breaking news
Kurnool District Latest News
-
సిల్వర్ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సిల్వర్సెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభంమైంది. కౌన్సెలింగ్ను కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 24న రాష్ట్ర స్థాయిలో సిల్వర్ సెట్ నిర్వహించామన్నారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్, రోస్టర్ విధానం అనుసరిస్తూ ఈ నెల 6వ తేదీ వరకు అన్ని సబ్జెక్టులలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బీఏ ఎకనామిక్స్ మేజర్ సీట్లు, హిస్టరీ మేజర్ 20 సీట్ల భర్తీకి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. బీఏ గ్రూప్ అడ్మిషన్లకు జరిగిన అర్హత పరీక్షలో కర్నూలు రూరల్ మండలం ఆర్కే దుద్యాల గ్రామానికి చెందిన ఎస్.వెంకట్రామిరెడ్డి కూతురు శ్రీలేఖరెడ్డి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి బీఏ ఆనర్స్లో అడ్మిషన్ పొందడం పట్ల ప్రిన్సిపాల్ అభినందించారు. బీఏ, హిస్టరీ, ఎకనామిక్స్ గ్రూప్లలో అన్ని సీట్లలో విద్యార్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు. -
కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా
● 12 మందికి గాయాలుకోడుమూరు రూరల్: వ్యవసాయ కూలి పనులకు వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాలు.. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళా కూలీలు సోమవారం ఉదయం గుడిపాడు గ్రామంలో ఉల్లినాట్లు వేసే పనికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో జూలకల్ గ్రామం దాటి గూడూరు సమీపానికి వస్తున్న సమయంలో డ్రైవర్ ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ట్రాలీ ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూలకల్ గ్రామానికి చెందిన దేవమ్మ, మార్తమ్మ, రజిత, పుష్పావతి, కవితతో పాటు మరో ఏడుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు గూడూరు ఎస్ఐ రాజకుళ్లాయప్ప తెలిపారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించొద్దు గూడూరు ఎస్ఐ రాజకుళ్లాయప్ప మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలు వాహనాల్లో పరిమితికి మించి ఎక్కి ప్రయాణించరాదన్నారు. వాహనదారులు కూడా కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, కూలీలను తీసుకెళ్లే సమయంలో అతివేగం మంచిది కాదని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
కొందరు పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికర్నూలు: పోలీసు అధికారులు కొందరు ఖాకీ డ్రెస్సులు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని సోమవారం కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ శివారులోని జిల్లా కారాగారంలో ములాఖత్ ద్వారా కలసి కాటసాని పరామర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షికి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రజల తరఫున పోరాడే నాయకులను ఎంతగా అణచివేయాలని ప్రయత్నించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు రాజకీయానికి లోబడకుండా రాజ్యాంగం, చట్టాల ప్రకారమే విధులు నిర్వహించాలన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నారు. అధికారాలు శాశ్వతం కాదని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పనిచేసిన సేవే ఎప్పటికీ గుర్తుండిపోతుందని గుర్తు చేశారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, అక్కిమి హనుమంత రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, నారాయణ రెడ్డి, కర్నూలు యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి, పాలకొలను రమేష్, సాయికృష్ణ, ఎరుకల రాజు తదితరులు కాటసాని వెంట ఉన్నారు. -
పీజీఆర్ఎస్లో రెవెన్యూ సమస్యలే అధికం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. నిషేధిత జాబితా 22ఏ నుంచి తొలగించాలని కోరుతూ ఎక్కువ మంది రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి పీజీఆర్ఎస్లో భాగంగా వినతులను స్వీకరించారు. సమస్యలను సరైన పరిష్కారాలు చూపాలని కింది స్థాయి అధికారులకు సూచించారు. 90 ఎకరాల భూమి ఇచ్చినా బువ్వ పెట్టడం లేదు ‘‘నా పేరు పద్మావతమ్మ. పత్తికొండ మండలంలోని దేవనబండ గ్రామం. నా భర్త శ్రీనివాసరెడ్డి 14 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఇప్పుడు నా వయస్సు సుమారు 85 ఏళ్లు. నాకు ముగ్గురు కుమారులు. మొత్తం 90 ఎకరాల భూమి ఉంది. ముగ్గురికీ 30 ఎకరాలు చొప్పున భాగ పరిష్కారం చేసి వారి పేరిట రాసిచ్చాం. ఇంత ఆస్తి ఇచ్చినా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు. ముద్ద బువ్వ పెట్టడంలేదు. ఈ వయస్సులో ఆకలితో జీవితాన్ని గడుపుతున్నా. పెద్ద కుమారుడు బీమిరెడ్డి కొంత నా పోషణ చేస్తున్నారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల నాకు ఆరోగ్యం బాగోలేకపోతే పెద్ద ఆపరేషన్ చేయించాడు. అతను కూడా కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని దాదాపు 10 ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాడు. అయితే మిగిలిన ఇద్దరు కుమారులు నా పోషణ గురించి అడిగితే పట్టించుకోవడం లేదు. పైగా ఈ వయస్సులో తనను కొట్టేందుకు వస్తున్నారు. వారసత్వంగా వారి ఇద్దరికీ వచ్చిన భాగ పరిష్కారం భూమి 60 ఎకరాలను రద్దు చేసి నా పేరిట చేర్చాలి.’’ అని కలెక్టర్కు వేడుకున్నారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందిస్తూ పత్తికొండ ఆర్డీఓకు ఫోన్ చేశారు. పద్మావతమ్మ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆమె కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలి
కర్నూలు(సెంట్రల్): తాగునీటిని పరీక్షించిన తరువాతే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ను ఆదేశించారు. సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్ జీవన్ అడిషనల్ సెక్రటరీ కమల్ కిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న జల్జీవన్ మిషన్ పథకం పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం జిల్లాలోని తాగునీటి సరఫరా అంశాలపై కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, డంపింగ్ యార్డులకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేయాని, అలాగే చెరువులు, చెక్డ్యాంలు, బోరు బావుల్లోని నీటిని పరీక్షించిన తరువాతే స్వచ్ఛమైనవిగా తేలితేనే సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు కల్లూరు: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఉలిందకొండ గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి పక్కనున్న మునిస్వామి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.7,700 నగదు సాధ్వీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. -
టీబీ డ్యామ్కు భారీగా వరద
● తుంగా ప్రాజెక్ట్ నుంచి 90 వేల క్యూసెక్కుల నీరు విడుదలహొళగుంద: కర్ణాటకలోని చిక్ మంగళూరు, కొప్ప, శివమొగ్గ, శృంగేరి, వరనాడు, మలేనాడు, తీర్థనహళ్లీ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో టీబీ డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడి వాగులు, వంకలు, వరద పోటెత్తి 3.10 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగా ప్రాజెక్ట్ (గాజనూరు జలాశయం) నిండడంతో 22 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగా ప్రాజెక్ట్ నుంచి నదికి వదులుతున్న నీరంతా భద్ర నదిలో సంగమై తుంగభద్రగా మారి టీబీ డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో టీబీ డ్యామ్కు సోమవారం 65 వేల క్యూసెక్కుల వరకు ఉన్న ఇన్ఫ్లో క్రమేణా పెరుగుతోంది. టీబీ డ్యామ్కు ఆశాజనకంగా వరద నీటి చేరికతో కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాల పరిధిలోని దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా టీబీ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు ఆంధ్రకు చేరుకోగా సోమవారం 250 కి.మీ వద్ద 630 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. -
అంబేడ్కర్ గురుకులంలో మిగులు సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(అర్బన్): నగర శివారుల్లోని దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు)లో జూనియర్ ఎంఈసీ, సీఈసీలో మిగులు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రిన్సిపాల్ బి.నిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఎంఈసీలో ఎస్సీ–3కు ఐదు, ఎస్టీకి 01, ఓసీకి 01 సీటు.. అలాగే జూనియర్ సీఈసీలో బీసీ–02, ఎస్టీ–02, ఓసీ–01 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ సీట్ల భర్తీకి బీఆర్ఏజీసీఈటీ 2026 ఎంట్రెన్స్ రాసిన వారు అర్హులన్నారు. అర్హులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు తమ గురుకులంలో కలిసి ప్రవేశం పొందవచ్చన్నారు. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్స్ కర్నూలు సిటీ: ఎస్.జి.పీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి బయో మెడికల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసిన, రాయని వారు, ఇంత వరకు పాలిటెక్నిక్లో అడ్మిషన్ పొందని వారు, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 5న ఉదయం 11 గంటలకు స్పాట్ కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్లతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9052437831 నంబర్ను సంప్రదించాలన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండండి కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు మరింత జవాబుదారీతనంతో పని చేయాలని విద్యు త్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అప్పుడే సమస్యలను సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈఈ లు, డీఈఈ, ఏడీఈలు వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో జల్లులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 4 మండలాల్లో జల్లులు కురిశాయి. పెద్దకడుబూరులో 10.4 మి.మీ, నందవరంలో 3.6, దేవనకొండలో 3.2, ఎమ్మిగనూరులో 2.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. ఆగస్టు నెలలో మూడు రోజుల్లో కురిసిన వర్షం 3.5 మి.మీ మాత్రమే. సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. వర్షాలు లేకపోగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలు మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు లేకపోగా.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. లంచం కేసులో జైలు, జరిమానా కర్నూలు: కడప విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎంఆర్ శ్రీనివాసులును దోషిగా నిర్ధారించడంతో రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ కర్నూలులోని సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి శోభారాణి సోమవారం తీర్పు వెలువరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు, అతని సంస్థను బ్లాక్ లిస్ట్లో వేసే ప్రక్రియను ప్రారంభించకుండా ఉండేందుకు 2015 జులై 24న రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి మొదటి విడతగా రూ.25 వేలు తీసుకుంటుండగా కడప ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించగా అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7 మరియు సెక్షన్ 13(2) ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎస్.మనోహర్ వ్యవహరించారు. -
చివరి ప్రయత్నంగా మోకీలు మార్పిడి
ఇటీవల మోకీలు నొప్పులతో వచ్చేవారు అధికమయ్యారు. ముందుగా కీళ్ల నొప్పులు ఎందుకు వచ్చాయో చూస్తాం. వారికి రుమటాయిడ్, థైరాయిడ్ వంటి సమస్యలుంటే సంబంధిత వైద్యులకు రెఫర్ చేస్తాం. ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ల అరుగుదల) ఉంటే మందులు ఇవ్వడంతో పాటు ఆహార నియమాలు, వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తాం. మోకీలు అరుగుదల నాలగవ దశలో ఉంటే మోకీలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. – డాక్టర్ ఎం.విజయకుమార్రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు -
ఆరాధనోత్సవాలకు ముందస్తు గదుల బుకింగ్ రద్దు
మంత్రాలయం: శ్రీమఠంలో ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరగనున్న స్వామివారి 355వ ఆరాధనోత్సాల సందర్భంగా ముందస్తు గదుల బుకింగ్ను రద్దు చేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం శ్రీమఠంలో విలేకరులతో మట్లాడుతూ.. ఆరాధనోత్సవాలకు దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులు అఽధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్ రూమ్ బుకింగ్ రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు మేనేజర్ తెలిపారు. 11వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో ఆరాధనోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ అధికారులు, శ్రీమఠం సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 12వ తేదీన శ్రీమఠాలు ఆల్ బ్రాంచ్ మేనేజర్లతో వీవీఐపీ డైనింగ్ హాల్లో సమావేశం ఉంటుందన్నారు. ఆరాధనోత్సవాలకు కలెక్టర్, ఎస్పీల అనుమతులు కోరినట్లు చెప్పారు. పంచాయతి సిబ్బంది శుభ్రతను పాటించే విధంగా చూడాలన్నారు. తుంగభద్ర నదిలో భద్రత, బోట్లు, స్విమ్మింగ్ సిబ్బంది అని కూడా లెటర్లు పంచామన్నారు. ఆగస్టు 30న హెలికాప్టర్తో రథోత్సవంపై పుష్పవృష్టి కురిపించేందుకు ఫైర్ సిబ్బంది, అధికారుల అనుమతులు కోరామన్నారు. 75 ఇంచులతో టీవీ, హుండీ కౌటింగ్ హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 5వ తేదీన హుండీ లెక్కింపు చేపడతామని వెల్లడించారు. వర్సిటీ టాపర్కు గోల్డ్మెడల్ కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగం టాపర్గా నిలిచిన డాక్టర్ పర్వేజ్ నవాజ్కు బంగారు పతకం దక్కింది. కర్నూలు జీజీహెచ్ కార్డియాలజీ విభాగంలో పీజీ విద్యనభ్యసిస్తున్న (2022–2025) ఆయన వర్సిటీ టాపర్గా నిలిచారు. ఈయనకు ఆసుపత్రి మొదటి కార్డియాలజిస్టు డాక్టర్ టి.రామకృష్ణారెడ్డి పేరిట ఆయన కుమారుడు డాక్టర్ టి.విజయ్కృష్ణారెడ్డి గోల్డ్ మెడల్ అందజేశారు. సోమవారం కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి జ్ఞాపకార్థం కుమారుడు డాక్టర్ విజయకృష్ణారెడ్డి ఏటా మెరిట్ విద్యార్థులకు బంగారు పతకం ఇవ్వడం అభినందనీయమన్నారు. డాక్టర్ టి.విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏటా కేఎంసీ విద్యార్థులే వర్సిటీ టాపర్లుగా నిలుస్తుండటం సంతోషకరమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ లక్ష్మిబాయి, ఐఎంఏ కర్నూలు కార్యదర్శి డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, వైద్యాధికారులు ఆదిలక్ష్మి, ప్రశాంత్, లలితకుమారి, చింతా రాజ్కుమార్, కిరణ్కుమార్రెడ్డి, రవికిరణ్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఆగి ఉన్న టిప్పర్ను ఢీ మహానంది: మండలంలోని గాజులపల్లె, బసవాపురం గ్రామాల సరిహద్దుల నుంచి గ్రావెల్ మట్టిని తరలిస్తున్న టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళ్తుండటం ప్రమాదకరంగా మారింది. నూతనంగా నిర్మిస్తున్న హైవే రహదారికి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాయి. టిప్పర్లు వేగంగా వెళ్తుండటంతో వచ్చి, వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అల్లినగరం గ్రామం వద్ద ఆగి ఉన్న ఓ టిప్పర్ను వెనుక నుంచి వస్తున్న మరో టిప్పర్ ఢీకొట్టింది. డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలకు అంతరాయం లేకుండా టిప్పర్లను రోడ్డు పక్కన పెట్టించారు. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు స్పందించి టిప్పర్లు నిర్ణీత వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కర్నూలు: కర్నూలు శ్రీరామ్ నగర్కు చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు (27) అప్పుల బాధతో విరక్తిచెంది ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను నగరంలోని ఐశ్వర్య క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. వారి నుంచి తిరిగి చెల్లించాలని ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఈయనకు భార్యతో పాటు కూతురు, కొడుకు సంతానం. భార్య పుట్టినిల్లు పెరవళికి వెళ్లింది. ఎంత అప్పులు చేశాడు. ఎవరెవరి దగ్గర అప్పులు చేశాడనే విషయం భార్య వచ్చిన తర్వా త తెలుస్తుందని పోలీసులు తెలిపారు. భార్య ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నాల్గవ పట్టణ పోలీసులు తెలిపారు. -
డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరపాలి
● ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నంద్యాలలో రిలే నిరాహార దీక్షలు ● విద్యార్థులు, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపు నంద్యాల: టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు, స్కాంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్సీ ఇసాక్బాషా, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డీఎస్సీలో అక్రమాలను నిరశిస్తూ ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నంద్యాల కేంద్రంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు, స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడం దారుణమన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. పోరాడితేనే హక్కులు సాధ్యమవుతాయని స్పష్టం చేస్తూ, బాధితులైన నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగే రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, రైతు విభాగం సెక్రటరీ రత్నబాబుచౌదరి, మహిళా విభాగం సెక్రటరీ శశికళా రెడ్డి, మాబున్నిసా, పార్టీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసూల్ అజాద్, కారు రవికుమార్, టీవీ రమణ, శంకర్నాయక్, శ్రీనివాసులు, కలాం బాషా, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, పార్దుడు, చింపింగ్, బాషీద్, సుబ్బరాయుడు, సాదిక్ బాషా, డాక్టర్ సుబ్బారెడ్డి, గౌస్, సాయిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన వారే ఎక్కువ
ఆసుపత్రికి ఎక్కువగా వివిధ ప్రమాదాల్లో గాయపడి ఎముకలు విరిగిన వారు వస్తుంటారు. వీరితో పాటు ఓపీ చికిత్సకు వివిధ రకాల ఎముకలు, నొప్పులతో వస్తుంటారు. వారికి ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, కొన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. అవసరమైన మందులు సూచిస్తున్నాం. నొప్పులు ఉన్నా యని పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం ప్రమాదకరం. అవి క్రమంగా కడుపులో మంటతో పాటు కిడ్నీలను దెబ్బతీస్తాయి. వైద్యుల సూచన మేరకే వాడాలి. – డాక్టర్ ఎం.రాజేష్కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ విభాగం, కర్నూలు జీజీహెచ్ -
వలస వెళ్లొద్దన్నందుకు ఆత్మహత్య
గోనెగండ్ల: వలస వెళ్లొద్దు.. గ్రామంలోనే పనులు చేసుకుందామని తండ్రి అనడంతో కుమారుడు క్షణికావేశంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బెలుప్పల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన ఈరన్న, సుబ్బమ్మల కుమారుడు చరణ్ (18) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. చరణ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తండ్రి ఈరన్నతో తాను వేరే ప్రాంతానికి పని కోసం వలస వెళతానని చెప్పగా ఆయన అంగీకరించలేదు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకుందామని చెప్పాడు. తండ్రి తన మాట వినలేదని చరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి తిరిగివచ్చి వాంతులు చేసుకుంటున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా పురుగు మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కోలుకోలేక సోమవారం ఉదయం చరణ్ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. -
మద్యం మత్తులో మృగంగా మారి..
● నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి ● మద్యం తాగొద్దనడంతో దారుణం బనగానపల్లె రూరల్: మద్యం తాగి జులాయిగా తిరగొద్దని చెప్పినందుకు విచక్షణ కోల్పోయి తండ్రి కన్న కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన బనగానపల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలంలోని యనకండ్ల గ్రామానికి చెందిన గొల్ల బాలమద్దిలేటి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు మధుకృష్ణ (30) జీవాల పెంపకంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తండ్రి బాలమద్దిలేటి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్య సుబ్బమ్మ, కుమారుడు మధుకృష్ణ, కోడలు అర్చనతో ఘర్షణ పడేవాడు. ఐదు రోజుల క్రితం భార్య సుబ్బమ్మతో ఘర్షణ పడుతుండగా బాలమద్దిలేటిని మద్యం తాగొద్దని కుమారుడు మందలించాడు. దీంతో ఇంట్లోవారికి చెప్పకుండా కోవెలకుంట్ల మండలంలోని లింగాల గ్రామానికి వెళ్లి పని చేసుకుంటూ అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న మధుకృష్ణ ఆదివారం తండ్రి వద్దకు వెళ్లి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. బాలమద్దిలేటి రాత్రి భోజనం చేసేందుకు మజ్జిగ కావాలని అడగడంతో మధుకృష్ణ డబ్బులు ఇచ్చాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు భోజనం చేసి నిద్రించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బాలమద్దిలేటి నిద్రిస్తున్న కుమారుడు మధుకృష్ణను గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన కోడలు, భార్య సుబ్బమ్మపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మధుకృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ కల్పన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా భార్య గర్భిణిగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎక్కడి పనులు అక్కడే!
పాణ్యం: రాయలసీమకు తలమానికంగా ఉన్న గోరుకల్లు జలాశయ రివిట్మెంట్ పనులు నత్తతో ప్రయాణం చేస్తున్నట్లు సాగుతున్నాయి. ఇంకా పనులు తుది దశకు చేరుకోకపోవడంతో ఈ ఏడాది గోరుకల్లులో నీటిని నిల్వ ఉంచుతారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఏడాది వర్షాలు లేక రైతులు, ప్రజలు సాగు, తాగునీటి కోసం ఎంతలా అల్లాడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి సమయంలో పైనుంచి వస్తున్న వరద నీరు శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతున్న తరుణంలో అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్ ద్వారా ఎస్సార్బీసీ నుంచి గోరుకల్లుకు చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది గోరుకల్లు జలాశయంలో నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జలాశయంలో 8 టీఎంసీల నీరు నిల్వ ఉన్న సమయంలో కట్ట కుంగిపోవడం ప్రారంభమైంది. క్రమంగా కుంగిపోవడం మరింత పెరిగి నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం లేకుండా పోయింది. కట్ట మరమ్మతులు చేయడంలో అఽధికారులు జాప్యం చేస్తున్నారు. నేటికీ పనులు పూర్తి కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. మంత్రి వచ్చి చూసినా..! రాయలసీమ జీవనాడి అయిన గోరుకల్లు కట్ట కుంగిన ప్రాంతాన్ని సాక్షాత్తు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పెండింగ్ పనులకు రూ.53 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గతేడాది జూన్ 11వ తేదీన హడావుడి చేశారు. తక్షణమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కట్ట కుంగిన చోట తాత్కాలిక మరమ్మతులకు రూ.కోటిన్నర నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏడాది పూరవుతున్నా పెండింగ్ పనుల ఊసే లేదు. ఇక తాత్కాలిక పనులు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు, ప్రజలు సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నత్తతో పోటీ పడుతున్న గోరుకల్లు రివిట్మెంట్ పనులు మరో పది రోజుల్లో శ్రీశైలం నుంచి నీరు వదిలే అవకాశం? అయినా పూర్తి కాని పనులు తాత్కాలిక పనుతో తాత్సారం -
కదిలితే నొప్పే!
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు మోకాళ్ల సమస్యలు 60 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ప్రస్తుతం 30 ఏళ్లకే అవి పలకరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అధికంగా కీళ్లనొప్పులతో బాధపడే వారే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వారికి నొప్పి నివారణ మందులు, కాల్షియం మాత్రలు, విటమిన్–సి, బి.కాంప్లెక్స్ మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. పట్టణాల్లోని వైద్యులు మాత్రం ఎముకలకు సంబంధించిన మల్టీవిటమిన్ మాత్రలు, విటమిన్–డి, కాల్షియం మాత్రలు, నొప్పి నివారణ మాత్రలు ఇస్తున్నారు. కీళ్ల అరుగుదల ఎక్కువైన వారికి దశలను బట్టి పలు రకాల ఇంజెక్షన్ చికిత్సలు, వాటికీ తగ్గకపోతే చివరకు మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. నొప్పులు తగ్గేందుకు దీర్ఘకాలంగా పెయిన్ కిల్లర్లు వాడే వారిలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో కొందరు డయాలసిస్ దశకు వెళ్తూ చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ప్రతి నెలా 1600 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. పెరుగుతున్న కీళ్లు, ఎముకల బాధితులు శారీరక శ్రమ లేకపోవడంతో ఈ రుగ్మత వైద్యుల వద్దకు క్యూ కడుతున్న బాధితులు నేడు జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవం -
రెవెన్యూ శాఖదే విజయం
పాణ్యం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో రెవెన్యూ శాఖ జట్టు ఆర్జీఎం జట్టుపై విజయం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు కామేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో రెవెన్యూ సర్వీసెస్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, ఆర్జీఎం జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీల్లో రెవెన్యూ శాఖ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 138 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఆర్జీఎం జట్టుపై విజయం సాధించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ ఘనోరి అత్యధికంగా 41 పరుగులు సాధించారు. నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కామేశ్వరరెడ్డి, ప్రవీణ్కుమార్, నంద్యాల అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, పీడీ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కృష్ణగిరి: ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చుంచుఎర్రగుడి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తన ట్రాన్స్ఫార్మర్ను వేరొక చోటికి మార్చేందుకు గ్రామంలోని ప్రైవేట్ టెక్నీషియన్ రాందాస్ను తీసుకెళ్తూ, అక్కడ హోటల్ వద్ద ఉన్న గొంగళ్ల పెద్ద మద్దయ్య (56)ను వెంట తీసుకెళ్లారు. సాయంత్రం ఐదున్నర గంటలకు త్రీఫేజ్ సప్లయ్ ముగిసిన తర్వాత రైతు, టెక్నీషియన్ ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు వెళ్లగా అక్కడ ఏమీ జరిగిందో గానీ పెద్ద మద్దయ్య మాత్రం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. అధికారుల అనుమతులు తీసుకోకుండా విద్యుత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అయితే పెద్ద మద్దయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామానికి ఇన్చార్జ్గా ఉన్న ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడును వివరణ కోరగా తమకు ఎల్సీ కావాలని ఎవరూ సంప్రదించలేదన్నారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలలుగా లైన్మెన్ పోస్టు ఖాళీ మండలంలోని చుంచుఎర్రగుడి గ్రామంలో నాలుగు నెలలుగా లైన్మెన్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న లైన్మెన్ పదోన్నతిపై వెళ్లడంతో అప్పటినుంచి ప్రభుత్వం ఈ గ్రామానికి లైన్మెన్ను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంతోపాటు లక్కసాగరం గ్రామ పంచాయతీకి కూడా లైన్మెన్ లేకపోవడంతో దాదాపుగా 7 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమవుతున్నారు. అత్యధికంగా కనెక్షన్లు ఉన్న గ్రామాలకు రెగ్యూలర్ లైన్మెన్లను నియమించాలని కోరుతున్నారు. -
కర్ణాటక బస్సు ఢీకొని కార్మికుడి దుర్మరణం
మంత్రాలయం రూరల్: కర్ణాటక బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు హెచ్.తిక్కయ్య (67)మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని చెట్నెహళ్లిలో ఆదివారం చోటు చేసకుంది. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. తిక్కయ్య ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తూ రోడ్డు దాటుతుండగా మంత్రాలయం వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కర్ణాటక బస్సు (కేఎ 36 ఎఫ్ 1750) ఢీకొట్టింది. బస్సు చక్రాల కింద నలిగి తిక్కయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకొని తిక్కయ్య మృతదేహంతో జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరిబాబుతో వాగ్వాదానికి దిగారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పారు. తహసీల్దార్ వెంటనే ఆర్డీఓకు సమాచారం అందించడంతో ఆర్డీఓ కె.అరుణాదేవి, తహసీల్దార్, సీఐ వచ్చి పరిశీలించి జీబ్రా క్రాసింగ్, సిగ్నల్ లైట్ వద్ద సిమెంట్తో యుద్ధ ప్రాతిపదికన స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. ధాదాపు రెండు గంటల పాటు ధర్నా జరగడంతో మంత్రాలయంకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు అతివేగం తగ్గించుకోవాలని, లేదంటే వాటిని నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై తరచూప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించామని, ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మృతదేహన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమదానికి కారణమైన బస్సు డ్రైవర్ మల్లన్న (41)ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసిన అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ -
పోతిరెడ్డిపాడు గేట్లను తాకిన కృష్ణాజలాలు
జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయంలోకి 1,69,211 క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండటంతో డ్యాంలో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాంలో 849.70 అడుగులకు నీటిమట్టం చేరుకోగా కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను తాకాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీశైలం డ్యాంలో 849.70 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 848.70 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నందున మరో రెండు, మూడు రోజుల్లో డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకొనే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్కుగాను జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల కిందున్న ఆయకట్టు రైతులు మొక్కజొన్న, మినుము, కంది తదితర పంటలు సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాల్వలకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారా? పంటలను ఎలా కాపాడుకోవాలా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి సత్వరమే అనుమతులు పొంది వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు ఎత్తి కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. గతేడాది జులై 5న నీటి విడుదల గతేడాది జులై 6న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా దిగువనున్న కాల్వలకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన వర్షాలవల్ల శ్రీశైలం డ్యాంలోకి వరద నీరు పోటెత్తడటంతో డ్యాం క్రమేణా జలకళ సంతరించుకొంటోంది. డ్యాంలో మరో రెండు రోజుల్లో 854 అడుగుల నీటిమట్టం చేరుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. -
క్రీడాకారిణికి ఆర్థిక సాయం
గడివేముల: అంతర్జాతీయ గోల్ షాట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థిని జగదీశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్ద జగదీశ్వరికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించడంతోపాటు సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. క్రీడాకారిణికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లారెడ్డి, అనిల్కుమార్ రెడ్డి, సర్వేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కార్యక్రమం
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో.. వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 73826 14308 నంబర్కు ఫోన్ చేసి తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు గాయాలు బండిఆత్మకూరు: మండలంలోని చిన్న దేవళాపురం గ్రామంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో దంపతులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ నాగమ్మ ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లొచ్చిన అనంతరం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాగమ్మకు, భర్త సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులు కొంతమేర ధ్వంసమయ్యాయి.వ గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం బండి ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి ఆదోని అర్బన్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత సమాజంలో విబేధాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల హక్కులు, ఐక్యతను పరిరక్షించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రమోహన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భార్య అనారోగ్యంతో ఉందని ఆత్మహత్యాయత్నం ఆదోని అర్బన్: మండల పరిధిలోని ఆరేకల్ గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి భార్యకు అనారోగ్యం ఉందని మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందు భార్య కిడ్నీ సమస్యలతో బాధపతూ కర్నూలులో చికిత్స పొందుతోంది. దీనిని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోవిందును స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. గుడిసె దగ్ధం హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన కజ్జి నాగరాజుకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు గుడిసె పైకప్పుకు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, గాలి తోడవడంతో క్షణాల్లోనే మంటలు గుడిసె అంతటా వ్యాపించాయి. గుడిసె నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావంతో గమనించిన స్థానికులు తక్షణమే మంటలను అదుపు చేసేందుకు నీళ్లు, ఇసుక వేశారు. పక్కనే ఇతర ఇళ్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, విలువైన సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో రూ.లక్ష దాకా ఆస్తి నష్ట వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
బళ్లారి రాఘవ సేవలు ఎనలేనివి
కర్నూలు(సెంట్రల్): కళామతల్లికి బళ్లారి రాఘవ చేసిన సేవలు ఎనలేనివని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ కొనియాడారు. ఆదివారం ఉదయం కలెక్టట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో టూరిజం, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ పితామహుడు, మహానటుడు బళ్లారి రాఘవ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బళ్లారి రాఘవ 1880 ఆగస్టు 2న జన్మించి తాడిపత్రి, బళ్లారి, మద్రాస్లలో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాదిగా స్థిరపడ్డారని చెప్పారు. ఆయన తెలుగు నాటక రంగానికి విశేషమైన కృషి చేసి కళాకారుడిగా దేశ, విదేశాల్లో పేరు గడించారని చెప్పారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ.. బళ్లారి రాఘవ కర్నూలుకు చెందిన కృష్ణమ్మను వివాహం చేసుకున్నారని, ఆయన్ను బ్రిటీష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించి రావు బహుదూర్ బిరుదు ఇచ్చినట్లు చెప్పారు. బెంగళూరులో మహాత్మాగాంధీ బళ్లారి రాఘవ నటించిన దీనబంధు కబీర్ నాటికను తిలకించి రాఘవ మహారాజుకి జై అని అన్నట్లు చరిత్ర చెబుతోందని వివరించారు. లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ఏపీ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కరణ్, డీవీఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
‘బ్లాక్ రెయిన్ బో’ కథలు.. జీవిత ప్రతిబింబాలు
కర్నూలు కల్చరల్: వాస్తవ జీవితానికి ప్రతిబింబంగా కథలు రాస్తూ తెలుగు దళిత సాహిత్యంలో సంచలనంగా నిలిచినవి ‘బ్లాక్ రెయిన్ బో’ కఽథలని ప్రసిద్ధ సాహితీ వేత్త గుంటూరు లక్ష్మీ నరసయ్య అన్నారు. ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ రాసిన దళిత కథలు ‘బ్లాక్ రెయిన్ బో’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకంలోని కథలు వైవిధ్యతను సంతరించుకున్నాయని, రాయలసీమ నేపథ్యంలోని అసమానతలు, మారుతున్న సమాజంలో రూపం మార్చుకున్న వివక్షత ఇందులో కథలుగా ఆవిష్కరించబడ్డాయన్నారు. వర్తమాన సాహిత్య సమాజంలో ఈ దళిత కథలు అనివార్యమని, ఇవి సమాజానికి ప్రతిబింబంగా కనబడతాయన్నారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంపీ బసవరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి వెంకట కృష్ణ, ఆర్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, రాయలసీమ ప్రచురణలు సంపాదకులు ఇనయతుల్లా, గౌరవ సంపాదకులు మారుతి, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడారు. పశ్చిమ ప్రాంత మాండలికంలో కథలు రాయడం వల్ల కథా సాహిత్యంలో అరుదైన శిల్పంగా కనబడతాయన్నారు. సాహిత్రీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, నగర అధ్యక్షుడు ఆకెపోగు నాగరాజు, ప్రధాన కార్యదర్శి పార్వతయ్య, కవులు, రచయితలు పాల్గొన్నారు. -
హాస్టల్లో విద్యార్థిని బంధువు హల్చల్
వెల్దుర్తి: స్థానిక బీసీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని బంధువు ఆదివారం హల్చల్ చేశాడు. హాస్టల్ సిబ్బందిపైనే దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లె గ్రామానికి చెందిన శశికళ ప్రస్తుత ఏడాది 6వ తరగతిలో చేరింది. హాస్టల్లో ఉండనంటూ భీష్మించడంతో తల్లికి సమాచారం అందించారు. ఆదివారం కావడంతో హాస్టల్కు వచ్చిన తల్లి కుమార్తెను బయటకు తీసుకెళ్లింది. విద్యార్థిని బాబాయ్ మహేశ్తో కలిసి ఒప్పించి తిరిగి హాస్టల్లో వదిలారు. తర్వాత బాబాయ్ తిరిగి వచ్చి తెలుపు రంగు ద్రావణం ఉన్న ఓ బాటిల్ను గేటు వద్ద ఉన్న విద్యార్థినికి ఇచ్చి ‘ఈ కూల్డ్రింక్ను హాస్టల్లో ఉంటున్న శశికళకు ఇవ్వమని’ అందించాడు. సదరు విద్యార్థిని ఆ బాటిల్ను శశికళకు అందజేయగా తాగి ఉప్పగా ఉండడంతో ఊసేసింది. విషయం తెలుసుకున్న సిబ్బంది అనుమానం కలిగి విద్యార్థిని బాబాయ్కు ఫోన్ చేసి పిలిపించారు. అతను హాస్టల్లోకి వచ్చి సిబ్బందిని దూషిస్తూ, దాడికి పాల్పడ్డాడు. ఘటనపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజాదేవి, సిబ్బంది కలిసి స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. బాబాయ్ను విచారించగా తాను బాటిల్ ఇవ్వలేదని చెబుతున్నాడని, సీసీ పుటేజీ, బాటిల్ ద్రావణంపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
తాగునీటికి పాట్లు
కోడుమూరు రూరల్: మండలంలోని గోరంట్ల గ్రామానికి మంచినీటిని అందించే హంద్రీ నది వానల్లేక ఒట్టిపోయింది. హంద్రీలో నీరు లేక, గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోర్లు పనిచేయక గ్రామంలోని కొళాయిలకు గత నెల రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. వాడుకోవడానికి వదిలేసి కనీసం తాగేందుకు కూడా నీళ్లు దొరక్క గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై బిందెలతో నీటిని తెచ్చుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గోరంట్ల హంద్రి నదికి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేసి తమ ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇద్దరికీ వేదనే!
