు దిగానంటూ పిన్నికి ఫోన్ చేసింది. ఆమె చైతన్యను తీసుకురావాల్సిందిగా పొరుగింట్లో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తిని కోరింది. వెంటనే బస్టాప్నకు వెళ్లిన శ్రీకాంత్ తల్లీబిడ్డను బైక్పై ఎక్కించుకుంటున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వేగంగా వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో చిన్నారి ఆర్జిక్ అక్కడికక్కడే మరణించాడు. చైతన్య, శ్రీకాంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని హైవే అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చైతన్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్
వనస్థలిపురం: వనస్థలిపురం కార్యాలయంలో రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టార్ ఎస్.రాజేష్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్టేషన్కు సబ్రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెం. 1064కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

టెన్త్ క్లాస్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆ బాలుడికి క్రికెట్ బ్యాట్పై మక్కువ... ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు కొనివ్వలేదు... పక్క భవనంలోని స్నేహితుడి ఇంటి నుంచి ఆ బ్యాట్ చోరీకి స్కెచ్ వేశాడు. ఒకవేళ బ్యాట్ కనిపించకపోతే అందినకాడికి డబ్బు దోచుకొని ఆ సొమ్ముతో బ్యాట్ కొనుక్కుందామనుకున్నాడు. చోరీ అనంతరం ఇంటిని గ్యాస్ లీక్తో తగలబెట్టాలని వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని మరీ కుట్రపన్నాడు.అయితే చోరీ చేస్తుండగా ఆ ఇంటి యజమాని కుమార్తె చూడటంతో తప్పించుకోవడం కోసం ఆమెను దారుణంగా హతమార్చాడు. కూకట్పల్లి దయార్గూడలో ఈ నెల 18న సహస్ర (11) అనే బాలికను చంపిన పదో తరగతి బాలుడి వ్యవహారమిది. పోలీసులను తప్పుదోవపట్టిస్తూ, ముప్పతిప్ప లు పెట్టిన నిందితుడు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చిక్కాడు.పుట్టిన రోజున వచ్చి కేక్ తినిపించి...పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి దాదాపు రెండేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చి కూకట్పల్లి దయార్గూడలోని ఓ భవనం నాలుగో అంతస్తులో నివసిస్తున్నారు. భర్త గతంలో చిరుద్యోగం చేసి మానేయగా భార్య కొన్నాళ్ల క్రితం వరకు కిరాణా దుకాణం నిర్వహించి ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదివే వారి కుమారుడు (15) సక్రమంగా బడికి వెళ్లకుండా టీవీ, ఓటీటీల్లో వచ్చే క్రైమ్, హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు.కొన్నాళ్లుగా ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్కు చెందిన చానల్ వీక్షిస్తున్నాడు. తమ ఇంటికి ఆనుకొని ఉన్న మూడంతస్తుల భవనంపై ఉన్న పెంట్ హౌస్లో సహస్ర అనే బాలిక తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి సింగిల్ బెడ్రూం ఇంట్లో నివసిస్తోంది. పక్కపక్క భవనాల్లో ఉండటంతోపాటు ఆమె సోదరుడు కూడా బాలుడు చదివే పాఠశాలలోనే చదువుతుండటంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. మార్చిలో జరిగిన సహస్ర పుట్టిన రోజు వేడుకకు సైతం హాజరైన బాలుడు.. ఆమెకు కేక్ కూడా తినిపించాడు.క్రికెట్ కిట్ కొనివ్వని కారణంగా...సహస్ర సోదరుడితోపాటు కాలనీలో ఉండే పిల్లలతో కలిసి బాలుడు తరచూ క్రికెట్ ఆడేవాడు. కొన్నాళ్ల క్రితమే సహస్ర సోదరుడు ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ఓ క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడంతో తనకు కూడా క్రికెట్ బ్యాట్ కొనివ్వాలని తల్లిదండ్రుల్ని పలుమార్లు అడిగాడు. వారు కొనకపోవడంతో సహస్ర ఇంట్లో చోరీకి స్కెచ్చేశాడు. తరచూ సహస్ర ఇంటికి వెళ్లి వస్తుండటం వల్ల ఆ ఇంట్లో ఏవి ఎక్కడు న్నాయో తెలిసిన బాలుడు.. ఆ ఇంట్లో ఎవ్వరూ లేనివేళ బ్యాట్ కాజేసి.. ఆపై సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు గ్యాస్ లీక్ ద్వారా ఇంటికి నిప్పంటించాలని కుట్ర పన్నా డు. ఇందుకోసం వచ్చీరాని ఆంగ్లంలో ఓ పేపర్పై రాసుకొని చివర్లో ‘మిషన్ డన్’ అని రాశాడు. పాఠశాలకు సెలవులు కావడంతో...