రాష్ట్రంలో ఆటవికపాలన
● టీడీపీ నేతలు బందిపోట్లుగా మారారు ● పెట్రోల్ బాంబులతో మాజీ మంత్రి ఇంటిపై దాడి అమానుషం ● వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర సెక్రెటరీ శ్రీనివాసులు
బొమ్మలసత్రం: రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రుల ఇళ్లపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర సెక్రెటరీ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం, కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన దుష్ప్రచారం అందుకు ఉదాహరణ అన్నారు. సిట్ నివేదికలో లడ్డూలో కొవ్వు కలవలేదని తేలటంతో ఇప్పుడు మరో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, దుష్ప్రచారంపై గొంతెత్తిన అంబటి రాంబాబు, జోగి రమేష్, వంశీ, నాని లాంటి మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేయటం దారుణమన్నారు. లీగల్ సెల్ స్టేట్ స్పోక్ పర్సన్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ టీడీపీ లడ్డూపై ఆరోపణలు చేస్తున్నట్లుగా లేదని సాక్షాత్తు ఆ దేవదేవుడిపై ఆరోపణల దాడి చేస్తున్నట్లుగా ఉందన్నారు. తప్పుడు ప్రచారమని ప్రపంచానికి తెలియటంతో టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. లీగల్సెల్ పట్టణాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ గీతం యూనివర్సిటీకి రూ. 1000 కోట్ల భూములు కేటాయించారని ప్రశ్నిస్తే దాడులు, లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ రిపోర్టు చూపితే దౌర్జన్యాలు, కేసులు ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఇచ్చే సందేశమేమిటో చెప్పాలన్నారు. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కంప్లైంట్లు వేసి పోలీసులపై చట్టపరమైన చర్యలకు దిగుతామన్నారు. టీడీపీ నాయకులకు వారు చుట్టంగా పనిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు సుహేల్రాణా, జీవీ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