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కాన్పుల వార్డులో పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో మంచంపై ఇద్దరు గర్భిణులను పడుకోబెట్టి చికిత్స అందిస్తుండటంతో కాన్పు కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలింతలు చంటి బిడ్డలతో ఒకే మంచంపై నరకయాతన అనుభవిస్తున్నారు. బాలింతలకు సహాయకులుగా వచ్చిన వారు చంటి పిల్లలను ఎత్తుకుని లాలిస్తున్నారు. పెద్దాసుపత్రిపై నమ్మకంతో ఎంతో దూరం నుంచి ప్రసవం కోసం వస్తే కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
అన్యాయంగా అరెస్ట్ చేశారు
ఆదోని/ఆలూరు రూరల్/ఆలూరు/ చిప్పగిరి/కర్నూలు (టౌన్): ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించాల్సిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ‘రెడ్బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించి బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భయానక వాతారణంలో పోలీస్స్టేషన్లోనే నిర్బంధించారు. ఆదివారం రాత్రి సమయంలో జైలుకు హాజరు పరిచి జడ్జి రిమాండ్కు ఆదేశించడంతో కర్నూలు సబ్జైలుకు తరలించారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిప్పగిరిలో భారీగా ధర్నా నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వ బెదిరింపులకు బెదరబోమని హెచ్చరించారు. పోలీసుల ‘పచ్చ’పాతం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 34 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు టీడీపీ నేతల సేవల్లో తరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విరూపాక్షి ఎమ్మెల్యే ఎన్నికై రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఆయనకు పోలీసులు సరైన గుర్తింపును ఇవ్వలేదు. టీడీపీ నాయకుల జన్మదినోత్సవాలకు వెళ్లడం, వారి మన్ననలను అందుకోవడం ఆలూరు పోలీసులకు రివాజుగా మారింది. ఎమ్మెల్యే విరూపాక్షి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతుండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పోలీసులతో పథక రచన చేశారు.‘రెడ్బుక్’ రాజ్యాంగం అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక రచించి అమలు చేశారని ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ చేయించారని అర్థమవుతోంది. భయభ్రాంతులకు గురిచేసి.. చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిపై శనివారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన వారు తనపై దాడికి పాల్పడుతున్నారని గిరి ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి, సోదరుడు శ్రీరాములు, వైఎస్సార్సీపీ కార్యకర్తల అక్కడికి వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిని పట్టించుకోకుండా టీడీపీ నేతల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 3 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి పోలీసుపలు వెళ్లారు. ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా ఆయన ఇంటి సీసీ కెమెరాల వైర్లు కోసి, ఇంటి తాళాలు పగులగొట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెయని పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురైనా పోలీసులు లెక్కచేయలేదు. బాధితులపైనే కేసు నమోదు దాడి చేసిన వారిపైన కాకుండా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడిలో గాయపడి చేయి విరిగిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ విషయం పక్కన పెట్టారు పోలీసులు తలకు చిన్న గాయమైన వ్యక్తికి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తీవ్రగాయాలైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని తప్పుడు వాగ్మూలం తీసుకున్నా ఎమ్మెల్యేతో పాటు 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకముందే ఎమ్మెల్యేపైనే తీవ్రమైన కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. సబ్ జైలుకు తరలింపు ఎమ్మెల్యేతో పాటు మరో 12 మందికి ఆదివారం సాయంత్రం 8 గంటలకు ఆలూరు కోర్టులో హాజరు పరచగా ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమ వీరికి 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 12 వైఎస్సార్సీపీ కార్యకర్తలను ప్రత్యేక బస్సులో ఆదివారం రాత్రి 11:30గంటలకు కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఉన్న సబ్జైలుకు తరలించారు. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో దొంగచాటున ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. చిప్పగిరిలోని అంబేద్కర్ కూడలిలో రెండు గంటల పాటు నిసరన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ గుండాలు దాడి చేస్తే పరామర్శిండానికి వెళ్లిన ఎమ్మెల్యేపై అదే టీడీపీ గుండాలు దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం దారుణమన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీలు మధుసూదన్, ఇసాక్, మాజీ ఎంపీ బుట్టారేణకు, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ మేయర్ బీవై రామయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కురువ శశికళ, ఆలూరు నియోజకవర్గ నాయకులు వైకుంఠం మల్లికార్జున చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉండబోదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరసనలో వైఎస్సార్సీపీ చిప్పగిరి మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్సీపీ నాయకులు జూటూరు మారయ్య, పామిడి వీరయ్య, గుంతకల్లు బాబు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదు భగ్గుమన్న వైఎస్సార్సీపీ నేతలు చిప్పగిరిలో భారీ ధర్నా ‘రెడ్బుక్’కు బెదరబోమని హెచ్చరికకార్యకర్త ఆపదలో ఉన్నాడని సీఐకి ఫోన్ చేస్తే స్పందించలేదు. సరే చచ్చిపోతాడేమోనని మా ఆయన వెళ్తే తిరిగి ఆయన పైనే కేసు పెట్టారు. రాత్రి 11 గంటలకు కేసు విషయమై వెళ్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత మేం ఇంటికొచ్చి నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామును 3 గంటలకు వచ్చి పోలీసులు తలుపులు పగులగొట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వస్తున్నాం అని చెబుతున్నా కూడా దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ఇంట్లో తోడు ఉంటాడని గుంతకల్లు నుంచి వచ్చిన మా అబ్బాయిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుని పరిస్థితి ఏంటి? – రామంజనమ్మ, ఎమ్మెల్యే విరూపాక్షి భార్యకార్యకర్తను పరామర్శించేందుకు వెళితే తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విలేకరులకు తెలిపారు. సబ్జైల్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశపాలన కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. -
పోలీసులు దారుణంగా వ్యవహరించారు
ఒక శాసనసభ్యుడికి పోలీసులు కనీస మర్యాదు కూడా ఇవ్వలేదు. రాత్రివేళ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగల మాదిరిగా, టెర్రరిస్టుల్లా తీసుకుపోవడం అత్యంత దుర్మార్గం. ఈ రోజు పోలీసులు తమ ధర్మాన్ని మర్చిపోయి టీడీపీ నాయకుల ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోరు. కానీ దౌర్జన్యం చేసిన టీడీపీ ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేయాలనే ఈ విధంగా పోలీసులతో చేయిస్తున్నారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కసి పెరుగుతుందే తప్ప ఎవ్వరూ భయపడరు. 2029లో మళ్లీ జగన్ను సీఎంగా చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. – కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
సైకోలుగా తయారయ్యారు!
టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం ఇలాగే అమలు పరుస్తూ పోతే భవిష్యత్తులో బ్లడ్ బుక్ రాజ్యాంగం వస్తుంది జాగ్రత్త! సైకోలుగా తయారై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఒక కార్యకర్త ఆపదలో ఉండి ‘అన్నా నీవు ఇప్పుడు రాకపోతే పొద్దున్నే నా శవాన్ని చూస్తావ్’ అని ఫోన్ చేస్తే ఎమ్మెల్యేగా వెళ్లి పరామర్శించడం తప్పా? టీడీపీ నాయకులు సైకోలుగా తయారయ్యారు. ఇష్టానుసారంగా బెదిరిస్తే బెదిరిపోయే నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో ఎవ్వరూ లేరు. మా పార్టీ శ్రేణులకు మేమందరం అండగా ఉంటాం. – సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే -
అక్రమ కేసులు దుర్మార్గం
ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్లపైనే తిరిగి పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. ఎమ్మెల్యే విరూపాక్షిని ట్రాప్ చేసి రప్పించడం కోసమే ముందస్తు ప్రకారం కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. రాత్రి పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేను అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి హర్డ్ డిస్క్లు, కెమెరాలు లాక్కెళ్లడం ఏ చట్టం కిందకు వస్తుందో పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వైఎస్సార్సీపీ నేతలు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్కు వెళితే వాళ్లపైనే కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం నడుస్తోంది. విరూపాక్షిపైన పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే విరమించుకోవాలి. మేం న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ చట్టబద్ధంగా పోరాడుతాం. – శైలజనాథ్, మాజీ మంత్రి -
ఇలా ప్రారంభించి.. అలా మూతేసి!
● తక్కువ ధరకే బియ్యం కౌంటర్లు ఫొటోలకే పరిమితం ● కాసేపటికే మూసేసిన వైనంకర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు తగ్గింపు ధరలపై నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలే అంతా ఉత్తిదేనని తేలిపోయింది. కర్నూలులోని అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఆదివారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించి వెళ్లిన అర గంటకే మూసేయడంతో వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు. బయట మార్కెట్లో స్టీమ్డ్ రైస్ ధర కిలో రూ.62. రా రైస్ ధర రూ.58 ఉందని, ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్టీమ్ రైస్ రూ.52కే పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. వినియోగదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే కౌంటరును ప్రారంభించి ఐదారుగురికి బియ్యం పంపిణీ చేసి ఫొటోలు దిగి.. మరో చోట కౌంటరును ప్రారంభించాల్సి ఉందని.. మూసేసి వెల్లిపోవడం గమనార్హం. తక్కువ ధరకే బియ్యం పంపిణీ చేస్తున్నామని భారీగా ప్రచారం చేసి.. కౌంటరుకు కేవలం 25 కిలోల బస్తా మాత్రమే తీసుకురావడం చూస్తే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. మండిబజారులో కూడా హోల్సేల్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఒక కౌంటరు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నా... అది కూడా ఫొటోలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. అమీన్ అబ్బాస్ నగర్ రైతుబజారులో బియ్యం కౌంటరు ప్రారంభ కార్యాక్రమంలో ఏఎస్ఓ రంజిత్, ఎస్టేట్ ఆఫీసర్ జయమ్మ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ప్రతి పనికో రేటు!
● శ్రీశైలం మండలంలో మితిమీరుతున్న టీడీపీ నాయకుడి ఆగడాలు ● పీజేఆర్ఎస్లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ సాక్షి, టాస్క్ఫోర్స్: శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఓ స్థలం విషయంలో రూ.లక్ష తీసుకుని తనని మోసం చేశాడని తాజాగా సున్నిపెంట గ్రామంలో నిర్వహించిన పీజేఆర్ఎస్లో ఏకంగా శ్రీశైల మండల టీడీపీ ప్రధాన నాయకుడిపై ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీ నాయకులే విస్మయానికి గురయ్యారు. తన వద్దకు సమస్యలపై వచ్చేవారికి టీడీపీ ఇన్చార్జ్కి, స్టేషన్లో ఓ అధికారికి డబ్బు ఇవ్వాలని ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి డబ్బు వసూలు చేస్తాడని సమాచారం. అతని ఆగడాలు సున్నిపెంటలో శృతిమించుతున్నట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు సైతం వెల్లువెత్తినట్లు సమాచారం. ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలే పెట్టుబడి.. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అండదండలతో శ్రీశైలం మండలంలో ద్వితీ యశ్రేణి నాయకులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని టార్గెట్ చేసుకుని ఒక్కోపనికి ఒక్కో రేటు కట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే స్థానిక పర్యటనలకు వచ్చినప్పుడు ఆయనతో చనువుగా ఉన్నట్లు వ్యవహరిస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను స్టేటస్లలో పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఉద్యోగాలు, స్థలాలు, ఇరిగేషన్, గృహాలు, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఓ స్థలం తనకు ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకుని స్థలం ఇప్పించకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ జిల్లా ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ● తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ పేరుచెప్పి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ● పూర్ణానంద ఆమం సమీపంలో ఓ ఇంటి విషయంలో ఒకరికి మద్దతు తెలిపి వారి నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ● ఇటీవల ఓ వడ్డీ వ్యాపారి, మరో యువకుడు గొడవ పడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో రాజీ చేస్తానని ఇద్దరి నుంచీ డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసింది కాదని స్టేషన్ అధికారికి, మండల టీడీపీ ఇన్ చార్జ్కి మరో రూ.50 వేలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తాము అంత ఇచ్చుకోలేమని వారు నేరు గా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంతోపాటు అన్ని మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. పది మండలాల్లో తేలికపాటి వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రుతుపవనాలు బలహీనపడిపోయాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని 10 మండలాల్లో తేలికపాటికే వర్షం కురిసింది. పెద్దకడుబూరులో 25.4 మి.మీ. వర్షం కురియగా.. మిగిలిన మండలాల్లో జల్లులకే పరిమితం అయ్యాయి. కౌతాళంలో 8.6, గోనెగండ్లలో 7.8, ఎమ్మిగనూరులో 4.2, కల్లూరులో 2.6, కోడుమూరులో 2.4, కోసిగిలో 2.2, మద్దికెరలో 1.0, కర్నూలు రూరల్లో 0.4, కర్నూలు అర్బన్లో 0.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్వోగా శ్యామల కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్వోగా ఐఎఫ్ఎస్ పి. శ్యామల నియమతులయ్యారు. అటవీ శాఖ జిల్లా అఽధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్యామలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డేవిడ్ పదవీ విరమణ పొందడంతో కర్నూలు డీఎఫ్ఓ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి డీఎఫ్ఓగా వ్యవహరించనున్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.8,290 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్ట ధర రూ.8,290లు పలికింది. మార్కెట్కు 4,616 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటం వేరుశనగ కనిష్ట ధర రూ.3,130లు, మధ్యస్థ ధర రూ.6,745ల ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. ఆముదాలు క్వింటం రూ.5,100కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. హైవేపై ఎలుగుబంటి హల్చల్ పాములపాడు: మండలంలోని ఎర్రగూడూరు గ్రామ సమీపంలో జెమ్మి చెట్టు నేషనల్ హైవేను దాటుతూ ఎలుగుబంటి హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఎలుగుబంటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో హారన్లు కొడుతూ కేకలు వేశారు. దీంతో ఎలుగుబంటి పరుగున అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో అటువైపు వెళ్లేందుకు ప్రజలు సాహసించలేదు. అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అటవీ సమీప గ్రామాల్లోకి అడవి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డికల్లూరు: బస్తిపాడు గ్రామ పొలిమేరలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై, చెట్లమల్లాపురం గ్రామంలోని జగనన్న కాలనీలో ప్లాట్లను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీసీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ ఆంజనేయులతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం ప్రజల హక్కులపై దాడితో సమానమన్నారు. బస్తిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 382లో ఉన్న సుమారుగా 1.93 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అన్నారు. చెట్లమల్లాపురం గ్రామంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం వైఎస్సారీసీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కల్లా వెంకట రమణారెడ్డి, నారాయణరెడ్డి, దండు లక్ష్మీకాంతరెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, శివశంకర్రెడ్డి, తిరుపాల్, పెద్దన్న, యూనస్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ సొమ్ము మాయం.. గంటల్లోనే రికవరీ
కోడుమూరు రూరల్: సచివాలయంలో పింఛన్ల పంపిణీ కోసం దాచిన డబ్బును కాజేసి చివరకు పోలీసులకు చిక్కిన సంఘటన శనివారం కోడుమూరులో చోటు చేసుకుంది. కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలోని సచివాలయం–1లో ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేసేందుకు వెల్ఫేర్ అసిస్టెంట్ అనీల్కుమార్ శుక్రవారం సాయంత్రం బ్యాంకు నుంచి పింఛన్ అమౌంట్ రూ.29.96 లక్షలు డ్రా చేశాడు. డ్రా చేసిన మొత్తంలో నుంచి పింఛన్ల పంపిణీ కోసం సిబ్బందికి రూ.16.56 లక్షలు ఇవ్వగా, మిగిలిన రూ.13.40 లక్షల నగదును సర్వేయర్, మహిళా పోలీస్, ఆఫీస్ బాయ్ సమక్షంలో గ్రామ సచివాలయంలోని బీరువాలో భద్రపరిచి తాళాలను అనీల్కుమార్ తీసుకెళ్లాడు. శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ కోసం బీరువా తాళాలు తెరిచి చూడగా రూ.60 వేలు తక్కువగా ఉండటాన్ని గమనించి డబ్బుపోయిన విషయంపై సిబ్బందితో కలిసి కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ విచారణ చేపట్టగా ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న బోయ సురేష్ మారు తాళాలతో బీరువా నుంచి డబ్బులను దొంగలించినట్లుగా గుర్తించాడు. దీంతో బోయ సురేష్ నుంచి డబ్బులను ఎస్ఐ రికవరీ చేసి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్కు నగదును అప్పగించాడు. కాగా నగదు మాయమైన విషయాన్ని ఫిర్యాదు చేసిన వెంటనే చేధించి ఇంటి దొంగను పట్టుకున్న కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి, సిబ్బందిని గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు, ప్రజలు అభినందిస్తున్నారు. -
దయనీయం
మేం ఇప్పటి వరకు 8 ఎకరాల్లో కందులు, 3 ఎకరాల్లో పసుపు, రెండు ఎకరాల్లో ఎర్ర మిరప సాగు చేశాం. మాకు నాలుగు బోర్లు ఉన్నాయి. గతంలో ఎపుడూ లేని విధంగా బోర్లలో నీరు అడుగంటి పోయింది. వర్షాలు లేక, బోర్లలో నీరు అడుగంటి పోవడంతో పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలు, సేద్యాలు, బాడుగలు, కూలీ ఖర్చులు మొత్తంగా రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి మొత్తం మట్టిపాలు అయినట్లే. వానల్లేక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. – బత్తుల రాముడు, రామళ్లకోట, వెల్దుర్తి మండలం జల్లులు మినహా ఒక మోస్తరు వర్షం కూడా లేదు. మాకు సొంత భూమి 2 ఎకరాలు ఉండగా... 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వర్షాధారం కింద రెండు ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో ఎర్ర మిరప సాగు చేశాం. జూలై నెలలో వర్షాలు పడి ఉంటే పంటలు కోలుకునే అవకాశం ఉంది. నెల రోజులుగా చినుకు జాడ లేకపోవడం, ఎండలు, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇపుడు వర్షాలు పడినా కోలుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకు రూ. లక్ష పెట్టుబడి పెట్టాం. ఎకరాకు రూ.12 వేలు కౌలు ఉంది. రెండు ఎకరాలకు రూ.24 వేలు చెల్లించాలి. గతంలో ఎపుడూ లేని విధంగా నష్టాలు మాట కట్టుకున్నాం. – ఎం.మల్లయ్య, హొళగుంద -
5 నుంచి 16 వరకు ‘టెట్’
కర్నూలు(సెంట్రల్): టీచర్ ఎలిజబులిటీ టెస్టు(టీఈటీ)ను ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ...జిల్లాలో టెట్ కోసం 31,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి జిల్లాలో ఐదు, హైదరాబాద్లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి పంపుతామని, ఆలస్యంగా వస్తే అనుమతించబోరని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను తీసుకెళ్లరాదన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతో గట్టి నిఘా ఉంచాలని డీఈఓ సుధాకర్ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: రోడ్డు ప్రమాదాలను నివారించడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఈ ఏడాది జనవరి 1నుంచి జూలై 31వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి 24,846 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్స్టేషన్ల వారీగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం కర్నూలు(అర్బన్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన అందరి సహకారంతో ఘనంగా నిర్వహిద్దామని జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి డీ సురేష్ అన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన శనివారం తన చాంబర్లో గిరిజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఆయా సంఘాల నాయకులతో చర్చించారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు ఆర్ కై లాస్నాయక్, ఆర్ చంద్రప్ప, రామరాజు, వై రాజు, వై మద్దిలేటి, యోగేష్నాయక్, గుండాల నాయక్, సేవాలాల్నాయక్, సీమ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజూ 35 వేల మందికి ఉపాధి పనులు కల్పించాలికర్నూలు(సెంట్రల్): వ్యవసాయ పనులు తక్కువ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ప్రతి రోజూ 35 వేల మందికి ఉపాధి పనులు కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం ఆమె వీబీజీరామ్జీ పథకం అమలుపై ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, ఏపీడీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. హార్టికల్చర్ కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు ఐదు వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కింద 11 రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో చేపడుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. అనంతరం మండలాల వారీగా ఉపాధి పనుల కల్పన, ప్లాంటేషన్పై కలెక్టర్ సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్లో డ్వామా పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహించండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధికర్నూలు: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కక్షిదారులను ప్రోత్సహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం మధ్యవర్తిత్వం 3.0పై న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథులుగా హాజరై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని హైకోర్టు తీర్మానించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల నుంచి డిసెంబర్ 31 వరకు దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0పై ముమ్మర ప్రచారాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని కోర్టుల్లో నిర్వహిస్తామని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా ఏ విధంగా కేసులు పరిష్కారమవుతాయో న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కక్షిదారులకు న్యాయవాదులు కూడా మీడియేషన్పై అవగాహన కల్పించి వారి కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెలిపారు. దీనివల్ల కోర్టుల్లో కేసులు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం, ఖర్చు లేకుండా శాశ్విత పరిష్కారం కక్షిదారులకు లభిస్తుందని తెలిపారు. కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం
కర్నూలు(హాస్పిటల్): తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని, అవి అన్ని వ్యాధులు రాకుండా బిడ్డను రక్షిస్తాయని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం ఆసుపత్రిలోని గైనిక్ వార్డులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యానికి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అదనపు ఆహారం లేదా నీరు అవసరం లేదన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువుకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమాన భూతం.. తల్లీ, బిడ్డ హతం
● భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త ● బళ్లారిలోని ఆంఽధ్రాళ్ ప్రాంతంలో దారుణం సాక్షి,బళ్లారి: కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం పెంచుకున్న కిరాతక భర్త ఏడు నెలల పసికందును, భార్యను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బాళ్లారి నగర శివార్లలో 8వ వార్డు పరిధిలోని ఆంధ్రాళ్ ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. ఆంధ్రాళ్లో నివాసం ఉంటున్న హొన్నూరప్ప(28), తన భార్య రాజేశ్వరి(24)ని, కుమార్తె అశ్విని(1)ని దారుణంగా హత్య చేశాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే ఎస్పీ సుమన్ పన్నేకర్, డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన రాజేశ్వరికి హొన్నూరప్పతో పెళ్లయింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే చివరి సంతానం అశ్విని తనకు పుట్టలేదంటూ భార్య శీలంపై అనుమానం పెంచుకుని తరచు గొడవ పడేవాడు. చివరకు పసికందును, భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పథకం ప్రకారం భార్యను, పసికందును సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానే హత్య చేసినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిగ్రీ సప్లిమెంటరీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు htt ps://rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రెండవ సెమిస్టర్కు సంబంధించి 454 పేపర్స్కు దరఖాస్తు చేసుకోగా 152, నాల్గవ సెమిస్టర్కు సంబంధించి 587 పేపర్స్కు దరఖాస్తు చేసుకోగా 283 పేపర్స్ ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.అశ్విని (ఫైల్)హొన్నూరప్ప, రాజేశ్వరి (ఫైల్) -
ఉద్రిక్తంగా స్కీం వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి
కర్నూలు(సెంట్రల్): స్కీం వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మెయిన్ గేట్ వద్ద కనీస వేతనాల కోసం ఉద్యమించిన స్కీం వర్కర్లను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లు దూకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో పోలీసులు, స్కీం వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కనీస వేతన డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.నిర్మల మాట్లాడుతూ స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలన్నారు. వర్కర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమీజాబీ, బాలదుర్గమ్మ, శివలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల
కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు తాత్కాలిక మెరిట్ జాబితా, తిరస్కరణ వివరాలను విడుదల చేసినట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆయా కేటగిరీలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్, జానియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్టు, ఎల్డీ కంప్యూటర్, ఏఎన్ఎం గ్రేడ్ –3 పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ https://kurnool.ap.gov.in లో జాబితాలను ఉంచామన్నారు. వివరాల్లో ఏవైనా ఆక్షేపణలు ఉంటే ఈ నెల 7వ తేది సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. అలాగే కార్యాలయ మెయిల్ ఐడీ addwknl@gmail.comకి తగిన ఆధారాలతో తెలియజేయవచ్చన్నారు. ‘నీట్’ విద్యార్థిని ఆత్మహత్య కోడుమూరు రూరల్: నీట్ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు. బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్కు చెప్పసాగింది. అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు(అర్బన్): తల్లి పాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 1 నుంచి 7వ తేది వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.విజయ తెలిపారు. ప్రసవించిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించాలని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లాలోని గర్భిణిలు, బాలింతలు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమ పరిధిలో తప్పక పాల్గొనాలని ఆమె కోరారు. -
లోకేష్.. మంత్రి పదవి నుంచి తప్పుకో
● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలికర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2024 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ డీఎస్సీ–2024లో పెద్ద ఎత్తున అవకతవకాలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో కొందరు టీడీపీ నాయకులు ఒక్కో టీచర్ ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని.. స్వయంగా పేపర్ తయారు చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టీచర్ ఉద్యోగం రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ అక్రమాలకు మంత్రి లోకేష్ సన్నిహితులే పాల్పడ్డారని, అందులో ఆయనకూ వాటా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఏపీలో డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలన్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఇన్చార్జి ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన కుమారుడు మంత్రిగా ఉండటం వల్లే అక్రమాలు జరిగినా విచారణ జరిపించడం లేదన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పడం లేదన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ షరీష్, జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రశాంత్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతం కటికె, మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పింఛన్లు లేనట్లే!