చోరీ కోసం పథకం వేసిన బాలుడు ఈ నెల 18న సహస్ర, ఆమె సోదరుడు స్కూళ్లకు వెళ్లిపోతారని.. తండ్రి మెకానిక్ షాపుకి, తల్లి విధులకు వెళ్తుందని భావించాడు. అయితే సహస్ర చదువుతున్న బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయాలో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో నాలుగు రోజులు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. దీంతో ఆమె మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలియని బాలుడు.. తమ భవనం నాలుగో అంతస్తు నుంచి మూడో అంతస్తుకు వచ్చి సైడ్ వాల్ మీదుగా సహస్ర కుటుంబం ఉంటున్న భవనం మూడో అంతస్తులోకి వెళ్లాడు. అక్కడి పెంట్హౌస్కు చేరుకున్నాడు.తలుపు తీసి ఉండటంతో నేరుగా లోపలకు వెళ్లి చోరీకి ప్రయత్నించాడు. అదే సమయంలో లోపల గదిలోంచి హాల్లోకి వచ్చిన సహస్ర బాలుడిని చూసింది. ఆమె అరిస్తే పట్టుపడతాననే భయంతో బాలుడు ఆమె నోరు నొక్కి తన వద్ద ఉన్న కత్తితో నేరుగా ఆమె గొంతులో పొడిచాడు. దీంతో సహస్ర అరవలేక అక్కడే కూలిపోయింది. అయినప్ప టికీ చావలేదని భావించిన నిందితుడు.. ఆమెను విచక్షణారహితంగా దాదాపు 20 పోట్లు పొడిచి వచ్చిన మార్గంలోనే తన ఇంటికి పారిపోయాడు. బయట ఆరేసిన దుస్తులు తన మీద వేసుకొని రక్తం మరకలు తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోకి వెళ్లాడు.కత్తి, లేఖను దాచి... రక్తం మరకలు దుస్తుల్ని వాషింగ్ మెషీన్లో పడేసి ఆన్ చేశాడు. ఆపై ఏమీ ఎరగ నట్లు తండ్రితో కలిసి పెంపుడు కుందేలును పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో లంచ్ బాక్స్ కోసం ఇంటికి వచ్చిన సహస్ర తండ్రి.. కుమార్తె రక్తపుమడుగులో మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులనూ తప్పుదోవ పట్టించి..ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు జటిలంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితోపాటు ఈ బాలుడినీ విచారించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేలా అతను.. సహస్ర ఇంటి నుంచి డాడీ, డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పి బాలిక తండ్రినే అనుమానితుడిగా చేశాడు. దీంతో ఆమె తండ్రిని విచారించిన పోలీసులు.. క్షుద్రపూజల అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేశారు.ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచి్చన సమాచారంతో... స్థానికంగా నివసించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఈ బాలుడి వ్యవహార శైలిపై అనుమానం వచి్చంది. దీంతో ఆయన ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. శుక్రవారం ఉదయం ఆ బాలుడు చదివే పాఠశాలకు వెళ్లిన పోలీసులు సహస్ర హత్య విషయమై ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు చేశారు.దీంతో కత్తి, రక్తం మరకలతో ఉన్న దుస్తులు, లేఖ లభించాయి. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆంగ్లంలో 11 లైన్లలో రాసి ఉన్న ఆ లేఖలో ‘ఫస్ట్ గో హోం... అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్ అండ్ నెక్ట్స్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్’అంటూ లేఖలో రాసి ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు చోరీ తర్వాత ఆధారాలు దొరక్కుండా ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చాలని కుట్రపన్నినట్లు భావిస్తున్నారు. ఈ ఉదంతంపై శనివారం అధికార ప్రకటన చేయనున్నారు.
వీడియోలు


స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స
Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్


తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన


Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!


బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్


కూకట్పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబసభ్యుల ఆందోళన


ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం


నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య


కూటమి ప్రభుత్వంలో పెన్షనర్ల కూడు లాక్కుంటున్నారు


Sahastra Incident: క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే బాలుడు వెళ్లాడు: సీపీ మహంతి