
నగరంలో పెరుగుతున్న ఒబెసిటి సమస్య
ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు డిప్రెషన్
బీపీ, షుగర్ వంటి రోగాలతో అవస్థలు
వెంటాడుతోన్న పోషకాహార లోపం
శరీరాకృతుల్లోనూ భారీగా మార్పులు
మహిళల్లో అలసట, కీళ్ల నొప్పులు, చిరాకు
వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడి
నగరం బరువెక్కుతోంది.. స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు డిప్రెషన్ దీనికి తోడు పోషకాహార లోపం ఇవన్నీ క్రమంగా నగరవాసులను రోగాలవైపు నెడుతున్నాయి. ఫలితంగా నగరవాసుల శరీరాకృతుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకాహార లోపం మరీ ఎక్కువగా ఉంది. దీంతో అలసట, కీళ్ల నొప్పులు, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవల నగరంలో నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వే వెల్లడిస్తోంది. ఈ కారణంగా బీపీ, షుగర్ వంటి ఇతర రోగాలు చుట్టుముడుతున్నాయని, ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.. – సాక్షి, సిటీబ్యూరో
చుట్టూ ఎత్తయిన భవనాలు.. అద్దాల మేడలు.. ఖరీదైన కార్లు.. అత్యాధునిక వసతులు. చూడ్డానికి విలాసవంతమైన జీవితం.. అంతా బానే ఉందిగా!.. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే.. వాస్తవానికి అవతలవైపు చూస్తే.. ఉరుకుల పరుగుల జీవనం, నిత్యం పని ఒత్తిడి, తీరికలేని జీవితం, ఆందోళన, డిప్రెషన్, ఉద్యోగ భద్రత గురించిన ఆలోచన, లోన్లు, ఈఎంఐల భయాలు, నెలవారీ ఖర్చులు, లక్షల్లో పిల్లల ఫీజులు, నెలాఖరుకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇది సగటున నగర జీవిని వేధిస్తోన్న ప్రధాన సమస్య.. ఫలితంగా ఒత్తిడికి లోనై కంటికి కనిపించని రోగాలైన బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో నిత్యం యుద్ధం చేస్తున్నాడు.
సర్వే చెబుతోందేంటి?
హైదరాబాద్ టెక్ రంగంలో ప్రపంచ దేశాలకు సేవలందిస్తోంది. ఐటీ కారిడార్, చుట్టూ పరిసర ప్రాంతాలు పది కిలో మీటర్ల పరిధిలో కిమ్స్ ఆస్పత్రి నిర్వహించిన వెయిట్ గెయిన్ ట్రెండ్స్ సర్వేలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు గల 6 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించగా అందులో ఉద్యోగుల్లో 45 శాతం మంది డిప్రెషన్లో ఉంటున్నారట. ఆందోళన, భయం, యాంగ్జైటీతో బాధపడుతున్నారని తేలింది. మరో వైపు ఇంటి పట్టునే ఉంటున్న వ్యక్తులు మధుమేహం, రక్త పోటుతో నిత్యం ఇబ్బంది పడుతున్నారట. ఆపై ఉబకాయం, డయాబెటిస్, రక్తపోటు, లివర్ సమ్యలు, థైరాయిడ్, పీసీఓడీ వంటి రోగాలతో నిత్యం సతమతమవుతున్నారని స్పష్టమవుతోంది. మహిళల్లో అత్యధికంగా ఉబకాయం, కీళ్ల నొప్పులు, ఇల్నెస్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు్కల్లో ఎక్కువ మంది ఉపవాసం (ఫాస్టింగ్) చేస్తున్నారు. మరికొంత మంది సిక్స్ప్యాక్, జీరోప్యాక్, స్లిమ్ అంటూ ఎక్కువ సమయం జిమ్లో కాలం గడుపుతున్నారు. ఆహారానికి బదులుగా ప్రొటీన్, ఇతర సప్లిమెంట్స్ తీసుకుటున్నారు. దీంతో అనర్థాలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్
వ్యాయామం అవసరం..
ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్ట్ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకు మాత్రమే వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులు వారం రోజుల్లో 6 కేజీల వరకూ తగ్గే అవకాశం ఉంది. అయితే ఒకే సారి మొత్తం బరువు తగ్గిపోవాలని అనుకోవడం మంచిది కాదు. వెయిట్ లాస్ కోసం వ్యాయామంతో పాటే వివిధ రకాల శస్త్రచికిత్సలు, అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, ఇవి దీర్ఘకాలంలో సత్ఫలితాలను అందిస్తాయంటున్నారు.
లైఫ్ స్టైల్లో మార్పులు..
టెక్ కంపెనీలు, అనుబంధంగా పనిచేస్తున్న రంగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు మిడ్ షిఫ్ట్, పూర్తిగా నైట్ షిఫ్ట్ పద్ధతుల్లో రాత్రి విధుల్లో ఉంటున్నారు. దీనికి తోడు నిత్యం టార్గెట్లతో విపరీతమైన ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్యాడ్జెట్స్కు అతుక్కుపోతున్నారు. కొంత మంది పగలు నిద్ర పోదామన్నా పరిస్థితులు అనుకూలించడం లేదని అంటున్నారు. కనీసం 7 గంటలు నిద్రపోవాల్సి ఉన్నా డీప్ స్లీప్ రెండు నుంచి మూడు గంటలే ఉంటుందని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. తీసుకునే ఆహారంలోనూ పాశ్చాత్య రుచులకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవు తున్నారు. చైనీస్, కొరియన్, అమెరికన్ స్టైల్ ఆహారానికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పోషకాల లోటును భర్తీ చేయడం కోసం వివిధ రకాల ప్రొటీన్, ఇతర పౌడర్లను తీసుకుంటున్నారు. ఫలితంగా శరీరంలోని కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!