● వృద్ధులకు తప్పని ఎదురు చూపులు ● దివ్యాంగులకు తొలగని కష్టాలు ● నేడు ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ ఈ చిత్రంలో కనిపించే వృద్ధురాలి పేరు కటికే మాసూంబీ. ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఈమెకు 73 ఏళ్ల వయస్సు ఉంది. నా అనే వాళ్లు లేరు. ఒంటరి మహిళ. కొన్ని నెలల కిత్రం వరకు ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. రోడ్డు విస్తరణ పేరుతో గుడిసెను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఆధారం కోల్పోయి మసీదుపురంలోని బంధువుల అవ్వ ఉంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగా రెండేళ్లుగా అవ్వకు పింఛన్ మంజూరు కాలేదు. .. జిల్లాలో ఇలాంటి వారు 18,717 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పింఛన్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయినా హామీని అమలు చేయలేదు. కనీసం 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదు. లబ్ధిదారులు మరణిస్తే భార్యకు పింఛన్ మంజూరు చేయడం మినహా కొత్తవి ఇవ్వడం లేదు. స్పౌజ్ పింఛన్లు కూడా 2025 జూలై నుంచి మాత్రమే ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంటే 2024 జూన్ నుంచి 2026 జూన్ వరకు 18,717 మంది పింఛన్దారులు మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. 2026 జనవరిలో 754, ఫిబ్రవరిలో 761, మార్చిలో 663, ఏప్రిల్లో 580, మేలో 713, జూన్లో 629 మంది పింఛన్దారులు మృతిచెందారు. పింఛన్ల కోసం వృద్ధులు ఎదురు చూడాల్సి వస్తోంది. దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత, మత్స్యకారులు, వివిధ వ్యాధిగ్రస్తుల కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఏడాది జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తి అయింది. ఆ సమయంలోకొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కాని కొత్త పింఛన్లు లేనట్లేనని తేలిపోయింది. నేడు పింఛన్ల పంపిణీ ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ శనివారం జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో జూలై నెలలో 2,34,266 పింఛన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 2,33,902కు తగ్గాయి. అంటే 364 పింఛన్లపై వేటు పడింది. -
ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించండి
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సీఐలు, ఎస్ఐలు పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సైబర్ నేరాల కేసుల విషయంలో 1930కి వచ్చిన ఫిర్యాదులు, ఆన్లైన్ ఫిర్యాదులు, బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన నగదు అంశాలను పర్యవేక్షించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరు మెరుగుపరచుకుని బృందాలుగా ఏర్పడి ప్రాపర్టీ నేరాలను ఛేదించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకటరామయ్య, రాఘవేంద్ర, దుర్గాప్రసాద్తో పాటు సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే టెన్జింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు–2025కు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలైన 2023, 2024, 2025 కాలంలో భూమి, సముద్రం, గగనతలంపై నిర్వహించిన సాహసక్రీడలు, సాహస కార్యక్రమాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన వ్యక్తులు ఈ అవార్డు దరఖాస్తుకు అర్హులన్నారు. అవార్డును అర్జున అవార్డులతో పాటు ప్రదానం చేస్తారన్నారు. అవార్డు గ్రహీతలకు టెన్జింగ్ నార్కే కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.15లక్షల నగదు బహుమతి అందజేస్తారన్నారు. ఈనెల 20లోపు httpr://awardr.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను కర్నూలు నగరం కల్లూరు ఎస్టేట్లోని సెట్కూరు కార్యాలయంలో సమర్పించాలన్నారు. -
సర్లో 2,73,587 మంది ఓటర్ల తొలగింపు
● సర్లో తొలగించిన ఓటర్ల సంఖ్య 2,73,587 ● అత్యధికంగా పాణ్యంలో 2,83,030 మంది ఓటర్లు ● అత్యల్పంగా మంత్రాలయంలో 1,97,152 మంది ● ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ● అభ్యంతరాలకు ఆగస్టు 30వ తేదీ వరకు గడువు ● అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా విడుదల కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)ల ఇంటింటి సర్వే పూర్తి కావడంతో జిల్లా ఎన్నికల సంఘం ముసాయిదా జాబితా విడుదల చేసింది. ఆ ప్రకారం జిల్లాలో 18,14,128 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,93,162 మంది కాగా.. మహిళలు 9,19,105.. ఇతరులు 264, సర్వీసు ఓటర్లు 1,596 మంది ఉన్నారు. కాగా, పురుష ఓటర్ల కంటే 25,944 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యధికంగా పాణ్యంలో 2,83,030 మంది ఓటర్లు, అత్యల్పంగా మంత్రాలయంలో 1,97,152 మంది ఓటర్లు ఉన్నారు. ఆలూరు తప్ప అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఆలూరులో 1,19,008 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,18,259 మంది ఉన్నారు. ఇక జిల్లా మొత్తంగా మహిళా ఓటర్లు 9,19,105 మంది ఉండగా పురుష ఓటర్లు 8,93,162 మంది, ఇతరులు 265 మంది ఉన్నారు. ఇతరుల్లో అత్యధికంగా పాణ్యంలో 63 మంది, అత్యల్పంగా కర్నూలులో 18 మంది ఉన్నారు. కర్నూలు, పాణ్యం, ఆదోనిలోనే ఎక్కువ ఓటర్ల తొలగింపు? కర్నూలు, పాణ్యం, ఆదోని నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తొలగింపులు ఉన్నాయి. కర్నూలులో మొత్తం ఓటర్లు 2,74,622 మందిలో 67,755 మంది, పాణ్యంలోని 3,35,015 మందిలో 51,985 మంది, ఆదోనిలోని 2,67,980 మందిలో 34,946 మంది ఓటర్లను తొలగించారు. ఇందులో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్లోని 16 వార్డుల్లోనే తొలగించిన జాబితా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. దీనిని బట్టి కర్నూలు నగరంలోని ఓటర్ల వివరాలు ఎక్కువగా గల్లంతయ్యాయని తెలుస్తోంది. తొలగింపుల్లో అర్హులు ఉంటే ఏమి చేయాలి సర్లో భాగంగా జిల్లాలో తొలగించిన ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు ఉంటే ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వీరంతా త్వరలోనే జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఫాం–6 ఇచ్చి మళ్లీ ఓటును పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే వారి ఓటు శాశ్వతంగా తొలగిపోతుంది. పెరిగిన 249 పోలింగ్ బూత్లు జిల్లాలో సర్లో భాగంగా పోలింగ్ బూత్ల విభజన కూడా జరిగింది. 2024 ఎన్నికల ప్రకారం జిల్లాలో 2203 పోలింగ్ బూత్లు ఉండేవి. ఈ క్రమంలో ప్రతి బూత్లో 1,200 ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా బూత్ల పరిధిని కుదించారు. గతంలో 1,500 పైగా కూడా ఒక్కో బూత్లో ఓటు వేసే వారు. అయితే ఆ సంఖ్య ను 1,200లకు కుదించడంతో జిల్లాలో భారీగా పోలింగ్ బూత్లు పెరిగాయి. ఆ సంఖ్య 2,203 నుంచి 2,452కు పెరిగింది. మొత్తంగా జిల్లాలో సర్ తరువాత 249 పోలింగ్ బూతులు పెరిగాయి. నియోజకవర్గం పోలింగ్ పురుష మహిళా ఇతరులు సర్వీస్ మొత్తం కర్నూలు 318 99820 107029 18 79 206946 పాణ్యం 373 137835 145132 63 277 283307 పత్తికొండ 277 103259 103578 22 449 207308 కోడుమూరు 291 112792 113772 12 177 226753 ఎమ్మిగనూరు 322 109503 112167 31 187 221888 మంత్రాలయం 267 96405 100719 28 57 197209 ఆదోని 284 114540 118449 45 108 233142 ఆలూరు 320 119008 118259 46 262 237575 మొత్తం 2452 893162 919105 265 1596 1814128 ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జిల్లాలో సంచలనం సృష్టించిన సర్–2026 సర్వేలో ఏకంగా 2,73,587 మంది ఓటర్లను తొలగించారు. జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటా సర్వే నిర్వహించి సేకరించిన జాబితాల ఆధారంగా ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాపై ఆగస్టు 30వ తేదీ వరకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తుంది. కాగా, ముసాయిదా జాబితాలను అన్ని పోలింగ్ బూత్ల వారీగా అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లోనూ తొలగించిన జాబితాలు, సర్ సర్వే జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఆ జాబితాల ఆధారంగా ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై ఆగస్టు 30వ తేదీ వరకు పరిశీలన చేసి సెప్టెంబర్ 28వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.జిల్లాలో మొత్తం 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. సర్లో భాగంగా బీఎల్ఓలు 2026 జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టారు. 2025 ఓటరు జాబితాను 2002 సర్ జాబితా ఆధారంగా పోల్చి చూశారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్లు ఇచ్చి సేకరించారు. మొత్తం 20,86,119 మంది ఓటర్లలో 18,12,532 మంది ఓటర్లే తమ ఎన్యుమరేషన్ ఫామ్లను తిరిగి సమర్పించారు. దీంతో ఎన్యుమరేషన్ ఫామ్లను సమర్పించని 2,73,587 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. -
ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల విక్రయం
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలోని జలవనరుల శాఖకు చెందిన సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు ప్లాట్ల విక్రయానికి తెగబడుతున్నారు. అటవీశాఖ కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. ఇప్పటికే సున్నిపెంటలోని ప్రభుత్వ భూములు, గృహాల అన్యాక్రాంతంపై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వ నేతల అండతో ఏ భయం లేకుండా ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో సన్నకార రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండించి వినియోగించుకుంటున్న భూమికి అద్దెలు చెల్లించేవారు. కాలక్రమేణా ఎటువంటి అధికారం లేకుండానే క్రయవిక్రయాలు జరిగాయి. యలమంచిలి రవి అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గోశాలను నిర్వహించేవాడు. రవి, ఆయన సతీమణి మరణాంతరం ఈ స్థలాలు తమవంటు ఫేక్ డ్యాక్మెంట్లు సృష్టించుకొని శ్రీధర్, శివకుమార్ అనే వ్యక్తులు ప్లాట్ల విక్రయానికి తెరలేపారు. ఇంత జరుగుతున్నా జిల్లా పంచాయతీ, జలవనరుల, రెవెన్యూ శాఖ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కదం తొక్కిన కార్మికులు
నంద్యాల(న్యూటౌన్): వివిధ రంగాల్లో పని చేస్తున్న షెడ్యూల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆయా రంగాల్లో ఉత్పత్తిని స్తంభింపజేస్తామని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పట్టణంలోని కోవెలకుంట్ల –నూనెపల్లి జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కార్మిక వర్గం లేకుండా ప్రభుత్వాలు నడవలేవన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బజారు హమాలీలు, వేర్హౌస్లు, షాపింగ్ మాల్లు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీలు, గనుల్లో పనిచేసే కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. జీతాలు పెంచమంటే జీవోలు ఉన్నాయా అని అడుగుతున్నారని, కానీ ఎమ్మెల్యేలకు మాత్రం లక్షల వేతనాలు పెంచడం న్యాయమేనా అని ప్రశ్నించారు. కనీస వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ రామునాయక్కు అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, బాల వెంకట్, వెంకట్ లింగం, రామ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కే మహమ్మద్ గౌస్, శివరాం జిల్లా నాయకులు రణధీర్, రత్నమయ్య, మారెన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బాలదుర్గ,భాస్కరాచారి రంగనాథ్, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, వీఆర్ఏ సంఘం జిల్లా నాయకుడు శివరామకృష్ణ పాల్గొన్నారు. -
తుంగభద్ర వెలవెల.. కృష్ణమ్మ గలగల!
కర్నూలు సిటీ: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా సబ్ బేసిన్లోని తుంగభద్ర నది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, భీమ, మలప్రభ, ఘట్టప్రభ నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఈ నీటి సంవత్సరం ఆలస్యంగానైన ఆల్మట్టి డ్యాం గేట్లు ఐదు రోజుల క్రితం తెరచుకున్నాయి. ఆ డ్యాం నుంచి ఉదయం 8 గంటల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఆ నీటినంతా దిగువన ఉన్న నారాయణ పూర్డ్యాంకు వదిలారు. అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. జూరాల నుంచి వదిలిన నీరు సప్తనదుల సంగమానికి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తోంది. కృష్ణా నది కంటే ముందుగానే తుంగభద్ర నదిలో వరద నీటి ప్రవాహాలు కనిపించినా..ఆశించిన స్థాయిలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో వర్షాలు కురువలేదు. దీంతో ఒక రోజు ఉన్న నీటి ప్రవాహం ఆ మరుసటి రోజుకు ఉండటం లేదు. ప్రస్తుతం కేవలం తాగు నీటికి మాత్రమే తుంగభద్ర జలాలను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం! శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలు. ఈ నెల 28వ తేదీ 1.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసుల బ్యారేజీ నుంచి 2.06 టీఎంసీల నీరు చేరింది. గురువారం మధ్యాహ్నానికి 825.20 అడుగుల మట్టంతో 46.82 టీఎంసీల సామర్థ్యానికి నీటి నిల్వలు చేరాయి. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యాంకు 1,10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. నారాయణపూర్ నుంచి 1,11,064 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతుండగా 12 గేట్లు పైకెత్తి 47,112, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,997 క్యూసెక్కుల నీటిని మొత్తం 85,109 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ఉదయం 67 వేల క్యూసెక్కుల నీరు మధ్యాహ్నానికి 85 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి విడుదల మరింత పెరగనుంది. సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మరో మూడు నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుంగభద్ర డ్యాం ఇన్ఫ్లో అంచనాకు అందడం లేదని తెలుస్తోంది. -
శ్రీవ్యాసతీర్థ రిజర్వాయర్కు భూమి పూజ
● రూ. 50 కోట్లతో నిర్మాణం ● శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా శంకుస్థాపన మంత్రాలయం: ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మంత్రాలయంలో గోశాల ఎదురుగా ఉన్న 25 ఎకరాల శ్రీమఠం భూమిలో గురువారం ఇంపౌండింగ్ రిజర్వాయర్కు భూమి పూజచేశారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం శ్రీవ్యాసతీర్థ రిజర్వాయర్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణానికి బెంగళూరుకు చెందిన హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఎఎల్ ) ముందుకు వచ్చిందన్నారు. వచ్చే 30 సంవత్సరాల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సరిపోయే విధంగా అంచనా రూపొందించారన్నారు. శ్రీగురు రాఘవేంద్రస్వామి భక్తుల కోసం ఈ కీలక ప్రాజెక్టుకు హెచ్ఎఎల్ సహకారం అందించడం సంతోషం అన్నారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసే సంస్థ రూ. 50 కోట్లు భరిస్తోందన్నారు. తుంగభద్ర నది కాలుష్యం కాకుండా భక్తులు చూడాలన్నారు. మురుగు నీరును ఫీల్డర్ చేసి తాగునీటిని చేస్తున్న తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల సమక్షంలో శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసులు, హెచ్ఎఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రవి తో అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కలసి ఒప్పంద పత్రాలు సంతకాలు చేశారు. 18 నెలల్లో పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 20.67 ఎంసీఎఫ్టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్లు). రిజర్వాయర్ 35 అడుగుల తోతు ఉంటుంది. ఒక కిలోమీటరు దూరంలో ఉండే తుంగభద్ర నది నుంచి అత్యాధునిక టెక్నాలజీతో స్టీల్ పైపులైన్ వేయనున్నారు. రిజర్వాయర్కు అవసరమైన నీటిని తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తారు. వరదనీరు వచ్చినప్పుడు, నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు రిజర్వాయర్కు తరలిస్తారు. ఎండాకాలంలో భక్తులకు, గ్రామప్రజలకు ఈ నీటిని సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నాణ్యత ప్రామాణాలతో రిజర్వాయర్ పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, శ్రీమఠం మేనేజర్–2 వెంకటేష్జోషి, ధార్మిక అధికారి శ్రీపతి, ఇంజినీర్ సురేష్కోనాపూర్, హాల్ సంస్థ హెచ్ఆర్ సభ్యులు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గుప్త, మంజునాథ్, రమేష్, సోమన్చౌదరి, డిజైనింగ్ అధికారి రంగనాథ్, హాల్ సంస్థ అధికారులు, శ్రీమఠం అధికారులు పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతంగా.. మంత్రాలయంలో గోశాల ఎదురుగా 40 ఎకరాల శ్రీమఠం భూమి ఉంది. అందులో 25 ఎకరాల్లో మాత్రమే రిజర్వాయర్ నిర్మించనున్నారు. రిజర్వాయర్ పక్కన స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో పార్కు ఏర్పాటు చేయనున్నారు.ఈ స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దనున్నారు. -
ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా?
● జిల్లా హామీ లేదన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ఆదోని: పిడికిలి బిగించి ఎనిమిది నెలలుగా ‘ఆదోని జిల్లాగా ప్రకటించాలి’ అనే డిమాండ్తో కొనసాగుతున్న ఉద్యమానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఊహించని మలుపు తిప్పాయి. అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా కల నెరవేరుతుందనే ఆశతో ఎదురు చూసిన ఉద్యమకారులకు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. దాదాపు 256 రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని అవహేళన చేస్తున్నట్లు అనిపించింది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ను జిల్లా సాధన సమితి ప్రతినిధులు కలిసి మరోసారి తమ డిమాండ్ను వినిపించారు. జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశా రు. అయితే దీనిపై స్పందించిన లోకేష్ ‘‘నేను కాని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ యువగళం పాదయాత్రలో ఎక్కడా ఆదోనిని జిల్లాగా చేస్తామని హామీ ఇవ్వలేదు..అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిద్దాం’’ అని స్పష్టం చేశారు. ఈ ఒక్క వ్యాఖ్యతో జిల్లాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గత 256 రోజులుగా ఎండా,వానా తేడా లేకుండా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన ర్యాలీలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదోని జిల్లా డిమాండ్ను సజీవంగా ఉంచిన ఉద్యమానికి ఈ వ్యాఖ్యలు పెద్ద ఎదురు దెబ్బగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో మద్దతు.. అధికారంలోకి వచ్చాక భిన్న స్వరం జిల్లా సాధన ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి అప్పటి టీడీపీ నాయకులు పలుమార్లు ఉద్యమ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. ఉద్యమకారులతో కలిసి ధర్నాల్లో పాల్గొనడంతోపాటు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఇచ్చిన రాజకీయ మద్దతు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కనిపించడం లేదని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం కొనసాగుతుందా.. ముగుస్తుందా? లోకేష్ వ్యాఖ్యల తర్వాత జిల్లా సాధన సమితి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలా? లేక ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరపాలా? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఉద్యమకారులు. ఇదిలా ఉండగా.. ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా? అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం
● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కర్నూలు: మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవా సదన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణా గురించి అనేక విషయాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం జులై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యూఎన్ఓడీసీ సంస్థ ఈ సంవత్సరం మానవ అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృత నేరం – దోపిడీని అంతమొందిస్తాం.. అనే నినాదాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి చట్టాలను బలోపేతం చేయడం, అవగాహన పెంచుకోవడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరచడం వంటి చర్యలను తీసుకోవాలని తెలిపారు. అనంతరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. డీసీపీఓ శారద, చైల్డ్ వెల్ఫేర్ సభ్యుడు సుధాకర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శివరామచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్, ఎస్ఆర్ఈడీఎన్జీఓ సుధాకర్ రెడ్డి, పోలీసులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, ఎన్జీఓలు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్య
కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ రామ్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. కొత్తమాడుగుల గ్రామానికి చెందిన ఈడిగ బాలస్వామి గౌడ్(50)కు రెండు ఎకరాల పొలం ఉంది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. గత రెండేళ్లుగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకోసం బాలస్వామి గౌడు ఇతరుల వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు భారంతో మానసికంగా కుంగిపోయి తీవ్ర భయాందోళన చెందాడు. ఈ క్రమంలో ఈనెల నెల 28వ తేదీన తాను కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు బాలస్వామి గౌడ్ను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతిచెందాడు. మృతుడి కొడుకు విక్రమ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. దైవదర్శనానికి వెళ్తూ ..సి.బెళగల్: దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సి.బెళగల్ చెందిన రాజు నూతన బొలెరో ట్యాలీ ఆటో కొనుగోలు చేసి బుధవారం మిత్రులు, పరిచయస్తులతో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు శ్రీశైలానికి వెళ్లారు. అయితే దోర్నాల మండలం మెట్లమల్లికార్జునపురం గ్రామం దగ్గర ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు, సి.బెళగల్ వాసులు ప్రయాణిస్తున్న బొలెరో ట్యాలీ ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో తెలుగు గోవిందు (48) అక్కడికికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించి వైద్యం చేయించారు. తెలుగు గోవిందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి గురువారం సి.బెళగల్కు తీసుకవచ్చారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
సరుకుల వివరాలు రాస్తే ఒట్టు
ఆలూరు: రేషన్ షాపులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకులు వివరాలు నోటీస్ బోర్డులో ఉండాలి. అయితే ఆలూరు పట్టణంలోని ఎల్లార్తి రోడ్డు సమీపంలో ఉన్న సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్లో ఇవి కనిపించడం లేదు. వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని గతంలో గోదాం డిప్యూటీ తహసీల్దార్ను పత్తికొండ ఆర్డీఓ చిన్న ఓబులేసు ఆదేశించారు. నెలరోజులు గడిచినా ఎలాంటి మార్పు రాలేదు. కరువు జిల్లాగా ప్రకటించాలి కర్నూలు(సెంట్రల్): ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు నాలుగు బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి, వేరుశనగ, కంది, జొన్న, సజ్జ తదితర పంటలన్నీ నష్టపోయినట్లు చెప్పారు. -
పశుగ్రాసానికి పనికి వచ్చే పంటలేవీ?
డోన్ సంతకు భారీగా వచ్చిన పశువులుకర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో తీవ్రత మూగజీవులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఒకవైపు పశుగ్రాసం కొరత, మరోవైపు నీటి కరువుతో రైతులకు పశుపోషణ పెనుభారంగా మారింది. వానాకాలం మొదలై రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకోలేదు. సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయాయి. లక్షలాది ఎకరాల్లో విత్తనం కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. ఏడాది పొడవునా ఇదే పరిస్థితులు ఉంటే పశువులను ఎలా పోషించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు లెక్కలు జిల్లాలో తెల్ల, నల్లజాతి పశువులు 3.40 లక్షలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు 18 లక్షలు ఉన్నాయి. ఆవు/ ఎద్దును ఒక యూనిట్గా తీసుకుంటారు. గేదెను ఒకటిన్నర యూనిట్గా పరిగణిస్తారు. ఒక దూడను 0.6 యూనిట్, ఐదు గొర్రెలు/ మేకలను ఒక యూనిట్గా వ్యవహరిస్తారు. వీటిని లైవ్స్టాక్ యూనిట్లుగా పేర్కొంటారు. ఇటువంటి యూనిట్లు ఏడు లక్షలు ఉన్నాయి. జాతి పశువులకు రోజుకు 30 కిలోల పచ్చి మేత, 7–8 కిలోల ఎండమేత అవసరం. నాటు పశువులకు 15 కిలోల పచ్చిమేత, 5–6 కిలోల ఎండుమేత అవసరం. పశుసంవర్ధక శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పశుగ్రాసం కొరత లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒకవైపు మేత, మరోవైపు నీటి సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సెప్టెంబరు నెల చివరి వరకు జిల్లాకు 3.50 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే 3.31 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందని చెబుతున్నారు. 19 వేల టన్నుల వరకు పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని, దీనిని నివారించేందుకు పశుగ్రాసం సాగుకు 75 శాతం సబ్సిడీపై గడివిత్తనాలు, 50 శాతం సబ్సిడీపై దాణా సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. 26 టన్నుల గడ్డి విత్తనాలు, 946 టన్నుల దాణా సరఫరా చేస్తుండటం వల్ల పశుగ్రాసం కొరత నుంచి బయట పడుతున్నామని కాకి లెక్కలు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పశుగ్రాసం కొరత కనిపిస్తోంది. నీటి తొట్లు ఉన్నా.. లేనట్లే! వర్షాలు లేకపోవడంతో చెరువులు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పరి, ఆలూరు, పెద్దకడబూరు, పత్తికొండ, ఆదోని తదితర మండలాల్లో 20 రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. పశువులు దాహార్తి తీర్చేందుకు ‘ఉపాధి’ నిధులతో 423 నీటితొట్లు నిర్మించారు. ప్రజలకు మంచినీరు ఇవ్వడమే కష్టమైన పరిస్థితుల్లో తొట్లకు నీటిని నింపడం కష్టంగా మారింది. మామూలుగా అయితే గ్రామ పంచాయతీలు తొట్లను నీటితో నింపాల్సి ఉంది. కాలువలకు నీరు రాకపోవడం, చెరువులు, కుంటలు ఎండిపోవడం.. సమస్య తీవ్రం కావడంతో తొట్లను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రధానంగా జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి తొట్లు ఉన్నా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పడిపోయిన పాల ఉత్పత్తి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్ పాలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాకు 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పశుగ్రాసం, నీటి కొరత ఏర్పడంతో పాల ఉత్పత్తి రోజురోజుకు పడిపోతోంది. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 8.58 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 7.2 లక్షల లీటర్ల వరకు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మాకు పది ఎకరాల పొలం ఉంది. అందులో ఏడు ఎకరాల్లో కంది, సజ్జ, మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. వరుసగా నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాకు రెండు ఎద్దులు, ఆరు బర్రెలు, మూడు దూడలు ఉన్నాయి. వీటికి మేత కోసం ట్రాక్టరు వేరుశనగ పొట్టు రూ.30 వేలకు కొనుగోలు చేశాం. ఇంటికి చేరేందుకు రూ.40 వేల వరకు ఖర్చు వస్తోంది. అది కూడా 45 రోజులకు సరిపోతుంది. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం చొరువ తీసుకొని రైతులకు పశుగ్రాసం సరఫరా చేయాలి. – ఎం.ప్రహ్లాదరెడ్డి, తుగ్గలికొన్నేళ్లుగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, ఉల్లి, శనగ పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పశుగ్రాసానికి పనికి వచ్చే వేరుశనగ, కొర్ర, జొన్న పంటలే ఎక్కువగా సాగు చేసేవారు. అప్పట్లో కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ పశుగ్రాసానికి ఇబ్బందిగా ఉండేది కాదు. ఇప్పుడు పండించే పంటలు పశుగ్రాసానికి పనికి రావు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 3.02 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 2.17 లక్షల హెక్టార్లలో, మిగిలిన పంటలన్నీ 85 వేల హెక్టార్లలో ఉన్నాయి. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో ఎల్నినో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పశుపోషణ ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారంగా మారిన పశుపోషణ చెరువులు, కుంటల్లో కనిపించని నీరు దొరకని పశుగ్రాసం సంతల్లో పశువులను అమ్మేస్తున్న రైతులు -
సేవలకు దూరమై.. లక్ష్యం ధ్వంసమై!
ప్రజలకు ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలందించాల్సిన గ్రామ సచివాలయం దుండగుల చేతిలో ధ్వంసమైంది. సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం ఈ భవనాన్ని నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోలేదు. నిరుపయోగంగా ఉన్న ఈ భవన తలుపులను, అద్దాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా కిటికీలను పెకళించి తీసుకెళ్లారు. ర్యాంప్ రోలింగ్ పైపును సైతం కొంతమేర అపహరించారు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – సి.బెళగల్ -
వరిగడ్డికి పెరిగిన డిమాండ్
ఎల్నినో నేపథ్యంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో వరిగడ్డికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, క్రిష్ణగిరి, దేవనకొండ, ఆదోని, ఆస్పరి, కోడుమూరు, గూడూరు, సీ బెళగల్ తదితర మండలాల రైతులు వరిగడ్డిని సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. గత ఏడాది ట్రాక్టరు వరిగడ్డికి రూ.10 వేల వరకు ధర లభించింది. ఈ సారి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పెరిగిపోయాయి. ఎల్నినో ప్రభావంతో పశుపోషణ భారం కావడంతో రైతులు పశువులను సంతకు తరలిస్తున్నారు. ప్రతి గురువారం డోన్తో సంత జరుగుతుంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది డోన్ సంతకు 15 నుంచి 20 శాతం వరకు పశువులు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. -
బైకును ఢీకొన్న ఐచర్.. ఇద్దరి దుర్మరణం
తాడిపత్రి రూరల్: బైకును ఐచర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా కొలమిగుండ్ల మండలం బందార్లపల్లికి చెందిన అన్నదమ్ములు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి (35), సమీప బంధువు రాజేంద్ర (40)లు బండల గనిలో కూలీలుగా పనిచేసేవారు. కొన్ని రోజులుగా పెద్ద దస్తగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గనిలో పని చేసి ఇంటికి వచ్చిన అతనికి అకస్మాత్తుగా బీపీ పడిపోయింది. దీంతో చిన్న దస్తగిరి, రాజేంద్రలు కలిసి పెద్ద దస్తగిరిని బైకులో ఎక్కించుకుని వైద్యం కోసం తాడిపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గల పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు దెబ్బతినడంతో బైకును చిన్నగా పోనిస్తుండగా ఓ ఐచర్ వాహనం వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన రాజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చిన్న దస్తగిరి, పెద్ద దస్తగిరిని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్న దస్తగిరి మృతి చెందాడు. రాజేంద్రకు భార్య అలివేలితో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్న దస్తగిరికి భార్య కవితతో పాటు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐచర్ డ్రైవర్ రఘురాముడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు. -
దాతల విరాళం.. దేవస్థానం నిర్లక్ష్యం!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలువురు దాతలు ఆరు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేశారు. ప్రస్తుతం వాటిలో ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. మిగతా వాహనాలు మరమ్మతులకు గురై వర్క్షాప్కు చేరాయి. దీంతో క్షేత్రానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు విరాళంగా అందించిన బ్యాటరీ వాహనాలను నడపకుండా దేవస్థానం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుడటంపై పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల కరుణా కటాక్షాల కోసం అనునిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. పర్వదినాల్లో, ముఖ్యమైన రోజుల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. అయితే క్షేత్ర భద్రతా చర్యల్లో భాగంగా భక్తులు బస చేసిన వసతి గదుల నుంచి తమ వాహనాల్లో కొంత దూరం వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను క్యూలైన్ల వద్దకు చేర్చేందుకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం ఉచిత బ్యాటరీ వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గత దేవస్థాన పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కనకదుర్గ–1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–1, యూనియన్ బ్యాంక్–2, తాడేపల్లికి చెందిన దాత–1, మరో దాత–1 ఇలా ఆరు బ్యాటరీ వాహనాలు దేవస్థానానికి సమకూరాయి. నంది సర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్, శీఘ్ర, అతిశీఘ్ర క్యూలైన్, ఆర్జిత సేవల క్యూలైన్, అన్నదాన భవనం, లడ్డూ కౌంటర్, దర్శనం అనంతరం నంది సర్కిల్ వరకు ఆరు బ్యాటరీ వాహనాలతో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవ కొనసాగుతుంది. వాహన డ్రైవర్లు భక్తులకు ఉచిత ప్రయాణ సేవ గురించి అవగాహన కల్పిస్తూ వారు వెళ్లాల్సిన ప్రాంతాలకు వాహనంలో చేర్చేవారు. మూలనపడిన బ్యాటరీ వాహనాలు శ్రీశైల దేవస్థానంలో ఆరు బ్యాటరీ వాహనాలు ఉండగా ప్రస్తుతం ఒక్క వాహనం మాత్రమే నడుస్తోంది. మిగతా ఐదు వాహనాలు వర్క్షాప్లో మూలనపడ్డాయి. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో బ్యాటరీ వాహనాలు మరమ్మతులకు గురై వర్క్షాప్కు చేరినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎంతగానో ఉపయోగపడే బ్యాటరీ వాహనాలు దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్లనే పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా దేవస్థాన అధికారులు స్పందించి వెంటనే బ్యాటరీ వాహనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తేవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. శ్రీశైల దేవస్థానానికి ఉచితంగా బ్యాటరీ వాహనాలు అందించిన దాతలు అధికారుల నిర్లక్ష్యంతో పనిచేయని బ్యాటరీ వాహనాలు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగ భక్తులు -
మహానందిలో వరుణయాగం
● నేడు సహస్ర ఘటాభిషేకంమహానంది: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కాంక్షిస్తూ మహానంది క్షేత్రంలో గురువారం వరుణయాగం పూజలు నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, అర్చకులు, రుత్వికుల బృందం పూజలు చేశారు. ముందుగా గణపతిపూజతో ప్రారంభించి త్రయాహ్నిక వరుణయాగం పూజలు జరిపారు. ఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి వర్షాలు కురవాలని కాంక్షిస్తూ పూజలు జరిపామన్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం పూజలను వేదమంత్రాలతో వరుణదేవుని ఆరాధన చేసి వర్షాలు కరువాలని, భూమికి జలసంపద, పాడిపంటలకు రక్షణ, ప్రజలకు శ్రేయస్సు కలగాలని శాస్త్రోక్తంగా పూజలు చేస్తామని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠ్వేర రాజు, పి. సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆలయాలు, గ్రంథాలయాలనూ వదల్లేదు!
కర్నూలు(అగ్రికల్చర్): అంతా వారిష్టం.. మార్గదర్శకాలు పట్టించుకోరు.. వివిధ రూపాల్లో నిధులు దుర్వినియోగం చేస్తారు. టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ బాగోతం సాగుతోంది. స్టేట్ ఆడిట్(లోకల్ ఫండ్) అధికారుల తనఖీల్లో వారి అక్రమాలు బహిర్గతం అయ్యాయి. స్థానిక సంస్థలు, దేవాలయాలు, గంథ్రాలయాలు, యూనివర్సిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు తదితర వాటికి వచ్చిన నిధులు, వాటి వినియోగంపై స్టేట్ అడిట్ అధికారులు ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తారు. ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు, ఖర్చులపై ఆడిట్ జరుగుతోంది. అక్రమాలు ఇవీ.. చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరం నిర్వహించిన ఆడిట్లో నిధుల వినియోగానికి సంబంధించి 18,799 అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం రూ.38.13 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి రూ.77.30 కోట్లు దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించి 2,413 ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. నిబంధనలు ఉల్లంఘించి రూ. 23.34 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అలాగే రూ.21.21 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను చూపలేదు. ఇదిలా ఉండగా ఎంపీ నిధులకు సంబంధించి రూ.181 కోట్లు, రాయలసీమ యూనివర్సిటీ నిధుల్లో రూ.51.15 కోట్లు దుర్వినియోగం అయినట్లు వెల్లడైంది. దేవాలయాల్లో ఏకంగా రూ.799 కోట్లు ఆడ్డుగోలుగా వినియోగించినట్లు సమాచారం. చర్యలు శూన్యం నిధుల వినియోగానికి సంబంధించి అనేక లొసుగులు వెల్లడైనప్పటికీ, రూ.కోట్లు దుర్వినియోగం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వేలాది ఆడిట్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్కు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత చూపుతోంది. ఆడిట్ అభ్యంతరాలు, సర్చార్జ్ సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోయింది. ఆడిట్ అభ్యంతరాలు గుట్టల కొలది పేరుకపోయి ఉన్నప్పటికీ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు, యూనివర్సిటీలకు, గంథ్రాలయాలకు నిధుల విడుదల ఆగడం లేదు. దీంతో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ నిధుల దుర్వినియోగం రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రూ.368.28 కోట్ల దుర్వినియోగం అయినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి 25,827 అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. 2014–15 సంవత్సరానికి సంబంధించే రూ.45.03 కోట్ల నిధుల దుర్వినియోగానికి 7,352 ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే 2018–19లో రూ.98.15 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఇందుకు సంబందించి 2,463 అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క నిధులు కొల్లగొట్టినట్లు ఆడిట్లో అక్రమాలు వెలుగు చూశాయి. సాధారణంగా ప్రతి ఏటా ఆడిట్ పూర్తి చేసిన తర్వాత సేట్ ఆడిట్ జిల్లా అధికారులు నివేదికను స్టేట్ ఆడిట్ డైరెక్టర్కు పంపుతారు. అక్కడి నుంచి ఆడిట్ అభ్యంతరాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నివేదిక ఆయా శాఖల హెచ్వోడీలకు వెళ్తుంది. అక్కడి నుంచి చర్యలు మొదలు కావాలి. కాని ఆడిట్ నివేదికలు హెచ్ఓడీల దగ్గర మరుగున పడిపోతున్నాయి. వివిధ పనుల్లో అడ్డుగోలుగా నిధులు స్వాహా స్టేట్ ఆడిట్ నివేదికలో అక్రమాల నిర్ధారణ నాటి టీడీపీ పాలనలో రూ.368 కోట్ల దుర్వినియోగం 2024–25లో 18,799 అభ్యంతరాలు ఈ ఏడాది ఇంకా ఎన్నెన్నో! -
టీ66ఎఫ్ పెద్దపులికి పోస్ట్మార్టం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం బీట్లో బుధవారం కనిపించిన పులి కళేబరానికి గురువారం పోస్ట్మార్టం నిర్వహించారు. డీకంపోజ్ దశలో ఉన్న కళేబరానికి చనిపోయిన చోటే శవపరీక్షలు నిర్వహించి దహనం చేశారు. పులి శరీరంపై గాయాలుండడంతో టెరిటోరియల్ ఫైట్ (వాసం కోసం పోరాటం)లో డామినేటెడ్ మేల్ టైగర్ చేత గాయపడి మరణించి ఉండవచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి 9 సంవత్సరాల వయసు కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ఎన్టీసీఏ గైడ్ లైన్స్ పరిధిలో పూర్తి చేశామన్నారు. రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి రైలు కింద పడి శివరాజ్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామ య్య తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన పాండవగల్లు ఎల్లప్ప అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అతని కుమారుడు శివరాజ్ తాగుడుకు అలవాటు పడ్డాడు. తన అక్క కూతురిని ప్రేమించానని, పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. మద్యానికి బానిసైన శివరాజ్కు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం లేక వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో మనస్తాపం చెందిన శివరాజ్ బుధవారం రాత్రి ఇస్వి–కుప్పగల్ ఆర్ఎస్ల మధ్యన రైలు కింద పడి మృతిచెందాడు. గూడ్స్ రైలు లోకో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని తల్లి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని యువకుడి మృతి బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణ సమీపంలో అవుకు రోడ్డులో జీఎంఆర్ వేర్ హౌస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండ పేటకు చెందిన చాకలి బాలసుబ్బన్న, జయ మ్మ దంపతుల కుమారుడు సుధాకర్ (28) గురువారం ఇంటి నుంచి గేదెలను మేపుకునేందుకు అవుకు రోడ్డు వైపు ఉన్న పొలాల వైపు బయల్దేరాడు. జీఎంఆర్ వేర్హౌస్ వద్ద వెయింగ్ వేబ్రిడ్జి వద్ద ఉన్న లారీని డ్రైవర్ రివర్స్ చేస్తుండగా అక్కడే ఉన్న సుధాకర్ను ఢీకొంది. లారీ టైరు అతనిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బనగానపల్లె టౌన్ ఇన్చార్జ్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య డోన్ టౌన్: స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రసూల్ (59) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్ఐ బింధు మాధవి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రసూల్ డోన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నారు. కాగా అనారోగ్యం కారణంతో ఈ నెల 27వ తేదీ నుంచి సెలవులో ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే డిప్యూటీ స్టేషన్ మాస్టర్ లాబాన్ విషయం తెలుసుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య రేష్మాకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్యతో పాటు తో ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ బింధు మాధవి తెలిపారు. కల్వర్టు గుంత చుట్టూ మట్టి కుప్ప! కల్లూరు: కర్నూలు నగరంలోని కృష్ణానగర్ రవీంద్ర స్కూల్ లైన్లో డ్రైనేజీ కాలువపై ఏర్పాటు చేసిన కల్వర్టు దెబ్బతిని గుంత ఏర్పడింది. గుంత చుట్టూ రక్షణగా మట్టి కుప్పను వేసి కానుగ ఆకులను ఉంచారు. ఈ రోడ్డుపై ద్విచక్ర, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. రాత్రి సమయంలో కల్వర్టుకు రక్షణగా ఏర్పాటు చేసిన మట్టి కుప్ప సరిగా కనిపించకపోతే వాహనాలు డ్రైనేజీ కాలువపై ఉన్న కల్వర్టు గుంతలో పడితే గాయాలకు గురికావాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మార్టిగేజ్ లేదా బదిలీ హక్కు ఇవ్వరాదు
సోలార్ పవర్ కోసం 5 ఎకరాల భూమిని తీసుకున్నారు. లీజు సమయంలో మార్టిగేజ్ లేదా ఇతర సంస్థలకు బదిలీ చేసే అవకాశం ఉందన్న నిబంధనను ఎవరూ చెప్పలేదు. ఈ నిబంధనను తొలగించకపోతే నష్టపోతాం. భవిష్యత్లో కంపెనీ నష్టాల బాటలో ఉంటే అది చేసిన అప్పులకు మా భూములను బ్యాంకులు వేలం వేస్తాయి. అప్పుడు మా పరిస్థితి ఏంటి. – బంగారు బజారప్ప, రైతు, జోహరాపురం, ఆస్పరి మండలం పత్తికొండ మండలం హోసూరులో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకోసం రైతుల నుంచి 29 సంవత్సరాల 11 నెలల కాలానికి భూములను లీజుకు తీసుకుంటూ ఒప్పందం చేసుకుంది. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు చెల్లిస్తారు. ఆ తరువాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అద్దెను 5 శాతం పెంచుతారు. రైతుల నుంచి తీసుకున్న పొలాలను మార్టిగేజ్ లేదా ఇతర సంస్థలకు బదలాయించే అధికారం కంపెనీకి ఉంటుంది. – నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు ● -
ముగ్గురు పిల్లల్లో ఒక్కరికీ దక్కని తల్లికి వందనం
● ఆటో డ్రైవర్కు ఐటీ రిటర్న్స్ చూపుతూ రిజెక్ట్కర్నూలు(సెంట్రల్): నగరంలోని పాతబస్తీలో నివాసం ఉంటున్న జావీద్బాషా ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే ఒక్కరికీ తల్లికి వందనం వర్తించకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. వృత్తిరీత్యా ఆటోకు సంబంధించిన ఈఎంఐలు, ఇంటి అద్దె, పొదుపు లోన్లను అతికష్టం మీద చెల్లిస్తున్నాడు. అయితే అతను ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారనే కారణంతో ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడికి తల్లికి వందనం వేయలేదు. గతేడాది కూడా ఇదే కారణంతో తల్లికి వందనాన్ని తిరస్కరించారు. అయితే అప్పట్లో తనకు ఎలాంటి ఐటీ రిటర్న్స్ లేవని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా తల్లికి వందనాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పన్ను చెల్లింపుదారుడని నమోదు చేయడంతో తన కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని జావీద్బాషా వాపోతున్నాడు. -
పత్తిలో యాజమాన్య పద్ధతులు పాటించాలి
నంద్యాల(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్, జూన్లో దాదాపు 2 లక్షల హెక్టార్లలో పత్తి సాగైందని ఆర్ఏఆర్ఎస్ పత్తి కీటక శాస్త్రవేత్త శివరామకృష్ణ తెలిపారు. ఏప్రిల్లో సాగు చేసిన పత్తి ప్రస్తుతం కాయ, పక్వ దశలో ఉందని, వీటిని గులాబీ పురుగు ఆశించిందన్నారు. ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఉంచి పురుగు ఉద్ధృతిని కనిపెట్టాలన్నారు. పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటిన వెంటనే ప్రొఫినోపాస్ 500 మి.లీ, ఫైరిడాలిల్ 750 మి.లీ ఎకరాకు లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలన్నారు. జూన్ నెలలో విత్తిన పత్తి బెట్టతో ఎండిపోయే దశలో ఉందన్నారు. పంటను కాపాడుకునేందుకు 19–19–19 పోషక మందును 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుతం అధిక గాలిలోని తేమ శాతం వల్ల పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుందని, దీని నివారణకు డైనేటో ఫ్యూరాన్, ఫ్లోనిక్ అమైడ్ మందును ఎకరానికి 60 గ్రాములు 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆగస్టు మొదటి వారం వరకు సరైన వర్షపాతం నమోదైతేనే పత్తి విత్తుకోవాలని, ప్రస్తుతం పత్తి విత్తుకొనే రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలన్నారు. పత్తిలో అంతర్పంటలుగా కంది, జొన్న, సోయాచిక్కుడును విత్తుకుంటే లాభాలు గడించవచ్చన్నారు. -
రైతులకు ‘షాక్’
● హోసూరు కేంద్రంగా టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు ● ఎకరాకు ఏడాదికి రూ.31వేల ప్రకారం 29 సంవత్సరాల 11 నెలలకు లీజు ● బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో మార్టిగేజ్కు కంపెనీకి హక్కులు ● అడ్వాన్సు చెల్లింపుల్లోనూ కంపెనీ ఇష్టారాజ్యం కర్నూలు(సెంట్రల్): పత్తికొండ మండలం హోసూరు కేంద్రంగా టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సోలార్ పవర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకోసం 2వేల ఎకరాలను లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. ఎకరాకు ఏడాదికి రూ.31 వేల ప్రకారం 29 సంవత్సరాల 11 నెలలపాటు లీజుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది. రెండు సంవత్సరాలకు ఒకసారి రైతులకు లీజు మొత్తంపై 5 శాతాన్ని అదనంగా చెల్లిస్తారు. ఈమేరకు ఇప్పటికే దాదాపు 1,500 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. మరో 500 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రైతులతో కంపెనీ చేసుకున్న ఒప్పందంలో ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. లీజు పేరిట తీసుకున్న భూములను కంపెనీ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో మార్టిగేజ్ లేదా ఇతర సంస్థలకు లీజును బదలాయించే అధికారం ఉండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని తమకు తెలియకుండా ఒప్పందం ఖరారు చేశారని వాపోతున్నారు. ఈ నిబంధన ప్రకారం బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో కంపెనీ లోన్ తీసుకొని చెల్లించకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటని, తమ భూములకు ఎవరు గ్యారంటీ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా భూములు ఇచ్చిన రైతులు మధ్యలో అమ్ముకోవాలంటే కంపెనీ అనుమతి తప్పనిసరి చేయడాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. గురువారం సోలార్ పవర్కు భూమి పూజ చేసేందుకు వస్తున్న మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో రైతులకు న్యాయం చేస్తారా? లేక కార్పొరేటు కంపెనీలకు అండగా నిలుస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో రైతుకు ఒక రకంగా అడ్వాన్సు చెల్లింపులు ఇప్పటికే టాటాపవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ పవర్ కోసం పత్తికొండ మండలంలోని హోసూరు, పెద్దహుల్తి, జోహరాపురం గ్రామాల రైతుల నుంచి దాదాపు 1,500 ఎకరాలు సేకరించింది. అయితే ఇందులో ఒక్కో రైతుకు ఒక రకంగా అడ్వాన్స్ చెల్లించింది. కొందరికి రెండు సంవత్సరాలు, మరికొందరికి 10 సంవత్సరాలు, ఇంకొందరికి 20 సంవత్సరాల అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఇందులో బ్యాంకుల్లో పొలాలను మార్టిగేజ్ చేసిన రైతులకు సంబంధించి 20 ఏళ్లకు అడ్వాన్స్ ఇచ్చింది. అయితే బ్యాంకుల్లో రైతులు తీసుకున్న మొత్తాలను చెల్లించి వారికి మిగిలిన అడ్వాన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో వారికి భవిష్యత్లో లీజు కింద తక్కువ ఆదాయం వస్తుంది. తద్వారా బాధిత రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకుల్లో ఉన్న క్రాప్ లోన్లను కూడా కంపెనీయే చెల్లించి మిగిలిన సొమ్మును పదేళ్లకు అడ్వాన్స్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో అప్పు లేని వారికి మాత్రం రెండేళ్ల అడ్వాన్స్లను చెల్లించింది. రైతుల డిమాండ్లు ఎకరాకు సంవత్సరానికి రూ.50 వేలు ఇవ్వాలి. ఏడాదికి 15 శాతం పెంచాలి. లీజ్ ఒప్పందంలో ఉన్న మార్టిగేజ్, లీజు హక్కులను ఇతరులకు బదిలీ చేసే నిబంధనలను పూర్తిగా తొలగించాలి. ప్రస్తుతం ఉన్న 29 సంవత్సరాల 11 నెలల లీజు కాలన్ని గరిష్టంగా 10 సంవత్సరాలకు పరిమితం చేయాలి. రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకేసారి 10 లేదా 20 సంవత్సరాల లీజు మొత్తం చెల్లించాలి. రైతు–కంపెనీ మధ్య జరిగే లీజు ఒప్పందాలకు ఆర్డీఓ లేదా కలెక్టర్ మధ్యవర్తిగా ఉండాలి. రైతుకు ఏదైనా వివాదం లేదా సమస్య వస్తే ఆ కేసుల విచారణ పత్తికొండ సివిల్ కోర్టు పరిధిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. -
హోంగార్డ్ అదృశ్యం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు ఈ నెల 22వ తేది నుంచి కనిపించడం లేదని ఆయన భార్య మంజుల 27వ తేదీన పాములపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ తిరుపాలు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆలస్యంగా తెలిసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 22న తన కుమారుడిని గుంటూరులో కాలేజీలో చేర్పించేందుకు నాగేశ్వరరావు వెళ్లాడు. అదేరోజు విజయవాడలోని దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నట్లు భార్యకు ఫోన్లో తెలిపాడు. తరువాత నుంచి ఆచూకీ లేదు. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో ఆయన భార్య మంజుల పోలీసులను ఆశ్రయించింది. పాములపాడు మండలం వేంపెంటకు చెందిన నాగేశ్వరరావు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టగా ఆయన విశాఖపట్నం లొకేషన్లో ఉన్నట్లు తెలిసింది. అక్కడ వెతికేందుకు వెళ్లినట్లు తెలిసింది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి దేవనకొండ: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన బోయ మునిరంగడు (35) సొంత ఊరిలో కరెంట్ మెకానిక్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. పొరుగు ఊరైన బుర్రకుంటలో బుధవారం పొలానికి విద్యుత్ మోటార్ బిగించే క్రమంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని దేవనకొండ ప్రాథమిక ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బనగానపల్లెలో చైన్స్నాచింగ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ సమీపంలోని కాలనీలో బుధవారం ఉదయం ఇంటి బయట నారాయణమ్మ అనే వృద్ధురాలు చెత్త ఉడ్చుతుండగా గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి ఆమె మెడలోని సుమారు రూ.4 లక్షల విలువైన మూడు తులాల బంగారు చైన్ను అపహరించారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తాను పనిలో ఉండగా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మెడలోని గొలుసును బలవంతంగా లాక్కున్నాడని, కొద్ది దూరంలో బైక్పై ఉన్న మరో వ్యక్తితో కలిసి ఇద్దరూ పరారయ్యారని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఇన్చార్జ్ సీఐ మంజునాథ్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిజాయితీ డోన్ టౌన్: ప్రయాణికురాలు తన ఆటోలో మరిచిపోయిన బ్యాగును వెంకటనాయునిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ మధు పట్టణ పోలీసులకు అందించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు.. కర్నూలుకు చెందిన పి.రాధ పాతపేట జెడ్పీ హైస్కూల్లో టీచరుగా విధులు నిర్వహిస్తోంది. బుధవారం డోన్ కొత్త బస్టాండ్ వద్ద ఆటో ఎక్కి పాతపేటలో దిగివెళ్లేటప్పుడు బ్యాగును ఆటోలో మరచిపోయారు. కొద్ది సేపటి తరువాత బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ మధు పట్టణ పోలీసుస్టేషన్లో అప్పజెప్పగా బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ప్రయాణికురాలు రాధగా గుర్తించారు. అలాగే బ్యాగులో ఏటీఎం కార్డులు, వెండి పట్టీలు, రూ.1500 నగదు ఉన్నాయి. సీఐ ఇంతియాజ్ బాషా ఆమెను పిలిపించి బ్యాగును అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మధు నిజాయితీని సీఐ అభినందించారు. ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు. కర్నూలు: మొబైల్ సిమ్కార్డులు ఉచితంగా ఇస్తామంటే నమ్మొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహుమతులు, ప్రభుత్వ పథకాలు, ఇతర ఆకర్షణీయ ఆఫర్ల పేరుతో కొందరు మోసగాళ్లు ప్రజల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. సిమ్ కార్డులను టెలికాం సంస్థల అధికారిక కార్యాలయాలు లేదా గుర్తింపు విక్రయ కేంద్రాల్లో మాత్రమే పొందాలన్నారు. ఉచిత సిమ్ కార్డులు జారీ చేస్తామని చెప్పే అపరిచిత వ్యక్తులు, ఏజెంట్లను నమ్మవద్దని, ఎక్కడ పడితే అక్కడ అనధికారిక వ్యక్తుల వద్ద సిమ్ కార్డులు కొనుగోలు చేయవద్దన్నారు. గోప్యమైన సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని హెచ్చరించారు. -
నిబంధనల పేరుతో అన్నదాతలకు మోసం
● ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి ● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపత్తికొండ: భూములు తీసుకుని అగ్రిమెంట్ చేసుకునే సమయంలో రైతులకు నిబంధనలు వివరించకుండా మోసం చేశారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. మోసపోయిన అన్నదాతలకు చంద్రబాబు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ కంపెనీ చేతిలో మోసపోయిన వైనంపై హోసూరు, పెద్దహుల్తి గ్రామాల రైతులు బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హోసూరు, పెద్దహుల్తి గ్రామాల్లో దాదాపు 700 మంది రైతుల నుంచి 1800 ఎకరాలు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం లీజుకు తీసుకుందన్నారు. అయితే లీజుకు సంబంధించిన విషయంపై రైతులతో అగ్రిమెంట్ చేసుకునే సమయంలో నిబంధనలను గోప్యతగా ఉంచి మోసం చేశారన్నారు. భూమిని 29 ఏళ్ల 11 నెలలు పాటు లీజ్కు తీసుకొని రైతులకు నగదు చెల్లింపు విషయంలో ఒక్కో రైతుకు ఒక రకంగా అడ్వాన్స్ చెల్లించారని తెలిపారు. కొంత మందికి రెండేళ్లకు నగదు చెల్లిస్తే మరికొందరికి పదేళ్ల లీజు మొత్తం చెల్లించి మోసం చేశారని మండిపడ్డారు. రైతులు ఇచ్చిన భూములను కంపెనీ అవసరాల కోసం కాకుండా వాటిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నట్లు తెలపడం దారుణమన్నారు. ఇలాగైతే భవిష్యత్లో భూములపై హక్కులు కోల్పోతామని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. గురువా రం హోసూరు గ్రామ పర్యటనకు వస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రైతులకు న్యాయం చే యాలని కోరారు. లేనిపక్షంలో రైతుల పక్షాన నిలిచి అందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకు లు శ్రీరంగడు, బాబుల్రెడ్డి, నారాయణ్దాస్, భా స్కర్నాయక్, బనగాని శ్రీనువాసులు, నరసింహాచారి, నాగరాజు, జిట్టా నాగేష్, కేశవరెడ్డి, శ్రీరాములు, నాగరాజు, కృష్ణారెడ్డి, రంగనాయక్, నాగిరెడ్డి, వాసుదేవనాయుడు, రవిరెడ్డి పాల్గొన్నారు. -
భార్యా పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం
● మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగు మందు తాగిన కుటుంబం పాములపాడు: మైక్రో ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక భార్య, భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. బుధవారం ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 28న రాత్రి నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన వడ్డె రామసుబ్బడు, భార్య మాధవి, 9వ తరగతి చదువుతున్న కూతురు జయతేజ, 7వ తరగతి చదువుతున్న అక్షయతో కలిసి మండలంలోని యర్రగూడూరు గ్రామంలో ఎల్లమ్మ ఆలయం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కర్నూలుకు వెళ్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. బండి లాక్కెళ్లారు – జీవనం కష్టంగా మారింది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఒడ్డె రామసుబ్బడు బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నా డు. ఫైనాన్స్ కంపెనీ వారికి 2 కంతులు బకాయి ఉండటంతో ఇటీవల వాహనాన్ని లాక్కెళ్లారు. అప్పటి నుంచి కుటుంబ జీవనాధారం కోల్పోయినట్లైంది. అప్పుల బాధ ఎక్కువైంది. ఫైనాన్స్ కంపెనీ వారి వేధింపులు ఎక్కువకావడం, అవమాన భారంతో మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబంతో సహా తనువు చాలించాలని నిర్ణయించుకొని నందికొట్కూరులో పురుగు మందు కొని తీసుకున్నారు. పాములపాడు మండలంలోని యర్రగూడూరు గ్రామం వద్దకు వచ్చి గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు బంధువులు తెలిపారు. -
నూతన పరిశోధనలపై దృష్టి పెట్టాలి
కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ఐటీడీఎం)లో బుధవారం డాక్టోరల్ కో లోక్వియం (పరిశోధన విద్యార్థుల సదస్సు) నిర్వ హించారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థల పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు. తమ పరిశోధనలను ప్రదర్శించడంతో పాటు, నిపుణుల సూచనలు పొందుతూ పరస్పర విద్యా, పరిశోధనా అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సులో వరంగల్ నీట్ ఆచార్యులు డాక్టర్ వై.శ్రీనివాసరావు మేధోసంపత్తి హక్కులు, పరిశోధనలో నైతిక అనుభవాలు అనే అంశంపై మలేషియాకు చెందిన ఆచార్యులు సి.వై టింగ్, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అండ్ కంప్యూటింగ్ అంశంపై ఎల్సేవియర్ పబ్లిషర్స్ సంస్థకు చెందిన పరిశోధన రైటర్ శివాలిక నాణ్యమైన శాసీ్త్రయ పరిశోధనా వ్యాసాల రచన, సరైన జర్నల్ ఎంపిక, వ్యాస నిర్మాణం, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రచురణకు అవసరమైన అంశాలను వివరించారు. అలాగే రీసెర్చ్ క్విజ్ పోటీలు నిర్వహించారు. పరిశోధనా ప్రదర్శనలను ఐఐటీ, నీట్, ట్రిపుల్ఐటీల నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ నిపుణుల బృందం మూల్యాంకనం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.50 వేల నగదు బహుమతి అందజేశారు. ట్రిపుల్ఐటీ డీఎం ఆచార్యులు కె.సత్యబాబు, రోహిత్కుమార్, దాస్ సయన్వయంతో సదస్సు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
● మరో ఐదుగురికి గాయాలు ● బాధితులను పరామర్శించిన కాటసాని రామిరెడ్డి కొలిమిగుండ్ల(అవుకు): అయ్యలూరు మెట్ట సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అవుకు పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త జక్కా మధుసూదనరావు (44) మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో విజయవాడకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వస్తున్న తరుణంలో నంద్యాల సమీపంలోని అయ్యలూరు మెట్ట వద్ద కారు ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదనరావు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్సీపీ అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబులరెడ్డి, నాయకులు దుగ్గిరెడ్డి రవీంద్రనాథరెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మధు మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కార్యకర్తలను పరామర్శించారు. -
‘తల్లికి వందనం’ నగదు కాజేసిన ఇద్దరి అరెస్ట్
కర్నూలు: తల్లికి వందనం పథకం నగదును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మోసపూరితంగా కాజేసిన ఇద్దరిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. కర్నూలు గడ్డా వీధి నివాసి షేక్ ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మోసానికి పాల్పడిన చిత్తారి వీధిలో నివాసముంటున్న నూకల ఉపేంద్ర, ఎయిర్టెల్ కంపెనీ ఉద్యోగి వీరారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉచితంగా ఎయిర్టెల్ సిమ్ కార్డులు ఇస్తామని చెప్పి లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు, ఐరిష్ స్కాన్, ఆధార్ వివరాలు సేకరించారు. తర్వాత లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరుతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డు తీసుకుని ‘తల్లికి వందనం’ పథకం సొమ్మును స్వాహా చేశారు. సీఐలు మారుతి శంకర్, పూల రామకృష్ణ, ప్రవీణ్కుమార్ రెడ్డి (సైబర్ సెల్ సీఐ), వారి సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కేసును 24 గంటల్లో ఛేదించారు. గడ్డా వీధి అలీషేర్ బాగ్, చిత్తారి వీధి, ఖడక్పుర ప్రాంతాలకు చెందిన దాదాపు 10 మంది మహిళలను ఇదే తరహాలో మోసగించినట్లు దర్యాప్తులో తేలింది. వారి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు లావాదేవీల వివరాలను పోలీసులు సేకరించారు. నగరంలోని వివిధ ఏటీఎం సెంటర్ల నుంచి రూ.5.80 లక్షలను నిందితులు విత్డ్రా చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 105 ఏటీఎం కార్డులు, రెండు సెల్ఫోన్లు, బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ డివైజ్తో పాటు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
కర్నూలు సిటీ: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రుఖియా బీ భర్త మహబూబ్ బాషా (48) బుధవారం ఉదయం తన స్వగృహంలో ఫ్యాన్కు పంచతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. గత ప్రభుత్వంలో మైనార్టీ కోటా కింద కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఆయన భార్యకు వరించింది. అలాగే మహబూబ్ బాషా డైరెక్టర్గా పని చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొదట్లో బాగానే సంపాదించారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో రెండు, మూడు చోట్ల వెంచర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో అప్పుల భారం పెరిగిపోయింది. అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించాలని ఒత్తిళ్లు పెరగడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఉన్న రెండు కార్లను అప్పులు ఇచ్చిన వారు తీసుకెళ్లిపోయారు. ఇటీవలే ఓ వ్యక్తికి ఇవ్వాల్సిన నగదుకు సంబంధించి ఒత్తిడి చేయడంతో బుధవారం డబ్బులు చెల్లిస్తానని పంచాయితీ చేసుకున్నారు. అయితే డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. పసుపుల గ్రామంలోని తన ఇంట్లో ఉదయం టిఫిన్ చేసి పైఅంతస్తులోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నారు. కొద్ది సమయం తరువాత భార్య వెళ్లగా భర్త ఉరేసుకుని ఉండటాన్ని చూసి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వచ్చి కిందకుదించారు. వెంటనే హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులు పసుపుల మహబూబ్ బాషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కూడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
చెంచులకు మల్లన్న స్పర్శ దర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం చెంచుగూడెంతో పాటు మార్కాపురం జిల్లా నుంచి 315 మంది, నంద్యాల – 120 మంది, పల్నాడు జిల్లా నుంచి 175 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్న స్పర్శ దర్శనం చేసుకున్నారు. చెంచులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శ దర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు భక్తులతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యురాలు గుల్లా గంగమ్మ పాల్గొన్నారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య డోన్ టౌన్: కుటుంబ సమస్యలతో మద్యానికి బానిసై పాతపేటకు చెందిన మడ్డి వెంకటేశ్వర్లు (48) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన మడ్డి వెంకటేశ్వర్లు, భార్య మడ్డి రాజమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారి ఒక్కగానొక్క కుమారుడు 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ దిగాలుతో రాజమ్మ పక్షవాతం భారిన పడటంతో వెంకటేశ్వర్లు మరింతగా కుంగిపోయి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఇంటికి రాగా గుర్తించిన భార్య కాలనీవాసుల సహాయంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
పైర్లకు జింకల బెడద
మద్దికెర: మేఘాలు తప్ప చినుకు రాలడం లేదు. పంటలు ఎండిపోతున్నాయని అల్లాడుతున్న అన్నదాతలకు జింకలు పొలాల్లో పడి పైర్లను నాశనం చేస్తూ ఇంకో సమస్యగా మారాయి. మండలంలోని మద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి, హంప, ఎడవలి తదితర గ్రామాల్లో పంటలకు జింకల బెడద ఎక్కువైందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సకాలంలో వానలు కురవకపోవడంతో, పడిన అరకొర వర్షాలకే వ్యయ ప్రయాసలకోర్చి కంది, పత్తి, ఆముదం, వేరుశనగ పంటలను లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేశారు. రోజూ పొలాల్లోకి వస్తున్న జింకల నుంచి పంటలను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడు వర్షాలు లేకపోవడంతో పంటలు వాడుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రోజు కూలి ఇచ్చి పంటలకు వ్యక్తులను కాపలా ఉంచుతున్నామని, అయినా జింకలు పడి నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా జింకల బెడద నుంచి పైర్లను కాపాడాలని అధికారులను కోరుతున్నారు. -
కరుగుతున్న కొండ
● యథేచ్ఛగా టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ● కనుమరుగవనున్న వెల్దుర్తి వీరన్న గట్టు కొండ ● పట్టణానికి, చెరువుకు, ఆయకట్టుకు ముప్పు వెల్దుర్తి: వెల్దుర్తి వీరన్నగట్టు కొండ కనుమరుగవుతోంది. అటవీ శాఖ పరిధిలోని వీరన్న గట్టు చెరువు పట్టణానికి, ఆయకట్టు పొలాలకు మధ్యలో కొండంత అండగా ఉంది. రెవెన్యూ శాఖ పరిధిలోని వీరన్న గట్టు కొండ ఎన్నో ఏళ్లుగా ఎలాంటి వైపరీత్యాలకై నా నేనున్నానని అండగా నిలబడి ఉండేది. ప్రస్తుతం కొందరు దురాక్రమణదారుల దెబ్బకు కరిగిపోతోంది. గత తెలుగుదేశం పాలనలో, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ నాయకులు కొండను తవ్వి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. దీంతో ఈ కొండపై వెలసిన శివాలయం, దర్గా, శిలువ ప్రాంతాలను చేరుకునేందుకు అక్రమార్కులకు ఇంకా ఎంతో కాలం పట్టకపోవచ్చు. అక్రమ మైనింగ్తో వారికి లాభాల పంట పండొచ్చు గానీ వెల్దుర్తి పట్టణం వరద ముంపునకు, ఆనుకుని ఉన్న చెరువు గండికి, ఆయకట్టు కనుమరుగుకు అవకాశాలున్నాయి. ఊరెలా పోతే మాకేమి అన్న రీతిలో పాలకులు, నాయకులు వివిధ పథకాల రోడ్డు పనులకు, ప్రభుత్వ పనులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీరన్నగట్టు కొండ ప్రాంతం నుంచి అక్రమంగా గ్రావెల్ను యంత్రాలతో తోడుతూ తరలించడం అలవాటు చేసుకున్నారు. గమనించాల్సిన రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకున్నారు. గతంలోనే ఈ ప్రాంతంలో ఐరన్ ఓర్ అక్రమ మైనింగ్ జరిగి కొండ ప్రాంతం కొంత కరిగిపోయింది. కొందరు నాయకులు ఈ ప్రాంతంలో ప్రభుత్వం నుంచి భూమిని పొంది తమ అనుయాయులకు ఇళ్ల నిర్మాణాలకు పట్టాలిప్పిస్తామని అమ్ముకున్నారు. ఆక్రమణలతోనే ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకొందరు ఈ కొండ ప్రాంతంలో భూమిని దున్నుకుని పంటలు పండించే నెపంతో గ్రావెల్ తవ్వుకుని అమ్ముకుంటున్నారు. వీటన్నిటి ఫలితంగా రాబోవు రోజుల్లో ఈ కొండ కరిగిపోయి ఇటు వెల్దుర్తి ప్రజలకు వరదల ముప్పుతోపాటు, అటు వీరన్న గట్టు చెరువుకు గండ్లు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా చెరువు సమీపంలోని రైల్వే లైనుకు ముప్పు తప్పదు. కొండపైన, కింద వెలసిన వివిధ మతాల గుళ్లు, దర్గాలు సైతం కనుమరుగయ్యే అవకాశం ఉంది. విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురవుతున్నా సంబంధిత అధికారులు పట్టనట్టు ఉంటుండడంతో అక్రమ మైనింగ్ దారులకు వీరన్న గట్టు ప్రాంతం వరమైంది. ఇప్పటికై నా అధికారులు భావి తరాల ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీరన్నగట్టు కొండ నుంచి గ్రావెల్, ఎలాంటి ఖనిజాలు తరలించకుండా, తవ్వకాలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కొండ చుట్టూ ఫెన్సింగ్, పైకి దారి, చెట్ల పెంపకంతో అభివృద్ధి చేసి భూ సమతుల్యతను, ప్రకృతి వనరులను, పట్టణాన్ని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
బతుకుదెరువుకు వచ్చి మృత్యువాత
● బైక్ను ఐచర్ లారీ ఢీకొట్టడంతో యువకుడి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలు మంత్రాలయం రూరల్: బతుకుదెరువు కోసం వెళుళూ ఆస్పరికి చెందిన యువకుడు చాకలి రాఘవ (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కల్లుదేవకుంట సమీపంలో ప్రాథమిక ఆరోగ్య శాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ అంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. ఆస్పరి నుంచి చాకలి రాఘవ, మాల లాలప్ప సెంట్రింగ్ పనుల కోసం స్కూటర్ (ఏపీ 39 ఎఫ్సీ 0520)పై మంత్రాలయంకు బయలుదేరారు. మంత్రాలయం వైపు నుంచి వస్తున్న కర్ణాటకకు చెందిన ఐచర్ (కేఏ 09 ఏఏ 4672) లారీ అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో చాకలి రాఘవ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న లాలప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ వెల్లడించారు. -
కామేశ్వరీ దేవికి శాకంబరీ ఉత్సవం
మహానంది: మహానంది క్షేత్రంలో గురుపౌర్ణమి సందర్భంగా కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఆలయ అర్చకులు మణికంఠశర్మ, ఏఈఓ ఎరమల మధు, అర్చకులు పుల్లూరు హరికుమారశర్మ, ధర్మతేజ ఉదయం నుంచి విశేష పూజలు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన మార్కెట్ శ్రీకాంత్ బృందం, కర్నూలు మార్కెట్ నుంచి గిరిధర బృందం వారు సుమారు రెండు వేల కిలోల అన్ని రకాల కూరగాయలను అలంకరణ నిమిత్తం అందించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సతీష్కుమార్
కర్నూలు(అర్బన్): ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్ సతీష్కుమార్, జీ ధనిబాబు, ఉపాధ్యక్షులుగా ఎం శేషయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన ఈ నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ ఇటీవలే ఈఈలుగా పదోన్నతి పొంది ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈఈలుగా పదోన్నతిపై వెళ్తున్న వారి స్థానంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్ ఈఈ శివనాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వీవీ మురళీక్రిష్ణనాయుడు, జిల్లా గౌరవాధ్యక్షులు వీ రవీంద్రరెడ్డి, డీఈఈలు కర్రెన్న, నాగరాజు, ఏఈఈఈలు జ్యోత్స్న, అమర్నాథ్, మురళీ, రాఘవేంద్ర, మంజుల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్కుమార్, ధనిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ను జిల్లాలో బలోపేతం చేస్తామన్నారు. -
వారానికో వేట .. సుదీర్ఘ నిద్ర
● నల్లమల రారాజు పెద్దపులి ● సంతానోత్పత్తిపై ఆడపులికి స్పష్టమైన అవగాహన ● 2024 – 25 లెక్కల ప్రకారం ఎన్ఎస్టీఆర్లో 87 పులులు ● నేడు అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం సంతానం సంరక్షణ బాధ్యత ఆడపులిదే పర్యావరణ సంరక్షణలో పెద్ద పులికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. కాగా పెద్దపులి అంతరించే దశ నుంచి క్రమేపీ ఎదుగుతున్న క్రమంలో ప్రధాన బాధ్యత వహిస్తున్న ఆడపులికి పునరుత్పత్తి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. తన సంతానం బలంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్ష ఆడపులిలో కచ్చితంగా ఉంటుంది. ఒక మగ పెద్దపులి 400 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని తన నివాస ప్రాంతంగా (టెరటరీ) ప్రకటించుకుంటుంది. ఆ ప్రాంతంలో సుమారు 6 ఆడపులులు కూడా తమ టెరటరీని నిర్ణయించుకుంటాయి. గర్భం ధరించడానికి మగ పులితో జత కట్టడానికి ఈ ఆడపులుల మధ్య కూడా పోటీ ఉంటుంది. ఇందుకోసం అవి కూడా ప్రాణాంతక దాడులు చేసుకుంటాయి. పులి ఒక కాన్పులో సాధారణంగా 2 నుంచి 4 కూనలకు జన్మనిస్తుంది. అరుదుగా 7 వరకు కూడా ఉండవచ్చు. రేచులు (అడవికుక్కలు) పులికూనల పాలిట ప్రధాన శత్రువులుగా ఉంటాయి. వాటి నుంచి కూడా ఆడ పులి తన కూనలను రక్షించుకోవాల్సింటుంది. తన పిల్లల సంరక్షణ బాధ్యతను గుర్తెరిగి తన కూనలు పెరిగి వేటకు సిద్ధమయ్యే వరకు అవి తిరిగి గర్భం దాల్చవు. ఆడపులి తొలి సంతానంలో పుట్టిన పిల్లలు సహజంగా అన్ని బతకవు, రెండోసారి గర్భంలో 50 శాతం, ఆపై జన్మించిన కూనల్లో 90 శాతం బతుకుతాయి. ఇదంతా ఆడపులి పిల్లలను కాపాడుకునే నైపుణ్య సాధించడంలో భాగంగానే జరుగుతుంది. స్థానం కోసం పోరాటం.. మగ పెద్దపులి తను ఒక టెరిటరీని రక్షించుకోవడంలో ఇతర పులులతో నిరంతరం పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ పోరాటంలో ఓడిపోతే మరణం తప్పదు... లేదంటి తన స్థానం గెలిచిన పులికి అప్పగించి మౌనంగా మరో చోటుకు వెళ్లాల్సిందే. ఇటీవల ఒక పెద్దపులి తెలంగాణాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో తన స్థావరం వీడి పోయి కృష్ణా నదిని దాటి రాజీవ్ గాంధీ అభయారణ్యం (ఎన్ఎస్టీఆర్)లోకి వచ్చింది. అక్కడ దానికి చోటు లభించక పోవడంతో మెల్లగా గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యంలోకి వచ్చింది. అక్కడ స్థిర పడక పోతే లంక మలకు వెళ్లాల్సిందే మొదటి రోజు రక్తం.. రెండో రోజు గుండె, కాలేయం.. పెద్దపులికి అంత సులభంగా ఆహారం లభించదు. అడవిలో పెద్దపులికంటే మిగతా ఆహార జంతువులన్నీ కూడా వేగంగా పరిగెత్తుతాయి. అందుకే పెద్దపులికి ఐదారు ప్రయత్నాలకు ఒకసారి మాత్రమే ఫలితం దక్కుతుంది. ఇది సరాసరి 7 రోజులకో వేటగా ఉంటుంది. పెద్దపులి తన ఆహారాన్ని తీసుకోవడంలో క్రమ పద్ధతిని పాటిస్తుంది. తొలుత ఆహార జంతువు మెడను కొరికి చంపే పులి మొదట రక్తాన్ని స్వీకరిస్తుంది. అందుకే రక్తం ఎక్కువగా లభించే ఉదర ప్రాంతంపై కొరికి రక్తంతో కూడిన మాంసాన్ని తీసుకుంటుంది. రెండవ రోజు సున్నితమైన అవయవాలైన కాలేయం, గుండే, ఉపిరి తిత్తులను తింటుంది. మూడో రోజు జంతువు కటి భాగంలోని మాంసాన్ని నాలుగోరోజు తొడ మాంసాన్ని తింటుంది. ఆపై మొత్తం మాంసం మెత్తబడి పోతుంది కాబట్టి రెండుమూడు రోజులలో తన వేట మాంసం ఆసాంతం తినేస్తుంది. పులి వేట ఎంత కష్టతరమో వేట మాంసాన్ని వారం రోజులు కాపాడుకోవడం కూడా అంతే కష్టం. చిరుత పులులు చెట్లపై చంపిన జంతువును దాచుకుంటాయి. కాని పులి చెట్టు ఎక్కలేదు కాబట్టి పొదల్లో దాచి పెట్టుకుంటుంది. పెద్దపులి రోజు 20 గంటలు నిద్రావస్తలోనే ఉంటుంది. కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే ఆహారం కోసం వెతుకుతుంది. అలాగే వేట దొరికిన తరువాత వారం రోజులు తినడానికి ఉపయోగించుకునే పులి ఆ తరువాత రెండు పూర్తి రోజులు నిద్రలో గడుపుతుంది. సంవత్సరం సంఖ్య 2014 – 15 37 2015 – 16 40 2016 – 17 46 2017 – 18 46 2018 – 19 47 2019 – 20 63 2020 – 21 70 2022 – 23 78 2024 – 25 87 2026 – పులుల అంచనా పూర్తి కాలేదు అందంలోనూ ... బలంలోనూ పెద్ద పులికి సాటిరాగల మరో జంతువు భూమిపై ఏదీ కనిపించదు. అది నడుస్తుంటే రాజసం తొణికిసలాడుతుంది. అంతటి అపురూపమైన జంతువును సంరక్షించేందుకు అటవీ శాఖ ఎన్నో చర్యలు చేపట్టింది. నేడు ఇంటర్నేషనల్ టైగర్డే సందర్భంగా పెద్ద పులుల విశేషాలు ఇలా.. – ఆత్మకూరురూరల్ -
అవస్థలు చూసి‘నారా’
బాలికలకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఇటీవల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠ శాలలకు పూర్వవైభవం తీసుకువస్తామని, మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఎమ్మిగనూరు మాచాని సోమప్ప ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ 6 నుంచి 10 వరతగతి వరకు 50 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 3,400 మంది విద్యార్థినులు ఇక్కడ చదువుతున్నారు. సరిపడే గదులు లేక 11 తరగతులను అరుబయట, వరండాలో, చెట్ల కిందనే నిర్వహిస్తున్నారు. గాలి, వర్షం వస్తే బాలికల పరిస్థితి ఎలా ఉంటుందో, పాఠాలు ఎలా వినాలో ఊహించుకోవచ్చు. పాఠశాలకు 80 మరుగుదొడ్లు కావాల్సి ఉండగా 20 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని నిరుపయోగంగా మారాయి. బాలికల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గదుల కొరత, మరుగుదొడ్ల సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఎన్. నీలకంఠ తెలిపారు. – ఎమ్మిగనూరు రూరల్ -
31న ఉద్యోగ మేళా
కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పి.దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 54 ఉద్యోగాల కోసం పేటీఎం, అనంత ప్రాజెక్ట్స్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా పాసైన 18–32 సంవత్సరాల మధ్య ఉన్న యువతీ, యువకులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న ఉన్న వారు www.ncs.gov.in, employment. zap. gov.in లలో రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు. పశువులకు నీరు వదలండి హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు సంబంధించి డిస్ట్రీబ్యూటరీ(డీపీ) 67 కింద ఉన్న కుంటకు పశువుల తాగునీటి అవసరాలకు నీటిని వదలాలని వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ఇంగళదహాళ్ ప్రహ్లాదరెడ్డి కోరారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జీవాలకు నీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఎల్లెల్సీలో ప్రవహిస్తున్న నీటిని 67వ డీపీ కింద ఉన్న కుంటకు వదిలితే నీటి ఎద్దడి సమస్య తీరుతుందన్నారు. ఆ నీటిని కేవలం పశువులకు మాత్రమే వాడుకుంటామని తెలిపారు. జిల్లాధికారులు వెంటనే స్పందించాలని కోరారు. డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు డిబార్ కర్నూలు కల్చరల్: డిగ్రీ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మంగళవారం చూచిరాతలకు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు రాయలసీమ వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు తెలిపారు. మొత్తం 49 పరీక్ష కేంద్రాల్లో 8,372 మంది విద్యార్థులకు 7659 మంది హాజరు కాగా 708 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు డిగ్రీ కళాశాల, నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూరు సిద్ధార్థ డిగ్రీ కళాశాల, చాగలమర్రి ఎస్వీ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్కొరు చొప్పున మొత్తం ఐదుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 4,865 మంది విద్యార్థులకు 4,597 మంది పరీక్షలకు హాజరు కాగా 268 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. లా పరీక్షలకు 34 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న లా రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల్లో మంగళవారం 31 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 426 మంది విద్యార్థులకు 395 మంది హాజరు కాగా 93 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. బుడగ జంగాల కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి నంద్యాల: పట్టణంలోని బుడగ జంగాల కాలనీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం ఆమె కాలనీని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని, రోడ్లు, డ్రైనే జీ ఏర్పాటు చేయాలని, శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కాలనీవాసులు కలెక్టర్ను కోరా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బుడగజంగాల కాలనీలో వెంటనే అంగన్వాడీ కేంద్రం ప్రారంభించాలని అధికారులు ఆదేశించా రు. రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటిక వంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 104 మంది విద్యార్థులతో అద్దె భవనంలో నడుస్తున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను పరిశీలి ంచి ఇరుకు గదుల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురై రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి కోలుకోలేక మృతి చెందినట్లు టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపారు. వ్యక్తి వయస్సు 35 నుంచి 45 మధ్య ఉంటుందని, కాకి రంగు చొక్కా ధరించి ఉన్నాడని, ఎవరికై నా సమాచారం తెలిస్తే టూటౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. వివాహిత బలవన్మరణం డోన్ టౌన్: మండల పరిధిలోని కొచ్చెర్వు గ్రామంలో రాజేశ్వరి (27)అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ ఎస్ఐ మమత తెలిపిన వివరాల మేరకు.. రాజేశ్వరికి సోంపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కొచ్చెర్వు గ్రామంలోని పుట్టింటికి వచ్చారు. వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
చదువులు చతికిల‘బడి’
ఉయ్యాలవాడ: భావి భారత పౌరులను తీర్చి దిద్దాల్సిన బడులను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇందుకు నిదర్శనం మండలంలోని పెద్దయమ్మనూరు ప్రాథమికోన్నత పాఠశాల. ఈ బడిలో 1 నుంచి 7వ తరగతి వరకు 34 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం వీరిద్దరిలో మాధవి అనే టీచర్ సెలవులో వెళ్లగా మరో ఉపాధ్యాయురాలు (హెచ్ఎం) రమణమ్మ వరండాలో 1, 2, 3, 4 తరగతుల విద్యార్థులకు బోధన చేస్తూ వుంది. 5, 6, 7 తరగతుల విద్యార్థులు ఒకే గదిలో ఖాళీగా ఉన్నారు. ఉన్న ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవుపై వెళ్తే బోధన కుంటు పడుతోంది. దీంతో విద్యార్థులు చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. అల్లూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు వున్నారు. ఈ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు వున్నారు. ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా వుంది. ఉపాధ్యాయుల కొరతపై ఎంఈఓ వీరప్రతాప్రెడ్డిని వివరణ కోరగా.. ఖాళీల వివరాలను డీఈఓ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీ
బేతంచెర్ల: బుగ్గానిపల్లె గ్రామ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల మేరకు నంద్యాల నుంచి బేతంచెర్ల వైపు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు, బేతంచెర్ల నుంచి నంద్యాల వైపు వెళ్తున్న టమాట లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ప్రమాదవశాత్తు ఎదురెదురుగా ఢీ కొ న్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రియా జ్ హుస్సేన్ తోపాటు ప్రయాణికులు ఎం.పెండేకల్లు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, మద్దమ్మ, కంబగిరి ఆచారితో పాటు తాటిమాను కొత్తూరు గ్రామానికి చెందిన మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో బేతంచెర్ల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి మహిళా కూలీ మృతి
పాములపాడు: పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీ రాణెమ్మ (45) వ్యవసాయ బావిలో కాలు జారి పడి మృతి చెందింది. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో ఇద్దరు మహిళా కూలీలు మొక్కజొన్న పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. విరామ సమయంలో రాణెమ్మ దిగుడు బావిలో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి జారీ నీటిలో పడిపోయింది. అక్కడే ఉన్న మరో మహిళ వెంటనే కేకలు వేయడంతో చుట్టు పక్కల పొలాల్లో ఉన్న యువకులు బావిలో దూకి నీట మునిగిన రాణెమ్మను బయటకు తీశారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలికి భార్య ఏసు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
తాగునీటి సమస్య తీర్చండి
పత్తికొండ రూరల్: తాగునీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబును అటికెలగుండు గ్రామస్తులు కోరారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. రెండేళ్ల పాలనలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తుండగా గ్రామంలో తాగునీటి సమస్యను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బండగట్టు పథకం నీరు నిలిచిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తిందని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ ఏమీ చేయలేక గ్రామస్తులతో పాటు బిందె ఎత్తి నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ కార్యకర్తల ఇళ్లకు మాత్రమే వెళ్లి, గ్రామంలో కొన్ని కాలనీల్లోనే తిరిగి వెళ్లిపోయారు. -
లంచం కేసులో హెడ్ కానిస్టేబుల్కు జైలు
కర్నూలు: హెడ్ కానిస్టేబుల్ దేవదానంకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కర్నూలులోని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎన్.శ్రీవిద్య తీర్పు వెలువరించారు. వైఎస్సార్ కడప జిల్లా పద్మావతి కుమారుడు రైల్వే పట్టాలపై మృతిచెందిన ఘటనకు సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ కాపీ ఇంక్వెస్ట్ రిపోర్టు, పోస్టుమార్టం పరీక్ష నివేదిక, ఫైనల్ రిపోర్టు, అనుకూలమైన దర్యాప్తు నివేదికను ఇవ్వడం కోసం 2018లో ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దేవదానం రూ.9 వేలు లంచం తీసుకుంటుండగా కడప ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కర్నూలులోని ప్రత్యేక న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(2), 13(1)డి కింద దేవదానంను దోషిగా నిర్ధారించి ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.లక్ష జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ కారాగారశిక్ష విధించింది. అలాగే అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7 కింద దోషిగా నిర్ధారించి ఐదు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 లక్షలు జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ కారాగారశిక్ష విధించింది. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలులో ఉండాలని ఆదేశించారు. అలాగే రూ.3 లక్షలు జరిమానా మొత్తాన్ని ఫిర్యాదుదారుకు పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ పెద్దకడబూరు: హత్య కేసులో నిందితుడు తెలుగు లక్ష్మన్నను అరెస్ట్ చేసినట్లు సీఐ మంజునాథ్, ఎస్ఐ మారుతి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కల్లుకుంట గ్రామానికి చెందిన తెలుగు కార్తీక్(18), తెలుగు లక్ష్మన్న సన్ని హితులుగా ఉండేవారన్నారు.రెండు నెలలుగా కార్తీక్ తనను దూరం పెడుతున్నాడ ని లక్ష్మన్న కక్ష పెంచుకున్నారన్నారు. ఈనెల 23న ఆవును మేపడానికి గౌడప్ప కుంట బీడు పొలాని కార్తీక్ వెళ్లగా పదునైన కత్తితో లక్ష్మన్న పొడినట్లు పేర్కొన్నారు. హతుడి తండ్రి సన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని లక్ష్మన్నను గ్రామంలోని నబిసాబ్ దర్గా వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామయ్య, పోలీసులు చంద్రన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కాల్పుల ఘటనపై కేసు నమోదు
కర్నూలు: నగర శివారులోని జొహరాపురం రోడ్డులోని వీఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ కాల్పులు జరిపిన ఘటనపై ప్రత్యక్ష సాక్షి మద్దెల విజయరాజు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో కర్నూలు శ్రీకృష్ణ కాలనీకి చెందిన కౌశిక్ టీమ్ ఓడిపోయింది. దీనిని జీర్ణించుకోలేని కౌశిక్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో మూడు రౌండ్లు కాల్పులు జరపడం కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కౌశిక్తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని సంఘటనపై విచారణ జరిపారు. బ్యాడ్మింటన్ పోటీల్లో తమ జట్టు ఓడిపోయినందుకు మనస్తాపానికి గురై కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైందని మూడో పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. కౌశిక్ లైసెన్స్ రివాల్వర్తో పాటు తూటాలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపినట్లు ఆయన వెల్లడించారు. ప్రాణరక్షణ కోసం కొన్నేళ్ల క్రితం కౌశిక్ రివాల్వర్ లైసెన్స్ పొందాడని, దాని రద్దు కోసం ఎస్పీ ద్వారా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీస్ ట్రాకర్ డాగ్ రాఖీ మృతి కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో 2017 నుంచి సుమారు 9 సంవత్సరాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో విశేష సేవలందించిన రాఖీ వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం కర్నూలు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ సమీపంలోని డాగ్ స్క్వాడ్ కార్యాలయంలో మృతిచెందింది. సోమవారం మధ్యాహ్నం కర్నూలు శివారు దిన్నెదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో రాఖీ కళేబరానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో డాగ్స్క్వాడ్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాబ్రడార్ జాతికి చెందిన మగ ట్రాకర్ డాగ్ అయిన రాఖీ డాగ్స్క్వాడ్లో పనిచేసిన కాలంలో దొంగతనాలు, హత్య కేసులతో పాటు పలు నేరాల దర్యాప్తులో కీలకపాత్ర పోషించి పోలీసు శాఖకు విశేష సేవలు అందించింది. పోలీస్ ట్రాకర్ డాగ్ జిల్లాకు వచ్చినప్పటినుంచి డాగ్ హ్యాండ్లర్గా హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఉన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ జావేద్, ఆర్ఎస్ఐలు, డాగ్స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు జైలు శిక్ష డోన్ టౌన్: పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష పడింది. పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపిన వివరాల మేరకు. కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన మద్దిలేటి, కర్నూలుకు చెందిన షేక్ ఖలీల్, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వి.వీరేష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టణ పోలీసులకు చిక్కారు. వీరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా మొదటి ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్ష, వీరేష్కు రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యూడీషియల్ సెకెండ్క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్.నూరుల్లా తీర్పు వెలువరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపై వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించేది లేదని హెచ్చరించారు. పట్టణ ఎస్ఐలు శరత్కుమార్రెడ్డి, నరేంద్రకుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ● డోన్ రూరల్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన పట్టణంలోని చిగురమానుపేటకు చెందిన హుస్సేన్ సాహెబ్ను కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి విచారణ చేసి రూ.10వేల జరిమానా విధించినట్లు సీఐ సీఎం రాకేష్ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ మమత పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కొత్తపల్లి: బైకు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు, ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వీరాపురం గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ ఆటోలో ఎర్రమఠం వైపు నుంచి కొత్తపల్లి వైపు వస్తున్నాడు. అదే సమయంలో శివపురం గూడెంకు చెందిన సురేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి అయిన శివశంకర్ను ఎక్కించుకుని పెద్దగుమ్మడాపురం నుంచి ముసలిమడుగు వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ముసలిమడుగు గ్రామ సమీపంలోని నీలగిరి చెట్ల ప్రాంతలో ప్రమాదవశాత్తూ బైకు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో సురేష్, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి కర్నూలుకు రెఫర్ చేశారు. -
ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడుకర్నూలు: నా కుమార్తెకు అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని నా అల్లుడి ద్వారా పరిచయమైన పాములపాడు మండలానికి చెందిన సాయినూరు దేవకుమార్ కర్నూలులో రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడని అలంపూర్ తాలూకా రాజోలి గ్రామానికి చెందిన పాపిరెడ్డి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్క నున్న క్యాంప్ కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ వినతులను స్వీకరించి మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 100 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలి తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. -
ప్లాస్టిక్ పంట పండింది.. కాలుష్యం నవ్వింది!
ప్రకృతిని కాలుష్యం కాటేస్తోంది. పచ్చని పంటలు పండే భూములను ప్లాస్టిక్ భూతం మింగేస్తోంది. పాలకులు, అధికారులు కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దామంటూన్నారే కానీ.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్లాస్టిక్ కవర్ల కలిగే అనర్థాలపై ప్రజలకు సరైన అవగాహన కరువైంది. దైనందిన జీవితంలో భాగమై పూలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్, మటన్, స్వీట్లు, పాలు, బ్రెడ్డు.. ఇలా అన్నీ కవర్లలో ఇంటికి చేరుతున్నాయి. దుకాణాలు, హోటళ్లలో యథేచ్ఛగా వినియోగిస్తున్నా అడిగేవారు లేరు. కోడుమూరులోని వెల్దుర్తి రోడ్డులో డంపింగ్యార్డ్లో పారవేసే చెత్తలో ఉన్న ప్లాస్టిక్ కవర్లు గాలికి కొట్టుకుపోయి సమీపంలోని పొలాలను కప్పేస్తున్నాయి. ప్లాస్టిక్ రహిత పట్టణాలు, గ్రామాలుగా మార్చాలన్న ప్రభుత్వ చర్యలు గాలిమాటలే అనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. – కోడుమూరు రూరల్ -
ఆమోదమా.. తిరస్కారమా?
● నేడు ధర్మకర్తల మండలి సమావేశం ● సాలు మండపాలు, తెలంగాణ అర్చకుల వివాదం, దుకాణాల టెండర్పై సర్వత్రా ఉత్కంఠ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో మంగళవారం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు అధ్యక్షతన జరుగనున్న తొమ్మిదవ ట్రస్ట్బోర్డు సమావేశం సర్వత్రా టెన్షన్గా మారింది. సాలు మండపాల టెండర్ను రద్దు చేయాలని, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన 10 మంది అర్చకులను ఆ రాష్ట్రానికి పంపాలని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు లేఖ రాశారు. అంతేకాకుండా గత నెలలో దేవస్థాన వాణిజ్య సముదాయంలోని పలు దుకాణాలకు నిర్వహించిన బహిరంగ వేలాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెళ్తువెత్తాయి. ఈ క్రమంలో తొమ్మిదవ ధర్మకర్తల మండలి సమావేశంలో సాలు మండపాల టెండర్, తెలంగాణ అర్చకుల అంశం, దుకాణాల బహిరంగ వేలం నిర్ణయాలను అజెండా అంశాలుగా చేర్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన ఈ మూడు అజెండాలపై చర్చ హీట్ హీట్గా సాగే అవకాశం ఉంది. సాలు మండపాల వివాదంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ధర్మకర్తల మండలి నిర్ణయమే కీలకం కావడంతో టెండర్ల భవితవ్యం కూడా తేలనుంది. సాలు మండపాల అజెండాపై సర్వత్రా ఆసక్తి.. సాలు మండపాల వ్యవహారం ధర్మకర్తల మండలిలోనూ విభేదాలను తీసుకువచ్చింది. ఇప్పటికే సాలు మండపాల టెండర్ బిడ్ను దేవస్థాన అధికారులు ఓపెన్ కూడా చేశారు. టెండర్ దక్కించుకునేందుకు మూడు కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ టెండర్ను ఆమోదింపజేసేందుకు దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్, శ్రీశైలం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఇప్పటికే ఓ సీనియర్ సభ్యుడితో టచ్లోకి వెళ్లి మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులతో చర్చించి సాలు మండపాల టెండర్ అజెండాకు ఆమోదం తెలిపేలా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అయితే ధర్మకర్తల మండలిలో చైర్మన్తో 16 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది మహిళా సభ్యురాలు ఉన్నారు. వీరికి ఆయా అజెండా అంశాలపై అంతంత మాత్రంగానే అవగాహన ఉంది. మిగిలిన సభ్యుల్లో ఒకరిద్దరు తప్పా అందరూ అజెండాలపై అవగాహన కలిగి చర్చించే వారే. సాలు మండపాలపై ట్రస్ట్బోర్డు తీర్పు ఎలా ఉండబోతుందోనని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ వాదనకు బోర్డు మద్దతు లభిస్తుందా? కోరం చైర్మన్ వైపు ఉంటుందో లేక మిగిలిన సభ్యుల వైపు ఉంటుందో వేచిచూడాలి. ఈ నేపథ్యంలో మంగళవారం జరుగబోయే ట్రస్ట్బోర్డు సమావేశంపై సర్వత్రా టెన్షన్ టెన్షన్ నెలకొంది. -
మహిళ ఆత్మహత్య
బేతంచెర్ల: బలపాలపల్లె గ్రామంలో కుటుంబ సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామనికి చెందిన రవికుమార్, తిరుమలమ్మ (27) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి భర్త ఆలస్యంగా ఇంటికి రావడంతో తిరుమలమ్మ గొడవ పడింది. సోమవారం వారి మధ్య ఇదే విషయంపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆమె విష ద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి అన్న మద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. పైళ్లెన 18 రోజుల్లోనే.. ఆదోని సెంట్రల్: పట్టణానికి చెందిన యువకుడు ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఇంద్రానగర్కు చెందిన లక్ష్మన్న కుమారుడు ఉపేంద్ర ఆదివారం రాత్రి ఆదోని–నగరూర్ రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్న అప్లైన్ ట్రాక్పై ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కో పైలెట్ అందించిన సమాచారం మేరకు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఉపేంద్ర తీవ్ర గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడికి ఈనెల 9వ తేదీన అదే కాలనీకి చెందిన యువతితో వివాహమైంది. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి చెట్టుకు క్యూఆర్ కోడ్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వ విద్యాలయంలోని ప్రతి వృక్షాన్ని, దానికి సంబంధించిన వివరాలను డిజిటలైజేషన్ చేసి క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే ఒక వినూత్న కార్యక్రమమని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు అన్నారు. వర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల అకడమిక్ ప్రాజెక్ట్గా రూపొందించిన ‘రాయలసీమ యూనివర్సిటీ వృక్ష సంపద యొక్క క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ గుర్తింపు’ కార్యక్రమాన్ని సోమవారం వీసీ ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ ప్రాంగణంలోని 82 రకాల వృక్షజాతులను శాసీ్త్రయంగా గుర్తించి వాటి చిత్రాలు, బెరడు, ఆకులు, పుష్పాలు, పండ్లు, శాసీ్త్రయ నామం, సంరక్షణ స్థితి, ఔషధ, ఆర్థిక ప్రాముఖ్యత తదితర వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసన్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విజయకుమార్ నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్, డీన్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆచార్య భరత్ కుమార్, బోటనీ విభాగ కో ఆర్డినేటర్ డాక్టర్ రంగనాయకులు పాల్గొన్నారు. -
లోకేష్ పర్యటన.. కూటమికి పరీక్ష!
ఆదోని: రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఆదోని పర్యటనకు రానున్న నేపథ్యంలో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు ప్రత్యేక జిల్లా సాధన కోసం నిరసనల హోరు సాగుతోంది. ఇదే సమయంలో పెద్దహరివాణం ఆదినారాయణ రెడ్డి 100 గంటల నిరవధిక రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈనేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోకేష్కు నిరసన సెగ తగలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇన్చార్జ్ డీఎస్పీ పిలుస్తున్నారు స్టేషన్కు రావాల్సిందిగా టూ టౌన్ పోలీసుల నుంచి జిల్లా సాధన జేఏసీ నాయకులకు పిలుపు వచ్చింది. అయితే, ఇందుకు భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్నా చేయడానికి లేదా అరెస్టు కావడానికి కూడా సిద్ధంగా ఉందామంటూ జేఏసీ నాయకులు, సభ్యులు వాట్సాప్ల ద్వారా ఒకరికొకరు మెసేజ్లను పంపించుకుంటున్నారు. మంత్రి లోకేష్ దృష్టికి జిల్లా సాధన అంశాన్ని తీసుకెళ్లేందుకు ఉద్యమకారులకు అవకాశం ఇస్తారా? లేక అరెస్టులు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చినప్పుడు కూడా జేఏసీ నాయకులకు ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు డీఎస్సీ–2026 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ తక్షణమే రాజీనా మా చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజి ఉదంతంపై విద్యార్థుల పోరాటానికి తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేశారని, అదే రీతిలో రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలంటూ గళం వినిపించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ పర్యటన విజయవంతంమవుతుందో లేదో అనే భయం ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది. 29, 30 తేదీల్లో విద్యాశాఖమంత్రి లోకేష్ పర్యటనకర్నూలు (సెంట్రల్): మానవ వనరుల అభివృద్ధి (విద్య) శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 29, 30 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఎ.సిరి తెలిపారు. సోమవారం సునయన ఆడిటోరియంలో ఆమె మాట్లాడుతూ...29వ తేదీన ఆదోనిలో, 30వ తేదీన పత్తికొండలో మంత్రి పర్యటన ఉంటుందని, అధికారులు ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలను మంత్రి సందర్శించే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులకు చెప్పారు. పత్తికొండ మండలం హోసూరులో సోలార్ ప్రాజెక్టుకు మంత్రి భూమి పూజ చేస్తారని వెల్లడించారు. పెరుగుతున్న లోకేష్ రాజీనామా డిమాండ్ జేఏసీ నాయకుల అరెస్టుకు రంగం సిద్ధం? -
ట్రాక్టర్ ఎరువు రూ.15 వేలు
దొర్నిపాడు: ప్రస్తుతం మార్కెట్లో పశువుల ఎరువులతో పండించిన కూరగాయలు, పండ్లకు గిరాకీ ఉంది. దీంతో పశువుల ఎరువుకు డిమాండ్ ఏర్పడింది. ట్రాక్టరు ట్రిప్పు ఎరువు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు పలుకుతోంది. దొర్నిపాడు పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది వ్యాపారులు ఇక్కడ పాడి రైతుల వద్ద ట్రాక్టరు ఎరువును రూ.3 వేలకు కొనుగోలు చేసి తాడిపత్రి, అనంతపురం ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పశువుల ఎరువుల తో సహజంగా పండిస్తున్న సపోట, చీని, దానిమ్మ, బొప్పాయి, అలాగే కూరగాయలు మంచివంటూ వినియోగదారులకు వ్యాపారులు అమ్ముతున్నారు. -
పద్మ అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలు అందించిన వ్యక్తులు పద్మ అవార్డులకు అర్హులన్నారు. అర్హులు ఈ నెల 31వ తేది వరకు ఆన్లైన్లో నామినేషన్లను పంపుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) ప్రదానం చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సేవల్లో ఉన్న ఉద్యోగులు(వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా) ఈ అవార్డులకు అర్హులు కారన్నారు. నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా http://awardr.gov.in వెబ్సైట్లో మాత్రమే సమర్పించాలన్నారు. నేటి నుంచి డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వ విద్యాలయం పరిఽధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు ఆదేశాల మేరకు 49 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 8,312 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ హాల్ టికెట్తో అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఆ ఇద్దరు వీఏఏలు సస్పెండ్ హొళగుంద: సబ్సిడీ వేరుశనగ, ఎరువులు ఇప్పిస్తామని రైతుల నుంచి దాదాపు రూ. 6 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో అరైస్టె రిమాండులో ఉన్న నెరణికి, లింగంపల్లి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు (వీఏఏ)లు పరమేష్ కుమార్ నాయక్, బలదేవ్ నాయక్ను జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి సస్పెండ్ చేశారు. అగ్రోనమి ఏడీఏ రాజశేఖర్ విచారణ నివేదిక మేరకు ఆ వీఏఏలపై చర్యలు తీసుకున్నారు. పాస్పోర్ట్ సేవల్లో అసౌకర్యాలు కలగరాదు కర్నూలు(అర్బన్): పాస్పోర్ట్ సేవల కోసం వచ్చే వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ నందన్లాల్ భూక్య అన్నారు. సోమవారం ఇక్కడకు వచ్చిన ఆయనకు స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలో కర్నూలు డివిజన్ సూపరిటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి. జనార్దన్రెడ్డి పూలబొకే అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని (పీఓపీఎస్కే ) పరిశీలించి మాట్లాడారు. పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇకపై శనివారాల్లో కూడా పీఓపీఎస్కే అపాయింట్మెంట్ స్లాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరాశాజనకంగా వేరుశనగ ధరలు కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధరలు నిరాశాజనకంగా ఉండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. కర్నూలు. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ముందస్తు ఖరీఫ్లో నీటి వసతి కింద సాగు చేసిన వేరుశనగ దిగుబడులు ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్నాయి. కర్నూలు మార్కెట్కు 1096 క్వింటాళ్ల వేరుశనగ రాగా... కనిష్ట ధర రూ.2277, గరిష్ట ధర రూ.8721 లభించింది. ఆదోని మార్కెట్కు రికార్డు స్థాయిలో 5,625 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కనిష్ట ధర రూ.3,599, గరిష్ట ధర రూ.8,998 పలికింది. ఎమ్మిగనూరు మార్కెట్కు 696 క్వింటాళ్ల వేరుశనగ రాగా కనిష్ట ధర రూ.2,611, గరిష్ట ధర రూ.7,909 లభించింది. అలాగే ప్రస్తుతం రైతుల దగ్గర పత్తి నిల్వలు లేవు. వ్యాపారులు నిల్వ చేసిన పత్తికి నేడు అధిక ధరలు లభిస్తుండటం విశేషం. ఆదోని మార్కెట్ యార్డులో పత్తికి కనిష్టంగా రూ.9,179, గరిష్టంగా ధర రూ.9,677 ధర లభించగా.. సగటు ధర రూ.9,339 నమోదైంది. -
పీఎం – అజయ్ పనుల్లో మరింత జాప్యం
● రోడ్లు మినహా మిగిలిన వాటికి కొత్త అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశంకర్నూలు(అర్బన్): జిల్లాలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, ఆయా కాలనీల్లో వివిధ రకాల ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన ( పీఎం – అజయ్ ) పనుల్లో మరింత జాప్యం చోటు చేసుకోనుంది. ఈ పథకం కింద గుర్తించిన ఒక్కో గ్రామానికి రూ.20 లక్షలకు తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతాయి. దీంతో రోడ్లు, డ్రైనేజీ, పాఠశాలలు, అంగన్వాడీ భవన నిర్మాణాలు, నీటి వసతి, పైప్లైన్లు, వీధి లైట్ల ఏర్పాటు తదితర అనేక రకాల పనులు చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ఫేజ్ –2 కింద రూ.1.80 కోట్ల అంచనాతో 46 పనులను, నంద్యాల జిల్లాలో రూ.3.80 కోట్ల అంచనాతో 85 పనులను గుర్తించారు. ఈ పనులకు 2025 ఏప్రిల్ 17వ తేదీన పాలనా అనుమతులు లభించాయి. అలాగే ఫేజ్ – 3 కింద నంద్యాల జిల్లాలో రూ.1.60 కోట్ల అంచనాతో 29 పనులను గుర్తించారు. ఈ పనులకు ఈ ఏడాది జనవరి 19వ తేదీన పాలనా అనుమతులు లభించాయి. ఫేజ్ 2, 3లో పాలనా అనుమతులు లభించిన పనులకు ప్రస్తుతం రూ.6 కోట్లు మంజూరయ్యాయి. అయితే ...ఇప్పుడు రోడ్ల పనులను మినహాయించి మిగిలిన అన్ని పనులకు మళ్లీ కొత్తగా అంచనాలు రూపొందించి పాలనా అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పీఎం – అజయ్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగనుంది. -
భూములు లాక్కోని రైతులకు అన్యాయం చేయొద్దు
● మీదివేములలో బలవంతంగా భూసేరణ వద్దు ● పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కాటసాని రాంభూపాల్రెడ్డి కర్నూలు(సెంట్రల్): ఓర్వకల్లు మండలం మీదివేములలో బలవంతంగా ఏపీఐఐసీ కోసం భూసేకరణ చేసి రైతులకు అన్యాయం చేయొద్దని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మీదివేముల గ్రామ రైతులతో కలసి బలవంతపు భూసేకరణ చేయొద్దని కోరుతూ కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీదివేములలో ఏపీఐఐసీ 200 ఎకరాలను సేకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనాధారంగా ఉన్న భూములను తక్కువ పరిహారంతో తీసుకొని రైతుల జీవితాలను అంధకారంలోకి నెట్టవద్దన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా భూసేకరణ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ భూసేకరణ అమలైతే గ్రామస్తులు తమ ఇళ్లను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతుల జీవనోపాధికి భంగం కలిగించే ఈ భూసేకరణను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటువైపు కూడా చూడడం లేదన్నారు. ఇంత దారుణమైన స్థితిలో చంద్రబాబు పాలన ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిస్తే ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాటసాని వెంట మాజీ మార్కెట్యార్డు చైర్మన్ ప్రభాకరరెడ్డి, మీదివేముల గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ములుగుందం పరిసరాల్లో చిరుత
ఆస్పరి: మండలంలోని ములుగుందం గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం ఆ గ్రామ సమీపంలో ఉన్న పత్తి పొలంలో పడుకొని ఉన్న చిరుతను గమనించి రైతులు, కూలీలు భయాందోళనకు గురై ఇంటికి వచ్చారు. కొందరు చిరుత సంచారం వీడియోలు తీశారు. రెండేళ్ల నుంచి ములుగుందం కొండల్లో, పొలాల్లో చిరుత సంచరిస్తుందని, గత ఏడాది మేకలు, గొర్రెలను చంపిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈవిషయాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉంటే మూడు నెలలు క్రితం అట్టెకల్లు గ్రామ సమీపంలో చిరుతు ఆర్అండ్బీ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. చెరువుల్లో నీరు తాగేందుకు అటు, ఇటు తిరుగుతున్న సమయాల్లో చిరుతలు ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాటిని బంధించి తీసుకెళ్లాలని స్థానికులు అటవీ అధికారులకు కోరుతున్నారు. -
రోదిస్తు‘నది’
తుంగభద్ర కన్నీటి సంద్రమవుతోంది. నిలువెల్లా గాయాలతో మౌనంగా రోదిస్తోంది. ఇప్పటికే వాతావరణ పరిస్థితులు పగబట్టి తాగునీటికీ దిక్కులు చూసే దుస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు ధనార్జనే ధ్యేయంగా రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా నిత్యం 300 పైగా ట్రాక్టర్లతో నదిలోని ఇసుకను సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న నేత పేరు చెప్పుకొని తాను దగ్గరి బంధువని ఓ చోటానేత చేస్తున్న దందా లక్షలాది రూపాయల్లో ఉంటోంది. కళ్లెదుటే జరుగుతున్న బాగోతమైనా రెవెన్యూ, పోలీసులు అధికారులు చర్యలు తీసుకోని పరిస్థితి. అధికారుల స్థాయిని బట్టి చేతులు తడుపుతుండటంతోనే మౌనం వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలుకు కూతవేటు దూరంలోని పడిదెంపాడు–పూడూరు మధ్య తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకపోయినా పొక్లెయిన్లతో వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. రేయింబవళ్లు సాగుతున్న ఈ దందాను చూస్తే ప్రకృతిపై ఏ స్థాయిలో పగబట్టారో అర్థమవుతోంది. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు ఒక ట్రాక్టర్ ఇసుక ధర: రూ.4వేలు ప్రతిరోజూ తరలిస్తున్న ట్రాక్టర్ల సంఖ్య: 300 పైనే రోజుకు టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్న డబ్బు: రూ.12లక్షలు నెల రోజుల్లో అక్రమార్జన: రూ.3.60కోట్లు -
నిరుద్యోగుల కన్నెర్ర
కర్నూలు(సెంట్రల్): పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో దాదాపు 5 గంటలపాటు నిరసనను హోరెత్తించారు. సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వేలాది మంది నిరుద్యోగులు బిర్లా గేటు నుంచి కలెక్టరేట్ వరకు ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో మెయిన్ గేటు దగ్గర బైఠాయించి కలెక్టరేట్ దిగ్భంధానికి దిగారు. అయితే కొంతసేపటి తరువాత కలెక్టర్, జేసీలలో ఒకరు వచ్చి తమ వినతిపత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి పంపితే నిరసన కార్యక్రమాన్ని విరమిస్తామని పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు నిరుద్యోగుల విన్నపాన్ని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అందుకు ఒప్పుకోలేదు. కలెక్టర్, జేసీలు పీజీఆర్ఎస్లో ఉన్నారని, వారిలో కొందరిని అక్కడే తీసుకురావాలని సూచించారు. అందుకు నిరుద్యోగులు ఒప్పుకోలేదు. కచ్చితంగా కలెక్టర్, జేసీలలో ఒకరు తమ వద్దకు రావాల్సిందేనని పట్టుబట్టారు. ఈనేపథ్యంలో పోలీసులు విషయాన్ని డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లేది లేదు..ఎవరి కోసం..ఎంత సేపు ధర్నా చేసుకుంటారో చేసుకోమని చెప్పారు. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ మెయిన్ రోడ్డులో రాస్తారోకోకు దిగారు. 2గంటలకు పీజీఆర్ఎస్ పూర్తి అవుతుందని, అప్పుడు అధికారులు వస్తారని చెప్పడంతో తిరిగి నిరుద్యోగులు మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి నిరసనకు దిగారు. చెప్పిన సమయానికి కలెక్టర్, జేసీలు రాకపోగా..వారి వెనుక గేటు నుంచి వెళ్లిపోవడంతో నిరుద్యోగులు కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో మళ్లీ మధ్యాహ్నం 3గంటల సమయంలో మరోసారి మెయిన్ రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. ఈక్రమంలో చివరికి కలెక్టర్ నిరుద్యోగులను 4 గంటల సమయంలో తన కార్యాలయానికి పిలిపించుకొని వినతిపత్రం తీసుకోవడంతో కలెక్టరేట్ దిగ్గంధం ముగిసింది. ఇదిలా ఉంటే నిరుద్యోగులు కలెక్టరేట్ ముట్టడితో పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రెండు సార్లు పెద్దాసుపత్రి సర్కిల్లో రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించిన ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐదు గంటల పాటు కలెక్టరేట్ దిగ్బంధం చివరికి దిగివచ్చిన కలెక్టర్ -
వైభవంగా శాకంబరీ ఉత్సవాలు
శాకంబరీగా చౌడేశ్వరిదేవి బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయంలో శాకంబరీదేవి మహోత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన నిర్వహించగా.. సాయంత్రం కలశస్థాపన, సహస్రనామార్చన, అంకురార్పణ, పల్లకీసేవ, మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శాకాంబరీదేవి రూపంలో ఉన్న చౌడేశ్వరిదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేదపండితులు తెలిపారు. ఈ వేడుకలు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. మహానంది: ఆషాఢమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సోమవారం శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు ఆకుకూరల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, అర్చకులు ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న సింహ మండపంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. లోక కల్యాణం కోసం విశేష పూజలు నిర్వహించినట్లు వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. రెండో రోజు మంగళవారం వివిధ రకాల ఫలాలతో కామేశ్వరీదేవికి అలంకరణ ఉంటుందన్నారు. తొలిరోజు ఆకుకూరల అలంకారంలో శ్రీ కామేశ్వరీదేవి నేడు ఫలాలతో అమ్మవారికి అలంకరణ -
బారులు తీరిన సమస్యలు!
● పీజీఆర్ఎస్కు పోటెత్తిన బాధితులు ● తమ గోడు పట్టించుకోవాలని అధికారులకు మొర నాకు ముగ్గురు పిల్లలు సంతానం. అందులో ఇద్దరు చదువుకోరు. రెండోపాప సుమల్య మాత్రం 8వ తరగతి చదువుతోంది. ఈ పాపకు తల్లికి వందనం పడలేదు. చనిపోయిన మా మామ పేరిట మూడు కరెంట్మీటర్లు ఉన్నాయని, అందువల్ల తల్లికి వందనం రావడంలేదని సచివాలయ అధికారులు చెబుతున్నారు. గతేడాది వర్తించిన తల్లికి వందన ఈ సంవత్సరం ఎందుకు వర్తించదు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే పాపను కూడా చదువు మాన్పించి పనికి పంపాల్సి వస్తుంది. – షేక్ షరీఫా, భగత్సింగ్నగర్, కర్నూలు తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామ సర్వే నంబర్ 681లో మొత్తం 14.68 ఎకరాల భూమి ఉంది. ఇందులో 11 మంది రైతులు సాగు అనుభవంలో ఉన్నారు. అయితే సున్నపు వెంకటేష్, సున్నపు లక్ష్మీదేవిల పేరిట ఒక్కొక్కరికీ 5 ఎకరాలు చొప్పున మొత్తం 10 ఎకరాలు వారి పేరిటే చేర్చారు. ఇందులో మాకు 2.68 ఎకరాల భూమి ఉండాలి. కాని లేదు. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని వారి పేరిట ట్రాన్స్ఫర్ చేశారు. వెంటనే సర్వే చేసి అందులో ఉన్న 11 మంది పేరిట ఆన్లైన్లో భూమి ఎక్కించాలి. – బారికె ఈశ్వర్, మారెళ్ల, తుగ్గలి మండలం కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జనం పోటెత్తారు. వివిధ సమస్యలపై అర్జీలు చేతపట్టుకొని బారులు తీరారు. తమ గోడు పట్టించుకోవాలని జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టాగా ఉన్న తమ భూములను ఇనాం, చుక్కలు, 22ఏ కింద చూపుతున్నారని కొందరు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి అనర్హులు చేశారని మరికొందరు, కాటికి కాళ్లుచాపుకుంటున్న తమకు ఇంకెప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారంటూ ఇంకొందరు, ఇలా వివిధ సమస్యలపై కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతులు అందజేశారు. తిరిగి తిరిగి అలసిపోతున్నామే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని పలువురు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. మేము తండ్రికొడుకులం. మాకు ఉన్న భూ సమస్యను పరిష్కరించమని కలెక్టరేట్లో దాదాపు 20 సార్లు ఫిర్యాదు ఇచ్చినా పరిష్కారం చేయడంలేదు. మాకు గ్రామ సర్వే నంబర్ 420లో 8.92 ఎకరాల పొలం ఉంది. ఈ సర్వే నంబర్లో మొత్తం 16.92 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి మా భూమికి సంబంధించి సర్వే చేసి హద్దులు వేయాలని కోరుతుంటే తహసీల్దార్ పట్టించుకోవడంలేదు. కోర్టు ఆదేశాలను కూడా అధికారులు లెక్క చేయడంలేదు. మా సమస్య ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – రాముడు, కృష్ణ, పెద్దనెలటూరు, గోనెగండ్ల మండలం -
భానుముక్కలలో ఉద్రిక్తత
● రస్తా స్థలంపై వివాదం పాములపాడు: భానుముక్కల గ్రామంలో హిందూ శ్మశాన వాటిక నుంచి క్రతువుకు వెళ్లే రహదారి విషయంలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సుమారు 20 రోజులుగా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు వర్గాలు రెవెన్యూ, పోలీసు అధికారులను ఆశ్రయించారు. ఇటీవల జరిగిన రీసర్వేలో మిగులు భూమిగా ఉన్న దాతలిచ్చిన 0.42 సెంట్ల స్థలం తమదే అన్నట్లుగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రికార్డులో పొందుపర్చి, ఆన్లైన్లో నమోదు చేయించారు. ఈ నెల 17న సమస్య అధికారుల వద్ద ఉండగానే గుట్టు చప్పుడు కాకుండా శివుడు తన కుమారుడు శంకర్ పేరిట దాన విక్రయంగా రిజిస్టర్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏకమై సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ సుభద్రమ్మ, ఎస్ఐ తిరుపాలు గ్రామానికి చేరుకొని ప్రజలకు విషయాన్ని వివరిస్తూ సర్దుకునేలా చెప్పారు. కాగా ప్రజల్లో ఒకరికి ఒకరికి మాట పెరిగి ఉద్రిక్తంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే ప్రజలనందరిని అక్కడి నుంచి పంపించేశారు. -
రేపు కర్నూలులో భారీ ర్యాలీ
● భారీగా తరలిరావాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుల పిలుపుకర్నూలు (టౌన్): డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అద్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ సంయుక్తంగా డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఈనెల 28న కర్నూలులో నిర్వహించనున్న భారీ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున పోస్టులను అమ్ముకున్నారని, ఏనాడు క్రీడా మైదానం చూడని వారు ఉద్యోగాలు పొందారన్నారు. ఎంతో మంది అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. అప్పట్లో నిరుద్యోగ డీఎస్సీ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా చంద్రబాబు ప్రభుత్వానికి చలనం లేదన్నారు. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారని, అదే తరహాలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్, రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయి కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లకు సంబంధించి విద్యార్థులకు చెల్లించాల్సిన రూ. 10,700 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. నిరుద్యోగ భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో 28న చేపడుతున్న ర్యాలీకి యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పాణ్యం యువజన విభాగం అధ్యక్షుడు దుర్గప్రసాద్, జిల్లా కార్యదర్శి మధుమోహన్ రెడ్డి, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు అన్సూర్ బాషా, పాణ్యం విద్యార్థి విభాగం అద్యక్షుడు జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీఆర్ఎస్ఏ ఎన్నికలు ఏకగ్రీవం
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) కర్నూలు డివిజన్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ధనంజయరెడ్డి ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష, కార్యదర్శులుగా బి.ధనుంజయరెడ్డి, బి. గురుస్వామి రెడ్డి, ట్రేజరర్గా కె.సందీప్నాయక్తోపాటు 16 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆర్డీఓ కార్యాలయ మీటింగ్ హాలులో కర్నూలు డివిజన్ యూనిట్ ఎన్నికలను ఎన్నికల అధికారి వెంకటేశ్వరరెడ్డి నిర్వహించారు. అయితే ధనుంజయరెడ్డి ప్యానల్ మాత్రమే పోటీలో దిగడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష, కార్యదర్శులతోపాటు అసోసియేట్ ప్రెసిడెంట్గా ఆర్.విష్ణుప్రసాదు, ఉపాధ్యక్షులుగా ఎం.ప్రీతం, ఎస్ అన్వర్బాషా, జె.షర్మిళారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా బి.విష్ణుమాధవ, జి.తరుణ్, బి.గోవిందు, ఈసీ మెంబర్లుగా వై.అఖిలేశ్వరరెడ్డి, ఎ.అబ్దుల్రజాక్, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కె.కె. మృదుల, కె.రాజేశ్ యాదవ్, రవి ప్రకాష్, ఎస్.రాజునాయక్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు డివిజన్ యూనిట్ను జిల్లా అధ్యక్షుడు సి.నాగరాజు, కర్నూలు, సి.బెళగల్, వెల్దుర్తి తహసీల్దార్లు రమేష్బాబు, వెంకటలక్ష్మి, చంద్రశేఖరశర్మ అభినందించారు. అంతకముందు కొత్త కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు బి.ధనుంజయరెడ్డి, బి.గురుస్వామిరెడ్డి తెలిపారు. -
నిర్లక్ష్యానికి మారుపేరు!
ఓర్వకల్లు మండంలోని రాతివనం సంభ్రమాశ్చర్యం. నిత్యం వందలాది మంది పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రదేశం. ఇలాంటి పర్యాటక ప్రాంతంలో సమాచారం అందించే బోర్డులో అధికారుల పేర్లు తప్పుగా ఉన్నాయి. టూరిజం శాఖ అధికారిగా తిరుమల నాయుడు ఉండగా మరో పేరు దర్శనమిస్తోంది. గత జిల్లా కలెక్టర్ రంజిత్బాషా పేరు ఇదే బోర్డులో కనిపిస్తోంది. కనీసం అధికారుల పేర్లు కూడా మార్చలేని పనిలో టూరిజం శాఖ వారు ఉన్నారా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
కరివేన చెరువు ఇక కనుమరుగే!
● వెయ్యి ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంఆత్మకూరురూరల్: ప్రజలకు దాహార్తి తీర్చే, భూములను సస్యశ్యామలం చేసే కరివేన చెరువు కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్న నీటి పారుదలశాఖ పరిధిలోని ఈ చెరువు ప్రమాదపు అంచుల్లో ఉంది. వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించే దీనిని మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్కడ అనాలోచిత, అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ చెరువు ఆత్మకూరు మున్సిపాలిటీకి ఆనుకుని ఉంది. పట్టణంలోని పాత ఇళ్లను తొలగించిన సమయంలో వచ్చే వ్యర్థాలను తీసుకు వచ్చి ఇందులో వేస్తున్నారు. దీంతో చెరువు నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. అంతే కాకుండా నీరు కలుషితం అయ్యే అవకాశం నెలకొంది. ప్రస్తుతం నీరు లేకపోవడంతో మందుబాబులు చెరువులో అక్కడక్కడ ఉన్న తుమ్మచెట్ల కింద మద్యం సేవిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు పగులగొట్టడంతో గాజుపెంకులు కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు! వ్యర్థాలతో చెరువును ఓ వైపు నింపుతుంటే మరోవైపు విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. చెరువులో విలువైన మొరుసును (గ్రావెల్) అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు నంద్యాల– కల్వకుర్తి 167 జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని చదును చేసేందుకు కరివేన చెరువునుంచే మొరుసును తరలించారు. గ్రామస్తులు ఈ అక్రమ తవ్వకాన్ని అడ్డుకోవడంతో వాళ్లు కాస్త వెనక్కి తగ్గారు. అక్రమార్కులు విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడంతో చెరువుకు నీటిని తీసుకువచ్చే ఫీడర్ ఛానల్ ధ్వంసం అయ్యింది. ఇదిలా ఉండగా కల్వకుర్తి – నంద్యాల 167 జాతీయ రహదారి కరివేన చెరువు అలుగును మూసివేస్తూ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ‘సాక్షి’ ఈ అంశంపై ప్రత్యేక వార్త ఇవ్వడంతో స్పందించిన అధికారులు జాతీయహదారి అలైన్మెంట్ మార్చడంతో చెరువుకు పెద్ద ప్రమాదమే తప్పింది. మైనర్ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికై నా చెరువు వైపు దృష్టి సారించి కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. -
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ ఎస్ఈ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్పై క్యూఆర్కోడ్ కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)పై అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్పై మరింత జవాబుదారీతనాన్ని పెంచేందుకు క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నేడు పీజీఆర్ఎస్ కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలను అధికారులు స్వీకరిస్తారన్నారు. వర్షం కోసం ఎడ్లబండ్లతో ప్రదక్షిణ నందవరం: వర్షం కోసం నందవరం మండలం కే పేట గ్రామంలో ఆదివారం 52 ఎడ్లబండ్లతో రామప్ప, లచ్చప్ప ఆలయం చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం చిన్నారులు కలశాలతో, భజనలతో పూర్వ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. కే పేట గ్రామం నుంచి 52 జతల ఎడ్లబండ్లతో నాగలదిన్నె మీదుగా గురజాల గ్రామం చేరుకున్నారు. అక్కడ తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి రామలింగేశ్వర స్వామికి, పార్వతీ దేవికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం తుంగభద్ర నది జలాలను తీసుకుని గ్రామానికి చేరుకుని చిన్నారులు కలశాలతో పాటు బ్యాండు మేళాలు, డ్రమ్స్లతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పిండి వంటలు నైవేద్యాలుగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహానంది: మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో సోమ వారం శాకంబరీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి అలంకరణ కోసం వినియోగించే ఆకు, కాయగూరలను ఆదివారం తీసుకొచ్చారు. స్థానిక కల్యాణ మండపంలో మహిళా భక్తులు అలంకరణ కోసం దండలు అల్లే కార్యక్రమం చేపట్టారు. ఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వరుసగా మూడు రోజుల పాటు మహానందిలో శాకంబరీ ఉత్సవం ఉంటుందన్నారు. -
ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం
నంద్యాల(వ్యవసాయం): ఆధునిక వైద్య విధానాలపై డాక్టర్లకు అవగాహన అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సింగరి ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈఎన్టీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మధుమణి నర్సింగ్ హోమ్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఈఎన్టీ వైద్య వైజ్ఞానిక సదస్సు, శస్త్ర చికిత్సల శిక్షణ కార్యశాల ( వర్క్ షాప్) ఆదివారం ముగిసింది. నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆరు రాష్ట్రాల నుంచి 170 మంది చెవి, ముక్కు, గొంతు వైద్యులు హాజరయ్యారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే యువ వైద్యులు నిరంతరం ఆధునిక విధానాలను నేర్చుకుని నైపుణ్యాలు పెంచుకోవాలని సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవికృష్ణ అన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈఎన్టీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్రెడ్డి, వైద్యులు అహిలస్వామి, నాగమణి, రోహిత్, లోచన రెడ్డి, మధుప్రీతి, ప్రణీత్, సింధు తదితరులు పాల్గొన్నారు. -
ఉడుముల వేటగాడు అరెస్ట్
బండిఆత్మకూరు: నారపురెడ్డి కుంట అటవీ ప్రాంతంలో అక్రమంగా ఉడుములను పట్టుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించా మని బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి నాసీర్ ఝా ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన సుబ్బా రావు శనివారం సాయంత్రం నారపురెడ్డి కుంట నార్త్ బీట్లో బైక్పై అనుమానాస్పదంగా కనిపించడంతో అటవీ శాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు ఉడుములను స్వాధీనం చేసుకున్నామని, అందులో ఒకటి మృతి చెందడంతో డాక్టర్లు పోస్ట్ మార్టం చేసి దహనం చేశారన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, నిందితుడు ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్స్ ఖాశీం నాయక్, నాగరాజు, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య ఆదోని అర్బన్: ఔట్సోర్సింగ్ పద్ధతిన మున్సిపల్ శానిటేషన్లో ఉద్యోగం చేస్తున్న చిన్న ఈరన్న (35) ఆదివారం ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాలు.. ఆదోని పట్ట ణంలోని సాయిబాబానగర్ కాలనీకి చెందిన చిన్న ఈరన్న తొమ్మిది నెలల క్రితం ఇందిరానగర్ కాలనీకి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఆమె తన తల్లి ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లి ఇంటి తాళాలు ఇప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శిరీష మధ్యాహ్నం ఒంటి గంటకు తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికులను పిలిపించి వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆదోని జిల్లా సాధనపై నోరుమెదపని టీడీపీ నాయకులు ఆదోని సెంట్రల్: ఆస్పరి మండలంలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశంలో ఆదోని జిల్లా చేయాలని టీడీపీ నాయకులు మాట్లాడక పోవడం విచారకరమని ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దస్తగిరి ఆదివారం పేర్కొన్నారు. ఆదోని జిల్లా చేస్తామని చెప్పడంలో టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి విఫలమయ్యారన్నారు. వినతిపత్రం అందిద్దామని ఆదోని జిల్లా సాధన అభివృద్ధి కమిటీ సభ్యులు కుంకునూరు వీరేష్, అయ్యాలప్ప వంటి సభ్యులతో కలసి వెళితే కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. చివరికి సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఅర్ఎస్లో ఇచ్చి పీఎంఓ కార్యాలయానికి అప్లోడ్ చేయించి వచ్చామని తెలిపారు. ఆదోని జిల్లా రాకుండా అడ్డుపడుతున్న మంత్రి టీజీ భరత్ను, టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ‘యముడు’ చిత్ర బృందం సందడి ఆళ్లగడ్డ: యముడు చిత్ర బృందం ఆదివారం పట్టణంలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా వచ్చిన బృందం సభ్యులు ఆర్టీసీ బస్టాండు, పాత బస్టాండు, రామలక్ష్మీ థియేటర్ల సమీపంలో తిరుగుతూ పోస్టర్లు పంచారు. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ సినిమాలో రాయలసీమ వాసి జగద్ హీరోతోపాటు దర్శక, నిర్మాత బాధ్యతలు నిర్వహిచడం జరిగిందని, అందరూ ఆదరించాలని వారు కోరారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి కొలిమిగుండ్ల: మండల పరిధిలోని పెద్దవెంతుర్లలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బోయ కుమారి (48) భర్త చంద్రమోహన్తో కలిసి సొంత పొలంలో మొక్క జొన్న పంటకు మందు పిచికారి చేసేందుకు ఇంటి నుంచే స్పేయర్ డబ్బాతో బయలుదేరారు. ఈ క్రమంలోనే పొలంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు డబ్బాను తగలడంతో కుమారి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు చికిత్స నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ప్రభు త్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృత్యువాత పడింది. -
రాళ్ల గుట్టలో మట్టి దొంగలు
నందవరం: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతలు ప్రకృతి వనరులను కొల్లగొట్టి పైసలు పోగేసుకుంటున్నారు. వాగులు, వంకలు, చెరువులు, గుట్టలు కనిపిస్తే చాలు కొద్ది రోజుల్లోనే ఆనవాళ్లు కోల్పోవాల్సిందే. మండల పరిధిలోని గంగవరం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో చీకటి పడగానే మట్టి మాఫియా వాలిపోతుంది. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత ఆధ్వర్యంలో ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రామంలోని సర్వే నంబరు 114లో 32.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని రాళ్ల గుట్టగా పిలుస్తున్నారు. ఈ రాళ్ల గుట్ట అక్రమార్కులకు కాసులు కురిపించే గనిగా మారింది. రాత్రి 9 గంటల తర్వాత అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. భారీ ప్రొక్లెయినర్లతో తవ్వి, టిప్పర్ల ద్వారా మంత్రాలయంలోని బైపాస్ రోడ్డుకు తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలు టీడీపీ నేత కనుసన్నల్లో జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు 200 ట్రిప్పుల వరకు గ్రావెల్ను తరలిస్తునట్లు సమాచారం. ఒక్కొక్క ట్రిప్పు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. అధికార పార్టీ నేత అండదండలు ఉండటంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదకరంగా మారిన గుంతలు..ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. రైతులు తమ పొలాలకు వెళ్లాంటే ఈ భూమి మీదుగా వెళ్లాలి. అలాగే పాడి రైతులు పశువులను మేత కోసం అటువైపు వెళ్తారు. అక్రమ మట్టి తవ్వకాలు జరగడంతో భారీ గుంతలు ఉండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. వానలు కురిసి గుంతలో నీరు నిలిచి అటువైపుగా పొలాలకు వెళ్లలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలపై తహసీల్దార్ అబ్దుల్ వాహాబ్ను వివరణ కోరగా.. గంగవరం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో తెలుగు తమ్ముళ్ల చీకటి దందా అక్రమంగా గ్రావెల్ తరలింపు టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మారిన తవ్వకాలు ప్రమాదకరంగా మారుతున్న గుంతలు -
వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేద్దాం
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డిఓర్వకల్లు: గ్రామాల్లో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేద్దామని పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ అనుబంధ విభాగాల్లో జిల్లా, రాష్ట్ర హోదాల్లో పదవులు దక్కించుకున్న నాయకులకు ఆదివారం దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఓర్వకల్లు గ్రామానికి చెందిన కాశిరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి నియామకమైన సందర్భంగా ఆయన స్వగృహానికి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కాటసాని, ఆయన తనయుడు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివనరసింహారెడ్డి వచ్చారు. వారికి గజమాలతో విష్ణువర్ధన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మీదివేముల ప్రభాకర్రెడ్డి, శంకర్రెడ్డి, నాగలింగేశ్వరరెడ్డి, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షులు శివకృష్ణారెడ్డి, గ్రామ నాయకులు కాశిరెడ్డి స్వామిరెడ్డి, తోట పురుషోత్తంరెడ్డి, జి.గోవిందరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఉస్మాన్బాషా, యోగీశ్వరరెడ్డి, అబ్రహం, జెల్ల ప్రవీణ్, చంద్రారెడ్డి, బషీర్, కోటేశ్వరరెడ్డి, అల్లస్వామి, మంజూరుబాషా, జెల్ల కృష్ణ, కుర్వ ఎల్లప్ప, స్వాములు, కృపయ్య, గోపాల్రెడ్డి, హరికృష్ణ, రాజు, రాజేష్, శివశంకర్రెడ్డి, రొక్కం సుధాకర్, భాస్కర్రెడ్డి, నారాయణరెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిచిప్పగిరి: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలతో అర్హులైన వారికి అన్యాయం జరిగిందన్నారు. అవకతవకలపై సీబీఐతో విచారణ చేయాలని తమ పార్టీ ఎన్ని సార్లు డిమండ్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు– నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దిందన్నారు. నేడు స్టూడెంట్ కిట్ కూడా ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు కత్తి రామాంజనేయులు, చంద్రశేఖర్, శ్రీరాములు, వెంకటేష్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
నమో..రాఘవేంద్రాయా!
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. ‘నమో.. రాఘవేంద్రాయా’ అంటూ స్వామి సేవలో తరించారు. అధిక సంఖ్యలో భక్తుల రావడంతో ఆదివారం మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. కల్పతర క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు కిక్కిరిసి కనిపించాయి. మహాద్వారం వరకు క్యూలైన్లో భక్తులు నిలబడ్డారు. శ్రీమఠం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు రోప్లైన్లో వెళ్లి దర్శించుకున్నారు. తుంగభద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మూల బృందవనంను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. -
ప్రయోగం..నీరుగారిన లక్ష్యం!
కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాలన్నింటికీ అప్పట్లో ఒకటే ల్యాబొరేటరీ. కీలకమైన రక్తపరీక్షలతో పాటు నీరు, ఆహార పరీక్షలు చేయాలన్నా ఇక్కడికే పంపించేవారు. అందరికీ అందుబాటులో ఉంటుందని కర్నూలు మెడికల్ కాలేజ్ ఆవరణలోనే ప్రాంతీయ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాని ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పనిచేసే సిబ్బంది భవనం దుస్థితి చూసి బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ప్రాంతీయ ప్రయోగశాల ఉంది. దాదాపు 45 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతానికి కర్నూలులో, కోస్తా ప్రాంతానికి గుంటూరులో, ఉత్తర కోస్తాకు విశాఖపట్టణంలో ప్రాంతీయ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేని వైద్యపరీక్షలను హైదరాబాద్, చైన్నె, ముంబయి వంటి నగరాలకు పంపించేవారు. అలా గాకుండా ఆ పరీక్షలన్నీ స్థానికంగానే చేయాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్లో మైక్రోబయాలజిస్టు, పెథాలజిస్టు, బయోకెమిస్ట్ వైద్యులతో పాటు పారామెడికల్ ఆఫీసర్/ వాటర్ అనలిస్టు, మరో వాటర్ అనలిస్ట్, మూడు ఫుడ్ అనలిస్ట్ పోస్టులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, రెండు వాచ్మెన్, ఒక క్లర్క్, ఒక స్వీపర్, రెండు జేఎస్ఓ, నాలుగు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, మూడు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, ఒక శ్యాంపిల్ టేకర్, రెండు జూనియర్ అనలిస్టు పోస్టులను క్రియేట్ చేసి మంజూరు చేశారు. ప్రస్తుతం ఇద్దరు, ముగ్గురు సిబ్బంది మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వరదలతో భవనం శిథిలం 2009 సంవత్సరంలో కర్నూలు నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో హంద్రీనీరు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు కర్నూలు మెడికల్ కాలేజిలోకి వచ్చాయి. కళాశాల ఆవరణలో ఉన్న ప్రాంతీయ ప్రయోగశాలలోకి కూడా వరదనీరు రావడంతో భవనంతో పాటు వైద్యపరికరాలు, పరీక్షల పరికరాలు బాగా దెబ్బతిన్నాయి. ల్యాబ్లోని ప్రధాన భవనం మొత్తం దెబ్బతిని అందులోని గోడల్లో చెట్ల వేళ్ల కిందకు దిగాయి. ప్రస్తుతం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఈ భవనం ఉంది. దీంతో పాటు పక్కనున్న కళాశాల మైదానం నుంచి పెద్ద పెద్ద పాములు ఈ భవనంలోకి వచ్చి వెళ్తుండటంతో ఉద్యోగులు హడలిపోతున్నారు. దీంతో ఈ భవనానికి తాళం వేసి ముందుగా ఉన్న రెండు షెడ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చిన రూ.19కోట్లు వెనక్కి! వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతీయ ప్రయోగశాల ప్రాంతంలో నూతన ప్రయోగశాల నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024లో రూ.19కోట్లను మంజూరు చేసింది. ఇదే సమయంలో దీనిని స్టేట్ ల్యాబోరేటరీగా కూడా అప్గ్రేడ్ చేశారు. అయితే దీనిని కళాశాలలోనే నిర్మించేందుకు స్థానిక అధికారులు ఒప్పుకోకపోవడంతో బయటి ప్రాంతంలో స్థలసేకరణ కోసం చూశారు. రెండేళ్లైనా స్థలం చూడలేకపోవడంతో వచ్చిన నిధులు రూ.19 కోట్లు ల్యాప్స్(వెనక్కి వెళ్లిపోయినట్లు) తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ల్యాబ్ నిర్వహణను ప్రాంతీయ శిక్షణ కేంద్రం(మేల్)లో నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. అయితే తమకు ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఎలాంటి అనుమతులు రాలేదని అక్కడి అధికారులు చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రాంతీయ ప్రయోగశాల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. కాగా ఇటీవల ఈ ప్రయోగశాల విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సృజన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రయోగశాల నిర్మాణానికి సంబంధించి సమగ్రంగా నోట్ఫైల్ తయారు చేసి తనకు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొక్కుబడిగా నీటి పరీక్షలు ఆహార, వైద్యపరీక్షలు గాలికి వైద్య సిబ్బంది కొరత శిథిల భవనంలో ప్రయోగశాల కూలేందుకు సిద్ధంగా భవనం 2014లో రూ.19కోట్లు మంజూరు వాడుకోలేక నీరుగారిన వైనంనామమాత్రంగా పరీక్షలు వరదల కారణంగా ల్యాబ్ దెబ్బతిన్నప్పటి నుంచి కొన్నాళ్ల పాటు నామమాత్రపు రక్తపరీక్షలు చేశారు. ఐదారేళ్ల నుంచి ఈ పరీక్షలు కూడా చేయకుండా ప్రస్తుతం నీటి పరీక్షలు(వాటర్ అనలిస్టు) మాత్రమే చేస్తున్నారు. ఇక్కడకు ఎవ్వరైనా తెచ్చే నీటిని పరీక్షించడంతో పాటు పండుగలు, పర్వదినాలు, అంటువ్యాధులు ప్రబలిన ప్రాంతాలతో పాటు మున్సిపాల్టీలకు, పంచాయతీలకు ఇక్కడి ఉద్యోగులు వెళ్లి నీటి నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. కాగా కర్నూలు నగరంలో 60కి పైగా ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. దీనికితోడు వసతి గృహాలు, వాణిజ్య కేంద్రాలు, వ్యక్తిగత గృహాల్లో ఏర్పాటు చేసుకున్న ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీటిని పరీక్షల కోసం తీసుకొస్తున్నారు. తగినంత సిబ్బంది లేక పరీక్షలు చేయలేకపోతున్నారు. -
బలిజ, కాపుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
కర్నూలు(అగ్రికల్చర్): బలిజ, కాపుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రాయల అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్( రోపా) నాయకులు పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి ఆదివారం కర్నూలు నగరంలోని సాయివసంత్ కాంప్లెక్స్లో పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజీవీ కళా క్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ...కాపు జాతికి రిజర్వేషన్లు అమలు చేసేందుకు అలుపెరగని పోరాటం చేసి ముద్రగడ ఆదర్శప్రాయులయ్యారని పేర్కొన్నారు. రోపా అధ్యక్షుడు చింతలపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ముద్రగడ చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వం కాపు, బలిజ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. జస్టిస్ మంజునాథ్ కమిటీ సిఫారస్సు మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రోపా ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు, కోశాధికారి పెద్దస్వామి, తులసి సీడ్స్ ఆధినేత రామచంద్రప్రభు, ఇతర సభ్యులు దివాకర్రావు, కామిని వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమే సాంస్కృతిక విధానాన్ని ప్రవేశపెట్టాలి
● భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు చర్యలు చేపట్టాలి ● ప్రజానాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం కర్నూలు(సెంట్రల్): సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ డిమాండ్ చేశారు. ప్రజా నాట్య మండలి 11వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఆదివారం సన్యాసిరావు – పెంచలయ్య నగర్లో రెండో రోజు వివిధ రకాల కళారూపాల వివరాల నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జిల్లాల ప్రతినిధులు, కార్యదర్శి నివేదికపై చర్చల్లో పాల్గొన్నారు. అంతేగాక సభలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు, భావవ్యక్తీకరణకు భంగం ఈ సందర్భంగా కట్టా నరసింహ మాట్లాడుతూ..1991 తరువాత ప్రపంచీకరణ నేపథ్యంలో కళలు కూడా బడా కార్పొరేటర్లకు అనుకూలంగా మారిపోయాయన్నారు. ప్రజా కళలు, కళాకారులకు ప్రోత్సాహం తగ్గిపోయిందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు, భావవ్యక్తీకరణకు భంగం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాలు, ప్రజా కళలు వర్ధిల్లాల్సిన పరిస్థిలి నెలకొందన్నారు. శ్రమజీవులు, గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ప్రజానాట్య మండలిపై, ప్రజా సాంస్కృతిక ఉద్యమంపై బరువు, బాధ్యతలు పెరిగాయన్నారు. సామాజిక సేవకులపై దాడులు కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందరాపుమురళీ, గొర్రెలు మేకల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంట్రావు, జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బంగారు మురళీ మాట్లాడుతూ.. ప్రజా కళలు వర్ధిల్లాలని, ప్రజా పోరాటాలను ఉద్ధృతం కావాలన్నారు. ప్రజల హక్కులను ప్రజా కళాకారులను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. ఈ మధ్యకాలంలో అనేకమంది మేధావులు, కళాకారులు, పౌర హక్కుల నేతలు, సామాజిక సేవకులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో అందరూ ఐక్యమై ప్రజా కళలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత పెరిగిందన్నారు. గురజాడ సాంస్కృతిక విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలనే తీర్మానాన్ని పెద్దిరాజు ప్రవేశపెట్టగా రాఘవయ్య బలపరిచారు. గురజాడ సాంస్కృతిక విశ్వ విద్యాలయం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు జానపద, నాటక, ప్రజా కళారూపాలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. తెలుగు మాధ్యమ విద్యను బలోపేతం చేయాలని, కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి అనే తీర్మానాన్ని ఎంచంటి ప్రవేశపెట్టగా నోమేశ్వరి బలపరచారు. ఇందులో ప్రధానంగా భావ ప్రకటనా స్వచ్ఛా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొంటూ రచయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రెండు తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు, ఉపాధ్యక్షులు జి.రమణ, సహాయ కార్యదర్శులు ఈ నాగరాజు, ఐవెంకటేశ్వర్లు, రిసోర్స్పర్సన్లు కవి పీఎన్ఎం సీనియర్ నాయకులు జగన్, కర్నూలు జిల్లా అధ్యక్షులు నోమేశ్వరి పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న వీధి నాటకోత్సవాలు..
పీఎన్ఎం 11వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వీధి నాటకోత్సవాలు ఆదివారం ఆకట్టుకున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు మార్కెట్ యార్డులోని కళా వేదికలో కర్నూలు జిల్లా కళాకారులు ప్రదర్శించిన డప్పుల నృత్యం ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా కళాకారులు ప్రదర్శించిన ఆజాది డ్యాన్స్, టామీటామీటామీ వీధి నాటిక, కర్నూలు జిల్లా కళాకారులు ప్రదర్శించిన పోతులూరి వీరబ్రహ్మం నృత్యరూపకం ఆలరించింది. పశ్చిమ గోదావరి జిల్లా కళాకారులు ప్రదర్శించిన మన్యం విప్లవం వీధి నాటకం, పోలవరం జిల్లా కళాకారులు ప్రదర్శించిన అమ్మ పేకనులు మేసీ డ్యాన్స్, నెల్లూరు జిల్లా కళాకారులు ఏకులం నీది వీధి నాటికలు ఆకట్టుకున్నాయి. వివిధ జిల్లాకు చెందిన కళాకారులు అబ్బురపరచే కళలు, నృత్యాలను ప్రదర్శించి ఆకట్టకున్నారు. -
మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు
కర్నూలు(అర్బన్): మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. శనివారం స్థానిక బి.క్యాంప్లోని జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయంలో జూలై 26న కార్గిల్ దివస్ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల కోసం లీగల్ సర్వీసెస్ క్లీనిక్ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో న్యాయవాదితో పాటు ప్యారా లీగల్ వలంటీరు ఉంటారన్నారు. మాజీ సైనికులకు చట్టబద్ధమైన సమస్యలు ఉంటే ఉచిత న్యాయాన్ని అందించి పరిష్కరిస్తామన్నారు. ఇందుకోసం లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులకు వీర్ పరివార్ లీగల్ ఎయిడ్ కార్డ్స్ను జడ్జి అందించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఇన్చార్జి అధికారి మహేంద్రమ్మ, లీగల్ ఎయిడ్ న్యాయవాది విజయలక్ష్మి, ప్యారా లీగల్ వలంటీరు మదుసూధన్రావు తదితరులు పాల్గొన్నారు. -
అధిష్టానానికి ఫిర్యాదులు
ఆలూరు నియోజకవర్గంలో అధికంగా ఉన్న బోయ, కురువ, ఎస్సీతో పాటు మిగిలిన బలహీనవర్గాల్లో కొందరు వీరభద్రగౌడ్కు అనుకూలంగా ఉన్నారు. జ్యోతి ఇన్చార్జి కాగానే ఆయా వర్గాలకు చెందిన చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలను ఆమె దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. దీంతో పాత టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరభద్ర గౌడ్ సైతం నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆయన వర్గం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇప్పటికే పలుమార్లు జ్యోతిపై నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
సొంత పార్టీలోని వర్గపోరు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్రమార్కులకు.. దోచిపెట్టే వాళ్లకే ఆ పార్టీ ముఖ్య నేతలు పెద్దపీట వేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే ఫిర్యాదులతో అధిష్టానం తల బొప్పి కట్టగా.. ఇ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆస్పరి మండలానికి చెందిన టీడీపీ నేతలు సతీష్, సంజప్ప, ఇదే మండలంలోని సాయిబాబా, యుగంధర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్లనివ్వకుండా స్వయంగా టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి వర్గం అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయుష్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి శనివారం మధ్యాహ్నం ఆస్పరి మండలానికి చేరుకున్నారు. ఇదే సందర్భంగా కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి హాజరుకాకుండా పలువురు టీడీపీ నేతలను ఉదయం నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేయడం గమనార్హం. వీరభద్రగౌడ్ అనుచరుల పట్ల వివక్ష సతీష్, సంజప్ప, సాయిబాబా, యుగంధర్లు గతంలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బి.వీరభద్రగౌడ్ అనుచరులు. గత ఎన్నికల్లో ఆయన వైఎస్సార్సీపీ అభ్యర్థి విరుపాక్షి చేతిలో ఓటమిచెందారు. దీంతో వీరభద్రగౌడ్ను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి పార్టీ అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వైకుంఠం జ్యోతిని ఇన్చార్జిగా నియమించారు. అప్పటినుంచి జ్యోతి తన సామాజిక వర్గంతో పాటు తన ముఖ్య అనుచరులకే పనులు చేసిపెడుతూ పాత టీడీపీ వర్గీయులను దూరం పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వీరభద్రగౌడ్ అనుచరుల పట్ల పూర్తి వివక్షతో వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. వివాదాస్పదంగా ఆలూరు ఇన్చార్జి వైకుంఠం జ్యోతి తీరు అసమ్మతి వర్గాన్ని అణగదొక్కే వ్యూహం చంద్రబాబును కలవకుండా పోలీసు అస్త్రం వీరభద్రగౌడ్ అనుచరులకు చుక్కెదురు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు -
ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకోం
ఆదోని: భూకబ్జాలపై ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయ న తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండిగిరి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 344లో గుంతకల్వాసి షేక్ సాదిక్కు చెందిన3.37 ఎకరాలను తాను కబ్జా చేశానంటూ గుడిసె క్రిష్ణమ్మ నిరాధరమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మి వెంటనే మీడియా మందుకు వచ్చి ఆరోపణలు చేయడం బాధ్యతాయుతమైన రాజకీయం కాదన్నారు. అతని వద్ద ఉన్న పత్రాలు, భూమి ఆయనకు ఎలా వచ్చింది, అసలు వివాదం ఏంటి, అమ్మింది ఎవరు, కొనింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలన్నారు. ‘నేను ఎన్నోసార్లు చెప్పాను.. నాకు, నా కుటుంబానికి కబ్జాలతో సంబంధం లేదు’ అని మరోసారి తెలిపారు. తన పేరు పదే పదే ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం రాజకీయ అవివేకమన్నారు. తన పేరును అంతగా గుర్తుంచుకోవాలనుకుంటే రింగ్ టోన్గా మార్చుకోవాలన్నారు. భూకబ్జా అంటే ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడటం సరికాదని.. తనకు ఎవరి భూమినో దోచుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన తాతల కాలం నుంచి భగవంతుడు ఇచ్చిన ఆస్థి ఉందని, అక్రమాలకు పాల్పడాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అసలు ఈ రెండేళ్ల కూటమి పాలనలో భూకబ్జాలకు పాల్పడుతోంది మీ పార్టీ నేతలనేనన్నారు. ఇసుక, మద్యం, బియ్యం, అక్రమ రిజిస్ట్రేషన్లు.. అన్నింట్లో దోపిడీ జరుగుతోందన్నారు. ముందుగా వీటిపైన విచారణ చేయించాలని గుడిసె కృష్ణమ్మకు సవాల్ విసిరారు. -
హాస్టల్ను మూసివేస్తాం.. ఇంటికి వెళ్లండి!
కోసిగి: గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం కోసిగిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ఎత్తివేస్తాం..ఇంటికి వెళ్లండంటూ వార్డెన్ జయరాముడు విద్యార్థులకు సూచిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. హాస్టల్ను ఎత్తి వేసి ఆ స్థానంలో గురుకుల బాలికల పాఠశాల ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్డెన్ చెబుతున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కలిసి వార్డెన్తో వాగ్వాదం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండానే పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను యథాతథంగా కొనసాగించాలని, కొత్తగా చేరే విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. గురుకుల బాలికల పాఠశాలను కోసిగిలోనే మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
పోలీసులను అడ్డుపెట్టుకొని..
ఆస్పరికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా పాత టీడీపీ కార్యకర్తలు తమ ఇబ్బందులను తెలిపేందుకు సిద్ధమయ్యారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పోలీసులను అడ్డుపెట్టి సతీష్, సంజప్ప, సాయిబాబా, యుగంధర్లను గృహనిర్బంధంలో ఉంచినట్లు ప్రచారం ఉంది. ఇప్పటికే అనుకూలంగా ఉన్న కొందరు పోలీసు అధికారులను అడ్డు పెట్టుకుని వీరభద్రగౌడ్ అనుచరులైన పాత టీడీపీ వర్గీయులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సొంత పార్టీ వర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏ ముఖం పెట్టుకొని వచ్చావు చంద్రబాబూ!
చిప్పగిరి: ఎన్నికల సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. శనివారం ముఖ్యమంత్రి ఆస్పరి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరైన వేదావతి, నగరడోణ రిజర్వాయర్, జింకల పార్కు, హంద్రీనీవా తూము ఇలా చెప్పుకుంటూపోతే ఆయన ఇచ్చిన హామీలు పెద్ద చిట్టానే ఉందన్నారు. అయితే రెండేళ్లు గడిచినా ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ పోలీసులు కనీస ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే వైఎస్సార్సీపీ నాయకులను చూస్తే అంత భయమెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసులు పావులుగా మారుతున్నారన్నారు. ఎల్లప్పూడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ అరాచక పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మునిస్వామి
కర్నూలు(టౌన్): వైఎస్సార్సీపీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బి. మునిస్వామి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బి. మునిస్వామికి బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.డాక్యుమెంట్ల తయారీకి పీడీఈ కౌంటర్లు కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ డేటా ఎంట్రీ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా రిజిస్ట్రార్ వై.బజారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీడీఈ కౌంటర్ల ద్వారా ప్రజలు డాక్యుమెంట్లను తయారు చేయించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పీడీఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పాత సేవలతో ‘కొత్త సంజీవని’ ● పైలట్ ప్రాజెక్టుగా ఆస్పరి పీహెచ్సీ ఎంపిక ● నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యసేవలను డిజిటలైజేషన్ చేసే విధంగా తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంజీవని అని పేరు పెట్టింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రంగా ఈ పైలట్ ప్రాజెక్టు అమలవుతుండగా మన జిల్లాలోని ఆస్పరి పీహెచ్సీలో ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ అభా కార్యక్రమం, టెలిమెడిసిన్లను కలిపితేనే సంజీవని అవుతుందని వైద్యుల్లోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ సంజీవని ప్రాజెక్టులో సాంకేతిక సహకారాన్ని టాటా సంస్థ అందిస్తోంది. పీహెచ్సీకి వచ్చే రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, వారికి చేసిన వైద్యపరీక్షలు, ఇచ్చిన చికిత్స, మందులు తదితర వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి పీహెచ్సీలో కొందరు సిబ్బందిని నియమించనున్నారు. బీఎడ్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత మార్చి నెల నిర్వహించిన బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రెగ్యులర్ 4,404 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,186 మంది ఉత్తీర్ణత సాధించారన్నారురు. సప్లిమెంటరీకి సంబంధించి 977 మంది పరీక్షలు రాయగా 742 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. -
గంగమ్మ డెత్ మిస్టరీని ‘దాచిపెట్టారు’!
ఆదోని: గంగమ్మ డెత్ మిస్టరీని పోలీసులు ‘దాచిపెడుతున్నట్లు’గానే కనిపిస్తోంది. రెండు నెలల క్రితం కౌతాళం మండలం బదినేహాళ్ గ్రామానికి చెందిన మాల గంగమ్మ కస్టోడియల్ డెత్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నిజానిజాలను ప్రజల ముందుంచేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ నిజనిర్ధారణ కమిటీ మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం బదినేహాళు గ్రామానికి చేరుకుంది. స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి షౌకత్ తబ్రేజ్, లీగల్ సెల్ కార్యదర్శి జీవన్సింగ్, ఎంఎల్సీ డాక్టర్ మధుసూదన్, తదితరులు ఆయన వెంట ఉన్నారు. అయితే విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు గంగమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యులను భయపెట్టి ఇంటి నుంచి పంపేసినట్లు తెలుస్తోంది. ఒక గంట క్రితం వరకు వారంతా ఇంట్లోనే ఉన్నారని, ఇంతలోనే కనిపించకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని గ్రామస్తులే చర్చించుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ గంగమ్మ లాకప్ డెత్ వెనుక వాస్తవాలను వెలికితీయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. గంగ మ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి షౌకత్ తబ్రేజ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినట్లు తప్పు చేసిన వాళ్లు సప్త సముద్రాల అవతల దాగున్నా వదలబోమన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో బదినేహాలుకు నాయకులు కనిపించని గంగమ్మ కుటుంబ సభ్యులు పోలీసులు భయపెట్టి ఉంటారనే చర్చ -
ప్రజా వ్యతిరేకతతోనే సీఎం జిల్లా పర్యటనలు
ఆస్పరి: ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండటంతోనే చంద్రబాబు జిల్లా పర్యటనలకు వస్తున్నాడని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలకు ఖర్చు చేసే వందల కోట్ల రూపాయలు ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించాలన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెలలోనే నాలుగు పర్యటనలు చేసిన సీఎం ఒక్క సమస్యనైనా పరిష్కరించలేకపోయాడన్నారు. శనివారం ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ ఎమ్మెల్యే శుక్రవారం ఆస్పరిలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న సమయంలో అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఎమ్మెల్యే సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా అని ప్రశ్నించారు. కొద్దిసేపు పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలోని గ్రామాలలో మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. ఆస్పరి మండలంలోని గ్రామాల్లో నెలకోసారి కొళాయిలు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా నగరడోణ, వేదావతి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. ఆస్పరిలో ఓ చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బసవరాజు, జెడ్పీటీసీ దొరబాబు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నిలదీతలు.. నిరసనలు
కర్నూలు సిటీ: పాఠశాల విద్యలో మార్పుల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడికి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులు ముగిసి గత నెల 12న స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజుకూ విద్యార్థులకు అవసరమైన కిట్లు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పీటీఎం(పెరెంట్స్, టీచర్స్ మీటింగ్) పేరుతో సమావేశాలు నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు ఒక రోజు ముందు అత్తెసరు నిధులు జమ చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే స్కూళ్లకు చెందిన హెచ్ఎంలు ఆ నిధులు సరిపోక సమావేశాలను మమ అనిపించారు. మౌలిక సదుపాయాల పనులు నిలిచిపోవడం, తల్లికి వందనం రాకపోవడం, టీచర్లు లేకపోవడంపై పశ్చిమ ప్రాంత స్కూళ్ల హెచ్ఎంలను పెరెంట్స్ ప్రశ్నించారు. పిల్లల సామర్థ్యంపై టీచర్ అంచనా వేసి లోటు పాట్లను పెరెంట్స్కు తెలియజేయడంతో పాటు ఆప్యాయతను పంచాల్సిన సమావేశంలో ఎక్కడా ఆ ఊసేలేకుండా పోయింది. పీటీఎం సమావేశాల్లో టీడీపీ నేతలు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో పోలీసుల బందోబస్తు మధ్యనే సమావేశాలు నిర్వహించారు. అయితే చాలా చోట్ల వేదికలపై ఎలాంటి నామినేటెడ్, ప్రొటోకాల్ పదవులు లేని వారిని సైతం కూర్చోబెట్టి విద్యాశాఖ అధికారులు ప్రసంగాలు ఇప్పించారు. మరికొన్ని చోట్ల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ప్రతినిధులు లేకుండానే సమావేశాలు నిర్వహించారు. ● ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన పీటీఎం సమావేశంలో టీడీపీ జిల్లా అద్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడులు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సమాధానం చెప్పక ముందే విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు గేటు బయటకు గెంటేశారు. పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ● పత్తికొండ నియోజకవర్గంలోని రామలింగాయపల్లెలో జరిగిన పీటీఎం సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. పత్తికొండ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన పీటీఎం సమావేశాలను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ● కర్నూలు నగరంలోని ప్రభుత్వ ఉన్నత(టౌన్ మోడల్) హైస్కూల్లో జరిగిన పీటీఎం సమావేశంలో ఎమ్మెల్సీ బి.టి నాయుడు హాజరయ్యారు. ఇదే సమయంలో విద్యా సంస్థల బంద్లో భాగంగా విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి చేరుకొని ఢిల్లీ ఘటనలపై మీ ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అయితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను బయటకు లాక్కెళ్లిపోయారు. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం విద్యాసంస్థల బంద్లో భాగంగా విద్యార్థుల ఆందోళన వేదికలపై టీడీపీ నేతలను కూర్చోబెట్టి ప్రసంగాలు -
ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నీ తొలగిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తామని ప్రతీ సమావేశంలో వాగ్దానం చేశారు. గ్రామాలను పట్టణాలకు
● ఏర్పాటు కాని జింకల పార్కు ● కలగా మారిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ● చెరువులకు అందని హంద్రీ–నీవా నీరు ● అందుబాటులోకి రాని నగరడోణ రిజర్వాయర్ ● గ్రామాలకు 20 రోజులకోసారి తాగునీటి సరఫరా ● నేడు ఆస్పరి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన ఎన్నికల సమయంలో ఆలూరులో ప్రజలకు హామీలు ఇస్తున్న చంద్రబాబు(ఫైల్)20 రోజులకోసారి తాగునీరు జింకల పార్కు ఎప్పుడో? రైతుల వినతి మేరకు హొళగుంద మండలంలోని దేవరగట్టులో జింకల పార్కు ఏర్పాటు చేస్తానని 2013లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుల పంటల పొలాల రక్షించుకునేందుకు కంచె ఏర్పాటు చేసుకోవాడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుదని చెప్పారు. అలాగే ఆలూరులో టెక్స్టైల్ పరిశ్రమ, ఆస్పరి మండలంలో టమాటా జూస్ ఫ్యాక్టరీ వంటి హామీలు ఇప్పటికీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 2016లో రైతులకు స్ప్రింకర్లు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హోదాలో ఆలూరు మండలం అరికెర గ్రామ సమీపంలో ప్రారంభోత్సవ సభకు వచ్చిన చంద్రబాబు నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీ–నీవా నుంచి ఎత్తిపోతల ద్వారా నీరు నిల్వ చేస్తానని రైతులకు గట్టిగా హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో నీటిని ఎత్తింది లేదు.. పోసింది లేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, భూ కబ్జాలు, ఇసుక, ఎర్రమట్టి దోపిడీ, వీధికో బెల్టు షాపులు పెట్టి లక్షలు గడిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పొలాల్లో సంచరిస్తున్న జింకలుఐనేకల్లు గ్రామంలో తాగునీటి కోసం నిరీక్షణఆలూరు రూరల్: ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని ఆలూరు నియోజకవర్గ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 2024లో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్పరి మండలంలో శనివారం సంజీవని కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో నిలదీయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. పూర్తికాని నగరడోణ చిప్పగిరి మండలంలో నగరడోణ రిజర్వాయర్ ఏర్పాటుకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ.18 కోట్లతో 0.104 టీఎంసీల నీటి సామర్థ్యంతో 14,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రభుత్వ ధరతో భూములు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. వైఎస్సార్ మరణాంతరం ఆ పనులు నిలిచిపోయాయి. పాదయాత్రగా 2013లో చిప్పగిరి మండలానికి చంద్రబాబు వస్తే సమస్యను రైతులు విన్నవించారు. టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే రిజర్వాయర్ నిర్మాణం పూర్తిచేస్తాని హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఐదేళ్లు చేసిందేమి లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీటెండరింగ్ ద్వారా రూ.56 కోట్లతో నగరడోణ రిజర్వాయర్ పనులు చేపట్టి 75 శాతం పూర్తి చేశారు. హంద్రీ–నీవా ద్వారా తూము ఏర్పాటు చేసి ఏబీసీ (ఆలూరుబ్రాంచ్ కెనాల్)కి సాగునీరు అందిస్తామ న్న హామీని చంద్రబాబు పదేళ్లుగా నెరవేర్చలేదు. మాటలకే పరిమితం! సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రజాగళం పేరుతో ఆలూరులో ఏర్పాటు చేసిన ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వేదవతి, నగరడోణ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తానని మాట ఇచ్చారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా చెరువులకు నీటి నింపుతామని చెప్పారు. కేంద్రప్రభుత్వంతో మాట్లాడి హైవే 167 రహదారి నిర్మాణం పూర్తి చేయిస్తామన్నారు. దేవనకొండ మండలంలోని నల్లచెలిమల గ్రామంలోని పెద్ద చెరువు, చిన్న చెరువుకు, నల్లగుండ్ల గ్రామ చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని నింపుతామని వాగ్దానం చేశారు. వేదవతి, నగరడోణ రిజర్వాయర్ల నిర్మాణం ఊసేలేకుండా పోయింది. అలాగే టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, జింకల పార్కు ఏర్పాటు.. తదితర హామీలు నీటి మూటలా మిగిలిపోయాయి. ఆలూరు యోకవర్గంలోని ఆరు మండలాల పరిఽధిలో 3.50 లక్షల జనాభా ఉంది. కేవలం తొమ్మిది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులతో ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నారు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా అన్ని స్టోరేజీలకు తాగునీరు పంప్ చేసి అక్కడ నుంచి ఆయా సంపుల ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులకు నింపి ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. మండల కేంద్రాలకు 15 రోజుల ఒక సారి తాగునీరు సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు నెలకో సారి కూడా మంచినీరు సరఫరా కాని పరిస్థితి. ఈ ఏడాది ఎల్నీనో ప్రభావంతో వర్షాలు లేక నియోజకవర్గంలో తాగునీటి కష్టాల వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. ప్రజలు మంచినీటి కోసం కిలో మీటర్ల మేర వెళ్లి బోర్లను ఆశ్రయిస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు ముట్టడిస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వంలో, అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. కరువుకు కేరాఫ్గా ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు ఈ ఏడాది గుక్కెడు నీటి కోసం అల్లాడుతోంది. -
శ్రీశైలంలో ఆగస్టు 13 నుంచి శ్రావణమాసోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆగస్టు 13వ తేదీ నుంచి శ్రావణమాసోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శ్రావణమాసోత్సవాల ఏర్పాట్లపై అర్చకస్వాములు, వేదపండితులు, డిప్యూటీ ఈఓ, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాలు ముందస్తు ప్రణాళికలతో ఉత్సవ నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, క్యూ కంపార్ట్మెంట్లలో తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించాలన్నారు. లడ్డూప్రసాదాల కొరత లేకుండా చూసు కోవాలన్నారు. సామూహిక వరలక్ష్మీవ్రతం, శ్రావణ అఖండ శివనామ భజనలకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలన్నారు. అమ్మవారికి బంగారు గాజుల సమర్పణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు దంపతులు బంగారు గాజులు సమర్పించారు. గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. బంగారు గాజులతో పాటు నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి రూ.3లక్షల విరాళాన్ని కూడా అందజేశారు. బంగారు గాజుల మొత్తం బరువు 186 గ్రాములు ఉంటుందని, వీటి విలువ సుమారు రూ.27లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. అనంతరం దాత సిద్ధా రాఘవరావు దంపతులకు వేదాశీర్వచనముతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందజేసి సత్కరించారు. -
పర్యావరణ హితంగా పండుగ చేసుకోవాలి
నంద్యాల(వ్యవసాయం): వినాయక చవితి పండుగను పర్యావరణ హితమైన పండుగగా చేసుకోవాలని రాష్ట్ర గణేష్ మహోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ అన్నారు. జిల్లా గణేష్ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం జిల్లాలో ని అన్ని మండలాలలో ఉన్న వినాయక చవితి కమిటీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా స్థాయి విస్తృత సమావేశం రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పాకాల త్రినాథ్ మాట్లాడు తూ పండుగను ముందస్తు ప్రణాళికలతో ఎటువంటి సమస్యలు, ప్రమాదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. రాష్ట్ర గణేష్ మహోత్సవ కమిటీ ఉపాధ్యాక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వినాయక మండప నిర్వాహకులు మట్టి (సహజ) వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలన్నారు. విగ్రహాల నిమజ్జనం ప్రభుత్వ అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలని, చెరువులు, కాలువలు కాలుష్యం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గణేష్ సమితి నిర్వాహక సభ్యుడు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి రాజశేఖర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి విజయకుమార్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్, మేడ మురళీ, నర్ల మహేశ్వరరెడ్డి, సత్యం, శంకర్, సుహాసిని, ఇందిరా, నాగిరెడ్డి, హుస్సేన్ రెడ్డిలు పాల్గొన్నారు. -
మహానందిలో వార్షిక ఆలయ శుద్ధి
మహానంది: ఆషాఢమాసం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో గురువారం వార్షిక ఆలయ శుద్ధి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, హనుమంతుశర్మ, నాగేశ్వరశర్మ, అర్చకులు రాముశర్మ, హరిశర్మ, ధర్మతేజ ఉదయం ప్రత్యేక పూజలు చేపట్టారు. ముందుగా గణపతిపూజ, ద్రవ్యపూజలు శాస్త్రోక్తంగా జరిపారు. జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, వట్టివేళ్లు, లాంటి సుగంధ ద్రవ్యాలతో మిశ్రమ జలాన్ని తయారు చేసి సంకల్ప పూజలు జరిపిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి, రామాలయం, ఆంజనేయస్వామి, నవగ్రహ ఆలయం, వినాయకనంది, పాండవులు ప్రతిష్టించిన పంచలింగాల ఆలయాల గోపురాలను పరిశుభ్రం చేశారు. వేదపండితులు రవిశంకర అవధాని మాట్లాడుతూ.. ఆలయ శుద్ధి కార్యక్రమం వెనుక ఆధ్యాత్మిక, ఆగమపరమైన వాటితో పాటు ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయన్నారు. ఏడాది పొడవునా భక్తులు వస్తుండటం, ఆరోగ్యానికి హాని చేసే క్రిమి కీటకాలు లాంటివి ఉండకుండా చేస్తారని, ద్రవిడ బాషలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారన్నారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ఐటీఐ బాటలో ఉద్యోగ అవకాశాలు
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి తర్వాత అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్లో చేరారు. మరికొందరు టెక్నికల్ కోర్సులైన పాలిటెక్నిక్, ఐటీఐలలో చేరేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం అవగాహన కల్పించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలోని ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) కళాశాలల్లో దాదాపు భారీగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 ప్రభుత్వ, 16 ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి డోన్, బేతంచెర్ల, అవుకు, నంద్యాల, శ్రీశైలంలో కళాశాలలు ఉన్నాయి. మొదటి విడతలో ప్రభుత్వ ఐటీఐలలో 1,040 సీట్లకు గాను 325 సీట్లు మాత్రమే భర్తీ కాగా మిగిలిన 715 సీట్ల కోసం రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రైవేటు ఐటీఐలలో 2 వేల సీట్లకు గాను 7 సీట్లు మాత్రమే భర్తీ కాగా 1993 సీట్లను రెండో విడతలో ఆన్లైన్ దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐటీఐ కోర్సులు చదివిన విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రాంగణ ఎంపికల ద్వారా వారికి వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావ కాశాలు కల్పించడంతో పాటు వివిధ పరిశ్రమలలో అప్రెంటిస్ శిక్షణ కూడా అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ విద్యార్థులకు పీఎం సర్వసేతు అనే విద్యా విధానం ద్వారా ఆన్లైన్ కోర్సులు నిర్వహించి జర్మన్ భాష నేర్పించి వారికి జర్మనీలోని వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా ఐటీఐ కోర్సులతో ఒక చక్కటి బాటను ఏర్పాటు చేసుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఐటీఐ చక్కటి మార్గం. విద్యుత్, రైల్వే, రక్షణ రంగంతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు ఉపాధి తప్పకుండా లభిస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ, ఐటీఐల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధి సైతం ఐటీఐ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఉన్నత చదువుకు అవకాశం.. ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్లో ప్రవేశం పొందొచ్చు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఈ నెలలో అడ్మిషన్ పక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 3వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలలో అదే నెల 4న వెరిఫికేషన్ చేయించుకోవాలి. 6న కౌన్సెలింగ్ నిర్వహించి షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మైబెల్ నంబర్కు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి. – ప్రసాదరెడ్డి, ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ జిల్లా కన్వీనర్, నంద్యాల డోన్ ఐటీఐలో కంప్యూటర్ ద్వారా శిక్షణ పొందుతున్న విద్యార్థులునంద్యాల ఐటీఐలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాల్లో 3,080 సీట్లు మొదటి విడతలో 332 సీట్లు మాత్రమే భర్తీ రెండో విడత ప్రభుత్వ ఐటీఐలో 715, ప్రైవేటులో 1,993 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు కోర్సుల వివరాలు ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఏడాది, రెండేళ్లకు సంబంధించిన పలు కోర్సులున్నాయి. ఇందులో రెండేళ్లకు సంబంధించి ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మోటర్ మెకానిక్, డ్రాఫ్ట్ మెన్, సివిల్, టర్నర్, మిసినిస్టు కోర్సులున్నాయి. ఏడాదికి సంబంధించి డ్రస్ మేకింగ్, కంప్యూటర్ కోర్సు (కోప) డిజిల్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్ కోర్సులు ఉన్నాయి. -
గిరిజన కళాశాలలో సీట్ల భర్తీ దరఖాస్తుల ఆహ్వానం
శ్రీశైలంప్రాజెక్ట్: స్థానిక గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ 22, బైపీసీ 16, సీఈసీ 18, ఒకేషనల్ గ్రూప్ల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. నంద్యాల, కర్నూలు, ప్రకాశం, కడప, అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలకు చెందిన గిరిజన విద్యార్థులు అర్హులని తెలిపారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు కూడా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి కళాశాలలో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 9490957268, 8985229957ను సంప్రదించాలన్నారు. వరి బస్తాల దొంగలు అరెస్టు నందవరం: నాగలదిన్నె గ్రామంలో జరిగిన వరి బస్తాల చోరీ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గత నెల 6వ తేదీన గ్రామానికి చెందిన రంగయ్య శెట్టికి సంబంధించిన 155 బస్తాల వరి ధాన్యం బస్తాలు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి గ్రామానికి చెందిన పుల్లారెడ్డి, మన్సుర్, రంగస్వామిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 155 బస్తాల వరి ధాన్యం రికవరీ చేశామని, అలాగే చోరీకి వినియోగించిన ట్రాక్టర్, టెంపోలను సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. ముగ్గురు నిందితులను గురువారం కోర్టులో హాజరు పరుచుగా జడ్జి రిమాండ్కు ఆదేశించారన్నారు. ఆలూరులో చోరీ ఆలూరు రూరల్: ఆలూరు పట్టణంలో గురువారం సాయంత్రం చోరీ జరిగింది. కోయనగర్ కాలనీలో నివాసం ఉండే బజారప్ప ఇంట్లో దొంగలు చొరబడి రూ.లక్ష దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. వివరాలు..కాలనీలో శుభకార్యం ఉండడంతో ఇంటికి తాళాలు వేసి వెళ్లగా.. కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువా తెరచి ఉండగా..లోపలికెళ్లి చూసి.. అందులో దాచుకున్న రూ.లక్ష నగదు దోచుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించినట్లు ఎస్ఐ మన్మథ విజయ్ వివరించారు. ఓర్వకల్లు: మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యదర్శి శ్రీరాములు నాయుడు సూచించారు. గురువారం స్థానిక పొదుపు భవన్లో నిర్వహిస్తున్న కమ్యూనిటీ మేనేజింగ్ ట్రైనింగ్ సెంటర్(సీఎంటీసీ)ను ఆయన సందర్శించారు. ఐక్య సంఘం గౌరవ సలహాదారురాలు విజయభారతి అధ్యతన జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని అదనపు సీఈఓ శ్రీరాములు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమాఖ్య బలోపేతానికి కర్నూలు, ఓర్వకల్లులో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓర్వకల్లు శిక్షణ కేంద్రానికి రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి హాజరయ్యారన్నారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యూట్ బ్యాగ్(జనపనార సంచుల)లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కెనెరా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే టైలరింగ్ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు శ్రీధర్రావు, శ్రీధర్రెడ్డి, డీపీఎమ్లు నవీణ్, రహెమాన్, ప్రభావతి, ఏపీఎంలు శ్రీనివాసులు, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. రిజర్వాయర్కు భూములిచ్చే ప్రసక్తేలేదు ● తేల్చిచెప్పిన మీదివేముల గ్రామ రైతులు ఓర్వకల్లు: ఏపీఐసీసీకి భూములిచ్చే ప్రసక్తే లేదని మండలంలోని మీదివేముల గ్రామ రైతులు తేల్చిచెప్పారు. గురువారం వైఎస్సార్సీపీ నాయకులు, కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఏపీఐఐసీ 600 ఎకరాలను సేకరించిందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ కోసమని మరో 230 ఎకరాలకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ కేవలం ఒకే గ్రామాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదన్నారు. తీసుకున్న భూములకు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వారిచ్చే పరిహారానికి బయట కొనుగోలు చేయాలంటే కనీసం అర ఎకర కూడ రాదన్నారు. ఇప్పటికై నా గ్రామ రైతుల మనోభావాలను అర్థం చేసుకుని భూములు తీసుకోవాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ విరమించుకోవాలి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నక్కి లెననిబాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు పూనుకోవడం అన్యాయమన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఏఐటీయూసీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకుంటోందన్నారు. విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్కు అప్పగించేందుకు చూస్తుందని, దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నాయకులు జి.చంద్రశేఖర్, ఈశ్వర్, కృష్ణారెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు. కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలతో ఖర్చులు తడిసి మోపైడె ప్రజలపై భారం పడడం తప్పా.. ఒరిగిందేమీ లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్ విమర్శించారు. నెల రోజుల్లో నాలుగోసారి ఉమ్మడి జిల్లాకు వస్తున్నా ఒక్క పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుకు పైసా విదల్చలేదన్నారు. గురువారం సుందరయ్య భవన్లో ఆయన మాట్లాడుతూ.. వెంటనే గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్, పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఎమ్మిగనూరులో చేనేత క్లస్టర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత సీజన్లో వర్షాలు లేక రైతులు పంటలు విత్తుకోలేదని, వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ నారాయణ, జి.రామకృష్ణ, ఎండీ ఆనంద్బాబు పాల్గొన్నారు. -
బాలల సంక్షేమం కోసం లీగల్ సర్వీసెస్ కృషి
కర్నూలు (టౌన్): బాలల సంక్షేమం కోసం, వారికి న్యాయ సహాయం కోసం లీగల్ సర్వీసెస్ కృషి చేస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి అన్నారు. కర్నూలు శివారులోని పెద్దపాడులోని దామోదరం సంజీవయ్య బాలసదన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. బాలసదన్లో పిల్లలకు అందిస్తున్న ఆహారం, సంరక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికై నా న్యాయ సహాయం కావాలంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100కు కాల్ చేసి ఉచితంగా పొందవచ్చన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్ర పాల్గొన్నారు. -
బ్యాంకుల ద్వారానే ప్రీమియం చెల్లించాలి
● లోనీ ఫార్మర్స్కు వ్యవసాయ అధికారి సూచన కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతులు బ్యాంకు ద్వారానే వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణం తీసుకొని.. మీ సేవ సెంటర్లలో ప్రీమియం చెల్లించిన రైతులు ఈ నెల 24లోగా ఆప్ట్ అవుట్ ఫారం సమర్పించాలని సూచించారు. ఏ పంటకై తే ప్రీమియం చెల్లించారో.. అదే పంట ఈ–క్రాప్లో విధిగా నమోదై ఉండాలన్నారు. అలాంటి రైతులు మాత్రమే పంటల బీమా పరిహారానికి అర్హులన్నారు. వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. మరో లక్ష ఎకరాలను సాగులోకి తేవాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పీఎండీఎస్ కింద మరో లక్ష ఎకరాలను సాగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం పీఎండీఎస్(ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) అంశంపై కలెక్టర్ వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో వెబెక్స్లో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు లాభదాయకమైన సాగు విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 80 వేల ఎకరాల్లో పంటలు సాగైన నేపథ్యంలో మరో లక్ష ఎకరాలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో వారా నికి 50 ఎకరాలు కచ్చితంగా పీఎండీఎస్ విధానంలో సాగు చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నేటితో ఎస్ఐఆర్ ఇంటింటా సర్వే పూర్తి ● 31న డ్రాఫ్ట్ రోల్ విడుదల కర్నూలు(సెంట్రల్): ఎస్ఐఆర్లో భాగంగా బీఎల్ఓలు చేపట్టిన ఇంటింటా సర్వే శుక్రవారంతో ముగుస్తోంది. జిల్లాలోని 20,86,199 మంది ఓటర్లను బీఎల్ఓలు ఇంటింటా కలసి వారి 2002 సర్, 2025 జాబితా వివరాలను సరిపోల్చి ఈసీఐ నెట్లో అప్లోడ్ చేశారు. జూలై 31వ తేదీన డ్రాఫ్ట్రోల్ను విడుదల చేస్తారు. ఇదిలాఉంటే అనామలీస్ ఫారాల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ, మండలాల వారీగా అనామలీస్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిన రెండు రెండు రోజుల్లో అనామలీస్ శాతాన్ని 16–17 శాతానికి తగ్గించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ నూరుల్ ఖమర్, కర్నూలు మునిసిపల్ కమిషనర్ ఓబులేసు, పత్తికొండ, ఆదోని, కర్నూలు ఆర్డీఓలు ఓబులేసు, అరుణాదేవి, సందీప్కుమార్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.8,580 ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో వేరుశనగకాయల ధర గురువారం క్వింటా రూ.8,580 పలికింది. యార్డుకు రైతులు 4,709 సంచులు అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.8,580, మధ్య ధర రూ.7,456, కనిష్ట ధర రూ.3,499 నమోదైంది. అదేవిధంగా పత్తి 14 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.9,550, కనిష్ట ధర రూ.9,050 పలికింది. మొక్కలను సంరక్షించుకుందాం కర్నూలు కల్చరల్: మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ శాఖ అధికారి శ్యామల అన్నారు. గురువారం నగర శివారులోని జగన్నాథ గట్టుపై అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్తో సీడ్బాల్స్ చల్లడం కార్యక్రమాన్ని డీఎఫ్ఓ శ్యామల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి సుమారు 30వేల సీడ్ బాల్స్ను చల్లినట్లు చెప్పారు. వీటి ద్వారా వచ్చిన మొక్కలను సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ కర్నూలు, ఆదోని రేంజ్ ఎఫ్ఆర్వోలు ప్రియాంక రెడ్డి, తేజశ్వి, డీఆర్వో ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
● కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసనకర్నూలు కల్చరల్: యూనివర్సిటీల్లో దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్ట్ అండ్ టైం స్కేల్) అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పి.నాగరాజు, డాక్టర్ బి. సాయినాథ్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన తరువాతనే రెగ్యుర్ నియామకాలు చేపట్టాలన్నారు. ఏళ్ల తరబడి పనిచేయించుకొని ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమను అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పరిగణించకపోవడం దారుణమన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తరువాతనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు డాక్టర్ రఘునాథ రెడ్డి, డాక్టర్ శరత్మనోహర్ బాబు, జాయింట్ సెక్రటరీలు డాక్టర్ సునీత, డాక్టర్ శివశంకర్ యాదవ్, కోశాధికారి డాక్టర్ సురేంద్ర, సభ్యులు పాల్గొన్నారు. -
వానలు కురవాలి.. పంటలు పండాలి
వీబీఆర్ వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులుదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని.. రైతులు సాగు చేసిన పంటలు బాగా పండాలని కోరుతూ వెలుగోడులో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో రిజర్వాయర్కు ఆనుకుని ఉన్న మైదానంలో వందలాది మంది క్రైస్తవులు సమావేశమై సామూహిక ప్రార్థనలు చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుడిని ప్రార్థించారు. వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సకాలంలో వానలు ఎంతో అవసరమని, వర్షాభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా దేవుడు కరుణించాలని ప్రార్థనల్లో వేడుకున్నారు. చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో నిండి భూగర్భ జలాలు పెరగాలని, పాడిపంటలతో ప్రజలు సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఏబీఎం ఫీల్డ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో రాజేష్, మధు, విక్టర్, ప్రసాద్, నాగన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. – వెలుగోడు -
66 శాతం లోటు వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో అంతంతమాత్రం వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల పాటు ఆకాశం మేఘావృతమవుతున్నా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రెండు మండలాల్లోనే తేలికపాటి వానలు పడ్డాయి. పత్తికొండలో 5.6 మి.మీ, వెల్దుర్తిలో 4.8 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.5 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 30 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. 66 శాతం లోటు వర్షపాతం ఉండటం గమనార్హం. జిల్లాలో ప్రధాన పంట పత్తి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటికే 2.10 లక్షల హెక్టార్లలో సాగయింది. వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పటికే పత్తి పూర్తిగా దెబ్బతినింది. నల్లరేగడి నేలల్లో పత్తి సాగు చేస్తారు. తేలికపాటి వర్షాలకు నల్లరేగడి నెలలు ఒక ఇంచు కూడా నానలేదు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పత్తి పంట కోలుకున్న దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం మాత్రమే ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. -
సమస్యలు అప్గ్రేడ్!
పెచ్చులూడిన పైకప్పు నిరుపయోగంగా ఉన్న టీవీవిరిగిపోయి పగలే వెలుగుతున్న ఎల్ఈడీ లైటుఇటీవలే ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన నెరణికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ పాఠశాలలో 320 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. మొత్తం 11 మంది టీచర్లు పాఠాలు చెబుతున్నార. ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పులు పెచ్చలూడి ప్రమాదకరంగా మారాయి. పాఠశాల భవనం, కాంపౌండ్ వాల్ మధ్యలో పిచ్చి మొక్కులు పెరిగి విష కీటకాలకు తిరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా కుక్కలు సంచరిస్తుండగా.. గోడకు బిగించిన లైటు విరిగిపోయి పగలే వెలుగుతోంది. తరగతి గదిలో బోధన కోసం ఉన్న సుమారు రూ.లక్ష వరకు విలువ ఉన్న ఐఎఫ్బీ ప్యానల్ (ఎల్ఈడీ టీవి) స్క్రీన్ పగిలి పోయింది. ఈ విషయంలో పాఠశాలలోని ఓ టీచరుకు వివరణ కోరుతూ షోకాజు నోటీసు కూడా ఇచ్చినట్లు ఎంఈఓ– 1 సుధారాణి తెలిపారు. – హొళగుంద -
‘అనంత్ అరణ్య’కు ప్రాధాన్యం
శ్రీశైలంప్రాజెక్ట్: అనంత్ అరణ్య ప్రాజెక్ట్ కింద గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో జరుగుతున్న పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయాలని అధికారులను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు ఆదేశించారు. నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన సంక్షేమ సిబ్బందితో గురువారం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీబీ–జీ రామ్జీ (చెంచు) క్షేత్రస్థాయి సిబ్బందితో ఉపాధి హామీ పనులపై చర్చించారు. గిరిజన గూడేలలో ఉపాధి పనుల కల్పన, వేతన చెల్లింపులు, పనిదినాలలో కల్పించిన లక్ష్యాల ఛేదన వంటి విషయాలపై చర్చించారు. చెంచు గిరిజన కుటుంబాలకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా కావలసిన పనులను గుర్తించాలని ఆదేశించారు. పీఎం జన్మన్ కింద చేపడుతున్న గృహ నిర్మాణాల కుటుంబాలకు 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పండ్ల తోటలు వేయించి సుస్థిర ఆస్తుల కల్పన చేయించాలన్నారు. సమావేశంలో మూడు జిల్లాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
వాటర్ గ్రిడ్ పనుల్లో కదలిక
● బుగ్గన పాదయాత్ర అనంతరం అధికారుల్లో చలనండోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రూ.400 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాటర్ గ్రిడ్ పనుల్లో కదలిక మొదలైంది. గోరుకల్లు నుంచి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలకు శుద్ధ జలాన్ని అందించే వాటర్ గ్రిడ్ పనుల్లో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పనులు నిలిచిపోవడంతో నిరసగా నెల క్రితం మాజీ మంత్రి బుగ్గన వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలసి బేతంచెర్ల నుంచి శుద్ధ జలం ప్లాంట్ ఉన్న బుగ్గానిపల్లె వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర తర్వాత అధికారులు పైప్లైన్ పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో గోరుకల్లు నుంచి డోన్ మండలం దేవరబండ వరకు అధికారులు చేపట్టిన నీటి సరఫరా ట్రయల్ రన్ గురువారం విజయవంతమైంది. గ్రామ శివారులో పైప్లైన్ ద్వారా ఎగసిపడుతున్న నీటిని అదుపు చేసేందుకు సిబ్బంది ప్రెషర్ వాల్వ్ను అమర్చారు. మాజీ మంత్రి పాదయాత్ర ఫలితంగా త్వరలోనే ప్యాపిలి మండల ప్రజలకు కూడా శుద్ధ జలం అందే అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత...!
● మహానంది దేవస్థానానికి ట్రస్ట్బోర్డు ఏర్పాటు ● 13 మంది ట్రస్ట్సభ్యులతో జీఓ జారీ మహానంది: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానానికి ట్రస్ట్బోర్డు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కన్నబాబు గురువారం ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితో పాటు తదితర ఆలయాలకు ట్రస్ట్బోర్డు సభ్యులను ఏర్పాటు చేసింది. అయితే మహానంది దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ గిరి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు పోటీ పడటంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో రెండున్నరేళ్లు గడిచినా ఇంత వరకు పాలకమండలి సభ్యులను నియమించలేదు. ఎట్టకేలకు తాజాగా 12 మంది ట్రస్ట్బోర్డు సభ్యులతో పాటు ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడు కలిసి 13 మందితో కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. మసీదుపురం గ్రామానికి చెందిన నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి ట్రస్ట్బోర్డు చైర్మన్గా దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యులుగా తురగ నాగలక్ష్మమ్మ, ఎం. కాశీనాయక్, పొత్తూరు ధనూష, లాలం నాగార్జున, అన్నెపోగు విజయుడు, చింతా నాగేశ్వరరావు, కాటేపోగు రామేశ్వరమ్మ, ముక్కమల్ల ఆదిశేషుడు, కొల్లి దీప, గుద్దేటి రమాదేవి, అనురాధతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మలను నియమిస్తూ జీఓ ఆర్టీ నెంబర్ 1267 జారీ చేశారు. త్వరలోనే వీరి ప్రమాణ స్వీకారం జరగనుంది. -
మరో నాలుగు రోజులు వర్షాలు
ఎమ్మిగనూరు సెంట్రల్: జిల్లాలో మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం, ఆదివారం రోజుల్లో తేలికపాటి వర్షాలు, శుక్రవారం, శనివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 5నుంచి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చన్నారు. క్వింటా వేరుశనగ రూ.8,089 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.8,089 పలికింది. మార్కెట్కు 808 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.3,132, మధ్యస్థం రూ.6,400.. గరిష్ట ధర రూ.8,089 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. మాజీ మంత్రి అరెస్ట్ అక్రమం ● వైఎస్సార్సీపీ బెస్త విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ కర్నూలు(టౌన్): మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్సీపీ బెస్త విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందన్నారు. ఈనెల 11న కాశీబుగ్గ పాత హైవేపై ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో దానయ్య అనే గొర్రెల వ్యాపారి ఘటన స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీ ఒప్పందం చేసుకున్నట్లు పత్రికల్లో కూడా వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారన్నారు. మత్స్యకార ప్రజాప్రతినిధులు మోపిదేవి వెంకటరమణ రావు, కొల్లు రవీంద్ర ఇప్పుడు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజులపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. మత్స్యకారుల ప్రజాప్రతినిధులతో రాజకీయ చదరంగం ఆటను వెంటనే విరమించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కర్నూలు(హాస్పిటల్): నీట్ పరీక్ష పత్రం లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జుడా) నాయకులు డాక్టర్ నిశాంత్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి నీట్ అభ్యర్థికి ఏపీ జుడా అండగా నిలుస్తుందని, పరీక్షా వ్యవస్థలో న్యాయం, యోగ్యత, పారదర్శకతకు మద్దతు ఇస్తుందన్నారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై నిష్పాక్షికమైన, సమగ్రమైన విచారణ జరపాలని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్ష ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, సమగ్రతను నిర్దారించే అర్ధవంతమైన సంస్కరణల కోసం కృషి చేయాలన్నారు. కోడుమూరు రూరల్: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వానలు కురవకపోవడంతో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో మూగ జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన రైతు ఖాజామోదీన్ ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని రూ.4 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి చౌళకాయ పంట సాగు చేశాడు. వానల్లేక చౌళకాయ పంట సరిగా ఎదగలేదు. పైగా వానల్లేక చౌళకాయ పంటకు వైరస్ సోకింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక బుధవారం సాయంత్రం చౌళకాయ పంటను గొర్రెలకు మేతగా వదిలేశాడు. వానల్లేక చౌళకాయ సాగుతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతు ఖాజామోదీన్ వాపోయాడు. -
కర్నూలు ఎయిర్పోర్టు అభివృద్ధిపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఓర్వకల్ను ఇండస్ట్రీయల్ పార్కుగా ప్రగతి చేసి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు ఊతమిచ్చే ఓర్వకల్ ఎయిర్పోర్టును విస్మరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్టు అభ
2021 మార్చి – 2022 మార్చి: 31,971 2022 మార్చి – 2023 మార్చి: 37,532 2023 మార్చి – 2024 మార్చి: 39,229 2024 మార్చి – 2025 మార్చి: 18,813 2025 మార్చి – 2026 మార్చి: 19,733 2026 మార్చి – 2026 జూన్: 4,7491,52,027 ఎయిర్పోర్టు ఏర్పాటైన ఐదేళ్లలో ప్రయాణికుల సంఖ్య 77,888 వెళ్లిన ప్రయాణికులు 74,139 వచ్చిన ప్రయాణికులు ప్రతిపాదనలకే పరిమితమైన నైట్ల్యాండింగ్, రన్వే విస్తరణ త్వరలోనే ప్రారంభం కానున్న పైలట్ శిక్షణ కేంద్రం గత ప్రభుత్వ హయాంలోనే నాంది క్రమంగా తగ్గిపోతున్న విమాన ప్రయాణికుల సంఖ్య అనువుగా లేని విజయవాడ ప్రయాణ వేళలు -
రక్తపింజరిని పట్టుకున్న రెస్క్యూ టీం
పాములపాడు: స్థానిక పోస్టాఫీసు ఎదురుగా ఒక గోడలో విషపూరిత రక్తపింజరి పామును ఫారెస్టు రెస్క్యూ టీం పట్టుకున్నారు. ఈ నెల 21న రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో పాము రోడ్డు దా టుతుండటాన్ని గమనించిన ఓ మహిళ అక్కడు న్న యువకులకు చెప్పింది. గోడలో నక్కి ఉన్న ఆ సర్పాన్ని చూసి కొండచిలువగా భావించిన యు వకులు వెంటనే స్థానిక పోలీసు స్టేషన్, ఫారెస్టు అధికారులకు ఫోన్ చేసి సమాచారంఅందించా రు. రెస్క్యూ టీం సభ్యులు వచ్చి పరిశీలించి రక్తపింజరి పాముగా గుర్తించారు. స్నేక్క్యాచర్ చాకచక్యంగా పామును బంధించారు. అనంతరం హ నుమాన్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ టీం సభ్యులు జాకీర్హుస్సేన్, ఎఫ్ఎస్ఓ సాయిపీరా మాట్లాడుతూ.. ఈ పాము విషపూరితమైనదని, కుక్కర్ విజిల్లాగా శబ్దం చేస్తుందని చెప్పారు. మనిషి ఉన్న దూరాన్ని అంచనా వేసిదాడి చేయగల సామర్ధ్యం దాని సొంతమన్నారు. హనుమాన్ యాప్ను డౌన్లోడు చేసుకొని విషసర్పాలు ఎక్కడున్నా సమాచారం అందిస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని పాములను పట్టుకొని అడవిలో వదులుతామని చెప్పారు. స్నేక్ క్యాచర్ కాళీచరణ్, వీఏ ఖలీల్, సీబీఈటీ ఇస్మాయిల్ ఉన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి కర్నూలు: కల్లూరు మండలం మహమ్మద్ నగర్లో నివాసముంటున్న ఖాజా (40) బైక్ అదుపుతప్పి కింద పడటంతో తీవ్రగాయాలపాలై అర్ధరాత్రి మృతిచెందాడు. ఈయన కల్లూరు ఎస్టేట్ లోని ఎంఎస్ రాయల్ పాలిమర్స్ ఫ్యాక్టరీ లో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తూ గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడి గాయాలపాలయ్యాడు. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నొప్పులు తీవ్రం కావడంతో భార్య హసీనా ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి కింద పడటం వల్లే తలకు, ఛాతీకి గాయాలై చనిపోయాడని భార్య హసీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐటీఐ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ ఐటీఐలో రెండవ విడత అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రవీంద్రబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 3వ తేదీ ఆఖరు కాగా ఆన్లైన్లో admissio ns.ap.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చన్నారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ ఐటీఐ వారిని నేరుగా సంప్రదించవచ్చన్నారు. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్మెన్ సివిల్, ఒక సంవత్సరం కోర్సులు డీజిల్ మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ కోర్స్ ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్డర్ ట్రేడ్ కోర్సులో చేరేందుకు పదో తరగతి ఫెయిలైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ వారిని సంప్రదించి ఆగస్టు 4వ తేదీలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. రెండో విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ ఆగస్టు 6వ తేదీ జరుగుతుందని, అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో శ్రీశైలం ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు శ్రీశైలం ఐటీడీఏ (94932 52324, 94411 81072) ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చన్నారు. వేతన సవరణలో జాప్యం తగదు కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంకర్స్ అసోసియేషన్ చొరవ తీసుకొని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీనియర్ అధికారుల వేతన సవరణ చేపట్టాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏపీసీసీబీ ఆఫీసర్స్ అసోషియేషన్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. వెంటనే వేతన సవరణ చేపట్టాలని నినాదాలు చేశారు. సీనియర్ అధికారులు చేపట్టన ఆందోళన కార్యక్రమాలకు డీసీసీబీలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. ఆఫీసర్స్ అసోషియేషన్ నేత సునీల్కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 27న సా మూహిక సెలవు పెట్టి ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే 31న చలో విజయవాడ చేపట్టి, అ క్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
ఖాకీ కరుణ
ఆదోని: ట్రాఫిక్ పోలీసులు అంటే వారు విధించే చలాన్లే అందరికీ కనపడతాయి. కానీ ఖాకీ అంటే క్రమశిక్షణ, కఠినత్వం మాత్రమే కాదు.. మానవత్వం, దయ, సేవాభావానికి కూడా ప్రతీక అని ఆదోని ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎస్.మహ్మద్ అలీ ఆజాద్ నిరూపిస్తున్నారు. తన వృత్తి బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల పాఠశాలకు చెప్పులు లేకుండా వెళ్తున్న పలువురు బాలికలను ట్రాఫిక్లో గమనించిన ఆజాద్ చలించిపోయారు. వారి వివరాలు తెలుసుకుని సొంత ఖర్చుతో 60 మంది బాలికలకు చెప్పులు కొనిపెట్టారు. దీంతో ఆ చిన్నారులు ఆనందం వ్యక్తం చేయగా, తల్లిదండ్రులు ఆయన సేవా మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతటితో ఆగకుండా మండుటెండలో రోడ్ల పక్కన పండ్లు, పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధులకు గొడుగులు అందించి వారికి ఉపశమనం కల్పించడం.. అలాగే అనాథ శవాలకు ఎవరూ ముందుకు రాని సందర్భాల్లో స్వయంగా బాధ్యత తీసుకుని సొంత ఖర్చుతో అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ఇలా ఎలాంటి ప్రచారం ఆశించకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ఆజాద్పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఖాకీకి కూడా కరుణ ఉంటుంది.. మానవత్వం ఉంటుందనే విషయాన్ని అజాద్ తన సేవల ద్వారా నిరూపించారని పలువురు కొనియాడుతున్నారు. -
‘పత్తి’ రైతు చిత్తు
కృష్ణగిరి: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పశ్చిమ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తోంది. ఖరీఫ్ ప్రారంభం నుంచి వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో రోజురోజుకు భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయ బోర్లలోనూ నీరు ఇంకిపోయింది. చెరువుల్లో చుక్క నీరు లేక పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలన్నీ దాదాపుగా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. వారం రోజుల క్రితమే మండలంలో ఎండిన వేరుశనగ పంటను రైతులు పశువుల మేతకై నా పనికొస్తుందనే ఆశతో తొలగించారు. ఇప్పుడు పత్తి పంట కూడా తొలగించాల్సిన పరిస్థితి. వర్షం రాకపోదా? పంటలకు జీవం రాకపోదా! అనే ఆశలతో ఉన్న రైతులు ఒక్కసారిగా పంట రంగు మారుతుండటం చూసి ఆశలు అడియాసలయ్యేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. పంట సాగు చేసి దాదాపుగా రెండు నెలలు కావొస్తున్నా వర్షం లేకపోవడం, పంటను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు మందులతో పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతుందని, రెండు రోజులుగా పంట అక్కడక్కడ రంగు మారుతుండటంతో పత్తిపై ఆశలు వదులుకోవాల్సిందే అన్న సంకేతం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది అధిక వర్షాలకు వైరస్ సోకి పంట దెబ్బతినగా.. ఈ యేడాది కూడా దాదాపుగా 9 వేల హెక్టార్లలో పంట సాగుచేశారు. సాగు చేసినప్పటి నుంచి వర్షం లేక గాలులకు పంట రంగు మారుతుండటంతో ఇక పంటకు పెట్టిన పెట్టుబడులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోకపోతే వ్యవసాయం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


